దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.18 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 2.18 కోట్లను కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమ ర్పించారు. ఆదిదంపతులకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ పర్యవేక్షణలో పలువురు సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. మొత్తం రూ. 2,18,00,698 నగదు, 355 గ్రాముల బంగారం, 6.374 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ పేర్కొన్నారు. కానుకల లెక్కింపు దేవదాయ శాఖ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో కొనసాగింది.
కార్తికేయుని సేవలో
డెప్యూటీ సీఈఓ
మోపిదేవి: స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని డెప్యూటీ సీఈవో, ఈవీఎం నోడల్ ఆఫీసర్ కె. విశ్వేశ్వరరావు, పలువురు ఎన్నికల అధికారులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వీరు నాగపుట్టలో పాలుసోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బుద్దు సతీష్ శర్మ, విరూప్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. వీరి వెంట మచిలీపట్నం ఆర్డీవో కె. స్వాతి, స్థానిక తహసీల్దార్ శ్రీవిద్య, ఎస్ఐ సత్యనారాయణ, మోపిదేవి శ్రీనివాసరావు, వీఆర్వో వెంకట రమణ తదితరులు ఉన్నారు.
ప్రజావేదిక
ఏర్పాట్లు పరిశీలన
చందర్లపాడు(నందిగామ టౌన్): ప్రజావేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో నిర్వహించనున్న ప్రజావేదిక కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనులను చేపడుతున్నామన్నారు. నెట్టెం రఘురాం, సౌమ్య మాట్లాడుతూ ప్రజావేదిక ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
టికెట్ తనిఖీల్లోనూ రైల్వేకు
భారీగా ఆదాయం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లలో ప్రయాణికుల వద్ద టికెట్ తనిఖీల ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 62.03కోట్ల ఆదాయం విజయవాడ డివిజన్ ఆర్జించినట్లు అధికారులు తెలిపారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.60.10 కోట్లు నమోదు కాగా దానికి మించి 2.5 శాతం అధికంగా ఆదాయం వచ్చిందన్నారు. కమర్షియల్ విభాగం నిరంతర కృషి ఫలితంగానే డివిజన్ రికార్డు స్థాయిలో ఆదాయం సాధించినట్లు వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ విభాగం మొత్తం 9,76,584 కేసులు నమోదు చేయగా అందులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై 4,52,887 కేసులు నమోదు చేయడం ద్వారా రూ. 37.17 కోట్లు, సరైన టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న 5,13,285 మంది నుంచి రూ. 24.69 కోట్లు, బుక్ చేయని లగేజీలపై 10,412 కేసుల ద్వారా రూ. 19.46 లక్షల ఆదాయం వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, కమర్షియల్ సిబ్బందిని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.


