అలాగైతే తప్పుకుంటా | Sakshi
Sakshi News home page

అలాగైతే తప్పుకుంటా

Published Sun, Apr 28 2024 4:48 AM

Many leaders joined BJP in the presence of Bnadi Sanjay

ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తారా? 

నిరూపించకపోతే కాంగ్రెస్‌ అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకుంటారా?  

బీజేపీ కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ సవాల్‌ 

కాంగ్రెస్‌ నేతలూ.. ఎందుకీ డ్రామాలు, మోసాలని మండిపాటు 

వెధవ అన్న మంత్రి పొన్నం తిట్లను దీవెనలుగా భావిస్తా 

సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు 

కరీంనగర్‌ టౌన్, సిరిసిల్ల: రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచే తప్పుకుంటా... నిరూపించకపోతే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్‌ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్‌ నేతలు తన సవాల్‌ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. 

శనివారం కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్‌ గౌడ్‌తోపాటు తెలంగాణ ఉద్యమకారుడు కుమార్‌ తమ అనుచరులతో కలిసి బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహా్వనించారు. బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 

కుట్రలతో నన్ను ఓడించాలని చూస్తుండ్రు 
కరీంనగర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి చీకటి ఒప్పందాలతో తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటుకు రూ.వెయ్యి పంచి గెలవాలని యత్నిస్తున్నారని నిందించారు. ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్‌ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని, ఆయన తిట్లు దీవెనలుగా భావిస్తున్నానని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. వెధవ అంటే తన దృష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వరి్ధల్లు’అని అర్థమన్నారు. 

పరారీలో దోచుకున్న కుటుంబం 
మొన్నటివరకు బోయినపల్లిలో ఒక కుటుంబం అరాచకంగా వ్యవహరించిందని, కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారని సంజయ్‌ ఆరో పించారు. ఇప్పుడు ఆ కుటుంబం పరారీలో ఉందని, వత్తాసు పలికిన పోలీసుల పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. కేసీఆర్‌కు దోచిపెట్టడం తప్ప.. కుటుంబానికి దాచిపెట్టడం తప్ప వినోద్‌కుమార్‌ సాధించేదేమీ లేదని సంజయ్‌ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ‘సెస్‌’మాజీ చైర్మన్‌ అల్లాడి రమేశ్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement