
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమరావతి వెళ్లి డబ్బా పెరుగన్నం తిని డబ్బుల సంచి సర్దుకుని వచ్చారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అమరావతి గురించి గతంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ప్రజలు ఎవరూ మరచిపోలేదన్నారు. ‘ఆయనకు నిలకడలేదు.
పరిణతి లేకుండా మాట్లాడుతున్నారు. ట్విట్టర్లో ఒక మాట.. మైకు ముందు మరో మాట! ఇదీ పవన్ తీరు. కర్నూలుపై మనసులో మాట ఎటు పోయింది? ఆయన ఆలోచనలు పూర్తిగా దారి తప్పాయి’ అని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
దమ్ముంటే రాజీనామాలు చేయండి
‘అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మూడు రాజధానులను సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా 15న విశాఖలో విశాఖ గర్జన నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అమరావతిని రాజధానిగా కోరుకుంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. దమ్ముంటే అమరావతి కోసం కుప్పం ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి.
అప్పుడు వారికే తెలిసొస్తుంది. మూడు రాజధానులే అజెండాగా ఎన్నికలకు వెళతాం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం. పాదయాత్రను ఇప్పటికైనా వారు విరమించాలి. విశాఖ ప్రజలు అచ్చెన్నాయుడిని చూసి భయపడుతున్నారు. విశాఖలో టీడీపీ నేతల చేతుల్లో ఉన్న 450 ఎకరాల భూమిని కాపాడాం. అమరావతి విషయంలో టీడీపీ, జనసేన ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు.