nirbhaya case
-
బీజేపీలో చేరిన సంచలన లాయర్
Nirbhaya Lawyer Seema Kushwaha: సుప్రీంకోర్టు న్యాయవాది, బీఎస్పీ నేత సీమా కుష్వాహా సోమవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్రాస్ సామూహిక అత్యాచారం, శ్రద్ధా వాకర్ హత్య వంటి ల్యాండ్మార్క్ కేసుల్లో బాధితుల తరపున వాదించి కుష్వాహా ప్రసిద్ధి చెందారు. ఎవరీ సీమా కుష్వాహ? సీమా కుష్వాహా 2022 జనవరిలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో చేరారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తల్లి తరపున వాదించిన తర్వాత కుష్వాహాకు ఎనలేని గుర్తింపు లభించింది. మరోవైపు నిర్భయ జ్యోతి ట్రస్ట్ను స్థాపించి అత్యాచార బాధితుల తరపున న్యాయం కోసం వాదించే ప్రచారాన్ని కుష్వాహా ప్రారంభించించారు. కుష్వాహాతో పాటు ఉత్తరప్రదేశ్ లాల్గంజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీ ఎంపీ సంగీతా ఆజాద్ కూడా బీజేపీలో చేరారు. సంగీత భర్త ఆజాద్ అరి మర్దన్ కూడా ఆమెతో పాటు కాషాయ శిబిరంలో చేరారు. నిర్భయ అత్యాచారం కేసు 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై 2012 డిసెంబర్లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం, దాడి చేసి రోడ్డు మీదకి తోసేశారు. బాధితురాలు చికిత్స పొందుతూ 2012 డిసెంబర్ 29న మృతి చెందారు. బాధితురాలికి న్యాయం చేయడానికి ఏడేళ్లు పట్టింది. నిర్భయ కేసులో నలుగురు దోషులను 2020 మార్చి 20న ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. #WATCH | BSP MP Sangeeta Azad, party leader Azad Ari Mardan and Supreme Court lawyer Seema Samridhi (Kushwaha) join the BJP, in Delhi. pic.twitter.com/oaLN8Hg1Fo — ANI (@ANI) March 18, 2024 -
బ్రిజ్ భూషణ్ తరపున నిర్భయ లాయర్
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో.. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తరపున వాదిస్తోంది ఎవరో తెలుసా? నిర్భయ కేసు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ డిఫెన్స్ న్యాయవాదిగా వ్యవహరించనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడేలా చేశారు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్. 2012లో జరిగిన ఆ సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నలుగురు నిందితులకు ఎనిమిదేళ్ల తర్వాత 2020 మార్చిలో శిక్ష పడేంతవరకు అవిశ్రాంత పోరాటం చేసి న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేశారు రాజీవ్. నాడు న్యాయాన్ని గెలిపించారు.. మరి నేడు..? నిర్భయ కేసులో అద్భుతంగా వాదనలు వినిపించి బాధితురాలికి న్యాయం జరగడంలో తనదైన పాత్ర పోషించిన రాజీవ్ ఇప్పుడు మాత్రం ఎంపీ బ్రిజ్ భూషణ్ తరపున కోర్టుకు వాదనలు వినిపించనున్నారు. నాడు నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన అయన ఇప్పుడు వేధింపులకు గురైన రెజ్లర్లకు వ్యతిరేకంగా తన క్లయింట్ తరపున డిఫెన్స్ చేస్తుండటంతో చర్చనీయాంశమైంది. భారత రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ బెయిల్ పై ఈ నెల 20న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ మోహన్ బ్రిజ్ భూషణ్ కు ఊరట కలిగిస్తారో లేదో చూడాలి మరి. ఇది కూడా చదవండి: యూట్యూబర్ ఎఫెక్ట్.. కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేదం.. -
దస్తక్.. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రదర్శించబడుతున్న నాటకం
దేశం కదిలిపోయింది. దేశం కన్నీరయ్యింది. దేశం ఆగ్రహంతో ఊగిపోయింది. పదేళ్ల క్రితం డిసెంబర్ 16, 2012న ఢిల్లీలో జరిగిన ఘటన లక్షలాది స్త్రీలను, యువతులను, బాలికలను రోడ్డు మీదకు వచ్చి నిరసన చేసేలా చేసింది. కొత్త చట్టం ‘నిర్భయ’ పేరున వచ్చింది. అయితే అది సరిపోదు. ఆ హైన్యమైన ఘటన పునరావృత్తం కాకూడదని ఆ మహా చైతన్యం సజీవంగా ఉండాలని థియేటర్ నటి శిల్పి మర్వాహ గత పదేళ్లుగా నిర్భయ నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ఆమె ఆ నాటకాన్ని కొనసాగిస్తున్న తీరు, నిర్భయగా నటిస్తున్నప్పుడు ఆమె పడే వేదన తెలుసుకోదగ్గది. ఆ నాటకం ప్రతి చోటా వేయదగ్గది. ‘దస్తక్’ అంటే ‘తలుపు తట్టడం’ లేదా ‘తట్టి లేపడం’ లేదా ‘పిలుపునివ్వడం’. ఢిల్లీలో డిసెంబర్ 16, 2012 రాత్రి 9.30 నుంచి 11 గంటల మధ్య జరిగిన పాశవికమైన ‘నిర్భయ ఘటన’– చుట్టూ ఏం జరిగితే మనకెందుకు అని తలుపు మూసుకుని ఉన్న ఈ సమాజాన్ని, నిద్ర నటిస్తున్న ఈ సంఘాన్ని, బధిరత్వం నటిస్తున్న బండబారిన ఈ సమూహాన్ని తట్టి లేపింది. జాగృతపరిచింది. ఇప్పుడైనా కదలండి అని పిలుపును ఇచ్చింది. ‘నిర్భయ ఘటన ఈ దేశం నుంచి ఒక్కటే కోరింది–మారండి అని’ అని అంటుంది శిల్పి మార్వాహ. ఢిల్లీ నాటకరంగంలో చిరపరిచితమైన శిల్పి గత పదేళ్లుగా నిర్భయ ఘటన మీద ప్రదర్శిస్తున్న వీధి నాటకం పేరు– దస్తక్. ఢిల్లీ కమలా నెహ్రూ కాలేజ్లో చదువుకున్న శిల్పి ‘క్యాంపస్ థియేటర్’, ‘స్ట్రీట్ థియేటర్’లో అనేక ప్రయోగాలు చేసింది. 2011 ఢిల్లీ ‘యాంటి కరప్షన్ మూవ్మెంట్’లో చురుగ్గా పాల్గొని నాటకాలు వేసిన షిల్పి గుర్తింపు పొందింది. 2013 నుంచి ‘దస్తక్’ నాటకం ద్వారా తన సామాజిక బాధ్యతను గట్టిగా చాటుకుంటోంది. ఘటనకు మూల కారణం... ‘నిర్భయ ఘటనకు మూలకారణం పితృస్వామ్యం. ఇంటి వాతావరణంలో మగవాడికి పెత్తనం ఇవ్వడం నుంచి ఇది మొదలవుతుంది. తాను అణగదొక్కగలిగేవాడిగా స్త్రీ అణగదొక్కబడేదిగా మగవాడు ఎప్పుడైతే తర్ఫీదు ఇవ్వబడతాడో అప్పుడు స్త్రీ మీద హింస చేయడానికి వెనుకాడడు’ అంటుంది శిల్పి. ‘నిర్భయ ఘటన జరిగిన రోజు బస్సులో డ్రైవర్తో సహా 6 మంది ఉన్నారు. వారు మొదట నిర్భయతో గొడవ మొదలెట్టింది– ఇంత రాత్రి నువ్వు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నావ్ అని. అప్పుడు టైమ్ తొమ్మిదిన్నరే. ఏ ఒంటిగంటో కాదు. అయినా సరే స్త్రీని కంట్రోల్ చేసే స్వభావంతో ఆ ప్రశ్న వేశారు. అలా కంట్రోల్లో లేని స్త్రీని ఏమైనా చేయవచ్చని బరితెగించారు’ అంటుందామె. ఇండియా గేట్లో మొదటి ప్రదర్శన... ‘నిర్భయ ఘటన తర్వాత ఊరికే ఉండలేకపోయాను. ఆ ముందు సంవత్సరమే ‘దస్తక్’ అనే నాటకాన్ని స్త్రీపై సాగే హింసకు వ్యతిరేకంగా ప్రదర్శించేదాన్ని. అందులో రేప్ సన్నివేశం దుర్మార్గంగా చూపేదాన్ని. ఆడవాళ్లు నా దగ్గరకు వచ్చి ‘మరీ అంత దుర్మార్గం ఉండదు. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్’ అని అనేవారు. నిర్భయ ఘటన తర్వాత నేను మొత్తం నాటకాన్ని తిరగరాసి నిర్భయ మీద జరిగిన పాశవిక దాడిని నాటకంలో యధాతధంగా పెట్టాను. నిర్భయగా నేనే నటించాను. ఇండియా గేట్లో మొదటిసారి ప్రదర్శిస్తున్నప్పుడు నా మెదడు మొద్దుబారింది. ఆ నాటకంలో నేను కోపంతో అరుస్తున్నప్పుడు అది నటనగా కాక జరిగిన దారుణానికి నిరసనగా సగటు మహిళలో పెల్లుబికే కోపంగా వ్యక్తమైంది. చుట్టూ ఉన్న జనం చాలా మౌనంగా నాటకం చూశారు. సాధారణంగా వీధి నాటకాలు గోలగా చూస్తారు ప్రేక్షకులు. ఈ నాటకం సమయంలో మాత్రం దారుణమైన నిశ్శబ్దం పాటించారు. వారిలో వచ్చిన గాంభీర్యానికి గుర్తు అది. ఆ ప్రదర్శన తర్వాత అత్యాచారాన్ని అంత పాశవికంగా చూపడం ఎందుకో స్త్రీలు అర్థం చేసుకున్నారు. ఆ తీవ్రతను చూపితే తప్ప మార్పు రాదని తెలుసుకున్నారు’ అంటుంది శిల్పి. కొద్దిగానే మార్పు... ‘పదేళ్లుగా నిర్భయ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాను. పదేళ్లుగా నిర్భయ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేటికీ పెద్ద మార్పు లేదు. నిర్భయ నిందితుల్లో నలుగురికి ఉరిశిక్ష పడింది (ఒకరు విచారణ సమయంలో మరణించారు). జువెనైల్ చట్టంలో మార్పు వచ్చింది (ఒక నిందితుడు జువెనైల్ చట్టం నిర్థారించిన వయసు వల్ల విడుదల అయ్యాడు). కాని ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజా నాటకం నిర్భయ ఘటనను మాత్రం వదల్లేదు. అనేక గ్రూప్లు ఈ నాటకాన్ని ఆడుతూనే ఉన్నాయి. రంగస్థలం మీదకు నిర్భయ శవాన్ని తీసుకొచ్చినప్పుడల్లా జనం ఏడుస్తారు. కాని ఏడుపు మాత్రమే చాలదు. మార్పు రావాలి. ఇన్ని సంవత్సరాలుగా ఈ నాటకాన్ని వేయాలా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కాని మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని కూడా అనిపిస్తుంది. అందుకే నాటకం కొనసాగిస్తున్నాను. నిర్భయను మరువనివ్వను. నిర్భయ వల్ల వచ్చిన చైతన్యం కొనసాగాలి’ అంటుంది శిల్పి. -
స్వతంత్ర భారతి: తీరిన తల్లి ఘోష
దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్ఠాకూర్ (28), పవన్ గుప్తా (19), వినయ్శర్మ (20) లను ఢిల్లీలోని తీహార్ జైల్లో 2020 మార్చి 20న ఉరి తీశారు. 2012 డిసెంబర్ 16 న దేశ రాజధాని ఢిల్లీలో ఒక వైద్య విద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల, పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 2012 డిసెంబరు 29 న ఆమె తుదిశ్వాస విడిచారు. ఏడేళ్ల పాటు జరిగిన ఈ కేసు విచారణ కాలంలో ఆరుగురు నిందితులలో ఒకరు చనిపోగా, మరొకరు మైనరు కావడంతో అతడికి ఉరి నుంచి మినహాయింపు లభించింది. ‘2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం’గా వార్తల్లో ఉన్న ఆ ఘటనలో దేశం మొత్తం ఆ యువతి కుటుంబం తరఫున నిలబడింది. యువతి తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లి ఆషాదేవి చేసిన న్యాయపోరాటం ఫలించి చివరికి దోషులకు ఉరి అమలయింది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ఇండియాలోకి కోవిడ్–19 వ్యాప్తి. తొలి కేసు జనవరి 20న కేరళలో నిర్థారణ. టిక్టాక్ సహా 59 చైనా యాప్లను నిషేధించిన భారత్. ఆ తర్వాత పబ్జీ సహా మరో 118 చైనా యాప్ల నిషేధం. నేషనల్ ఎడ్యుకేషన పాలసీ–2020 కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, చేతన్ చౌహాన్, ప్రణబ్ ముఖర్జీ, జయప్రకాశ్ రెడ్డి, రామ్విలాస్ పాశ్వాన్.. కన్నుమూత. (చదవండి: సమర కవి: సుబ్రహ్మణ్య భారతి/ 1882-1921) -
మనిషే కాదు వీడు.. వింటే వెన్నులో వణుకుపుట్టడం ఖాయం
Sakinaka Case: వావీవరుసలు లేని మానవ మృగం.. ఒంటరి మహిళపై అఘాయిత్యానికి తెగపడింది. అంతటితో ఆగలేదు.. పైశాచికత్వం ప్రదర్శించింది. వదిలేయమని బాధితురాలు బతిమాలినా వినలేదు. ఫలితం.. ప్రాణం కోసం పోరాడి కన్నుమూసింది. సంచలనం సృష్టించిన సాకినక ‘నిర్భయ’ కేసులో దోషికి మరణ శిక్ష ఖరారైంది. బాధిత కుటుంబం, న్యాయం కోసం తొమ్మిది నెలలపాటు పోరాడిన వాళ్ల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన.. సాకినక(ముంబై, అంధేరీ) అత్యాచారం, హత్య కేసులో దోషి మోహన్ కథ్వారు చౌహాన్ .. దిన్దోషి కోర్టు గురువారం మరణ శిక్ష ఖరారు చేసింది. ఇది అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించిన అదనపు సెషన్స్ జడ్జి హెస్.సి.షిండే.. ఇలాంటి సంఘటనల్లో దోషిపై కనికరం చూపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పింది. స్వయానా నిందితుడి తండ్రే.. తన కొడుకును ఛీదరించుకున్నాడని, ఉరి తీయాలంటూ వ్యాఖ్యానించాడని, పైగా తన సోదరుడి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించడం.. అతని స్వభావానికి అద్దం పడుతోందని, ఇంతకన్నా అతనికి మరణ శిక్ష విధించడానికి కారణాలు అక్కర్లదేని ఆయన అన్నారు. ‘‘ఇదొక భయానకం. బాధితురాలితో చౌహాన్ రాక్షసంగా ప్రవర్తించాడు. వీడు మనిషి కాదు.. కిరాతకుడు. అత్యాచారానికి పాల్పడ్డ తీరును తలచుకొంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇది అత్యంత అరుదైన కేసు కిందికి వస్తుంది’’ అని పేర్కొన్నారు. మరణ శిక్ష విధిస్తేనే సమాజంలోకి సరైన సందేశం వెళ్తుందన్నారు. మరణ శిక్షతో పాటు 32 వేల రూపాయల జరిమానా విధించారు జడ్జి. ఘోరంగా.. మోహన్ కథ్వారు చౌహాన్ (45).. యూపీకి చెందిన వ్యక్తి. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇంట్లోంచి గెంటేశారు. దీంతో భార్యాపిల్లలతో సహా ముంబై వచ్చి.. కూలీ పనులు చేసుకుంటున్నాడు. 2021 సెప్టెంబర్ 10న ముంబైలో నిలిపి ఉంచిన టెంపోలో.. 34 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పదునైన వస్తువులతో ఆమె జనానాంగాలను గాయపరిచాడు. ఈ ఘోరంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో నిర్భయ ఘటనగా ఇది సంచలనం సృష్టించింది. బాధితురాలు దళితురాలు కావడంతో ఈ కేసు.. ప్రముఖంగా చర్చల్లో నిలిచింది. దీంతో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక చొవర చూపించారు సీఎం ఉద్దవ్ థాక్రే. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు మోహన్ చౌహాన్. ఈ కేసులో చౌహాన్ తరపున వాదించేందుకు లాయర్లు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వమే.. న్యాయవాదిని ఏర్పాటు చేసింది. అడ్వొకేట్ కల్పన వాస్కర్.. చౌహాన్ తరపున వాదనలు వినిపించారు. అతని ఆర్థిక స్థితి, భార్య అనారోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్షను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ, కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. వాదనల సమయంలోనూ చౌహాన్ పదే పదే జోక్యం చేసుకోవడం న్యాయమూర్తిని చిరాకు తెప్పించింది. తాను అమాయకుడినని, మద్యం మత్తులో అలా జరిగిపోయిందని, పోలీసులు ఈ కేసులో పోలీసులు గోల్మాల్ చేశారంటూ మాట్లాడాడు. దీంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజీ మీద ఏం స్పందిస్తావ్ అంటూ నిలదీశారు. పైగా సొంత అన్న కూతురిపైనే అఘాయిత్యం చేస్తానని మోహన్ బెదిరించడాన్ని ప్రస్తావించారు. మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేని మృగంగా అభివర్ణించింది చౌహాన్ను న్యాయస్థానం. -
Yogita Bhayana: కింగ్ఫిషర్ టూ పరి..బాధితుల కోసం ‘భయనా’
ఢిల్లీకి చెందిన యోగిత భయనా అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడం కోసం ఏవియేషన్ కెరీర్ నుంచి బయటకు వచ్చి ‘పరి (పీపుల్ అగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా)’ అనే ఎన్జీవో స్థాపించింది. వాళ్లకు పునరావాసం, పోషణ, న్యాయపోరాటంతోపాటు చదువు కూడా చెప్పిస్తోంది. వినడానికి ఇది రెండు వాక్యాల విషయం లాగానే అనిపిస్తుంది. కానీ...ఈ ప్రస్థానంలో ఆమె దరి చేర్చిన జీవితాల సంఖ్య ఎంత పెద్దదంటే ఓ వెయ్యికి పైగానే. అంతమంది బాధితుల జీవితాలను గాడిన పెట్టడంలో నిమగ్నమైన యోగిత తనకు అత్యంత పెద్ద సవాల్ న్యాయవ్యవస్థలో నెలకొన్న జాగు అని చెప్తోంది. నిర్భయ పోరాటంలో నిర్భయ తల్లికి అండగా నిలిచిన యోగిత జీవిత ప్రస్థానం ఇది. చిన్నప్పటి నుంచి యాక్టివ్ యోగిత పద్నాలుగేళ్ల నుంచే సామాజిక సేవలో చురుగ్గా ఉండేది. ట్యూషన్లు చెప్పి ఆ డబ్బును వార్ధక్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ఆర్థిక సహాయం చేసేది. స్కూల్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోపాటు సామాజకి కార్యకర్తగా ఎదిగింది. ఆ తర్వాత ఉమెన్ యాక్టివిస్ట్గా ఒక స్పష్టమైన దారిని ఎంచుకుంది. కెరీర్ పరంగా ఏవియేషన్ రంగం మీద ఏర్పడిన క్రేజ్తో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో చేరింది. కానీ ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయిందామె. జీవితంలో గొప్ప రిలీఫ్ పొందిన క్షణం ఏదంటే ఉద్యోగం మానేసినరోజేనంటోంది యోగిత. తన జీవితాన్ని సామాజిక సేవలో నిర్బంధించిన సంఘటనను గుర్తు చేసుకుంటారామె. కట్టిపడేసిన సంఘటన ‘‘ఓ రోజు రోడ్డు మీద నా కళ్ల ముందే ఓ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. గాయపడిన వ్యక్తిని కాపాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను, నా ఫ్రెండ్ ధైర్యం చేసి అతడిని హాస్పిటల్కు తీసుకువెళ్లాం. ఆ ప్రభుత్వ వైద్యశాలలో గాయపడిన వ్యక్తికి వైద్యం చేయడానికి అవసరమైన పరికరాలు కూడా సరిగ్గా లేవు. అన్నీ సమకూర్చుకుని వైద్యం మొదలుపెట్టేలోపు ఆలస్యం అయిపోయింది. అతడు దక్కలేదు. అతడి భార్య, బిడ్డలు దిక్కులేని వాళ్లయిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ సంఘటన వెంటాడుతూనే ఉండేది. నిద్రపోవడానికి కళ్లు మూసుకుంటే ఆ కుటుంబమే కళ్ల ముందు మెదిలేది. ఆలోచించే కొద్దీ పేదరికం ఎంత నరకమో అర్థం కాసాగింది. నిజానికి నన్ను మేల్కొలిపిన సందర్భం అది. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. కోర్టులో సాక్ష్యం చెప్పాను. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం లభించే వరకు వారికి సహాయంగా ఉన్నాను. ఆ సంఘటన రగిలించిన ఆవేదనతో 2007లో దాస్ చారిటబుల్ ఫౌండేషన్ను స్థాపించాను. రోడ్డు ప్రమాదాల పట్ల చైతన్యవంతం చేయడం, కళ్ల ముందు ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలనే అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించాం. సేవామార్గంలో మలుపు నా కార్యకలాపాలు ఇలా కొనసాగుతుండగా 2012 లో నిర్భయ ఘటన జరిగింది. దేశరాజధానిలో ఒక యువతి అమానవీయంగా అత్యాచారానికి గురి కావడం, ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస వదలడం గుర్తుండే ఉంటుంది. దేశాన్ని కుదిపేసిన ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ న్యాయపోరాటంలో తీర్పు రావడానికి ఏళ్లు పట్టింది. ఆంత కాలం నిర్భయ తల్లికి అండగా ఉన్నాను. ఆ సమయంలో నాకు ఎంతోమంది నుంచి వినతులు వస్తుండేవి. ‘మాకు కూడా ఇలాగే జరిగింది. న్యాయపోరాటం చేయాలంటే మాకు తోడుగా ఎవరూ రావడం లేదు’ అంటూ తమకు సహాయం చేయమని అడిగేవాళ్లు. తరచూ కోర్టుకు వెళ్లాల్సి రావడంతో మరికొన్ని సంగతులు కూడా తెలిశాయి. నిర్భయ కేసు... సామాన్యుల నుంచి పాలకుల వరకు అందరి దృష్టిలో పడింది కాబట్టి అప్పటికైనా విచారణ పూర్తి చేసుకుని తీర్పుకు నోచుకుంది. పదిహేనేళ్లు దాటినా కూడా అతీగతీ లేకుండా కాగితాల్లో మూలుగుతున్న కేసులు లెక్కకు మించి ఉన్నాయని తెలిసింది. ఒక యాక్టివిస్టుగా నేను చేయల్సిన పని చాలా ఉందనిపించి పరి ఎన్జీవోను స్థాపించాను. ఈ వేదిక ద్వారా సహాయం పొందిన బాలికలు, యువతులు, మహిళల వివరాలను చెప్పలేను. కానీ వెయ్యికి పైగా జీవితాలు గాడిలో పడ్డాయని చెప్పగలను. వాళ్ల తరఫున న్యాయపోరాటం చేయడం, పునరావాసం కల్పించడం, చదువుకునే వాళ్లను చదివించడం వంటివన్నీ చేస్తున్నాను. అత్యాచార బాధితులతోపాటు ఒంటరి మహిళలకు కూడా మా దగ్గర కారు డ్రైవర్, కారు క్లీనర్, హౌస్ కీపింగ్ వంటి పనుల్లో శిక్షణ తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు’’ అని చెప్పింది యోగిత. छात्रों की समस्या का समाधान किया जाए. पिछले एक साल से सिर्फ एक मौके की मांग कर रहे छात्रों के साथ न्याय जरूरी है. #UPSCExtraAttempt EXTRA ATTEMPT FOR ALL pic.twitter.com/C9Umb146jp — Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) December 1, 2021 -
వన్డ్రైవ్ ఇన్ ఫుడ్కోర్టు బాత్రూంలో స్పై క్యామ్
-
వన్డ్రైవ్ ఇన్ ఫుడ్కోర్టు బాత్రూంలో స్పై క్యామ్: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్కోర్టులోని మహిళల టాయిలెట్లో తన సెల్ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్న హౌస్ కీపింగ్ బాయ్ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు హౌజ్ కీపర్ బెనర్జీనే స్పై క్యామ్ పెట్టినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. స్పై క్యామ్లో ఐదు గంటల డేటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. (చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్) ఇక ఈ వ్యవహారంలో వన్ డ్రైవ్ ఓనర్ చైతన్య పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వన్ డ్రైవ్ ఇన్లో సీసీ కెమెరా బ్యాక్ అప్ లేకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు హౌస్ కీపర్ బెనర్జీ ఇంటితో పాటు ఓనర్ చైతన్య నివాసంలో తనిఖీలు చేశారు. సీక్రెట్ కెమెరాల్లో 20 మంది అమ్మాయిల నగ్న దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెనర్జీ పై నిర్భయ కేసు నమోదు చేశారు. చదవండి: అమెజాన్లో కత్తి కొని ప్రియురాలి ఇంటికి.. చివరికి ఏమైందంటే -
హత్రాస్: నిందితుల తరఫున ప్రముఖ న్యాయవాది
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార, హత్య ఉదంతంపై నిందితుల తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది అజయ్ ప్రకాశ్ సింగ్ (ఏపీ సింగ్) మరోసారి అదే తరహా కేసునే ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఓ దళిత బాలికపై హత్యాచారానికి ఒడిగట్టి ఆమె మరణానికి కారణమైన మానవ మృగాల తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. నలుగురు నిందితులను రక్షించేందుకు వకాల్తా పుచ్చుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హత్రాస్ ఘటనలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు యువకుల తరఫున ప్రమున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తారని పేర్కొంది. తమ విజ్ఞప్తిని మన్నించి అమాయకులైన ఠాకూర్ యువకులను రక్షించేందుకు ముందుకొచ్చిన ఏపీ సింగ్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొంది. (హాథ్రస్ ఘటన: అంతా ఆ నలుగురి వైపే) ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కొంతమంది తమ వర్గానికి చెందిన యువకులను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రపన్నుతున్నారని, దాని నుంచి వారిని కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కాగా అఖిల భారతీయ క్షత్రియ మహాసభ చైర్మన్గా కేంద్ర మాజీమంత్రి రాజా మానవేంద్ర సింగ్ ప్రస్తుతం ఆ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఈ కేసు నిమిత్తం న్యాయవాదికి అయ్యే ఖర్చును తమ సంఘమే భరిస్తుందని తెలిపారు. దీని కోసం పెద్ద ఎత్తున చందాలను సైతం వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఏపీ సింగ్కు అప్పగించామని వెల్లడించారు. క్రిమినల్ న్యాయవాదిగా మంచి పేరును సింగ్.. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన నిర్భయ దోషులను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అనేక వాయిదాల అనంతరం నలుగురు దోషులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లను ఉరితీశారు. మరోవైపు నిర్భయ కేసులో బాధితురాలి పక్షాన వాదనలు వినిపించి.. దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహ హత్రాస్ బాధితురాలి తరఫున వాదించేందుకు ముందుకొచ్చారు. నిర్భయ కేసులో ఉన్నట్లే హాథ్రస్ ఘటనలోనూ నలుగురు నిందితులు ఉన్నారు. అయితే నిర్భయ కేసులో నిందితులకు మద్దతు లేదు. కానీ హత్రాస్ ఘటనలో అంతా ఆ నలుగురి వైపే ఉన్నారు. ఆమెపై దాడి మాత్రమే జరిగింది. అత్యాచారం జరగలేదు అని అడిషనల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అంటున్నారు. ‘పోలీసులు ఆమె తల్లిదండ్రులకు చెప్పిన తర్వాతే మృతదేహాన్ని దహనం చేశారు’ అని జిల్లా మేజిస్ట్రేట్ ఇదివరకే సెలవిచ్చారు. జిల్లా ఎస్పీ, మిగతా పోలీస్ అధికారులు హత్రాస్ మాటే ఎత్తడానికి లేదన్నట్లుగా ప్రతిపక్ష నేతల్ని, స్వచ్ఛంద సంఘాల వాళ్లను, మీడియాను బుల్గడీ గ్రామంలోకి కాదు కదా, అసలు హాథ్రస్లోకే అడుగు పెట్టనివ్వ లేదు. బాధితురాలి వైపు కాకుండా, ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న ఆ నలుగురు నిందితుల వైపు యావత్ జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా నిందితుల తరఫును పేరున్న సీనియర్ న్యాయవాది ఏపీ సింగ్ వాదిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సీమ ఈ కేసును ఎదుర్కోవడం సవాలు లాంటింది. అయితే నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడినట్లే తమ కుమార్తెను బలితీసుకున్న దోషులకు సైతం మరణశిక్ష పడుతుందని బాలిక తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నాళ్లిలా: చచ్చినా గౌరవం లేదు
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః... ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారన్నది నానుడి. పూజల మాటేమోగాని.. చచ్చినా కనీస గౌరవం ఇవ్వడంలేదు ఈ సమాజం! మొన్న నిర్భయ... నిన్న ప్రియాంకారెడ్డి.. తాజాగా హాథ్రస్ యువతి.. మహిళలపై హత్యాచారాలు, బెదిరింపులు, వేధింపులు... మన దేశానికి మాత్రమే పరిమితం కాదు.. కానీ... అతి ప్రాచీన సంస్కృతిగా గొప్పలు చెప్పుకుంటున్న భారతావనిలో ఇలాంటి ఘటనలు ఏటికేడాది పెరిగిపోతూ ఉండటం మాత్రం ఆందోళన కలిగించే విషయమే. మహిళల రక్షణ విషయంలో మనం చేస్తున్నదేమిటి? చేయాల్సిందేమిటి? అన్నది ఒక్కసారి తరచి చూస్తే.. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కరు లైంగిక, భౌతిక హింస ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. దేశాలకతీతంగా ఇది జరుగుతోంది. అయితే వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అకృత్యాల ప్రభావం నేటి మహిళపై ఏమిటి? అంటే.. వారి కదలికలపై ఆంక్షలకు కారణమైంది. వారి స్వేచ్ఛకు అన్ని రకాల పరిమితులు, పరిధులు ఏర్పాటు చేసింది. ఇది ఆయా మహిళలకు మాత్రమే నష్టం చేకూర్చడం లేదు. సమాజం మొత్తానికి తీవ్రమైన లోటుగా మారిందనడం అతిశయోక్తి కాదు. ఆడపిల్లలు తమ సామర్థ్యం మేరకు చదువు పూర్తి చేసుకోగలిగినా, నచ్చిన వృత్తి, ఉద్యోగాలను నెరపగలిగినా కుటుంబం పరిస్థితి, సమాజం తీరుతెన్నులు మరోలా ఉంటాయనడంలో సందేహం లేదు. (న్యాయం జరిగేదాకా పోరుబాటే) 2018లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ జారీ చేసిన జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు 108. అంతకు మునుపటి ఏడాది కూడా మన స్థాయి ఇంతే. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం, అవకాశం, రాజకీయ సాధికారత, విద్య, ఆరోగ్య సేవలు వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేసే ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్ ఏమాత్రం ముందుకు వెళ్లినా.. అది మన స్థూల జాతీయోత్పత్తిని అమాంతం పెంచేస్తుందని అంచనా. ఇదంతా ఎందుకూ అంటే.. మహిళల భద్రత, వారి చదువు సంధ్యలు మన సంస్కారాన్ని చాటుకునేందుకు మాత్రమే కాదు.. భారత్ విశ్వగురువుగా ఎదగాలన్న వారి ఆశలకూ అత్యవసరమని చెప్పేందుకు! ’(ఢిల్లీలో ప్రియాంకా గాంధీ ధర్నా) ఆ(యా)ప్కే సాథ్! మహిళల భద్రత అనేది భారత్కు మాత్రమే సంబంధించిన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశంలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ఆడబిడ్డలను సురక్షితంగా ఉంచేందుకు వినూత్న టెక్నాలజీల అభి వృద్ధి కూడా పలు దేశాల్లో జరుగుతోంది. స్మార్ట్ఫోన్ సాయంతో విపత్కర పరిస్థితుల్లో మహిళలు కుటుంబ సభ్యులను, పోలీసులను అలర్ట్ చేసేందుకు పలు అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి... నమోలా : దక్షిణాఫ్రికాలో రూపొందించిన అప్లికేషన్ ఇది. పోలీసులే కాకుండా.. అగ్నిమాపక దళం, అంబులెన్ వంటి అత్యవసర సేవలన్నింటినీ అందుబాటులోకి తెస్తుంది. మీరున్న ప్రాంతాన్ని దగ్గరివారితో పంచుకునేందుకు అవకాశం ఉండటం ఈ అప్లికేషన్ లోని ఒక అంశం. మీరు కలవాల్సిన ప్రాంతానికి బంధుమిత్రులు ముందుగానే వచ్చినా.. వారు ప్రయాణం ప్రారంభించినా ఆ సమాచారం మీకు చేరిపోతుంది. అప్లికేషన్ లోనే ఓ ప్యానిక్ బటన్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఒత్తితే చాలు.. పోలీసులకు మీరున్న ప్రాంత వివరాలు తెలుస్తాయి. మీరు కష్టాల్లో ఉన్నారన్న విషయమూ తెలిసిపోతుంది. లక్షకుపైగా డౌన్లోడ్లు ఉన్న ఈ అప్లికేషన్ రేటింగ్ 4.75/5 గా ఉంది. కవలన్ ఎస్ఓఎస్ : తమిళనాడు పోలీసులు రూపొందించిన స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ఇది. ఈవ్ టీజింగ్, కిడ్నాప్ వంటి పరిస్థితుల్లో పోలీస్ కంట్రోల్ రూమ్ను సంప్రదించేందుకు వీలు కల్పిస్తుంది. ఫేక్ కాల్స్ను నివారించేందుకు తద్వారా పోలీసుల విలువైన సమయాన్ని కాపాడేందుకు కూడా ఈ అప్లికేషన్ లో ఏర్పాట్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు ఎంపిక చేసుకున్న నంబరుకు మీరున్న ప్రాంతాన్ని చేరవేస్తుంది. ఆఫ్లైన్ మోడ్లోనూ పనిచేస్తుంది. ఎస్ఎంఎస్ల రూపంలో సమాచారం పంపిస్తుంది. ఎస్ఓఎస్ మీట నొక్కగానే ఫోన్ వెనుక భాగంలోని కెమెరా ద్వారా వీడియో రికార్డింగ్ మొదలవుతుంది. ఈ అప్లికేషన్కు 10 లక్షలకుపైగా డౌన్ లోడ్లు ఉన్నాయి. గ్రానస్ : మహిళలు, పిల్లలకు అత్యవసర వైద్యసాయం అందించేందుకు రూపొందించిన అప్లికేషన్ ఇది. ప్రమాదాలు జరిగినప్పుడు లేదా రక్తం అత్యవసరమైనప్పుడు ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. భారత్లో తయారైన ఈ అప్లికేషన్ ను ఇప్పటివరకూ 50వేల మందికిపైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. అత్యవసరమైనప్పుడు లేదా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు స్వచ్ఛంద సంస్థలను సంప్రదించేందుకు ఇందులో సౌకర్యం ఉంటుంది. గ్రానస్కు అనుబంధంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆపదలో ఉన్న మహిళతో మాట్లాడి అత్యవసర సాయం అందిస్తారు. రక్తం అవసరమైన వారిని, దాతలను కలిపే ఓ ప్లాట్ఫాం ఇది. స్మార్ట్ఫోన్ లేని వారి కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది. తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేకమైన కార్యకర్తల బృందం ఒకటి పనిచేస్తూ ఉండటం విశేషం. ఎక్కడుంది సమస్య? పితృస్వామ్య వ్యవస్థ మొదలుకొని, మన నగరాల్లోని చిన్న చిన్న విషయాల వరకూ అనేక అంశాలు ఈ దేశంలో మహిళల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. చిన్నప్పటి నుంచి అన్ని అంశాల్లోనూ మగపిల్లలకు అధిక ప్రాధాన్యం కల్పించడం.. వారిలో ఆడవారిపై ఒక రకమైన తేలిక భావాన్ని సృష్టిస్తుందని పలువురు సామాజిక నిపుణులు స్పష్టం చేశారు. ప్రతి లక్ష మందికి 125 మంది పోలీసులు మాత్రమే ఉన్న అతి తక్కువ దేశాల్లో భారత్ కూడా ఒకటి కావడం మహిళల భద్రతపై ప్రభావం చూపుతున్న అంశాల్లో రెండోది. భారత్లో రోజూ కనీసం 67 మంది అత్యాచారానికి గురవుతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. మహిళలపై హింస అంటే అది లైంగికమైందే అన్న స్థితికి భారత్ చేరుకుంది. ఫలితంగా భార్యపై భర్త భౌతికంగా దాడి చేయడం సాధా రణమైన అంశంగా మారిపోయింది. చాలా కేసులు పోలీసుల దృష్టికి రాకుండానే తెరమరుగు అవుతూ ఉంటాయి. చిన్న చిన్న పనులతో పెద్ద తేడా.. ప్రభుత్వం కొన్ని చిన్న చిన్న పనుల ద్వారా కొంత మార్పును తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. 2012 నాటి నిర్భయ ఘటనలో అత్యాచారానికి పాల్పడ్డ వారికి మరణ శిక్ష విధించినా.. కేసుల విచారణలో జాప్యం, దోషిగా నిరూపణ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటం వంటి అంశాల్లో మార్పు రావాల్సి ఉంది. అత్యాచార నేరాలకు ప్రత్యేక కోర్టులు, చట్టాలను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసింది. నగరాల్లో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు చేయడంతో మంచి ఫలితాలను ఇస్తుందని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు బస్టాపులన్నింటిలో వీధి దీపాల వెలుతురు ఉండేలా జాగ్రత్త పడటం లేదా ఏకాంత ప్రదేశాల్లో కాకుండా.. కొద్దోగొప్పో జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలకు బస్టాపులను తరలించడం. దీంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ అన్ని వీధుల్లో దీపాలు ఏర్పాటు చేయడం మహిళల భద్రత విషయంలో ప్రభావశీలిగా ఉంటుందని అంచనా. 2008 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో పొదుపు లక్ష్యంగా అమెరికాలో వీధి దీపాల వెలుగును తగ్గిస్తే చాలా నగరాల్లో మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, బహిరంగ ప్రదేశాల్లో మహిళల అవసరాలు తీర్చే ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటివి కూడా మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడతాయి. మరచిపోలేని నిర్భయలు.. 2013, ముంబై: శక్తి మిల్స్ సామూహిక అత్యాచారం. ఓ కౌమార వయస్కుడితోపాటు ఐదుగురు జరిపిన అమానవీయ ఘటన. 2014, ఉత్తరప్రదేశ్: బడావ్ సామూహిక అత్యాచారం కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారు. 2016, రాజస్తాన్: పదిహేడేళ్ల బాలికపై హాస్టల్ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇది. బాధితురాలి మృతదేహం ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం సమీపంలోని నీటి కొలనులో ప్రత్యక్షమైంది. 2017, ఉత్తరప్రదేశ్: ఓ మైనర్ బాలికపై ఉన్నావ్లో జరిగిన సామూహిక హత్యాచారం. బీజేపీ మాజీ సభ్యుడు కుల్దీప్ సింగ్ సెంగర్పై కేసు నమోదు. 2018, కథువా: జమ్మూకశ్మీర్లోని కథువాలో మైనర్ బాలికపై ఏడుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదు రోజుల తరువాత బాధితురాలి మృతదేహం లభ్యమయ్యింది. 2020, మధ్యప్రదేశ్: బన్సీపురలో ఆరేళ్ల పాపను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కనుగుడ్లు పెకిలించే ప్రయత్నం చేశారని పోలీసులు చెప్పారు. కిడ్నాపైన కొన్ని గంటలకు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు తాళ్లతో కట్టివేసిన పరిస్థితిలో ఈ బాలిక దొరికింది. -
హాథ్రస్ ఘటన: అంతా ఆ నలుగురి వైపే
ఆరేళ్లు నడిచింది నిర్భయ కేసు. హాథ్రస్కి ఇంకా నడకే రాలేదు. అసలు నడవనిచ్చేలానే లేరు! కోర్టుకు వెళ్తేనే కదా తొలి అడుగు. ఆ అడుగునే పడనివ్వడం లేదు. ఊళ్లోకి దారులన్నీ మూసేశారు. కొన్ని నోళ్లను కూడా!! ‘నిర్భయ’ లాయర్ వచ్చారు. ‘పో.. పోవమ్మా’ అని ఆపేశారు. ఆమె ఆగిపోతారనా?! నిర్భయ లాయర్ మాత్రమే కాదు.. లాయర్ నిర్భయ కూడా.. సీమ! తల్లీకూతుళ్లు పంట పొలంలో పచ్చిక కోస్తున్నారు. కోస్తూ కోస్తూ కూతురు కొంచెం దూరం వెళ్లింది. చిన్నపిల్లేం కాదు, ‘ఎక్కడుందో?’ అని తల్లి వెతుక్కోడానికి. పందొమ్మిదేళ్ల యువతి. సమయం గడిచింది. అలికిడి లేదు. అప్పుడు అనుమానం వచ్చి తలతిప్పి చూసింది. చూపు ఆనే దూరంలోనూ కూతురు కనిపించలేదు. కూతురు స్లిప్పర్స్ మాత్రం కనిపించాయి. తల్లి గుండె గుభేల్మంది. స్పిప్లర్స్ కనిపించాక, మనిషిని ఈడ్చుకెళ్లిన జాడలు కనిపించాయి. ‘తల్లీ’.. అని కూతురు ఏ లోకాన ఉన్నా వినిపించేలా అరచి, ఆక్రోశించింది తల్లి గుండె. సెప్టెంబర్ 14 న ఇది జరిగింది. సామూహిక అత్యాచారంలో ప్రాణం కోసం కొట్టుకుని కొట్టుకుని సెప్టెంబర్ 29 న ఆసుపత్రిలో ఆ కూతురు కన్నుమూసింది. తల్లిని కూడా దగ్గరికి రానివ్వకుండా పోలీసులే కూతుర్ని దహనం చేశారు! హాథ్రస్ ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా. ఆ జిల్లాలోని బుల్గడీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామంలో ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వెళ్లిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. సీమ ‘నిర్భయ’ కేసు లాయర్. ఆ కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష పడి, నిర్భయకు కొంతైనా న్యాయం జరిగిందంటే ఆమె వల్లనే. నిర్భయ కేసులో ఉన్నట్లే హాథ్రస్ ఘటనలోనూ నలుగురు నిందితులు ఉన్నారు. అయితే నిర్భయ కేసులో నిందితులకు మద్దతు లేదు. హాథ్రస్ ఘటనలో అంతా ఆ నలుగురి వైపే ఉన్నారు! ‘‘ఆమెపై దాడి మాత్రమే జరిగింది. అత్యాచారం జరగలేదు’’ అని అడిషనల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అంటున్నారు. ‘‘పోలీసులు ఆమె తల్లిదండ్రులకు చెప్పిన తర్వాతే మృతదేహాన్ని దహనం చేశారు’’ అని జిల్లా మేజిస్ట్రేట్ అంటున్నారు! జిల్లా ఎస్పీ, మిగతా పోలీస్ అధికారులు హాథ్రస్ మాటే ఎత్తడానికి లేదన్నట్లుగా ప్రతిపక్ష నేతల్ని, స్వచ్ఛంద సంఘాల వాళ్లను, మీడియా ను బుల్గడీ గ్రామంలోకి కాదు కదా, అసలు హాథ్రస్లోకే అడుగు పెట్టనివ్వడం లేదు. బాధితురాలి వైపు కాకుండా, ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న ఆ నలుగురు నిందితుల వైపు యావత్ జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టాక జిల్లా ఎస్పీని, మరో నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయడం మాత్రమే మృతురాలి కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు దక్కిన న్యాయం. ఈ తరుణంలో హాథ్రస్ కేసును తను వాదించడానికి ముందుకు వచ్చిన సీమా సమృద్ధికీ ఆటంకాలు ఎదురయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కేసును చేపట్టాలని సీమ కృతనిశ్చయంతో ఉన్నారు. మృతురాలు చనిపోయే ముందు ఆసుపత్రిలో ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను బట్టి ఆమెపై జరిగింది కేవలం దాడి మాత్రమే కాదు, అత్యాచారం కూడా అని రుజువు చేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బహిరంగ సాక్ష్యంగా ఉంది. వీడియో వరకు ఎందుకు? మృతురాలి తల్లి మాటలు చాలవా?! ‘‘ఈడ్చుకెళ్లిన జాడల వైపు నడుచుకుంటూ వెళ్లాను. ఓ చోట నా కూతురు స్పృహలో లేకుండా పడి ఉంది. ఒంటి మీద బట్టల్లేవు. నోట్లోంచి రక్తం కారుతోంది’’ అని ఆమె చెప్పిన నాలుగు ముక్కలు చాలు సీమ ఆ కేసును వాదించడానికి. సీమది కూడా ఉత్తరప్రదేశే. అక్కడి ఎటావా స్వస్థలం. తండ్రి బలాదిన్ ఖుష్వహ.. బిధిపూర్ గ్రామ మాజీ సర్పంచి. కూతుర్ని ఆమె ఇష్ట ప్రకారం ‘లా’ చదివించాడు. లా తర్వాత జర్నలిజం, పొలిటికల్ సైన్ కూడా చదివారు సీమ. 2012లో నిర్భయ ఘటన జరిగే నాటికి ఆమె ఇంకా విద్యార్థినిగానే ఉన్నారు. తర్వాత రెండేళ్లకు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆ నలుగురికీ ఉరిశిక్ష పడాల్సిందేనని గట్టిగా వాదించినప్పుడు తొలిసారిగా ఆమె పేరు దేశానికి తెలిసింది. కేసు నడుస్తున్నప్పుడు ‘నిర్భయ జ్యోతి ట్రస్టు’కు ఆమె సలహాదారుగా ఉన్నారు. ఆ ట్రస్టును నెలకొల్పింది నిర్భయ తల్లిదండ్రులు. అత్యాచార బాధితుల న్యాయపోరాటాలకు ఆర్థికంగా తోడ్పాటును అందివ్వడం ట్రస్టు ధ్యేయం. మిగతా సామాజిక అంశాలలో కూడా సీమ చురుగ్గా ఉన్నారు. నిర్భయ దోషులు చట్టంలోని వెసులుబాట్లను ఉపయోగించుకుని చివరి వరకు బయట పడాలని చూసినట్లే, వారిని ఉరికంబం ఎక్కించేందుకు సీమ చివరి వరకు ప్రయత్నించి నిర్భయకు కనీస న్యాయం జరిపించారు. ఇప్పుడీ హాథ్రస్ కేసు స్వీకరించడం కూడా తన ధర్మం అని ఈ న్యాయవాది మనస్ఫూర్తిగా భావిస్తున్నారు. -
హత్రాస్ ఘటన: ‘ఎంతమంది నిర్భయలు బలి కావాలి’
ముంబై: ఉత్తర ప్రదేశ్ హత్రాస్లో 19 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటన బాధితుఆరలఅఉ సెప్టెంబర్ 29న మరణించిన విషయం తెలిసిందే. అయితే గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రి పోలీసులు బాధితురాలి అంత్యక్రియలు జరిపించడంతో యూపీ సీఎం యోగి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధితురాలికి, తన కుటుంబానికి న్యాయం జరగాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సామాన్య ప్రజల నుంచే కాక సెలబ్రెటిల నుంచి నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై గ్లోబర్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. హత్రాస్ ఘటన నాటి నిర్భయ సామూహిక హత్యచారాన్ని గుర్తు చేసేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: నాలుక కోసి చిత్రహింసలు.. యువతి మృతి) ‘అగౌరవం, దుర్భాష.. నిరాశ, కోపం... మళ్లీ, మళ్లీ, మళ్లీ.. మహిళలు, యువతులు, చిన్నాలపైనే ఎప్పుడూ అఘాత్యాలపై అఘ్యాతాలు... కానీ వారి ఎడుపులు, అరుపులు మాత్రం ఎవరికి వినపడటం లేదు. ఇంకా ఎంత మంది నిర్భయలు బలి కావాలి’ అంటూ ప్రియాంక భావోద్యేగానికి లోనయ్యారు. కాగా సెప్టెంబర్ 14న యూపీలోని హత్రాస్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దళితురాలైన యువతిపై నలుగురు అగంతకులు సామూహిక లైంగిక దాడి చేశారు. అనంతరం బాధితురాలిని విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయలతో ఉన్న యువతిని తొలుత యూపీలోని అలీఘర్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితురాలు సెప్టెంబర్ 29న మృతి చెందింది. అయితే ఈ ఘటనలో నిందితులైన నలుగురిని అరెస్టు చేసి భారతీయ శిక్షాస్మృతి 302 కింద కేసు నమోదు చేసినట్లు హత్రాస్ ఎస్సై తెలిపారు. (చదవండి: యూపీ నిర్భయ పట్ల అమానవీయం) -
యూపీ నిర్భయ పట్ల అమానవీయం
హథ్రాస్/లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ‘నిర్భయ’ ఘటన బాధితురాలి పట్ల అధికార యంత్రాంగం మరోసారి అమానవీయంగా వ్యవహరించింది. ఢిల్లీ ఆస్పత్రిలో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన ఆ దళిత యువతి(19)కి అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించింది. అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ పోలీసులు తమను బలవంతపెట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. తాజా పరిణామంపై రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితురాలు అయినందున బాధితురాలి పట్ల మరణంలోనూ క్రూరంగా వ్యవహరించిందని మండిపడ్డాయి. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా హడావుడిగా అంత్యక్రియలు ముగించడంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. కుటుంబసభ్యుల కోరిక మేరకే అంత్యక్రియలు జరిపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారంలోగా దర్యాప్తు పూర్తి చేయించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ యూపీ సీఎంకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సీఎం యోగి బుధవారం ఉదయం బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. అర్థరాత్రి జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రాస్ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన దళిత యువతిపై 15 రోజుల క్రితం అగ్ర వర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, పాశవికంగా వ్యవహరించారు. ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయింది. రాత్రి సమయంలో ఆస్పత్రి నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు వెంటరాగా బాధితురాలి మృతదేహాన్ని తీసుకుని కుటుంబసభ్యులు అక్కడికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న హథ్రాస్ జిల్లాలోని సొంతూరుకు చేరుకున్నారు. అప్పటికి అర్ధరాత్రి 2.30 గంటలైంది. అధికారులు, పోలీసుల సమక్షంలో అప్పటికప్పుడే దహన సంస్కారాలు జరిపించారు. ఆ సమయంలో మృతురాలి తండ్రితోపాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిపి సుమారు 40 మంది శ్మశానవాటికలో ఉన్నారని ఆమె కుటుంబసభ్యుడొకరు చెప్పారు. మీడియా సభ్యులు దరిదాపుల్లోకి రాకుండా ప్రత్యేక పోలీసు దళాన్ని కూడా రంగంలోకి దించారు. ‘నా కూతురికి అర్థరాత్రి దాటిన తర్వాత 2.30–3 గంటల సమయంలో అంత్యక్రియలు జరిగాయి’ అని ఆమె తండ్రి తెలిపారు. ‘మా నాన్న ఢిల్లీ ఆస్పత్రి నుంచి హథ్రాస్కు చేరుకున్న వెంటనే పోలీసులు మా ఇంటికి వచ్చారు. మా నాన్నను బలవంతంగా తమతోపాటు శ్మశానవాటికకు తీసుకెళ్లారు’ అని బాధితురాలి సోదరుడు తెలిపారు. తాము గ్రామానికి చేరుకోకమునుపే పోలీసులు మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారని ఓ కుటుంబసభ్యుడు ఆరోపించారు. తీవ్ర విమర్శలు హత్యాచారానికి దారి తీసిన పరిస్థితులు, అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు జరిపించడంపై వివిధ ప్రతిపక్షపార్టీలు, వామపక్షాలు, కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఖరిపై ఢిల్లీలోని యూపీ భవన్ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో వారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తెలిపారు. తన కూతురికి న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. ‘బాధితురాలికి, ఆమె కుటుంబానికి మీ ప్రభుత్వం భద్రత కల్పించలేక పోయింది. మరణంతో సహా ఆమెకున్న అన్ని హక్కులను హరించింది. ముఖ్యమంత్రిగా కొనసాగడానికి మీకు ఎలాంటి నైతిక హక్కు లేదు. రాజీనామా చేయండి’ అంటూ ప్రియాంక ట్విట్టర్లో సీఎం యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. సాక్ష్యాలను చెరిపేసేందుకు పోలీసులు అర్థరాత్రి అంత్యక్రియలు జరిపారని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్ ఆరోపించారు. కోల్కతాలో యూపీ సీఎం కటౌట్ దహనం -
అగ్రికల్చర్ జేడీ హబీబ్ బాషాపై నిర్భయ కేసు
సాక్షి, అనంతపురం : జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషాపై నిర్భయ కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ మహిళ ఉద్యోగి సల్మా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గం వ్యవసాయ శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తాను, డిప్యూటేషన్ అడిగితే కోరిక తీర్చమన్నాడని బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించారు. ప్రస్తుతం జేడీ హబీబ్ బాషా సెలవుల్లో ఉన్నారు. గతంలో ఆయన గుంటూరులో డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సమయంలోనూ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
దివ్యాంగురాలిపై పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మహిళా ఉద్యోగి అని కూడా చూడలేదు.. దివ్యాంగురాలన్న కనీస కనికరం లేదు. ఆవేశంతో మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా అదే శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ దాడి చేశాడు. కార్యాలయ సిబ్బంది అతడ్ని నిలువరించేందుకు యత్నించినా దాడి కొనసాగించాడు. చివరికి సిబ్బంది గట్టిగా ప్రయత్నించి ఆపారు. నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే వారు కేసు నమోదు చేసి డిప్యూటీ మేనేజర్ను అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. మాస్క్ ధరించాలని సూచించడమే నేరం పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు కొండాయపాళెం గేట్ సమీపంలోని మిలటరీకాలనీలో చెరుకూరు ఉషారాణి, వీరగంధం హరిబాబు దంపతులు నివాసం ఉంటున్నారు. హరిబాబు సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో బెంగళూరులో ఉంటున్నారు. దివ్యాంగురాలైన ఉషారాణి ఏపీ టూరిజం శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆరేళ్ల క్రితం ఆమె విజయవాడ నుంచి నెల్లూరు దర్గామిట్టలోని ఏపీ టూరిజం హోటల్కు బదిలీ అయ్యారు. అదే హోటల్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న భాస్కర్ సుమారు ఏడు నెలల క్రితం ఆమె గురించి తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయమై బాధితురాలు భర్తకు తెలియజేశారు. దీంతో భాస్కర్ను హరిబాబు తీవ్రంగా మందలించారు. డిప్యూటీ మేనేజర్ భాస్కర్ గత నెల 27న మాస్క్ లేకుండా కార్యాలయానికి వచ్చి సీనియర్ అసిస్టెంట్తో మాట్లాడసాగాడు. గమనించిన ఉషారాణి కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన భాస్కర్ ఆమెతో గొడవపడ్డాడు. కుర్చీలో ఉన్న ఆమె జట్టు పట్టుకొని కిందపడేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు. కుర్చీ హ్యాండిల్తో కొట్టడంతో ఆమె గాయపడ్డారు. అతికష్టంపై తోటి ఉద్యోగులు అతని బారినుంచి విడిపించి ఆమెను బయటకు తీసుకెళ్లారు. బాధితురాలు దర్గామిట్ట పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మ నిందితుడిపై దాడి, నిర్భయతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సేకరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నిందితుడిని అదే రోజు అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి మంగళవారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు.∙ఘటనపై మంత్రి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించి, నిందితుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు విధుల నుంచి తొలగిస్తూ ఆ శాఖ ఎండీ ప్రవీణ్కుమార్ ఆదేశాలు జారీచేశారు. న్యాయం జరిగింది: ఉషారాణి దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా. వారు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నాకు న్యాయం జరిగింది. మహిళలకు అండగా ప్రభుత్వం: వాసిరెడ్డి పద్మ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఉషారాణితో మాట్లాడి జరిగిన దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధికారులు పాల్గొన్నారు. దాడి ఘటనపై సీఎం ఆదేశాలతో తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్ మహిళా ఉద్యోగి ఉషారాణిపై దాడి ఘటనపై తక్షణ చర్యలు తీసుకున్నట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తమకు ఆదేశాలు ఇచ్చారని డీజీపీ తెలిపారు. మహిళలపై దాడులు సహించేది లేదు: హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మహిళలపై దాడులను సహించేది లేదని, తప్పుచేస్తే ఎంతటివారైనా చట్టం ముందు తల వంచాల్సిందేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. -
నిర్భయ దోషులకు ఉరి: చివర్లో ఉత్కంఠ
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరితీయ బడ్డ నలుగురు దోషులు అద్భుతం జరుగుతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష వేయకుండా నిలిపివేస్తారని ఆశ పడ్డారని తెలిపాయి. కోర్టు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని పదేపదే అడిగారని జైలు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో విచారణ జరగడంతో చివరి నిమిషంలో తమకు మరణదండన తప్పుతుందన్న ఆశ నలుగురు నేరస్తుల్లో కనిపించినట్టు చెప్పారు. తీహర్ జైలులోని 3వ నంబర్ బరాక్లో ఉన్న దోషుల చివరి నిమిషం వరకు ’కోర్టు నుంచి ఏదైనా వర్తమానం వచ్చిందా’ అన్న ప్రశ్న తమకు ఎదురైందని వెల్లడించారు. ఉదయం 5.30 గంటలకు ఉరితీసే వరకు తమకు కాపలా ఉన్న 15 మంది భద్రతా సిబ్బందిని ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారట. (ఆ మైనర్ ఇప్పుడెక్కడా?!) లడ్డూలు, నూడుల్స్ అడిగారు నలుగురు దోషులకు గురువారం మధ్యాహ్నం రోజూ మాదిరిగా ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఇచ్చారు. ప్రత్యేకంగా ఏమి అడగలేదని, అందరూ లంచ్ చేశారని జైలు అధికారులు తెలిపారు. అక్షయ్ గురువారం సాయంత్రం టీ తాగాడు. అక్షయ్, పవన్ రాత్రి భోజనం చేయలేదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముకేశ్, అక్షయ్, వినయ్ తమకు లడ్డూలు, నూడుల్స్ కావాలని అడగడంతో వాటిని తెప్పించి పెట్టినట్టు వెల్లడించారు. గురువారం రాత్రి 11 గంటలకు దోషులు నలుగురికి న్యాయవాది, మానసిక వైద్యుడి సమక్షంలో చివరిసారిగా వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు జిల్లా మేజిస్ట్రేట్ (పశ్చిమ) డెత్వారెంట్ను దోషులకు చదివి వినిపించారు. ఉరిశిక్షకు భయపడిన పవన్ కాసేపు గలాభా సృష్టించడంతో అతడి వద్ద ఎక్కువ మంది పోలీసులను ఉంచారు. జైలు సిబ్బంది ఇచ్చిన బట్టలు వేసుకునేందుకు అతడు నిరాకరించాడు. ‘మేము ఇచ్చిన బట్టలను వేసుకోకుండా నేలకేసి కొట్టాడు. తనను క్షమించాలని ఏడుస్తూ వేడుకున్నాడు. ఉరి కంబం దగ్గరకు తీసుకెళుతుండగా దోషులందరూ తమను క్షమించాలని కన్నీళ్లు పెట్టుకుంటూ అర్ధించార’ని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. (నేనైతే ఫాంహౌజ్కు తీసుకువెళ్లి తగలబెట్టేవాడిని..) 8వ నంబర్ సెల్ ఉన్న వినయ్ శర్మ, ముఖేష్ సింగ్.. ఒకటో నంబర్సెల్ ఉన్న పవన్ గుప్తా, ఏడో నంబర్ సెల్లో ఉన్న అక్షయ్ సింగ్లను భద్రత సిబ్బంది ఉరికంబం వద్దకు తీసుకొచ్చారు. వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్లను ఒకేసారి ఉరి తీశారు. ఆ సమయంలో జిల్లా మేజిస్ట్రేట్, జైలు సూపరింటెండెంట్, ఇద్దరు సహాయ సూపరింటెండెంట్స్, వార్డెన్, వైద్యాధికారి, ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ ఉన్నారు. యూపీలోని మీరట్కు చెందిన తలారి పవన్ జలాద్కు ఒక్కో ఉరికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.60 వేలు చెల్లించినట్టు సమాచారం. జైలులో పనిచేసిన సంపాదించిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని దోషులు చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2 వేల నుంచి మూడు వేల వరకు ఉన్నట్టు సమాచారం. డబ్బుతో పాటు వారి బట్టలు, దుప్పట్లను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. (తలారికి లక్ష నజరానా.. జైలు వద్ద హడావుడి) -
నా కూతురి ఆత్మ శాంతించింది!
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావడంపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని, ఇప్పుడు భద్రంగా ఉన్నామని మహిళలు భావిస్తారని వ్యాఖ్యానించారు. శిక్ష అమలు ఇంతగా వాయిదా పడటానికి కారణమైన చట్టపరమైన లోపాలపై ఇకపై తాము పోరాటం చేస్తామన్నారు. నిర్భయ తల్లి ఆశాదేవి, తండ్రి బద్రీనాథ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని ఆశాదేవి వ్యాఖ్యానించగా, తమ కూతురికి న్యాయం జరిగిందని, ఇలాంటి అన్యాయానికి గురైన బాధితుల కోసం ఇకపై పోరు కొనసాగిస్తామని బద్రీనాథ్ పేర్కొన్నారు. ఉరిశిక్ష అమలు మూడుసార్లు వాయిదా పడటంపై స్పందిస్తూ.. శిక్ష అమలును వాయిదా వేసేందుకు చేసే ఇలాంటి కుయుక్తులకు అడ్డుకట్ట వేసేలా మార్గదర్శకాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టును వారు అభ్యర్థించారు. ‘ఇప్పటికైనా మిగతా బాధితులకు సకాలంలో న్యాయం జరగాలి. అందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు జరగాలి. ఆ దిశగా పోరాటం సాగిస్తాం’ అన్నారు. ఈ రోజు తన కూతురి ఆత్మ శాంతించిందని భావిస్తున్నానని భావోద్వేగంతో ఆశాదేవి వ్యాఖ్యానించారు. మా ఊరి ప్రజలు ఈ రోజే హోళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ శిక్ష తరువాతైనా.. తల్లిదండ్రులు మహిళలతో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తమ కుమారులకు నేర్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ‘గురువారం రాత్రి సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఇంటికి వచ్చి నా కూతురు ఫొటోను హత్తుకుని, బేటీ.. నీకు న్యాయం జరిగింది’ అని విలపించానని ఆశాదేవి తెలిపారు. రాత్రంతా తామిద్దరికి కంటి మీద కునుకు లేదన్నారు. మార్చి 20వ తేదీ చరిత్రలో నిలిచిపోవాలని, ఈ రోజును ఏటా ‘నిర్భయ న్యాయ దివస్’గా జరుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశాదేవి ఇంటి వద్ద తెల్లవారు జామున గుమికూడిన ప్రజలు ఉరిశిక్ష అమలుపై ‘కౌంట్ డౌన్’ నిర్వహించారు. -
ఉరేసరి
నిర్భయ అత్యాచారం కేసులో నిందితులుగా నిలిచిన నలుగురిని శుక్రవారం ఉరి తీశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ స్పందనను తెలియజేశారు. ‘ఉరే సరి’ అని అభిప్రాయాలను పేర్కొన్నారు. ఆలస్యమైనా న్యాయం జరిగింది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం తగ్గిపోకుండా ఉండేందుకు నిర్భయ కేసు మరో ఉదాహరణ అయింది. నిర్భయ కేసు కోసం పోరాడిన ఆమె తల్లి, న్యాయవాదులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. న్యాయ వ్యవస్థకు నా గౌరవాన్ని తెలియజేస్తున్నాను. ఇలాంటి ఘోర సంఘటనలు జరగకుండా ఉండేందుకు మరిన్ని కఠిన చట్టాలు, సత్వర తీర్పులు తీసుకురావాలని కోరుతున్నాను. – మహేశ్బాబు ఏడేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత నిర్భయ దోషులను ఉరి తీశారు. న్యాయం కోసం ఇన్నేళ్లు నిర్విరామంగా పోరాడిన నిర్భయ తల్లిగారు, న్యాయవాదులకు నా సెల్యూట్. – రవితేజ నిర్భయ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జైహింద్. – మనోజ్ మంచు ఒకరి చావు నాకు బోలెడు రిలీఫ్ ఇస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అలాగే కొంతమందికి భయాన్నిస్తే చాలు. – హరీష్ శంకర్ నిర్భయ దోషులను ఉరి తీశారనే అద్భుతమైన వార్తతో నా రోజుని ప్రారంభించాను. న్యాయం చేకూరింది. – తమన్నా భాటియా చాలా ఏళ్ల తర్వాత నిర్భయ తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రపోతారని అనుకుంటున్నాను. చాలా పెద్ద యుద్ధమే చేశారు. ఆశా దేవి (నిర్భయ తల్లి) గారికి నా సెల్యూట్ – తాప్సీ న్యాయం నిజంగా జరిగిందనుకుందామా? అత్యాచారం చేసిన ఆరు నెలల్లో ఉరి తీయాలనే చట్టాన్ని తీసుకురావాలి. ఇలాంటి సంఘటనల్లో అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయినా తీర్పును అమలు చేయడంలో ఇంత ఆలస్యం చేయడమెందుకు? – వరలక్ష్మీ శరత్ కుమార్ నిర్భయ కేసు మరింత త్వరగా ముగిసి ఉండాల్సింది. ఇప్పటికైనా ముగిసినందుకు సంతోషం. – ప్రీతీ జింటా నిర్భయ దోషులను ఉరి తీశారు. అత్యాచారానికి శిక్ష మరణమే. ఈ నిర్ణయం ఇండియాలోనే కాదు...ప్రపంచవ్యాప్తంగా కూడా ఓ ఉదాహరణగా నిలవాలి. మహిళలను గౌరవించాలి. నిర్భయ దోషులను ఉరి తీయడాన్ని ఆలస్యం చేయడానికి ప్రయత్నించిన వారిని చూసి సిగ్గుపడతున్నా – రిషీ కపూర్ ఈ భూమి మీద నలుగురు రాక్షసులు (నిర్భయ దోషులను ఉద్దేశిస్తూ) ఇకపై లేరు. నిర్భయ తల్లిదండ్రులు దీనికోసం ఏడేళ్లుగా ఎదురు చూశారు. చివరికి నిర్భయ ఆత్మకు శాంతి కలిగింది – రవీనా టాండన్ కఠినమైన చట్టాలు, శిక్షలు, ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర తీర్పులు వంటివి మాత్రమే నిర్భయలాంటి ఘటనలకు పాల్పడాలనుకునేవారికి భయాన్ని కలిగిస్తాయి. కాస్త ఆలస్యమైనా న్యాయం చేకూరింది – రితేష్ దేశ్ముఖ్ ఇవాళ (శుక్రవారం) దేశానికి న్యాయం జరిగింది. నిర్భయ తల్లి రూపంలో మనందరికీ ఓ హీరో దొరికారు. ఈ తీర్పు వల్ల న్యాయవ్యవస్థ మీద గౌరవం అలానే కొనసాగుతుంది. అలాగే తప్పు చేయాలనుకునే ఆలోచనలు ఉన్నవాళ్లకు ఓ హెచ్చరికగానూ ఉంటుంది. – ప్రణీతా సుభాష్ ఈ కేసు గెలవడానికి నిర్భయ తల్లికి ఏడేళ్లు పట్టింది. ఈ ఏడేళ్ల సమయంలో ఎన్నో అవమానాలు, మాటలు భరించాల్సి వచ్చిందామె. అవన్నీ దాటుకుంటూ ముందుకు వచ్చి పోరాడారు.. ‘అంత ఆలస్యంగా బయట ఏం చేస్తుందో?’ అని సులువుగా ఓ మాట అనేసి తన (నిర్భయ) వ్యక్తిత్వాన్ని తప్పుబట్టినవాళ్లందరూ స్వీయ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. -
‘నిర్భయ’దోషులకు ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ తల్లిదండ్రుల ఏడేళ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. 2012లో రాజధాని నడిబొడ్డున నడుస్తున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయని అత్యంత క్రూరంగా హింసించి అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషులైన ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31)లను శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరితీశారు. ఇలా ఒకేసారి నలుగురికి ఉరి శిక్ష అమలు చేయడం తీహార్ జైలు చరిత్రలో ఇదే మొదటిసారి ప్రాణాల మీద ఆశతో దోషులు చివరి వరకు ఉరిశిక్ష అమలును ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకుంటూ ఆఖరి వరకు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. దాంతో, గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా వారి ఉరిపై సందిగ్ధత నెలకొంది. గురువారం రాత్రి పవన్ గుప్తా పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు అత్యవసర విచారణ చేపట్టాయి. తన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రెండోసారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ పవన్ గుప్తా వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు బెంచ్ అసాధారణ రీతిలో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ప్రారంభించింది. గంటపాటు జరిగిన వాదనల అనంతరం ఆ పిటిషన్ను బెంచ్ కొట్టివేసింది. దాంతో, ఉరి శిక్ష అమలు చేయడానికి చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉరిశిక్ష అమలుకు ముందు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినివ్వాలని అక్షయ్ సింగ్, పవన్ గుప్తా పెట్టుకున్న అభ్యర్థనను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇది జరిగిన మూడు గంటల్లోనే తీహార్ జైలు అధికారులు నలుగురికీ ఉరి శిక్ష అమలు చేశారు. నిబంధనల ప్రకారం.. ఉరి వేసిన తరువాత అరగంట పాటు వారిని ఉరికంబానికే వేలాడదీసి ఉంచారని జైలు అధికారులు తెలిపారు . ‘ఉరిశిక్ష అనంతరం డాక్టర్లు పరీక్షించారు. నలుగురూ మృతి చెందారని నిర్ధారించారు’ అని ఆ తరువాత తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ ప్రకటించారు. ఆ తరువాత డీడీయూ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించామన్నారు. అక్షయ్, ముఖేష్ల మృతదేహాలను బిహార్, రాజస్తాన్ల్లోని తమ తమ గ్రామాలకు వారు తీసుకెళ్లారని చెప్పారు. వినయ్, పవన్ల మృతదేహాలను ఢిల్లీలో రవిదాస్ క్యాంప్లో ఉన్న వారి ఇళ్లకు తరలించామన్నారు. చివరి క్షణాలు ఒకవైపు కోర్టులో వాదనలు జరుగుతున్నా.. తీహార్ జైలు అధికారులు ఉరిశిక్ష అమలుకు సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. గురువారం రాత్రి నుంచే మొత్తం జైలుని లాక్డౌన్ చేశారు. దోషులు నలుగురిని వేర్వేరు గదుల్లో ఉంచారు. రాత్రి డిన్నర్ని ముఖేష్, వినయ్ రోజూ మాదిరిగా ఇచ్చిన టైమ్కి తినేశారు. వారికిచ్చిన ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఉన్నాయి. అక్షయ్ గురువారం సాయంత్రం టీ తాగాడు. ఆ తర్వాత అతను ఏం తీసుకోలేదు. పవన్ గుప్తా కూడా ఆహారం తీసుకోవడానికి నిరాకరించాడు. వారిలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని, రాత్రంతా కూడా వారు ముభావంగానే గడిపారని జైలు అధికారి ఒకరు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత లాంఛనాలు పూర్తి చేయడానికి తెల్లవారు జామున 3.30 గంటలకి ఆ దోషులు నలుగురిని నిద్ర లేపడానికి అధికారులు వెళ్లారు. అయితే వారు మేలుకొని ఉన్నారు. రాత్రంతా వారు నిద్రలేకుండానే గడిపారని జైలు అధికారులు వెల్లడించారు. స్నానం చేయడానికి, అల్పాహారం తినడానికి ఇష్టపడలేదు. నిర్వికారంగానే ఉరికంబం వైపు అడుగులు వేశారు. ఒకరి ఆత్మహత్య.. మరొకరి విడుదల దోషులుగా తేలి, ఉరిశిక్షకు గురైన నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులుగా విచారణ ఎదుర్కొన్నారు. విచారణ జరుగుతుండగానే.. ఆ ఇద్దరిలో రామ్సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు నేరం జరిగిన సమయానికి మైనర్ కావడంతో.. నిర్బంధ వసతి గృహంలో మూడేళ్లు శిక్ష అనుభవించి 2015 సంవత్సరంలో విడుదల అయ్యాడు. ప్రధాని మోదీ హర్షం నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. నిర్భయ కేసును ప్రస్తావించకుండా.. ‘న్యాయం గెలిచింది. మహిళల గౌరవం, భద్రత మనకు అత్యంత ముఖ్యమైన విషయం. మన మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తున్నారు. మహిళల సాధికారతపై ప్రధానంగా దృష్టి పెట్టే.. మహిళలకు సమానత్వం, సమాన అవకాశాలు లభించే సమాజాన్ని మనమంతా కలిసి నిర్మించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, మహిళలపై హింసను నివారించేందుకు మరణశిక్ష ఏ నాటికి పరిష్కారం కాబోదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. ఈ ఉరి శిక్ష భారతదేశ మానవహక్కుల చరిత్రలో ఒక మరకలా నిలిచిపోతుందని పేర్కొంది. ఆఖరి కోరికలివే ఉరికంబం ఎక్కడానికి ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తన అవయవాలను దానం చేశాడు. అదే తన ఆఖరి కోరికని చెప్పాడు. వినయ్ తాను జైల్లో ఉన్నప్పుడు వేసిన పెయింటింగ్లను జైలు సూపరింటెండెంట్కి ఇవ్వమని కోరాడు. తాను చదివే హనుమాన్ చాలీసా తన కుటుంబసభ్యులకు ఇవ్వమని చెప్పినట్టు జైలు అధికారి వెల్లడించారు. ముఖేష్, వినయ్, పవన్, అక్షయ్ ఎవరూ ఎలాంటి విల్లు రాయలేదని ఆ అధికారి చెప్పారు. విజయ సంకేతం చూపుతున్న నిర్భయ తల్లిదండ్రులు, లాయర్లు సీమా కుష్వాహ, జితేంద్ర ఝా 2012 నుంచి 2020 వరకు న్యూఢిల్లీ: నిర్భయ ఘటన 2012 డిసెంబర్ 16న చోటు చేసుకోగా, దోషులకు ఉరిశిక్ష 2020 మార్చి 20న అమలైంది. ఏడు సంవత్సరాలకు పైగా ఈ కేసు విచారణ సాగింది. దోషులుగా తేలి, ఉరిశిక్షను నిర్ధారించిన తరువాత కూడా కేసును సాధ్యమైనంత సాగదీశారు. విచారణ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కార్యాలయం చుట్టూ పలుమార్లు ఈ కేసు చక్కర్లు కొట్టింది. చివరగా, మార్చి 5న ట్రయల్ కోర్టు మార్చి 20న ఉరిశిక్షను అమలు చేయాలని డెత్ వారెంట్లను జారీ చేసింది. ‘నిర్భయ’ తలారికి లక్ష నజరానా యశవంతపుర: నిర్భయ హంతకులను ఉరి తీసిన తలారి పవన్ జల్లూద్కు రూ.లక్ష నజరానా ప్రకటించినట్లు నటుడు జగ్గేశ్ ట్వీట్ చేశారు. హంతకులను ఉరితీసే వ్యక్తికి రూ. లక్ష బహుమతిగా ఇస్తానని గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉరితీతతో సత్యం, ధర్మానికి న్యాయం లభించిందన్నారు. ఈ డబ్బుతో తన కుమార్తె వివాహం చేస్తానని జల్లూద్ గతంలో పేర్కొనడాన్ని జగ్గేష్ గుర్తు చేశారు. జైలు వద్ద నినాదాలు తీహార్ జైలు వెలుపల గురువారం రాత్రంతా జనం హడావుడి కనిపించింది. కరోనా భయాన్ని కూడా పక్కనపెట్టి వందలాది మంది గుమిగూడారు. దోషులను ఉరి తీశారన్న వార్త వినగానే జాతీయ జెండాను ఎగురవేస్తూ లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేశారు. న్యాయం దక్కింది నిర్భయ దోషులకు ఉరిశిక్షపై పలువురు ప్రముఖుల హర్షం న్యూఢిల్లీ/బెంగళూరు: నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని మోదీ సహా, పలువురు కేంద్రమంత్రులు, మహిళా సంఘాలు సానుకూలంగా స్పందించాయి. పలువురు రాజకీయ నేతలు న్యాయనిపుణులు హర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష అమలును పలువురు కేంద్ర మంత్రులు స్వాగతించారు. దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాలకు కఠిన శిక్షలు అమలు చేయాలని బాలీవుడ్ ప్రముఖులు రిషి కపూర్, తాప్సీ పన్ను, రితేశ్ దేశ్ముఖ్ తదితరులు పేర్కొన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాత్రం.. మహిళలపై అత్యాచారాలకు దోషులకు మరణ శిక్ష విధించడం ఏమాత్రం పరిష్కారం కాదని తెలిపింది. భారత్ మానవహక్కుల రికార్డుపై ఈ ఘటనను మాయని మచ్చగా అభివర్ణించింది. దోషులకు కఠిన శిక్షలు పడేలా నిర్భయ తల్లి సాగిస్తున్న పోరాటాన్ని స్వయంగా చూశాం. ఇందుకు కొంత సమయం తీసుకున్నా, చివరికి ఆ కుటుంబానికి న్యాయం దక్కినందుకు సంతోషంగా ఉంది. నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుతో నేరగాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని గట్టి హెచ్చరిక పంపినట్లయింది. –మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నిర్భయ ఘటనల వంటివి భవిష్యత్తులో జరక్కుండా చూస్తామని ఈ సమయంలో మనమంతా ప్రతినబూనాలి. ఏ కూతురికీ ఇలాంటి ఆపద రాకూడదు. వ్యవస్థలో లోపాలను అధిగమించేందుకు పోలీసులు, కోర్టులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలి. –ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర వేదనను అనుభవించిన ఒక కూతురు నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. మరణశిక్ష అమల్లో జాప్యం అయ్యేలా దోషులు తప్పుదోవ పట్టించకుండా ఇకపై న్యాయవ్యవస్థ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. –కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ నిర్భయకు ఎట్టకేలకు న్యాయం దొరికింది. ఆమె ఆత్మకు శాంతి లభించింది. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయడం మిగతా వారికి హెచ్చరికలా పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఈ కేసు బయటపెట్టింది. వీటిని నలుగురు దోషులు వాడుకున్నారు. –జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ నిర్భయ నివాసంలో హర్షం దోషులకు ఉరిశిక్ష అమలు శుక్రవారంనాడు పూర్తి కావడంతో పశ్చిమ ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నిర్భయ కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగువారు సంతోషం వ్యక్తం చేశారు. నిర్భయ కుటుంబసభ్యులను కలిసేందుకు జనం క్యూ కట్టారు. ఈ సందర్భంగా వారంతా స్వీట్లు పంచుకున్నారు. పాటలు పాడుకుంటూ, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ‘గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి మా ఇంటి ఆవరణలో నిర్భయకు నివాళిగా రోజూ కొవ్వొత్తులను వెలిగిస్తున్నాం. ఇటీవల ఒక రోజు రాత్రి భారీ వర్షం కురిసినా కూడా ఒక కొవ్వొత్తి వెలుగుతూనే ఉండటం గమనించాం. దీనిని మేం శుభ సూచికంగా భావించాం’అని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ తెలిపారు. నిర్భయ దోషుల మృతదేహాలతో ఆస్పత్రి వద్దకు వచ్చిన వ్యాన్ -
ఆ ఆరుగురి పాపమే !
న్యూఢిల్లీ: డిసెంబర్ 16, 2012.. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కదులుతున్న బస్సులో ఢిల్లీ మెడికో విద్యార్థిని నిర్భయపై జరిగిన దారుణం అత్యంత హేయమైనది. నిర్భయపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెని, ఆమె స్నేహితుడ్ని ఐరన్ రాడ్లతో రక్తాలు కారేలా చితకబాది కదులుతున్న బస్సులోంచే బయటపడేసిన అకృత్యమది. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనతో యావత్ జాతి కదలిపోయింది. నిర్భయ దోషులకు తగిన శాస్తి జరిగే వరకు పోరాడతామని ఎలుగెత్తి చాటింది. నిర్భయ తల్లిదండ్రులు, రేపిస్టులపై జాతి యావత్తు చేసిన పోరాటం నలుగురి ఉరితీతతో ముగిసింది. ఈ నేరం చేసిన ఆరుగురి వివరాలేంటో చూద్దాం రామ్సింగ్, ప్రధాన నిందితుడు : నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన బస్సు డ్రైవరే రామ్ సింగ్. దక్షిణ ఢిల్లీలో రవిదాస్ కేంప్ మురికివాడల్లో నివాసం ఉండే అతనే ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఢిల్లీ పోలీసులు రామ్సింగ్ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. రామ్సింగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే అతని సోదరుడు ముఖేష్ సింగ్ సహా మిగిలిన అయిదుగురిని అరెస్ట్ చేశారు. కేసు విచారణ కొనసాగుతుండగానే రామ్ సింగ్ 2013, మార్చి 10న జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబితే, అతనిని హత్య చేశారంటూ అతని తల్లిదండ్రులు ఆరోపించారు. మైనర్: అత్యంత హేయమైన ఈ నేరంలో ఒక మైనర్ ప్రమేయం కూడా ఉంది. నిర్భయను క్రూరంగా హింసించింది ఈ మైనరే. అతనిని ఆనంద్విహార్ ప్రాంతంలో మర్నాడు ఉదయం నిర్బంధించిన పోలీసులు జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. నేర నిర్ధారణ కావడంతో మూడేళ్లు రిమాండ్ హోమ్కి తరలించారు. మైనర్ అయినందున అతని వివరాలేవీ బయటకు వెల్లడించలేదు. మూడేళ్ల నిర్బంధం తర్వాత 2015 డిసెంబర్లో అతనిని విడుదల చేశారు. ఉరిశిక్ష అమలు చేసింది ఈ నలుగురికే ముఖేష్ సింగ్, బస్సు క్లీనర్ తీహార్ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తమ్ముడే ముఖేష్ సింగ్ (32). దక్షిణ ఢిల్లీలోని మురికివాడల్లో సోదరుడితో కలిసి నివసించేవాడు. అత్యాచారం జరిగిన రాత్రి నిర్భయను, ఆమె స్నేహితుడిని ఐరన్ రాడ్తో చితకబాదాడని ముఖేష్పై అభియోగాలున్నాయి. నేరం జరిగాక ముఖేష్ సింగ్ అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు అతనిని రాజస్తాన్లోని కరోలిలో అదుపులోనికి తీసుకున్నారు. నిర్భయపై అత్యాచారం చేసినప్పుడు ఆమె ప్రతిఘటించలేదని బీబీసీ ఇండియా డాటర్ అనే డాక్యుమెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పవన్ గుప్తా, పండ్ల వ్యాపారి పవన్ గుప్తా (25) పండ్ల వ్యాపారి. అతను కూడా రవిదాస్ మురికివాడల్లోనే నివాసం ఉంటాడు. డిసెంబర్ 16 మధ్యాహ్నం తప్పతాగాడు. ఆ తర్వాత అన్నం తిని మద్యం మత్తులోనే బయటకు వెళ్లాడు. నిర్భయ దుర్ఘటన జరిగినప్పుడు బస్సు దరిదాపుల్లో కూడా లేడని పవన్ కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ పవన్ గుప్తా ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తే అతను నేరం జరిగిన సమయంలో బస్సులోనే ఉన్నాడని బయటపడింది. వినయ్ శర్మ, జిమ్ ట్రైనర్ వినయ్శర్మ (26) కూడా రవిదాస్ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిట్నెస్ ట్రైనర్. ఒక జిమ్లో అసిస్టెంట్గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడగలడు. పోలీసులు అతనిని జిమ్ బయటే అదుపులోనికి తీసుకున్నారు. నేరం జరిగిన సమయంలో తాను బస్సు దగ్గర లేనని, ఒక సంగీత కార్యక్రమానికి హాజరవడానికి వెళ్లానని వినయ్ శర్మ పదే పదే చెప్పుకున్నాడు. 2016లో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కానీ జైలు అధికారులు అతనిని కాపాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా జైలు గోడలకి తలని బాదుకొని గాయపరుచుకున్నాడు. అక్షయ్ ఠాకూర్, స్కూల్ డ్రాపవుట్ అక్షయ్ ఠాకూర్ (31) బీహార్ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్గా ఉన్నాడు. స్కూల్ డ్రాపవుట్ అయిన అక్షయ్ 2011లో బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన అయిదు రోజుల తర్వాత అక్షయ్ని బీహార్లో అతని స్వగ్రామం తాండ్వాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షయ్ భార్య తన కుమారుడితో కలిసి బీహార్లోనే ఉంటోంది. ఉరితీతకు మూడు రోజుల ముందు అతను రెండోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. అక్షయ్ ఉరి శిక్షకు ముందు తాను వితంతువుగా జీవితాంతం బతకనని, తనకి విడాకులు ఇప్పించాలని కోరుతూ అతని భార్య కోర్టుకెక్కింది. -
‘ఉరిశిక్షను ఆలస్యం చేసినవారు సిగ్గుపడాలి’
నిర్భయ హత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను శుక్రవారం ఉరి తీసిన విషయం తెలిసిందే. తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. ఏడు సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ న్యాయమే గెలిచిందంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. (నేనైతే ఫాంహౌజ్కు తీసుకువెళ్లి..: దోషుల లాయర్) తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు స్పందించారు. ‘‘చాలా కాలం వేచి ఉన్నాం. న్యాయం జరిగింది. నిర్భయ ఘటనపై ఇప్పుడు జరిగిన విషయం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది. న్యాయం కోసం నిరంతర పోరాటం, కృషి చేసిన నిర్భయ తల్లిదండ్రులకు, న్యాయవాదులకు నా సెల్యూట్. న్యాయవ్యవస్థపై గౌరవం పెరిగింది. ఇలాంటి దురాగతాలకు సత్వర న్యాయం దక్కాలి, బలమైన చట్టాలుండాలి’’ అని ట్వీట్ చేశారు. అలాగే మరో ట్వీట్లో మహమ్మారి కరోనాను అరికట్టేందుకు ఈ నెల 22న (ఆదివారం) జనతా కర్ఫ్యూ పాటించాలని ఇచ్చిన పిలుపుకు అందరూ మద్ధతివ్వాలని కోరారు. (నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్ కానీ ఉరి తర్వాత!) Long awaited but Justice done!! #NirbhayaVerdict restores our faith in the judiciary. Saluting her parents and their advocates for their continuous unflinching efforts. Respect for our judicial system🙏🙏 still advocating for stricter laws and quicker verdicts in heinous crimes🙏 — Mahesh Babu (@urstrulyMahesh) March 20, 2020 నిర్భయ కేసు దోషులును ఉరి తీశారు. అన్న వార్తతో ఈ రోజు ప్రారంభమైంది. న్యాయం జరిగింది.- తమన్నా ఇలాంటి నమ్మశక్యంకాని వార్త. ఏడు సంవత్సరాల తరువాత, నిర్భయ కేసు దోషులను ఉరితీశారు. న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన నిర్భయ తల్లికి, న్యాయవాదికి నా వందనం - రవి తేజ నిర్భయకు న్యాయం జరిగింది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఇది ఓ ఉదాహరణగా నిలవాలి. అఘాయిత్యాలకు ఒడిగట్టిన వారికి ఉరిశిక్ష విధించాలి. మహిళను గౌరవించండి. ఉరిశిక్షను ఇన్నేళ్లపాటు ఆలస్యం చేసిన వారు సిగ్గు పడాలి. జై హింద్ - రిషి కపూర్ ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడింది. చాలా సంవ్సరాల తర్వాత ఈ రోజు నిర్భయ తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రిస్తారు. తాప్సీ అలాగే ఈ ఘటనపై మరికొంత మంది తారలు కూడా స్పందించారు. శ్రద్ధాకపూర్, రితేష్ దేశ్ముఖ్, రవీనాటాండన్, ప్రీతి జింటా, మధుర్ భండార్కర్ తదితరులు వారి ట్విటర్స్ అకౌంట్స్ ద్వారా నిర్భయకు న్యాయం జరిగింది అంటూ ట్వీట్ చేశారు. (జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!) Beginning the day with the incredible news that the #Nirbhayacase convicts are executed. Justice has been served. — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 20, 2020 Such incredible news...After seven long years, Nirbhaya case convicts have finally been executed! I Salute the mother and the lawyer who fought tirelessly for so many years to get justice🙏#NirbhayaVerdict — Ravi Teja (@RaviTeja_offl) March 20, 2020 Nirbhaya Justice. “Jaisi karni waisi bharni” Let this set an example not only in India but world over. Punishment for rape is by death. You have to respect womanhood. Shame on the people who delayed the execution. Jai Hind! pic.twitter.com/ENyjTxwlMI — Rishi Kapoor (@chintskap) March 20, 2020 It’s done. Finally. I hope the parents can finally sleep slightly better tonight after YEARS. It’s been a long long battle for them. Asha Devi 🙏🏼 https://t.co/XidMPTzKm4 — taapsee pannu (@taapsee) March 20, 2020 -
అమ్మ చెబితేనే కేసు ఒప్పుకొన్నా: దోషుల లాయర్
న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం రాజధానిలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీ పరిధిలో ఉన్న మునిర్కకు వెళ్లేందుకు బస్సు ఎక్కిన నిర్భయపై కామాంధులు అకృత్యానికి పాల్పడ్డారు. చిత్ర హింసలు పెట్టి.. ఆమెను, స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ఆ తర్వాత ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించి విఫలమై... వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అయితే దేశ రాజధానిలో ఈ ఘటన జరగడం, మీడియా కూడా ఈ విషయంలో త్వరగా స్పందించడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అనేక పరిణామాల అనంతరం వారిని దోషులుగా తేల్చిన కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఆనాటి నుంచి నేటి దాకా నిర్భయ కేసులో బాధితురాలి తల్లిదండ్రులకు ఎంతో మంది అండగా నిలిస్తే.. దోషులకు మాత్రం ఒకే ఒక వ్యక్తి పూర్తి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన కేవలం న్యాయవాదిగా తన కర్తవ్యాన్ని నెరవేరిస్తే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు.. కానీ ఆయన అలా చేయలేదు. బాధితురాలి వ్యక్తిత్వాన్ని, మహిళల వస్త్రధారణ ఇతరత్రా విషయాలపై నోరు పారేసుకున్నారు. చట్టంలోని లొసుగులను అనేక విధాలుగా ఉపయోగించుకున్నారు. ఆఖరికి శుక్రవారం దోషులకు ఉరిశిక్ష అమలైన నేపథ్యంలో ఓటమిని తట్టుకోలేక మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. (నిర్భయ కేసు: ఆ మైనర్ ఇప్పుడెక్కడ?!) ఆయన పేరు అజయ్ ప్రకాశ్ సింగ్(42). లక్నో యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. 1997 నుంచి సుప్రీంకోర్టులో లాయర్గా ప్రాక్టీసు చేస్తున్నారు. చాన్నాళ్లుగా అక్కడ పనిచేస్తున్నా ఆయనకు అంతగా గుర్తింపు లేదు.. గానీ నిర్భయ దోషుల తరఫున(మొదట అక్షయ్ ఠాకూర్.. తర్వాత పవన్ గుప్తా) వకాల్తా పుచ్చుకోగానే ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. తన క్లైంట్లను నిర్దోషులుగా నిరూపించేందుకు... బాధితురాలిని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ అమ్మాయి అంతరాత్రి పూట అబ్బాయితో బయటకు ఎందుకు వెళ్లిందో నేను అడగకూడదా? వాళ్లిద్దరూ కలిసి రాఖీ పండుగ జరుపుకోవడానికి అన్నాచెల్లెళ్లలా కలిసి బయటకు వెళ్లారో నాకు తెలియదు. అయితే వాళ్లు స్నేహితులు అని నాకు తెలుసు. ఈరోజుల్లో బాయ్ఫ్రెండ్, గర్ల్ఫ్రెండ్ సంస్కృతిని మనం పొగడాల్సిందే. కానీ నేను అటువంటి ఇంటి నుంచి రాలేదు. ఒకవేళ నా కూతురు లేదా సోదరి ఇలా పెళ్లికి ముందే చెడు తిరుగుళ్లు తిరిగి తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని, ఎవరైనా తనను ఏమైనా చేయవచ్చనే అవకాశం ఇస్తే.. నేను తనను వెంటనే మా ఫాంహౌజ్కు తీసుకువెళ్లేవాడిని. అక్కడే కుటుంబం అందరి ముందూ పెట్రోల్ పోసి తగులబెట్టేవాడిని’’ అని కుల, లింగ వివక్షతో కూడిన అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. (అర్ధరాత్రి నిర్భయ ఎక్కడుందో తెలుసా) ఇక ఈ కేసును అంగీకరించడం గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘తీహార్ జైలులో ఉన్న అక్షయ్ని కలవడానికి అతడి భార్య బిహార్లోని ఓ గ్రామం నుంచి ఢిల్లీకి వచ్చింది. అప్పుడే తనకు ఎవరో నా నెంబర్ ఇచ్చారు. దీంతో ఆమె మా ఇంటికి వచ్చి మా అమ్మను కలిసింది. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి.. మా అమ్మ గంభీరంగా ఉంది. ఈ అమ్మాయికి నువ్వు న్యాయం చేయాల్సిందే అని పట్టుబట్టింది. నిజానికి మా అమ్మానాన్న ఆధ్యాత్మిక భావనతో ఉంటారు. వాళ్లు ఎక్కువగా టీవీ చూడరు. అందుకే ఈ జంతర్మంతర్, రామ్లీలా నిరసనలు, మామ్బత్తీ, ధూప్ బత్తీ, అగర్బత్తీ ర్యాలీల గురించి వారికి అంతగా తెలియదు’’ అంటూ నిర్భయకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన వారిని కించపరుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిందితులను దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో సహనం కోల్పోయి ఏకంగా న్యాయమూర్తి ముందే అసహనం వెళ్లగక్కారు. ‘‘మీరు నిజాన్ని పట్టించుకోరు. అబద్ధాల్నే నమ్ముతారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ నాయకులు, ప్రజాగ్రహం ఒత్తిడికి తలొగ్గారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఉరితీయొద్దు.. సరిహద్దుకు పంపండి) ఏపీ సింగ్ వ్యవహారశైలిని నిరసిస్తూ.. ఈ కేసు నుంచి తప్పుకోవాలని యువత ర్యాలీలు నిర్వహించిన సమయంలో కేవలం అక్షయ్ తరఫునే కాకుండా పవన్ గుప్తా తరఫున కూడా తానే వాదిస్తానంటూ ముందడుగు వేశారు. తర్వాత వినయ్ తరఫున కూడా వకాల్తా పుచ్చుకున్నారు. ఈ క్రమంలో చట్టపరంగా దోషులకు ఎన్నో విధాలుగా అండగా నిలిచారు. సామాన్యులకు అంతుపట్టని విధంగా వరుస పిటిషన్లతో ఎప్పటికప్పుడు శిక్ష అమలును వాయిదా వేస్తూ వచ్చారు. ఆఖరికి న్యాయవాదిగా తాను ఓడిపోవడంతో మరోసారి బాధితురాలు, ఆమె తల్లి వ్యక్తిత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. దోషుల తల్లుల గర్భశోకం గురించి మాట్లాడారు. బాధితురాలి తల్లి వైపు మాత్రమే ఉంటారా.. మిగత తల్లుల బాధ మీకు పట్టదా అని సమాజాన్ని నిలదీశారు. అయితే అదే సమయంలో నిర్భయ తల్లి కడుపుకోత గురించి మాత్రం ఆలోచించలేకపోయారు. ఎందుకంటే ఆమె ఓ మహిళ, ఓ అత్యాచార బాధితురాలి తల్లి కావడం వల్లే ఆయన అలా మాట్లాడారు. న్యాయవాదిగా దోషులను సమర్థించినా వ్యక్తిగతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోయారు. దోషి ఒక ఆడపిల్ల అయి ఉంటే ఆయన వైఖరి వేరేలా ఉండేదేమో? వెంటనే ఉరితీయాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగేవారేమో?.. అన్నట్టు ఆయన కూడా ఓ ఆడపిల్లకు తండ్రే!(ఉరి ఖాయం.. ఇక నా కూతురి ఆత్మకు శాంతి!) ఖేదం.. మోదం సుదీర్ఘ న్యాయపోరాటంలో నిర్భయ తల్లిదండ్రులు న్యాయ వ్యవస్థ, జడ్జీలు, మీడియా, మహిళా సంఘాల అండతో ముందుకు సాగి విజయం సాధిస్తే.. దోషుల తల్లిదండ్రులు మాత్రం ఏపీ సింగ్నే నమ్ముకున్నారు. ఓ దేవుడిలా ఆయనను పూజించారు. ఆయన మాటలు వారిపై ఎంతో ప్రభావం చూపాయనడానికి.. దోషి పవన్ గుప్తా తండ్రి వ్యాఖ్యలే నిదర్శనం. ఫిబ్రవరి 1 దోషులను ఉరితీసేందుకు రంగం సిద్ధమైన సమయంలోకొడుకును చూసేందుకు జైలుకు రావాలని ఆయనకు పిలుపువచ్చిన సమయంలో.. ‘‘నా కొడుకు ఇదే ఆఖరి రోజని అధికారులు చెప్పారు. వాడిని చూసిపొమ్మన్నారు. కానీ నేను పవన్ను కలవలేదు. ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదు. కోర్టు మా మాటనే నమ్ముతుంది’’ అని వ్యాఖ్యానించారు. ఆఖరికి తన కొడుకును శాశ్వతంగా పోగొట్టుకుని ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నారు.(నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్ కానీ ఉరి తర్వాత!) -
నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్ కానీ ఉరి తర్వాత!
సాక్షి, న్యూఢిల్లీ: ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. అయితే ఇద్దరు దోషులు తాము చనిపోయాక చేయాల్సిన పనుల గురించి జైలు సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టరు నెహాల్ బన్సాల్ ఉరికి గంట ముందు జైలుకి వెళ్లి దోషుల చివరి కోరికల గురించి తెలుసుకున్నారు. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ మరణానంతరం అవయవాలను దానం చేయాలని కోరాడు. అవయదానానికి అవసరమైన పత్రంపై కూడా సంతకాలు చేశాడని అధికారులు వెల్లడించారు. (చదవండి: జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!) అయితే ఉరి తీసిన అనంతరం అరగంటపాటు వారి శరీరాలను అలానే వేలాడదీయడంతో కీలక అవయవాలు దానానికి పనికిరావని తెలుస్తోంది. ముఖేష్ సింగ్ ఉరికి ముందు తనను ఉరి తీయొద్దంటూ బతిమాలాడుతూ, తీవ్ర మనోవేదనకు గురయ్యాడని తెలుస్తోంది. మరో దోషి వినయ్ శర్మ కూడా తన మరణానంతరం.. జైల్లో ఉన్నప్పుడు తాను వేసిన పెయింటింగులను సూపరింటెండెంట్కు ఇవ్వాలని కోరాడు. తాను చదివిన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, తన ఫొటోగ్రాఫ్ను కుటుంబానికి అందించాలి కోరాడు. మిగతా ఇద్దరు పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ మాత్రం ఎలాంటి కోరికా కోరలేదని సమాచారం. (చదవండి: నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!) -
జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దాదాపు ఏడేళ్ల తర్వాత నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది. ఢిల్లీలోని తీహార్ జైల్లో శుక్రవారం ఉదయం 05:30 గంటలకు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లను ఉరితీశారు. తరువాత మృతదేహాలను పోస్టుమార్టం కోసం దీన్దయాల్ ఆస్పత్రికి తరలించారు. ఒక వేళ వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోతే పోలీసులే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వీరిని ఉరి కంబం వద్దకు తీసుకెళ్లే ముందు నలుగురు దోషులు కంటతడి పెట్టినట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఈ నలుగురు కూడా శిక్ష అనుభవిస్తున్న కాలంలో జైళ్లో పనిచేసి మొత్తం రూ.1,37,000 సంపాదించారు. వాటిలో అక్షయ్ రూ. 69 వేలు సంపాదించగా, పవన్ రూ. 29 వేలు, వినయ్ రూ. 39 వేలు సంపాదించారు. చదవండి: అర్ధరాత్రి ఎక్కడుందో తెలుసా: దోషుల లాయర్ ఇక ముఖేష్ సింగ్ ఎలాంటి పని చేయలేదు. కేసు కొనసాగిన ఏడేళ్ల కాలంలో ఈ నలుగురు 23 సార్లు జైలు నిబంధనలు ఉల్లంఘించారని సమాచారం. జైలు నిబంధనలు ఉల్లంఘించినందుకు వినయ్ శర్మ 11 సార్లు, అక్షయ్ సింగ్ ఒకసారి శిక్షను అనుభవించారు. ఇక ముఖేష్ మూడు సార్లు, పవన్ ఎనిమిది సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారు. వీరి చదువుల విషయానికి వస్తే 2016లో ముఖేష్, పవన్, అక్షయ్.. పదో తరగతిలో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ వారు పాస్ కాలేదు. 2015లో వినయ్ బ్యాచిలర్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు. కానీ, అతను ఆ డిగ్రీని పూర్తి చేయలేదు. కాగా.. 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. రామ్సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. అతడిపై నిఘా కొనసాగుతుంది. చదవండి: నిర్భయ కేసు: ఆ మైనర్ ఇప్పుడెక్కడా?! -
అర్ధరాత్రి ఎక్కడుందో తెలుసా: దోషుల లాయర్
న్యూఢిల్లీ: ఏడేళ్ల న్యాయ పోరాటం తర్వాత నిర్భయకు న్యాయం జరిగిందంటూ దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే దోషుల తరఫు లాయర్ అజయ్ ప్రకాశ్ సింగ్(ఏపీ సింగ్) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అహంకార పూరితంగా వ్యవహరించారు. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన నిర్భయ దోషులను కాపాడేందుకు ఏపీ సింగ్ శతవిధాలా ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషుల ఉరితీతకు రెండు గంటల ముందు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో శుక్రవారం ఉదయం నలుగురు దోషులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లను ఉరితీసిన విషయం తెలిసిందే. (నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు) ఈ నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు సహా ఢిల్లీ వ్యాప్తంగా యువత, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. విజయచిహ్నం చూపుతూ స్వీట్లు పంచుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఏపీ సింగ్.. స్థానికుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు ఓడిపోయిన క్రమంలో... దోషుల తల్లుల కడుపుకోతను వేడుక చేసుకుంటారా అంటూ మండిపడ్డారు. నిర్భయ తల్లిని ఉద్దేశించి.. ‘‘ ఒక తల్లి కోసం ఇంతమంది ముందుకు వచ్చారు. మరి ఆ తల్లి తన కూతురు అర్ధరాత్రులు ఎక్కడ తిరుగుతుందో ఎందుకు పట్టించుకోలేదు. ఎవరితో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఎందుకు తెలుసుకోలేదు’’ అంటూ అవమానకర రీతిలో మాట్లాడారు. దోషుల తల్లులు కూడా తమ కొడుకులను నవ మాసాలు మోసి కన్నారని.. వారికి బాధ ఉండదా అంటూ అక్కసును వెళ్లగక్కారు. మరో రెండు మూడు రోజుల పాటు ఉరిశిక్ష వాయిదా వేయించడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చారు.(ఉరితీయొద్దు.. సరిహద్దుకు పంపండి) కాగా ఏపీ సింగ్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య భావజాలానికి అద్దం పడుతున్నాయని.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక నిర్భయ ఘటన జరిగిన సమయంలోనూ ఏపీ సింగ్ ఇలాగే మాట్లాడిన విషయం తెలిసిందే. తనకు డబ్బు, ఆరోగ్యం కంటే కూడా వ్యక్తిత్వమే ముఖ్యమని.. నిర్భయ స్థానంలో తన కూతురు ఉండి ఉంటే ఆమెను తానే పెట్రోల్ పోసి నిప్పంటించేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (ఉరి ఖాయం.. ఇక నా కూతురి ఆత్మకు శాంతి!) -
నిర్భయ కేసు: ఆ మైనర్ ఇప్పుడెక్కడా?!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. ఢిల్లీలోని తీహార్ సెంట్రల్ జైలులో జైలు నెంబర్ 3లో ఈరోజు ఉదయం 5:30 గంటలకు వారిని ఉరితీశారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగిక దాడి చేసి.. అతి కిరాతకంగా చంపేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరో వ్యక్తి మైనర్ అని తేలింది. దీంతో అతనికి జువైనల్ యాక్ట్ కింద జైలు శిక్ష విధించి విడుదల చేశారు. ప్రస్తుతం అతను దక్షిణ భారత దేశంలో.. రహస్య జీవితాన్ని గడుపుతున్నట్టు తెలిసింది. (చదవండి: నిర్భయ దోషులకు ఉరి అమలుపై మోదీ) ఢిల్లీకి 220 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ గ్రామానికి చెందిన సదరు మైనర్కు బస్సు ఓనర్ రామ్ సింగ్.. క్లీనర్గా ఉద్యోగం ఇప్పించాడు. 11 ఏళ్లకే ఇళ్లు వదిలి వచ్చిన ఆ మైనర్ను రామ్ సింగ్ చేరదీశాడు. నిర్భయ ఘటన సమయంలో మైనర్ కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడని నిరూపణ అయింది. రేప్ కేసులో దోషిగా తేలిన మైనర్ను కొన్నాళ్లు జైలులో ఉంచారు. ఆ తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. అయితే, అతన్ని ఢిల్లీకి దూరంగా పంపేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక ఎప్పుడూ అతని ముఖాన్ని కప్పిఉంచడం వల్ల ఆ మైనర్ను ఎవరూ గుర్తుపట్టలేరు. అతని ఆనవాళ్లు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతను ఓ వంటవాడిగా జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. అతనిపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుంది. (చదవండి: నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!) -
ఇంకా 8మంది ఖైదీలు యావజ్జీవులుగా..
ఉరి శిక్ష అమలైన ఖైదీలు.. ఆఖరి నిమిషంలో యావజ్జీవ కారాగార ఖైదీలుగా మారుతున్నారు. చట్టంలోని లోటుపాట్లతో ఉరి నుంచి తప్పించుకుని జీవితాంతం జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. తీహార్ జైల్లో నిర్భయనిందితులకు ఉరిశిక్ష అమలు చేస్తున్న వేళ జిల్లాలోని రాజమహేంద్రవరంసెంట్రల్ జైలులో ఉరిశిక్ష అమలు, తదితర ఘటనలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: నిర్భయ కేసులో నలుగురు నిందితులను ఒకేసారి ఉరి శిక్షను అమలు చేసేలా కోర్టు తీర్పు ఇవ్వడం, నిందితులకు ఉరి శిక్ష అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండడంతో ఉరి శిక్షలు అమలుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీలోని నిర్భయ లైంగికదాడి కేసులో నిందితులైన ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాగూర్, పవన్ గుప్తా, వినయ్శర్మలకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. దీని అమలు, తీరుతెన్నులపై ఒక్కసారి అవలోకనం చేసుకుంటే దేశంలో ఎక్కువగా కఠిన శిక్షలు అమలు చేసిన దాఖలాలు లేవు. నేరస్తులను కస్టడీ అండ్ కేర్ కరక్షన్(అదుపులోకి తీసుకొని సంరక్షించి నేరాలు వైపు మరలకుండా సంస్కరించాలని) జైలు మాన్యువల్ చెబుతోంది. మహిళలపై జరిగిన లైంగికదాడులు ♦ 2005లో ఢిల్లీలో లక్ష్మి అగర్వాల్పై యాసిడ్ దాడి జరిగింది. దేశంలోనే సంచలనం కలిగించిన కేసు 2012లో డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయపై నలుగురు నిందితులు రేప్ చేసి హత్య చేశారు. ♦ 2007లో విజయవాడలో ఆయేషా మీరాపై లైంగికదాడి, హత్య. ♦ 2018 జనవరి 17న జమ్ము కశ్మీర్లో ఆసిఫా అనే బాలికపై లైంగికదాడి. అలాగే గుంటూరులో హరిత అనే మహిళపై లైంగికదాడి. 2019 గుంటూరులో మైనర్ బాలికపై రేప్ జరిగాయి. ♦ 2019 తెలంగాణలో లక్ష్మి అనే మహిళపై లైంగికదాడి అనంతరం హత్య చేశారు. ♦ 2019 నవంబర్ 27న హైదరాబాద్లో ప్రియాంక రెడ్డిపై లైంగికదాడికి పాల్పడి అనంతరం పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలపై లైంగికదాడులు, హత్యలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కొన్ని వెలుగులోకి వస్తుంటే.. మరికొన్ని మాత్రం బయటపడడం లేదు. నేరం చేసిన నిందితులు దర్జాగా సమాజంలో తిరుగుతున్నారు. మహిళలపై లైంగికదాడులు, హత్యలు, వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ♦ మహిళలపై లైంగికదాడులకు పాల్పడడమే కాదు వారిని హత్య చేసిన నిందితులకు పలుచోట్ల ఉరిశిక్షలు విధించినా.. వాటిని అమలు మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతోంది. తొలుత ఉరిశిక్ష అని తీర్పు చెప్పినా.. రోజులు గడిచే కొద్దీ మానవతా దృక్పథంతో ఆఖరి నిమిషంలో జీవిత ఖైదీలుగా శిక్షలు మార్చుతూ ప్రభుత్వాలు ఖైదీల పట్ల దయతో వ్యవహరించేవి. దీంతో ప్రస్తుతం మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడికే తరలించేవారు.. ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఏడు సెంట్రల్ జైళ్లు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరు, తెలంగాణలోని వరంగల్, చర్లపల్లి, చంచల్గూడలలో ఉన్నాయి. అయితే రాజమహేంద్రవరంలో మాత్రమే ఉరి శిక్ష అమలు చేసేందుకు ఉరి కంబం ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో నూతనంగా భవనాలు నిర్మించారు. వీటితో పాటు ఆధునికమైన ఉరి కంబంను కూడా నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉరి శిక్షలు అమలు చేయాలంటే ఖైదీలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకుతరలించాల్సిందే. ఉరిశిక్ష పడి జీవిత ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్న ఎనిమిది మంది ఖైదీలురాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో వివిధ కేసుల్లో ఉరి శిక్షలు పడిన ఖైదీలు, వాటిని హై కోర్టులు క్షమాభిక్షలుగా మార్చడంతో ఎనిమిది మంది ఖైదీలు యావజ్జీవ కారాగార శిక్షలుఅనుభవిస్తున్నారు. 1976లో ఆఖరి సారిగా ఉరి శిక్ష అమలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఆఖరి సారిగా 1976లో నంబి కృష్టప్ప అనే ఖైదీని ఉరి వేశారు. భార్య, పిల్లలు హత్య కేసులో నిందితుడైన ఈ ఖైదీని ఉరి తీశారు. ఇతడి ఆఖరి కోరిక లడ్డును తినాలని ఉందని కోరాడు. ఇతడి కోరికను జైలు అధికారులు తీర్చి అనంతరం ఉరి తీశారు. ఈ సెంట్రల్ జైలులో ఆదే ఆఖరి ఉరి. అప్పటి నుంచి దాదాపు 44 సంవత్సరాలు ఈ జైలులో ఉరి శిక్షను అమలు చేయలేదు. 1993 మార్చి 8న జరిగిన చిలకలూరి పేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతికి కారకులైన కేసులో నిందితులు గుంటూరుకు చెందిన గంటేల విజయవర్ధనరావు, చలపతిరావులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆఖరి నిమిషంలో 1997 ఏప్రిల్లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ క్షమాభిక్ష ప్రసాదించారు. 1997లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా భారత దేశ పర్యటనకు వచ్చిన సందర్భంగా పశ్చిమ బెంగాల్ రచయిత్రి మహాశ్వేతా దేవి ఉరి శిక్ష పడిన ఖైదీల గురించి నెల్సన్ మండేలా దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లి క్షమా భిక్ష ప్రసాదించాలని కోరడంతో మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణ క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులతో అప్పటి ఆర్టీఓ శ్రీధర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆఖరి నిమిషంలో జైలు అధికారులకు రాష్ట్రపతి ఉత్తర్వులు అందజేసి ఉరి శిక్ష పడిన ఖైదీలు విజయవర్ధనరావు, చలపతిరావులకు ఉరి శిక్ష అమలు కాకుండా నిలిపివేశారు. ప్రస్తుతం విజయవర్ధనరావు గుంటూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా చలపతిరావు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. -
నిర్భయ : న్యాయమే గెలిచింది : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడాలన్న దేశ వ్యాప్త డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. శుక్రవారం ఉదయం 5గంటల 30 నిమిషాలను నలుగురు దోషులను తీహార్ జైలు అధికారులు ఉరి తీశారు. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘చివరికి న్యాయమే గెలిచింది. మన నారీమణులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారికి భద్రతతో పాటు మరింత గౌరవాన్ని పెంచాల్సిన అవసరముంది. అన్ని రంగాల్లో సమానత్వం, అవకాశాల కల్పన ఎంతో ముఖ్యం. మహిళా సాధికారత దిశగా దేశం అడుగులు వేయాలి. దీనికి అందరూ కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. మరోవైపు నిర్భయ దోషులకు ఉరి అమలుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఆలస్యం అయినప్పటికీ దోషులకు శిక్షం పడటం సంతోషకరమన్నారు. తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందన్నారు. -
నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!
న్యూఢిల్లీ: ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. వారు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారని తెలిపారు. గత రాత్రి భోజనం చేయలేదని, ఉరి తీసే గంట ముందు బ్రేక్ ఫాస్ట్కు నిరాకరించారని పేర్కొన్నారు. ఉరి అమలు ముందు రోజు (గురువారం రాత్రి) వారిని విడివిడిగా ప్రత్యేక గదుల్లో ఉంచామని తెలిపారు. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు వారు నిద్ర లేచారని, అప్పటికే సుప్రీం కోర్టు వారి చివరి పిటిషన్ను కొట్టివేసిందని తెలిపారు. దోషులను స్నానం చేయాలని కోరగా.. ఎవరూ అంగీకరించలేదని అన్నారు. కాగా, నిర్భయ దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఈరోజు ఉదయం 5:30 గంటలకు తీహార్ సెంట్రల్ జైలులోని జైలు నెంబర్ 3లో ఉరితీసిన సంగతి తెలిసిందే. (చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం) 30 నిముషాలపాటు ఉరి.. ఉరికి ముందు దోషులను నిర్భయ కుటుంబ సభ్యులకు చూపించామని జైలు అధికారులు చెప్పారు. ఉరి అమలు నేపథ్యంలో జైలంతా లాక్డౌన్లో ఉంచామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇక కారాగార సమయంలో పవన్, వినయ్, ముఖేష్ జైల్లో పనిచేశారని, వారు సంపాదించిన మొత్తం ఆయా కుంటుంబాలకు అందిస్తామని జైలు అధికారులు చెప్పారు. 5:30 గంటలకు నిర్భయ దోషులను ఉరితీశామని తీహార్ జైలు అధికారి సందీప్ గోయల్ చెప్పారు. నిబంధనల మేరకు తలారి పవన్ జల్లాద్ దోషులను 30 నిముషాలపాటు ఉరికి వేలాడదీశాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇదిలాఉండగా.. ఉరి అమలుకు ముందు వినయ్ కుమార్ ఉరి తీయొద్దని పోలీసులను వేడుకున్నట్టు తెలిసింది. ఉరి భయాల నేపథ్యంలో అతను గత ఫిబ్రవరిలో గోడకు తల బాదుకున్నట్టు సమాచారం. (చదవండి: నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ) -
నిర్భయ దోషులకు ఉరి: తీహార్ జైలు వద్ద సంబరాలు
-
‘దోషులకు ఉరి అమలు; సమాజంలో మార్పేం ఉండదు’
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన తీహార్ జైలు వద్ద స్థానికులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. నిర్భయ వర్థిల్లాలి, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కొందరు జాతీయ జెండా ప్రదర్శించారు. కాగా, నిర్భయ దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఈరోజు ఉదయం 5:30 గంటలకు తీహార్ సెంట్రల్ జైలులోని జైలు నెంబర్ 3లో ఉరితీసిన సంగతి తెలిసిందే. ఇక జైలు వద్దకు చేరుకున్న వారిలో సామాజిక కార్యకర్త యోగితా భయానా కూడా ఉన్నారు. ‘నిర్భయకు న్యాయం జరిగింది. మిగతా బాధితులకు కూడా న్యాయం జరగాలి’ అనే పోస్టర్ను ఆమె ప్రదర్శించారు. నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం) కష్టతరమైన యుద్ధంలో విజయం సాధించామని నిర్భయ కుంటుంబం సన్నిహితుడు అకాశ్ దీప్ అన్నారు. ఉరి శిక్ష నిర్ణయం, అమలు.. మంచిదే.. కానీ, శిక్ష అమలు ఇంతలా ఆలస్యం కాకుండా... ముందే జరగాల్సిందని దివ్యా ధావన్ అనే మహిళా అన్నారు. ‘నిర్భయ దోషులకు ఉరి అమలుతో సమాజం ఏమీ మారదు. కానీ, నిర్భయకు న్యాయం జరిగింది. సంతోషం’అని సనా అనే యువతి తెలిపారు. ఇక ఆసియాలోనే అతిపెద్దదైన తీహార్ జైలులో ఒకేసారి నలుగురికి ఉరితీయయం ఇదే తొలిసారి. తీహార్ జైలు 16 వేల మంది ఖైదీలకు కాగారారం కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. ఇక ఉరి అమలు నేపథ్యంలో జైలు వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుద్టిమైన భద్రత ఏర్పాటు చేశారు. (చదవండి: ఉరి అమలు: ఉదయం 3:30 గంటలకు పిటిషన్ కొట్టివేత) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉరి అమలు: ఉదయం 3:30 గంటలకు పిటిషన్ కొట్టివేత
-
రెండు గంటల్లో ఉరి.. ఆగని ప్రయత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఏడేళ్లుగా నలుగుతున్న నిర్భయ కేసులో బాధితురాలికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఈరోజు (శుక్రవారం) ఉదయం 5:30 గంటలకు తీహార్ జైలులో ఉరి తీశారు. అయితే, మరణ దండన నుంచి తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాల పేరుతో దోషులు తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉరి శిక్ష అమలుకు రెండు గంటల ముందు వరకు దోషుల ప్రయత్నాలు ఆగలేదు. ఢిల్లీ హైకోర్టులో అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగాయి. ఉరిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో వారు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిర్భయ దోషుల చివరి పిటిషన్ను శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు సుప్రీం కోర్టు కొట్టివేసింది. (చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం) కాగా, దోషులు పిటిషన్లమీద పిటిషన్లు వేయడంతో డెత్ వారెంట్లు జారీ అయ్యాక మూడు సార్లు ఉరి అమలు నిలిచిపోయింది. 2020, జనవరి 22 న దోషులను ఉరితీయాలని ఢిల్లీ పటియాలా హౌజ్కోర్టు తొలుత డెత్ వారెంట్లు జారీ చేసింది. దోషుల వరుస పిటిషన్లతో ఉరి అమలు సాధ్యం కాలేదు. అనంతరం ఫిబ్రవరి 1, తర్వాత మార్చి 3న ఉరితీయాలని డెత్ వారెంట్లు జారి అయినప్పటికీ శిక్ష అమలు వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 20న (నాలుగోసారి) ఉరితీయాలని జారీ అయిన డెత్ వారెంట్ల ద్వారా నిర్భయకు న్యాయం జరిగింది. (చదవండి: నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ) ఏడేళ్ల నిర్భయ కేసు పరిణామాలు.. 2012, డిసెంబర్ 16న అర్థరాత్రి నిర్భయపై సామూహిక అత్యాచారం కదులుతున్న బస్సులో అత్యాచారం చేసిన ఆరుగురు దోషులు నిర్భయను అత్యంత క్రూరంగా హింసించి అత్యాచారం చేసిన దోషులు నిర్భయతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేసిన ఆరుగురు దోషులు తీవ్రగాయాలైనా ఇద్దరిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్సపొందుతూ 2012, డిసెంబర్ 29న నిర్భయ మృతి 2013, జనవరి 2న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు 2013, జనవరి 3న ఛార్జ్షీట్ దాఖలు 2013, మార్చి 11న తీహార్ జైల్లో రామ్సింగ్ ఆత్మహత్య 2013, మార్చి 21న నిర్భయ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం 2013, ఆగస్టు 31న మైనర్ దోషికి మూడేళ్ల రిఫార్మ్ హోం శిక్ష 2013, సెప్టెంబర్ 13న నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పు 2014, మార్చి 13న ఉరిశిక్షను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు 2015, డిసెంబర్ 20న రిఫార్మ్ హోం నుంచి మైనర్ విడుదల 2017, మే 5న ఉరిశిక్షను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు 2020, జనవరి 7న ఉరిశిక్ష అమలుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం 2020, ఫిబ్రవరి 1న ఉరితీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు ఉరిశిక్షను నిలిపేయాలంటూ కోర్టులో దోషుల పిటిషన్లు ఎట్టకేలకు 2020, మార్చి 20న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు -
ఈరోజు గెలిచాం : నిర్భయ తండ్రి
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ హత్యాచార కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిర్భయ తండ్రి బద్రినాథ్ సింగ్ దోషులకు ఉరిశిక్ష అమలైన అనంతరం విజయ చిహ్నం చూపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఈరోజు మేం విజయం సాధించాం..సమాజం, మీడియా, ఢిల్లీ పోలీసుల వల్లే ఇది సాధ్యమైంది..నేను ఎంత సంతోషంతో ఉన్నాననేది నా నవ్వు మీకు చెబుతుంద’ని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను శుక్రవారం తెల్లవారుజామున జిల్లా మేజిస్ర్టేట్, అధికారుల సమక్షంలో ఉరి తీశారు. ఏడేళ్ల తర్వాత న్యాయం ఏడేళ్ల తర్వాత నిర్భయకు న్యాయం జరిగిన ఈ రోజు చారిత్రక దినమని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు. ఈ రోజు ఆమె ఆత్మకు శాంతి కలిగిందని, మహిళలపై నేరాలకు పాల్పడేవారికి ఇది గట్టి సందేశమని, మీరు ఈ తరహా నేరాలకు పాల్పడితే మీకు ఉరిశిక్ష పడుతుందనే హెచ్చరికను పంపిందని ఆమె వ్యాఖ్యానించారు. ఎప్పుడో జరగాల్సింది.. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో తీవ్ర జాప్యం చోటుచేసుకుందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. దోషులను ఉరితీయడంతో మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమనే గట్టి సందేశాన్ని పంపారని అన్నారు. నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదని ప్రజలు తెలుసుకుంటారని, శిక్ష అమలును వాయిదా వేసుకోగలరేమో కానీ, శిక్ష నుంచి తప్పించుకోలేరని వెల్లడైందని అన్నారు. చదవండి : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు -
ఖేల్ ఖతమ్
-
‘ఈరోజు విజయం సాధించాం’
-
నా కుమార్తెకు న్యాయం జరిగింది
-
నిర్భయ దోషులకు ఉరి
-
నిర్భయ కేసు: దేశ చరిత్రలో ఇదే ప్రథమం
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషులు అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్లు ఈ తెల్లవారుజామున ఉరి తీయబడ్డారు. ఇలా ఒకేసారి నలుగురు వ్యక్తులను ఉరితీయటం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జలాద్ వారిని ఉరితీశారు. జైలు నెంబర్ 3లో అధికారుల సమక్షంలో ఉరిని అమలు చేశారు. ఉరి అనంతరం దోషులను పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్లు తేల్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలు డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం 8 గంటలకు నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. కాగా, 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. రామ్సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత నేడు మిగిలిన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది. చదవండి : నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ -
నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ
సాక్షి, న్యూఢిల్లీ : ‘ ఇన్నాళ్లకు నా కుమార్తెకు న్యాయం జరిగింది.. ఆత్మకు శాంతి కలిగింది’’ అన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. శుక్రవారం నిర్భయ దోషులను ఉరితీయటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ. ‘‘ ఏడేళ్లపాటు పోరాటం చేశా. ఆలస్యమైనా చివరకు న్యాయం గెలిచింది. ఇప్పటికైనా చట్టంలోని లోపాలను సరిచేయాలి. నిర్భయ ఫొటోను పట్టుకుని నీకు ఇవాళ న్యాయం జరిగిందని ఏడ్చాను. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాలని న్యాయపోరాటం చేస్తా. ఇప్పటికైనా చట్టంలోని లోపాలను సరిచేయాలి. మన ఇంట్లో, మన చుట్టుప్రక్కలి మహిళలపై ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వారికి తోడుగా నిలవాల’ని కోరారు. ( నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ) కాగా, నిర్భయ తల్లి ఆశాదేవీ 7ఏళ్ల సుదీర్ఘ పోరాటం నేడు ఫలించింది. ఈ కేసులో దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలకు తెల్లవారుజామున 5:30 గంటలకు తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు చేశారు. జైలు అధికారుల సమక్షంలో తలారి పవన్ వారిని ఉరితీశారు. దేశ చరిత్రలో ఒకే సారి నలుగురు వ్యక్తులను ఉరి తీయటం ఇదే ప్రథమం. చదవండి : ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’ -
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణదండన అమలు చేశారు. దోషులుగా తేలిన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్.. మనీలా తాళ్లతో ఉరి తీశారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్ కేంద్ర కారాగారంలో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. ఉరిశిక్షను తప్పించుకునేందుకు చివరి వరకు దోషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు గురువారం స్పష్టం చేయడంతో ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేశారు. దోషులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం ప్రకటించారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (నిర్భయ దోషులను ఎలా ఉరి తీస్తారో తెలుసా?) (నా కూతురి ఆత్మకు శాంతి లభిస్తుంది!) (‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’) (ఆఖరి ప్రయత్నం విఫలం; ఇక ఉరే) -
అదే వారికి చివరి రాత్రి
కొద్ది గంటల్లో నిర్భయ దోషులకు ఉరి. స్వయంగా నిర్భయ ఆత్మే ఏ ఆఖరి నిముషంలోనో గాలిలో తేలి వచ్చి ఏడేళ్ల నాటి కన్నీటి చారికల్ని తుడుచుకుంటూ దుఃఖపు క్షమతో ‘స్టే’ ఇప్పిస్తే తప్ప ఉరి నుంచి ఈ నలుగురూ బయటపడే దారే లేదు. చివరి రాత్రి ఇది (ఇది రాస్తున్న సమయానికి). ఉరికొయ్యపై పిట్ట పాడే ‘స్వాన్ సాంగ్’ (చివరి పాట)కు చరణాలు లేని పల్లవి ఈ రాత్రి. తినబుద్ధి కాని చివరి భోజనం ఈ రాత్రి. ఈ రాత్రి వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుంది? తెల్లారే ఉరి. ఏడేళ్ల నాటి ఒక రాత్రి చేత వాళ్లకై వాళ్లు తమ నుదుటిపై రాయించుకున్న డెత్ వారెంట్.. ఈ రాత్రి. తీహార్లోని జైలు నెంబర్ 3 గది గోడల మధ్య చావు భయపు ఛాయలలో వాళ్లు ఒక్కసారైనా అనుకోకుండా ఉండి ఉంటారా.. జీవితం ఏడేళ్లు వెనక్కి వెళ్లి.. దెయ్యం పట్టిన ఆ డిసెంబర్ 16 రాత్రి తొమ్మిదిన్నర గంటలప్పుడు దక్షిణ ఢిల్లీలోని ద్వారక సబ్–సిటీ నుంచి దక్షిణ ఢిల్లీ పరిధిలోనే ఉన్న పట్టణ గ్రామం మునిర్కకు వెళ్లేందుకు స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కిన ‘నిర్భయ’ గురించి చెడు ఆలోచనలేమీ చేయకుండా ఆమెను ఆమె గమ్యస్థానంలో దింపి వెళ్లి ఉంటే.. ఇప్పుడిలా ఉరికొయ్యల వైపు తమ ప్రాణాలను సర్దుకుని బయల్దేరక తప్పని స్థితి తప్పి ఉండేదని? ప్రాణం పోకడ తెలియదంటారు. ఉరి ఖైదీలకు ప్రాణం ఎప్పుడు పోయేదీ ముందే తెలుస్తుంది. మీరు చెప్పుకునేది ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చని, మీ కుటుంబ సభ్యులను కడసారి చూసుకోవచ్చనీ కొన్ని రోజుల ముందే జైలు సూపరింటెండెంట్ వెళ్లి చెప్తారు. ఉరితీసే ముందు రోజు రాత్రి చిట్టచివరి భోజనంలోకి అడిగినవి పెడతారని, ఉదయాన్నే ఉరికొయ్యల మీద కూడా ‘నీ ఆఖరి కోరిక ఏమిటి?’ అని అడుగుతారని అంటుంటారు. అయితే ఈ చివరి భోజనం, చివరి కోరిక.. రెండూ కూడా చట్టంలో లేనివేనని సునీల్ గుప్తా తన ‘బ్లాక్ వారెంట్’ పుస్తకంలో రాశారు! ‘లా’ ఆఫీసర్గా తీహార్ జైల్లోని తన 35 ఏళ్ల కెరీర్లో మొత్తం పదకొండు ఉరితీతల్ని ప్రత్యక్షంగా చూశారాయన. తొలిసారి ఆయన చూసిన ఉరి.. బిల్లా రంగాలది. 1982 జనవరి 31న బిల్లా రంగాలను ఉరి తీస్తున్నప్పుడు దగ్గరుండి మరీ న్యాయపరమైన విధానాల అమలును ఆయన సరిచూసుకోవలసి వచ్చింది. ఆయన సరిచూసుకున్న చివరి ఉరి మొహమ్మద్ అఫ్జల్ గురుది. 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ని ఉరి తీశారు. బిల్లా రంగాల ఉరి బాధ్యతలు మీద పడే వరకు వాళ్ల గురించి వార్తాపత్రికల్లో చదవడమే కానీ.. సునీల్ గుప్తా వాళ్లను చూసిందీ, వాళ్లతో నేరుగా మాట్లాడిందీ లేదు. ఉరికొయ్య దగ్గర ఉండటానికి ఉదయాన్నే డ్యూటీకి వచ్చేయమన్నారు సునీల్ని జైలు సూపరింటెండెంట్. ఇంటికెళుతూ ఆ రాత్రి బిల్లా రంగాలను చూడ్డానికి వాళ్లున్న సెల్ దగ్గరికి వెళ్లారు సునీల్. రంగా ఎప్పుడూ.. ‘రంగా ఖుష్’ అనుకుంటూ ఉండేవాడని, బిల్లా రోజంతా ఏడుస్తూ.. ‘అంతా నీవల్లే’ అని రంగాను నిందిస్తూ ఉండేవాడని విన్నాడు సునీల్. సెల్ దగ్గరకు వెళ్లేటప్పటికే రంగా తిని పడుకుని ఉన్నాడు! బిల్లా మేల్కొనే ఉండి, గది గోడల్ని చూస్తూ తనలో తను ఏదో గొణుక్కుంటున్నాడు. వాళ్లు చేసిన నేరం కూడా నిర్భయ వంటిదే. కారులో లిఫ్ట్ అడిగిన టీనేజ్ అక్కాతమ్ముళ్లను అదే కారులో కిడ్నాప్ చేసి తమ్ముణ్ణి కత్తితో పొడిచి చంపారు. అక్కను చంపేముందు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ కేసు మూడున్నరేళ్లు సాగింది. సెల్లో ఉన్న బిల్లారంగాలను చూసి వెళ్లాక సునీల్కు ఆ రాత్రి నిద్రపట్టలేదు. భోజనం సహించలేదు. మర్నాడు తెల్లారే ఉరి తీస్తున్నప్పుడు కూడా బిల్లా వెక్కిళ్లు పెడుతూనే ఉన్నాడు. రంగా మాత్రం ధైర్యంగా ఉండి, ‘జో బోలే సో నిహాల్, సత్ శ్రీ అకాల్’ (విజయ నినాదం) అని పెద్దగా అరుస్తూ తలవాల్చేశాడు. సాధారణంగా జైలు సూపరింటెండెంట్ కనుసైగతో దోషుల కాళ్ల కింది చెక్కను తొలగిస్తాడు తలారి. అయితే ఆ రోజు కనుసైగకు బదులుగా ఎర్రరంగు చేతిరుమాలును ఊపాడు. ఆ ఎర్రరంగు ‘బిల్లారంగా కర్చీఫ్’ ఇప్పటికీ ఒక ‘జ్ఞాపకం’గా ఆ సూపరింటెండెంట్ ఇంట్లో ఉందట. సునీల్కు ఇప్పటికీ ఒళ్లు ఝల్లుమనిపించే జ్ఞాపకం ఒకటుంది. ఉరి తీశాక దేహాలను రెండు గంటల పాటు అలా కొయ్యలకు ఉంచేస్తారు. తర్వాత జైల్ డాక్టర్ వచ్చి, ఆ దేహాలను పరీక్షించి, మరణాన్ని ధృవీకరిస్తారు. ఆ రోజు.. ఉరి తీసిన రెండు గంటల తర్వాత కూడా రంగా ‘పల్స్’ కొట్టుకుంటూనే ఉందని డాక్టర్ చెప్పడంతో సునీల్ ఒక్కసారిగా అదిరిపడ్డారు. ఉరి తీస్తున్నప్పుడు భయంతో శ్వాసను బిగబట్టినప్పుడు దేహం లోపల బందీ అయిపోయిన గాలి కారణంగా కొందరిలో అలా జరుగుతుందని డాక్టర్ చెప్పడంతో సునీల్ స్థిమితపడ్డారు. డాక్టర్ సూచనపై అక్కడి గార్డు ఒకరు పదిహేను అడుగుల ఆ గోతిలోకి దిగి, శూన్యంలో నిర్జీవంగా వేలాడుతున్న రంగా కాళ్లలో ఒకదాన్ని పట్టిలాగాడు. దాంతో గాలి బయటికి వచ్చి పల్స్ ఆగిపోయింది. జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జె.కె.ఎల్.ఎఫ్) కో–ఫౌండర్ మక్బూల్ భట్ను తీహార్ జైల్లోనే 1984లో ఉరి తీశారు. భక్తిపరుడు ఆయన. మంచి చదువు, మంచి ఇంగ్లిష్ ఉన్నవాడు. జైలు సిబ్బంది తమకు వచ్చిన మెమోలకు మక్బూల్ భట్ చేత ఇంగ్లిష్లో రిప్లయ్లను రాయించుకుని పై అధికారులకు సమర్పించేవారు. సునీల్ గుప్తా కూడా ఆయన దగ్గర తన ఇంగ్లిష్ను మెరుగు పరుచుకున్నారు. అలా వాళ్లిద్దరికీ మంచి స్నేహం. అకస్మాత్తుగా ఓ రోజు మక్బూల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యు.కె.లోని కశ్మీర్ మిలిటెంట్లు అక్కడి భారత రాయబారి రవీంద్ర మాత్రేను కిడ్నాప్ చేసి, మూడు రోజులు నిర్బంధించి, తర్వాత చంపేశారు. వెంటనే ఇక్కడ మక్బూల్కి డెత్ వారెంట్ జారీ అయింది. మాత్రేని ఫిబ్రవరి 6న తీవ్రవాదులు చంపేస్తే, ఐదోరోజు ఫిబ్రవరి 11న మక్బూల్ని ఉరి తీశారు. ‘‘ఉరి తీస్తున్నప్పుడు, ఆ ముందురోజు మక్బూల్ మౌనంగా, శాంతంగా ఉన్నారు’’ అని సునీల్ తన పుస్తకంలో రాశారు. నిర్భయ దోషులకు కొన్ని గంటల్లో ఉరి అనగానే వాళ్లెంత నేరస్థులయినా గాని మన మెడ చుట్టూ వాళ్ల ఆలోచనలు బిగుసుకోకుండా ఉండవు. ‘ఆ మహాతల్లి ఆ రోజు బస్సు ఎక్కకుండా ఉంటే ఈరోజు ఈ నలుగురు తల్లులకు ఇంత గర్భశోకం ఉండేది కాదు’ అని అనుకుంటున్న వాళ్లెవరైనా ఉంటే.. ‘ఆ రోజు ఈ నలుగురికీ ఒక్క క్షణం వాళ్ల తల్లులు గుర్తుకు వచ్చినా ఆ అమ్మాయి బతికి పోయేది’ అని కూడా వాళ్లు అనుకోవాలి. -
నిర్భయ దోషులకు నేడే ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరికి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఏడు సంవత్సరాల మూడు నెలలపాటు దర్యాప్తు, విచారణ ప్రక్రియ శిక్ష అమలుపై ఇక ముగియనుంది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ దోషులు మరోసారి పెట్టుకున్న పిటిషన్ను గురువారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దీంతో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ అనే నలుగురు దోషులు బలిపీఠం ఎక్కడం ఖాయమైంది. ఇప్పటికే మూడు పర్యాయాలు ఉరిశిక్ష వాయిదా పడగా మరోసారి స్టే విధించాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్ను పటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా గురువారం విచారించారు. ‘ఈ పిటిషన్ సమర్థనీయం కాదని నేను భావిస్తున్నాను. అందుకే ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నాను’అని ప్రకటించారు. ‘ఈ కేసు కోసం న్యాయవ్యవస్థ ఎంతో సమయాన్ని వెచ్చించింది. చట్ట పాలనపై తలెత్తిన ఎన్నో అనుమానాలకు సమాధానాలు కూడా ఇచ్చింది’ అని పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత: తీర్పు వెలువడిన తర్వాత కోర్టు ప్రాంగణంలో హైడ్రామా చోటుచేసుకుంది. అక్షయ్ భార్య తనతోపాటు తన కుమారుడిని కూడా ఉరితీయాలంటూ గుండెలు బాదుకుంటూ రోదించింది. రేపిస్టు భార్యగా జీవించలేకనే విడాకుల కోసం పిటిషన్ వేసినట్లు తెలిపింది. నిర్భయ తల్లి వ్యాఖ్య తన కూతురి ఆత్మకు ఇక ప్రశాంతత లభిస్తుందని ఈ తీర్పు వెలువడిన తర్వాత నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. ‘దోషులకు ఇక ఉరి తప్పదు. నాకు ఇప్పటికి శాంతి దొరికింది’అని తెలిపారు. దోషి అక్షయ్ భార్య విడాకుల కోసం పెట్టుకున్న పిటిషన్ పెండింగ్లో ఉన్నందున ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ ముగ్గురు దోషులు పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.ఢిల్లీకి చెందిన ఫిజియోథెరపీ విద్యార్థిని(23) 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి దారుణ అత్యాచారానికి గురై దాదాపు 15 రోజుల తర్వాత మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దురంతానికి నిర్భయ ఘటనగా పేరుంది. ఈ కేసులో ఆరుగురు దోషులు కాగా వీరిలో ఒకరు మైనర్. మరొకరు జైలులోనే ఉరి వేసుకున్నారు. మిగిలిన నలుగురు ముకేశ్(32), పవన్(25), వినయ్(26), అక్షయ్(31) అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నారు. -
ఎట్టకేలకు మరణదండన
ఉరి తాడు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో శుక్రవారం ఉదయం నిర్భయ దోషులు నలుగురికీ మరణదండన అమలు కావడం ఖాయమైంది. మన దేశంలో న్యాయ ప్రక్రియ ఎంత సుదీర్ఘమైనదో, ఉరిశిక్ష పడినవారికి సైతం చట్టపరంగా ఎన్ని రకాల అవకాశాలుంటాయో ఈ కేసు మరోసారి నిరూపించింది. తమ కుమార్తెను అమానుషమైన చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారం జరిపి హతమార్చిన దుండగులకు శిక్ష విధించడంలో ఎంతో జాప్యం చోటుచేసుకుందనుకుంటే... అది అమలు చేయడంలోనూ ఇంత తాత్సారమేమిటని నిర్భయ తల్లి అనేకసార్లు కన్నీరుమున్నీరయ్యారు. వారందరూ ఉరికంబం ఎక్కినరోజునే తమ కుమార్తె ఆత్మ శాంతిస్తుందని ఆమె చెప్పారు. అయితే ఉరిశిక్ష పడిన నేరస్తులకు అన్ని రకాల అవకాశాలూ ముగిశాకనే శిక్ష విధించడం మనకున్న చట్టాల ప్రకారం తప్పనిసరి. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదుగానీ... ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడరాదన్నదే ఈ న్యాయ సిద్ధాంతంలోనిఅంతరార్థం. ఒకసారి ఉరిశిక్ష అమలయ్యాక దోషులుగా తేలినవారు ఏ కారణం చేతనో నిర్దోషులని తేలినా... వారి అభ్యర్థనల్ని పరిశీలించడంలో సాంకేతిక లోపాలు చోటుచేసుకున్నాయని తేలినా తప్పు సరిదిద్దుకోవడం అసాధ్యం కనుకనే ఇన్ని జాగ్రత్తలు. ఇందిరాగాంధీ హత్య కేసు, పార్లమెంటు దాడి కేసు, ముంబైపై ఉగ్రవాద దాడిలో పట్టుబడిన కసబ్ విషయంలోనూ ఉరిశిక్ష విధించడానికీ, దాన్ని అమలు చేయడానికీ మధ్య ఎంతో వ్యవధి ఉంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు ఆవేదన ఉంటుందన్నది నిజమే. తమవారికి ఏం జరిగిందో, దోషులకు కూడా తక్షణం అదే జరగాలని వారు పట్టుదలగా వుంటారు. నిర్భయ దోషుల విషయానికే వస్తే వారు అనుసరించిన విధానాలు, శిక్ష తప్పించుకునేందుకు వారు చూపిన సాకులు నిర్భయ కుటుంబీకులకు మాత్రమే కాదు... దేశ ప్రజలందరికీ ఆగ్రహం కలిగించాయి. ఇలా ఇంకెన్నాళ్లు కాలక్షేపం చేస్తారన్న ప్రశ్నలు తలెత్తాయి. నిర్భయ కేసు విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడంతోపాటు అత్యాచారం, ఇతర లైంగిక నేరాల్లో విధించాల్సిన శిక్షల గురించి, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీ కూడా నియమించింది. జస్టిస్ వర్మ కమిటీ రికార్డు స్థాయిలో కేవలం 29 రోజుల్లోనే తన సిఫార్సులు అందించగా... ప్రభుత్వం కూడా చురుగ్గా కదిలి రెండు నెలల్లోనే అత్యాచార నేరానికి మరణ దండన విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే నిర్భయ కేసు ఫాస్ట్ట్రాక్ కోర్టులో చాలా త్వరగానే పూర్తయిందని చెప్పాలి. 2012 డిసెంబర్ 16న ఆ ఉదంతం జరగ్గా, నలుగురు దోషులకు 2013 సెప్టెంబర్లో మరణశిక్ష విధించింది. ఈ విచారణ కొనసాగుతుండగానే దుండగుల్లో ఒకడు ఆత్మహత్య చేసుకోగా, మరో దుండగుడి వయస్సు 16 ఏళ్లలోపు కావడం వల్ల అతడిపై జువెనైల్ కోర్టులో విచారణ జరిగి మూడేళ్ల శిక్ష పడింది. నలుగురు దోషులకూ ఫాస్ట్ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను ఆ మరుసటి ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ధ్రువీకరించింది. నిందితులు అప్పీల్ చేసుకోగా 2017 మే నెలలో ఈ నేరగాళ్లకు ఉరిశిక్ష సరైందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పటినుంచి రివ్యూ పిటిషన్లు మొదలయ్యాయి. నేరగాళ్లలో ఒకరి తర్వాత ఒకరు... ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు పిటిషన్లు దాఖలు చేయడం, వాటిని తిరస్కరించడం, రాష్ట్రపతికి క్షమాభిక్ష వినతులు, వాటిని తోసిపుచ్చాక దాన్ని సవాలు చేస్తూ తిరిగి ఢిల్లీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేయడం కొనసాగాయి. నేరం జరిగిన సమయానికి తాను జువెనైల్నని నేరగాడు పవన్ కుమార్ గుప్తా కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తమను ఏకాంతవాస ఖైదు చేశారని, చిత్రహింసలకు గురిచేశారని, తమను ఉరి తీయాలంటూ కేంద్రమంత్రులు తదితరులు ప్రకటనలివ్వడం వల్ల ఆ ప్రభావం న్యాయస్థానాలపై పడిందని నేరగాళ్లు ఆరోపించారు. ఒక దోషి భార్య తాను వితంతువుగా బతకలేను గనుక అతగాడినుంచి విడాకులు ఇప్పించాలని కోరింది. ఈ సాకుతో శిక్ష అమలును జాప్యం చేయొచ్చునన్నది వారి ఎత్తుగడ. ఈలోగా ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ కావడం, అవి వాయిదా పడటం రివాజైంది. ఈ కేసులో నేరగాళ్ల దుర్మార్గం సమాజం మొత్తాన్ని కలచివేసింది. కనుకనే ఈ ఉదంతంపై అంతగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వారికి సత్వరం ఉరిశిక్ష పడాలని అందరూ కోరుకున్నారు. ఈమధ్య కాలంలో అలాంటి నేరగాళ్లను ఎన్కౌంటర్ చేయాలన్న ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. ఏదైనా చట్టప్రకారమే జరగాలన్న విధానం నేరగాళ్లు శిక్ష పడకుండా తప్పించుకోవడానికి తోడ్పడుతున్నదన్న అసంతృప్తే ఇందుకు కారణం. నేరానికీ, శిక్షకూ మధ్య ఉండే ఈ అపరిమిత జాప్యాన్ని ప్రభుత్వాలు అధిగమించగలిగితే నేరం చేయాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో పౌరుల్లో ఉండే అసంతృప్తి సమసిపోతుంది. నేర నివారణకు చర్యలు తీసుకుంటూనే, అవి జరిగినప్పుడు తక్షణం స్పందించి పకడ్బందీ దర్యాప్తు, విచారణ పూర్తికావడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ప్రశంసనీయమైన చర్య తీసుకుంది. లైంగిక నేరాల కేసుల్లో దుండగులను పట్టుకుని 21 రోజుల్లో శిక్షించడానికి వీలుగా దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దాంతోపాటు దిశ యాప్ను రూపొందించి విడుదల చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. నేరాలకు ఆస్కారంలేని పరిస్థితులు కల్పించడం, నేరం చేసినవారికి వెనువెంటనే శిక్ష తప్పదన్న అవగాహన కలిగించడం కీలకం. అప్పుడు మాత్రమే ఏ సమాజమైనా భద్రంగా మనుగడ సాగించగలుగుతుంది. -
ఆఖరి ప్రయత్నం విఫలం; ఇక ఉరే
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు మరోసారి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ నిందితులు చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. ఢిల్లీ హైకోర్టులో ముగ్గురు దోషులు దాఖలు చేసిన స్టే పిటిషన్ను న్యాయస్థానం కొట్టిపారేసింది. పిటిషన్ దాఖలు చేసిన దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్కి కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. 'లిఖితపూర్వక డాక్యుమెంట్ ఏదీ లేదు.. పార్టీల మెమో లేదు,అఫిడవిట్లు లేవు. అసలు ఈ పిటిషన్ దాఖలు చేయడానికి మీకు అనుమతి ఉందా..?' అని కోర్టు ఆయన్ను ప్రశ్నించింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఫోటో కాపీలు జతచేయడం సాధ్యపడలేదని ఏపీ సింగ్ బదులిచ్చారు. ఏపీ సింగ్ వాదనపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. (నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు) 'చూడండి కోర్టులు ఎంత విశాల దృక్పథంతో పనిచేస్తున్నాయో.. ఈ ఒక్కరోజే మీరు మూడు కోర్టుల చుట్టూ తిరిగారు. ఈ రాత్రి 10గంటల సమయంలో మీ పిటిషన్పై విచారణ జరుపుతున్నాం.. కాబట్టి సాధ్యపడలేదు వంటి మాటలు చెప్పవద్దు' అని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నిర్భయ దోషుల స్టే పిటిషన్ కొట్టివేయడంతో.. పటియాలా హౌజ్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం శుక్రవారం(మార్చి 20) తెల్లవారుజామున ఉరిశిక్ష అమలుకానుంది. అంతకుముందు గురువారం మధ్యాహ్నం దోషుల స్టే పిటిషన్ను పటియాలా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ పిటిషన్ను సవాల్ చేస్తూ దోషులు హైకోర్టును ఆశ్రయించారు. -
నిర్భయ దోషులను ఎలా ఉరి తీస్తారో తెలుసా?
