హైదరాబాద్, సాక్షి: ‘‘నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. నా ఇంటికి పోలీసుల బందోబస్తు అవసరం లేదు. ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం’’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్ విసిరారు. ఇవాళ గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు.. అరికెపూడి ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పుతానన్న పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కౌశిక్డ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. అలాంటి ప్రయత్నమేస్తే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పీఏసీ కమిటీ చైర్మన్గా అరికెపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై కౌశిక్రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్కు రావాలని కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పాలి. గురువారం అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా. ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నాడు కాబట్టి రేపు అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా.. ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా ఎగరేసి, BRS భవన్ లో ప్రెస్ మీట్ పెడదాం’’ అని కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే దీనికి అరికెపూడి గాంధీ అంతేతీవ్రంగా ప్రతిస్పందించారు.
అంతకు ముందు.. తెలంగాణలోని పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఆ పదిమంది ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం ఉంటే.. స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలన్నారు. లేదంటే ఆ పదిమందికి చీరలు, గాజులు కొరియర్ చేస్తా.. వేసుకొని తిరగండి అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు తీవ్రంగా స్పందించారు.
ఇదీ చదవండి: చీర, గాజులు వర్సెస్ చెప్పులు!!
Comments
Please login to add a commentAdd a comment