నేటి నుంచి పది స్పాట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా కేంద్రమైన విజయవాడలో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్కు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకూ నగరంలోని బిషప్ అజరయ్య పాఠశాలలో ఈ స్పాట్ వాల్యూయేషన్ జరగనుంది. పదో తరగతి పరీక్షలు గత నెల 17వ తేదీన ప్రారంభమై ఈ నెల ఒకటో తేదీన ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలో 31,231 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పటికే విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి కోడింగ్ ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు.
ఉదయం 9 గంటల నుంచి..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియగానే జవాబు పత్రాల మూల్యాంకనానికి అవసరమైన ఏర్పాట్లలో విద్యాశాఖ నిమగ్నమైంది. ప్రభుత్వం పది జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పునర్విభజన జరిగిన జిల్లా కేంద్రాల్లోనే నిర్వహించింది. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్ల కోడింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడలోని బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణాన్ని నిర్ణయించారు. గతంలోనూ ఇదే ప్రాంగణంలో స్పాట్ వాల్యూయేషన్ను పాఠశాల విద్యాశాఖ నిర్వహించింది. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియలో భాగంగా స్పాట్ ఉత్తర్వులను ఇప్పటికే ఉపాధ్యాయులకు అందజేశారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది.
ఒరియంటేషన్ నిర్వహించిన అధికారులు
మూల్యాంకన విధులకు ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులను ఆయా జిల్లా విద్యాశాఖాధికారులు జారీ చేశారు. స్పాట్ వాల్యూయేషన్ ఉత్తర్వులను ఉపాధ్యాయులకు అందజేసే ప్రక్రియ దాదాపుగా ముగిసింది. జవాబు పత్రాల మూల్యాంగకనానికి సంబంధించి సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులను నియమించారు. ఎనిమిది రోజుల పాటు మూల్యాంకనం చేస్తారు. దానికి సంబంధించి బుధవారం స్పాట్ జరిగే ప్రాంగణంలో ఉపాధ్యాయులకు ఇతర అధికారులకు ఒరియేంటేషన్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.
జిల్లా కేంద్రానికి చేరుకున్న జవాబు పత్రాలు
వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,72,129 జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. జవాబు పత్రాలు జిల్లా కేంద్రానికి దఫదఫాలుగా వస్తున్నాయి. చివరిగా జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాలు ఇప్పడిప్పుడే చేరుకుంటున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి క్యాంప్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు తదితరులు జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొంటారు.
జిల్లా కేంద్రంలో టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ 9వ తేదీ వరకూ కొనసాగనున్న ప్రక్రియ జిల్లాకు 1.72 లక్షల సమాధాన పత్రాలు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నగరంలోని బిషప్ అజరయ్య హై స్కూల్ ప్రాంగణంలో ఈ నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకూ స్పాట్ వాల్యూయేషన్ను నిర్వహిస్తున్నాం. స్పాట్ జరిగే ప్రాంగణంలో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం. అప్పటికే ఉపాధ్యాయులందరికీ సమాచారం అందించాం. అలాగే ఉపాధ్యాయులందరూ ఈ వాల్యూయేషన్లో పాల్గొనున్నారు.
– యు.వి.సుబ్బారావు, డీఈఓ, ఎన్టీఆర్ జిల్లా
నేటి నుంచి పది స్పాట్
నేటి నుంచి పది స్పాట్


