
రాంచీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించింది. జార్ఖండ్లో హేమంత్ సోరెన్కు చెందిన జేఎంఎం (జేఎంఎం) 34 సీట్లు గెలుచుకుంది. ఇంతలో ఒక విచిత్ర పరిణామం చోటుచేసుకుంది.
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ)పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో ఇంతలోనే రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ చీఫ్ సుదేష్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నానని ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏజేఎస్యూ పార్టీ అధినేత సుదేష్ మహతో ఓటమి పాలయ్యారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిత్రపక్షమైన ఏజేఎస్యూ పార్టీ జార్ఖండ్లోని 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అయితే కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా కేవలం 231 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఈ విజయం సాధించింది. ఈ ఒక్క సీటు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే నిర్మల్ మహతో కూడా ఇప్పుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. మండూ స్థానం నుంచి ఎన్నికైన ఈయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ చీఫ్ సుదేష్ మహతోకు లేఖ పంపానని అన్నారు.
తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆయనను అభ్యర్థించానన్నారు. తద్వారా సుదేష్ మహతో ఇక్కడ(మండూ) జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. సుదేష్ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి అమిత్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇతనితో పాటు ఏజేఎస్యూకి చెందిన మరో 8 మంది అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఈ పార్టీ కేవలం మండూ సీటును మాత్రమే గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్.. మార్కెట్లు పుంజుకునే చాన్స్
Comments
Please login to add a commentAdd a comment