వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని ఉపాలయం నుంచి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీపై ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా, ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నా, వీక్షించినా భక్తుల ఇంట సకల శుభాలు కలుగుతాయని, సంతానం లేని వారికి సంతాన యోగం, వివాహం కాని వారికి వివాహయోగం కలుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఉభయ దాతలకు ప్రత్యేక క్యూ మార్గం ద్వారా ఆది దంపతుల దర్శనానికి అనుమతించారు.
కనులపండువగా వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం అమ్మవారికి శ్వేత(తెలుపు), హరిత(పచ్చ) వర్ణ పుష్పాలతో విశేషంగా అర్చన జరిగింది. అమ్మవారికి తెల్ల జిల్లేడు, మల్లె పూలు, మారేడు బిల్వ పత్రాలు, తులసీ దళాలు, మందార పుష్పాలతో అర్చన నిర్వహించారు. తొ లుత ఆలయ ఈఓ కె.రామచంద్రమోహన్, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఇతర అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలను ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పూజా మండపానికి చేరుకున్నారు. పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆయా పుష్పాలతో అర్చన నిర్వహించగా, పెద్ద ఎత్తున ఉభయ దాతలు, భక్తులు పాల్గొన్నారు.
లారీ కింద పడి ప్రాణాలతో బయటపడిన యువకుడు
పెనమలూరు: పోరంకి సెంటర్లో గురువారం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అనకాపల్లికి చెందిన సింగంపల్లి గోవిందు పని కోసం పోరంకికి వచ్చాడు. అతను పోరంకి సెంటర్లో బైక్పై డివైడర్ కటింగ్ వద్ద రోడ్డు దాటుతుండగా కంకిపాడు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న టిప్పర్ బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్తో పాటు గోవిందు లారీ కిందకు వెళ్లాడు. ఒక్కసారిగా అందరూ గోవిందు ప్రాణాలకు ముప్పు జరిగిందని భావించారు. అయితే అతను లారీ మధ్యలో ఉండటంతో లారీ చక్రాలు అతని పైకి ఎక్కలేదు. అతను సురక్షితంగా లారీ కింద నుంచి బయటకు వచ్చాడు. స్వల్వ గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.
100 అడుగుల రోడ్డులో కారు బీభత్సం
పెనమలూరు: కానూరు 100 అడుగుల రోడ్డులో బుధవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఎనికేపాడు నుంచి తాడిగడప జంక్షన్ వైపునకు అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్పై నుంచి దూసుకెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి పంట బోదెలో పడింది. డివైడర్ మధ్యలో ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో రహదారిపై ప్రయాణికులు ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుపై ఎవరైనా ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభం అలానే ఉంది.
కిడ్నాప్ కలకలం..
పోరంకిలో బుధవారం రాత్రి కిడ్నాప్ కలకలం చెలరేగింది. తన తండ్రిని కొందరు ఇంటి వద్ద నుంచి కిడ్నాప్ చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల కారణంగానే పోరంకిలో ఉంటున్న వెంకటేశ్వరరావును వ్యాపార పార్టనర్ రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఆమె తెలిపింది. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, కేసు నమోదు చేయలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. ఈ ఘటనలో ఇరువురు రాజీ పడినట్లు సమాచారం.
వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం
వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం
వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం


