బీజేపీలో చేరిన సంచలన లాయర్‌ | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన సంచలన లాయర్‌

Published Mon, Mar 18 2024 9:52 PM

Nirbhaya Case Lawyer Seema Kushwaha Joins BJP - Sakshi

Nirbhaya Lawyer Seema Kushwaha: సుప్రీంకోర్టు న్యాయవాది, బీఎస్పీ నేత సీమా కుష్వాహా సోమవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్రాస్ సామూహిక అత్యాచారం, శ్రద్ధా వాకర్ హత్య వంటి ల్యాండ్‌మార్క్ కేసుల్లో బాధితుల తరపున వాదించి కుష్వాహా ప్రసిద్ధి చెందారు.

ఎవరీ సీమా కుష్వాహ?
సీమా కుష్వాహా 2022 జనవరిలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో చేరారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తల్లి తరపున వాదించిన తర్వాత కుష్వాహాకు ఎనలేని గుర్తింపు లభించింది. మరోవైపు నిర్భయ జ్యోతి ట్రస్ట్‌ను స్థాపించి అత్యాచార బాధితుల తరపున న్యాయం కోసం వాదించే ప్రచారాన్ని కుష్వాహా ప్రారంభించించారు. కుష్వాహాతో పాటు ఉత్తరప్రదేశ్ లాల్‌గంజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్‌పీ ఎంపీ సంగీతా ఆజాద్ కూడా బీజేపీలో చేరారు. సంగీత భర్త ఆజాద్ అరి మర్దన్ కూడా ఆమెతో పాటు కాషాయ శిబిరంలో చేరారు.

నిర్భయ అత్యాచారం కేసు 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై  2012 డిసెంబర్‌లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం, దాడి చేసి రోడ్డు మీదకి తోసేశారు. బాధితురాలు చికిత్స పొందుతూ 2012 డిసెంబర్ 29న మృతి చెందారు. బాధితురాలికి న్యాయం చేయడానికి ఏడేళ్లు పట్టింది. నిర్భయ కేసులో నలుగురు దోషులను 2020 మార్చి 20న ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement