
సాక్షి,హైదరాబాద్ : ‘తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తన లక్ష్యం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో రేవంత్ రెడ్డి మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించారు.
అనంతరం,ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం మహిళా సంఘాల్ని పట్టించుకోలేదు. మహిళా సంఘాల్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నాం. గతంలో మామూలు చీరలు ఇచ్చేవారు. ఇప్పుడు ఖరీదైన చీరలు ఇస్తున్నాం. అంబానీ, అదానీలు పోటీపడే సోలార్ ప్రాజెక్ట్లలో మహిళలను ప్రోత్సహిస్తాం. మహిళలు వ్యాపారంలో వేగంగా ఎదిగేలా వారిని ప్రోత్సహిస్తున్నాం.
దేశంలోనే తొలిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషం. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మహిళలు ఆత్మగౌరవంతో బ్రతుకుతారని మా ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం. రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశాం.

వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చాం. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నాం. సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నాం .రూరల్, అర్బన్ అనే తేడా లేదు. తెలంగాణలో మహిళలంతా ఒక్కటే.. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందాం. ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నా.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. నిధులు మేం ఇస్తాం..నిర్వహణ మీరు చేయండి. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడులను కూడా అలాగే నిర్వహించుకోవాలి’ అని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment