
సాక్షి, కొత్తగూడెం: పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అహంకారానికి స్థానం లేదని ప్రజలు నిరూపించారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటలు తప్ప హమీల అమలు లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు. ఆరు నెలల ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. చైతన్యవంతులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రజాస్వామ్య విలువ పెంచాలని కోరారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం క్లబ్లోని ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణా ఉద్యమంలో తొలి తూటా దిగింది కొత్తగూడెం గడ్డ పైనేనని తెలిపారు. ఈ జిల్లా చైతన్య వంతమైన జిల్లా అని పేర్కొన్నారు. సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న గ్రాడ్యుయేట్స్.. మంచి ఎవ్వరో చెడు ఎవ్వరో తెలుసుకుని ఓటు వేయాలని సూచించారు.
ఎన్నికల ఫ్లెయింగ్ స్కాడ్ పేరుతో తమకు ఇబ్బందులు గురిచేయాలని చూశారని ఈటల ఆరోపించారు. లక్ష కోట్ల యజమాని అయిన గుడిసెల్లో ఉన్న వారికైనా ఒకటే ఆయుధం ఓటు అని తెలిపారు. ప్రతి హామీలపై పోరాటం చేసే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమేనని అన్నారు. భారత్ తెచ్చి 12వేల కోట్ల టాయిలెట్ కట్టించిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఫోన్ పే, గూగుల్ పే తెచ్చింది నరేంద్రమోీదీనేనని.. 10 సంవత్సరాల పరిపాలనలో కొన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవే నిర్మించింది బీజేపీనేనని అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తెచ్చి.. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసిన ఘనత మోదీనేనని ఈటల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment