
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీలు తెలంగాణ నిధులను దుర్వినియోగం చేశాయని మండిపడ్డారు. కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. నాడు రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీని తెలంగాణ దెయ్యం అన్నారు.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగానే దేవత అంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం. తెలంగాణను 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. ఇది కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాపం కాదా!. తెలంగాణకు పట్టిన శని బీఆర్ఎస్, కాంగ్రెస్. దోపిడీ, దగా, మోసం చేయడంలో దొందుదొందే. తెలంగాణను దోచుకుంటున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్.
తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరముంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ను పాతర వేయాల్సిందే. తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ నినాదానికి కట్టుబడిన పార్టీ బీజేపీ. తెలంగాణ ఉద్యమానికి కొంతమంది వెన్నుపోటు పొడిచారు. కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు. తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ తెలంగాణ కోసం ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేసింది. 11 ఏళ్ల పాలన తర్వాత తెలంగాణ ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
బంగారు తెలంగాణ ఎక్కడ?. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అన్నారు. ఆయన కుటుంబం మాత్రం అయ్యింది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా దోచుకున్నారు. నాడు దెయ్యం.. నేడు దేవత అయ్యిందా?. నాడు రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీని తెలంగాణ దెయ్యం అన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగానే దేవత అంటున్నారు. సకల జనుల సమ్మె పేరుతో ఉద్యమించిన వారి మీద, అమరవీరుల మీద ఒట్టేసి చెబుతున్నాను. తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని హామీ ఇచ్చారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..‘రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్కు వచ్చి తెలంగాణకు సపోర్ట్ చేశారు. సుష్మా స్వరాజ్ తెలంగాణ బిడ్డలారా చనిపోకండి మీకు అండగా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు. ఇంకా రాజకీయం చేయొద్దు పిల్లలు చనిపోతున్నారు బిల్లు పెట్టండి అని చెప్పింది బీజేపీనే. ఈ నీళ్ళు, నిధులు, నియామకాల కోసం యువకులు పోరాటం చేశారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలో తిరోగమన దిశలో తెలంగాణ పోతుంది. తెలంగాణ తన గొప్పదనం చాటి చెప్పాలంటే బీజేపీతోనే సాధ్యం’ అని అన్నారు.