దేశాన్ని కుదిపేసి దిగ్ర్భాంతికి గురిచేసిన నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లవుతుంది. నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష ఖాయమైంది. మార్చి 20న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరి తీయాలంటూ కోర్టు డెత్వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నిర్భయ దోషులను ఎవరు ఉరి తీస్తారు? ఆ తలారి ఎవరు అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో తలారి పవన్ అభిప్రాయాలు తెలుసుకుందాం. (నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’) రిపోర్టర్ : ఈయనే పవన్కుమార్. ధన్యవాదాలండీ. తలారి : ధన్యవాదాలండీ. మీరు ఈ అవకాశం కల్పించినందుకు సంతోషం. రి : ఉరిశిక్ష అమలు కోసం పిలిస్తే తీహార్జైలుకు వెళ్తారా? త : హా తప్పనిసరిగా వెళ్తాను. రి : తీహార్జైలు లేదా దేశంలోని ఇతర జైళ్లతో ఉరిశిక్ష అమలుకోసం ఒక సీజన్ ఉంటుందని తెలుస్తోంది. జైలు మ్యానువల్ ప్రకారం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణంగా ఉరిశిక్షలు అమలు చేస్తారని విన్నాం. ఉదయం 8 గంటలకు చేస్తారంట. ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? నలుగురిని ఒకేసారి ఉరితీస్తారా? లేక ఇద్దరిద్దరి చొప్పున ఉరితీస్తారా? వేరువేరుగా చేస్తారా? వివరాలు చెప్పండి. త : వీలైతే నలుగురిని లేదా ఇద్దరిద్దరి చొప్పున చేస్తాం. తక్తార్ పెద్దదైతే, సరిపోతే ఒకేసారి చేస్తాం. రి : నలుగురిని ఒకేసారి ఉరితీస్తారా? త : తీహార్లో ఉరితీసే ప్రదేశంలో ఫ్లాటుని బట్టి ఉంటుంది. గ్యాప్ పెద్దదిగా ఉంటే ఒకేసారి నలుగురిని ఉరితీస్తాం. రి : తీహర్ జైలులోని ఉరికంబం పొడవు, వెడల్పు పది అడుగులు ఉంటుందని విన్నాం. నలుగురిని ఒకేసారి ఉరితీయడానికి, నలుగురు నిలబడడానికి అది సరిపోతుందా? త : హా సరిపోతుంది. వీలుంటుందో లేదో చూసి చెప్పాలి. రి : ఉరికోసం తాడు కట్టడానికి సమయం పడుతుందా. లేక ముందే కడతారా? త : ఉదయం 3 గంటలకే అక్కడికి వెళ్తాం. తాళ్లు కట్టడానికి గంట సమయం పడుతుంది. ముందురోజే ఆ ట్రయల్ చేస్తాం. అన్ని సరిగా ఉన్నాయో లేదో తాడు బరువు తూగుతుందో లేదో దోషులు బలంగా ఉన్నారా? ఎన్ని ఇంచులు ఉంటుంది? ఒకేసారి చేయగలమా లేదా అని పరిశీలిస్తాం. దీన్ని బట్టి అధికారులకు చెప్తాం. రి : ఉరికోసం నాలుగు తాడ్లు, గ్రేటర్ ఎప్పుడు తీసుకెళ్తారు? ముందురోజు రాత్రా లేక అదే రోజు ప్రొద్దున్నా? త : పొద్దున్నే. ముందురోజు ట్రయల్ పూర్తయ్యాక అప్పుడు తీసుకెళ్తాం. రి : ఉరితీసే వారిని తీసుకొచ్చే సమయానికి తాళ్లు గ్రేటర్కు వేలాడుతూ ఉంటాయా? లేకుంటే వారొచ్చాక సమయానికి తాళ్లు కడతారా? త : లేదు. వాటిని ఒక పక్కకు ఉంచుతారు. గ్రేటర్కు కట్టి ఉంచుతారు. ఉరితీసే వాళ్ల కాళ్లు కట్టేస్తాం. ముసుగు వేస్తాం. లెవల్ దగ్గరికి తీసుకెళ్తాం. ఎప్పుడైతే జైలర్ సైగ చేస్తారో అప్పుడు లీవర్ను లాగుతాను. రి : ఉరి అమలుచేసే గదిలో పది నుంచి పన్నెండు మంది ఉంటారు. దోషుల్ని అక్కడికి తీసుకొచ్చాక ఎవరూ మాట్లాడరు. అందరూ మౌనంగా ఉంటారు. ఎందుకని? త : ఎందుకంటే ఎవరూ డిస్ర్టబ్ కాకూడదు కదా. మర్చిపోకూడదు కదా. అందుకే మౌనంగా ఉంటాం. కేవలం సైగల ద్వారా ఆదేశాలిస్తారు. సైగల ద్వారా అన్నీ ఒకేసారి జరుగుతాయి. రి : జైలర్ మీకు ఉరి అమలుచేసేందుకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారు? త : అంటే నేను వారిని కాళ్లను కట్టేసి ఫ్లేటు మీదకు తీసుకొచ్చాక వాళ్లకు ముసుగు వేసి తాళ్లు రెడీ చేసుకొని అంతా సిద్ధం అన్నట్లుగా సైగ చేస్తాను. అప్పడు జైలర్ నాకు ఆదేశాలిస్తారు. రి : జైలర్ చేతిలో రుమాలు పట్టుకొని ఉంటారా? త : అవును అవును. రి : జైలర్ రుమాలుతో సిగ్నల్ ఎలా ఇస్తారు? త : కరెక్టుగా టైం చూస్తూ జైలర్ తన చేతిలోని రుమాలు చూపిస్తూ ఇలా సైగ చేస్తారు. ( రుమాలును విదిలిస్తారు) అప్పుడు వెంటనే నేను లీవర్ లాగేస్తాను. రి : జైలర్ రుమాలుతో సిగ్నలిచ్చి మీరు లీవర్ లాగగనే ఏమవుతుంది? త : వాళ్లు తాళ్లకు వేలాడుతారు. అంటే నలుగురు కాళ్ల కింద ప్లేటు పడిపోతుంది. వారు కింద గోతిలోకి జారిపోతారు. రి : కాళ్లు కట్టేస్తారు. మరి చేతులు? త : చేతులకి సంకెళ్లు ఉంటాయి. వెనక్కి కట్టేస్తాం. రి :ఎంతసేపు వారు ఉరితాడుకు గిలగిలలాడుతారు? త : 10-15 నిమిషాలు. ఆ తర్వాత చల్లబడిపోతారు. అర్థగంట తర్వాత వైద్యులు వాళ్ల గుండెను పరీక్షిస్తారు. సిపాయిలు మృతదేహాలను తక్టా నుంచి కిందకి దించుతారు. రి : అంటే ఉరితీయడానికి ముందే తలారే తాళ్లు కడతాడు. ఆ తర్వాత చనిపోయిన వారి మెడ నుంచి తాళ్లు కూడా తలారే విప్పుతారు. ఈ రెండూ మీరే చేస్తారు. అంతేనా? త : అవును. రి : ఆ తర్వాత ఏం జరుగుతుంది? త : మా రానుపోను ఖర్చులు వగైరా ఇస్తారు. ఇంటికి వెళ్లిపోతాం. రి : ఆ సమయంలో మీ మనసులో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి? పదినిమిషాల ముందువరకు మీ ముందు జీవంతో ఉన్న మనిషి . .మీరు కట్టిన తాళ్లకు వేలాడి ప్రాణాలు వదులుతాడు. డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తారు. ఈ సమయంలో మీలో ఎలాంటి భావనలు కలుగుతాయి?త: ఏమీ ఉండదు. మీడియా వాళ్లు అడుగుతారు. వాళ్లకు సమాధానాలు చెప్తాను. రి :అవన్నీ అయిపోయాక మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఇదంతా చూశానన్న ఆలోచనలు ఎప్పుడైనా వస్తాయా? మీకు ఎలా అనిపిస్తుంది? త : ఎప్పుడూ లేదు. నేనేం నేరం చేశాను? నాకెలాంటి పశ్చాత్తాపం ఉండదు. నిర్భయ లాంటి వాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 8ఏళ్ల బాలికలను రేప్ చేస్తున్నారు. ఇలాంటి నేరాలకు ఉరిశిక్ష పడాల్సిందే. రి : ఉరితీసేటప్పడు కాళ్లు,చేతులు కట్టేస్తారు. ముఖానికి ముసుగు వేస్తారు. కానీ నోటికి ఏదీ అడ్డు పెట్టరు. కాబట్టి అతను అరవడం, కేకలు వేయడం వంటివేమైనా చేస్తాడా? త : లేదు. మృత్యువు ఖాయం అని తెలిశాక అరిచేం లాభం? రి : మరణమంటే ఎవరికైనా భయమే కదా? ఉరి అములుచేసే సమయంలో ఆ భయంతో ఎవరైనా వణికిపోవడం, గాబరాపడటం చూశారా? త : అలహాబాద్లో ఒకసారి ఇలానే జరిగింది. ఉరికంబం మీదకు వెళ్లడానికి ఒకతను నిరాకరించాడు. మొరాయించాడు. అప్పుడు పోలీసులకు చెప్పాను. వాళ్లు బలవంతంగా పట్టుకొచ్చారు. అప్పుడు ముసుగు వేశాను. జైలర్ సైగ చేశారు. అంతే.. రి : మీరు ఉరి అమలవుతున్న సమయంలో శిక్షకు గురవుతున్న వారిలో భయాందోళన, ఉద్వోగం వంటివి గమనించారా? త : హ. చూశాను. రి : ఆఖరి క్షణాల్లో ఉన్నవారిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి? త : నాకేమీ అనిపించదు. నా డ్యూటీ నేను చేస్తున్నాను. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను రి :మీ ఇంట్లో వాళ్లు ఏమంటారు? వాళ్లని ఇలా ఉరితీశాను. అలా చేశానంటూ అక్కడి విషయాలు మీ ఇంట్లో వాళ్లకి చెప్తారా? త : హా లేదు. ఆ వివరాలు తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్తే మీరు భయపడ్తారు అని వారికి చెప్తాను. తర్వాత వాళ్లకి చెప్పినా ఏమీ అనిపించదు. నిర్భయకాండ జరిపిన వాళ్లకు ఇలానే జరగాలి అని వాళ్లంటారు. రి : ఈ పనికి డబ్బులు తీసుకొని మీరు ఇంటికి వెళ్తారు. ఎవరో ప్రాణాలు తీసి డబ్బులు సంపాదించాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలుగుతుందా? త : లేదు. లేదు. న్యాయం అమలుకోసం ఇదంతా చేస్తాం. న్యాయం అమలు చేయడానికి ఇచ్చిన డబ్బులవి. ఈపని వల్ల 125 కోట్ల మంది భారతీయులకు న్యాయం చేస్తున్నానన్న తృప్తి ఉంటుంది. అందుకు నాకు ఎలాంటి దుఃఖం ఉండదు. ఇలాంటి నేరస్తులకు ఉరిశిక్ష పడాల్సిందే. రి : సినిమాల్లో చూపించినట్లు చివరి ఘడియల్లో వాళ్లకు చెవిలో చెప్పడం లాంటివి ఉంటుందా? త : అలాంటిదేమీ ఉండదు. రి : మీరు ఉరితీసే వాళ్లను ఎప్పుడు చూస్తారు? త : తక్టా పైన మాత్రమే వాళ్లను చూస్తాను. రి : ఉరిశిక్ష అమలుచేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన తాడును బక్సర్ జైలు నుంచి తెస్తారు. దాన్ని మలీనా రోప్ అంటారు. దానికి వెన్నపూసి ఎక్కడా చిక్కు ముడులు లేకుండా చూస్తారని, క్యారమ్బోర్డు మీద వేసే పౌడర్ను దానికి రాస్తారని విన్నాం. ఇదంతా నిజమేనా? త : హా. అలానే ఉంటుంది. రి : ఒకసారి తీహార్ జైలులో ఉరి సందర్భంగా మెడ కట్ అయి రక్తం వచ్చిందంటా? త : లేదు లేదు. అలా కాదు. చేతకాని వాళ్లు చేస్తేనే అలా అవుతుంది. ఇదే కదా మా వృత్తి. రి :నిర్భయ దోషుల కోసం ఎన్నిరోజులు జైళ్లో ఉంటారు? అప్పుడు మీరేం చేస్తారు? త : రెండు రోజులు. ఒకరోజు ట్రయల్ అంతే. ఎలా చేయాలి? ఏంటి? తాడు ఎలా కట్టాలి అన్నది ఆలోచిస్తాం. అధికారులతో సమావేశం అవుతాం. జైలు అధికారులు ఎలా చెప్తే అలా. రి :సినిమాల్లో తలారులు నల్లటి దుస్తులు వేసుకొని పొడవాటి గడ్డం, జుట్టుతో గంభీరంగా, ఒకింత భయానకంగా కనిపిస్తారు. మీరూ అలాంటి దుస్తులే వేసుకుంటారా? లేక మాములు దుస్తుల్లో వెళ్తారా? త : అదంతా సినిమాల్లోనే చూపిస్తారు. మేము మామాలుగానే వెళ్తాం. రి : నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం మీకు లభించింది. ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? త : ఏమీ లేదు. నిర్భయ తల్లిదండ్రులకు శాంతి కలగాలి. 125 కోట్ల ప్రజలకు శాంతి కలగాలి. అదే కోరుకుంటున్నా. అంతే. -
ఉరి ఖాయం.. ఇక నా కూతురి ఆత్మకు శాంతి!
సృష్టిలోని ప్రతీ తల్లికి తన బిడ్డ అపురూపమే. ప్రాణాలు పణంగా పెట్టి జన్మనిచ్చిన తన పాపాయికి చిన్న ఆపద కలిగినా అమ్మ మనసు తట్టుకోలేదు. ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో ఆ మాతృమూర్తి మనోభావాలు మరింత సున్నితంగా ఉంటాయి. కూతురు ఉన్నతోద్యోగం చేస్తూ.. పదిమందిని శాసించే స్థాయిలో ఉన్నా చంటి బిడ్డలాగే తనను లాలిస్తుంది. చిన్ననాడు తన చీర కట్టుకుని మురిసిపోయిన తన చిట్టితల్లి .. అత్తింటికి వెళ్లి... తనో బిడ్డకు తల్లిగా మారితే చూసి మురిసిపోవాలనుకుంటుంది. ఢిల్లీకి చెందిన ఆశాదేవి కూడా తన కూతురి విషయంలో సరిగ్గా ఇలాగే ఆలోచించారు. అయితే ఆమె ఆశలను చెల్లాచెదురు చేశారు ఆరుగురు మృగాళ్లు. ఆమె కూతురిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి.. తీవ్రంగా హింసించి ఈ లోకంలో లేకుండా చేశారు. ఆశాదేవికి గర్భశోకం మిగిల్చారు. అవును... సామూహిక అత్యాచారానికి గురై అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలు విడిచిన నిర్భయకు తల్లి ఆమె. రెండు గంటల్లో తిరిగి వచ్చేస్తానమ్మా బయటకు వెళ్లిన కూతురిపై ఏ మృగం దాడి చేసిందో తెలియనంతగా.. కూతురి శరీరం రక్తంతో తడిసిపోతే కళ్లారా చూసి గుండె పగిలేలా రోదించింది. పెదవులు చిట్లిపోయి... తలమీద చర్మం ఊడిపోయి... మాంసపు ముద్దలా ఆస్పత్రి మంచం మీద పడి ఉన్న బిడ్డకు ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురుచూసింది. తమ కెరీర్లో ఇంతటి ఘోరమైన కేసును ఎప్పుడూ చూడలేదని వైద్యులు వాపోయినా.. ఏదో ఒక అద్భుతం జరిగి తన చిన్నారి తల్లి కళ్లు తెరుస్తుందనుకుంది.(నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు) కానీ నిర్భయ తన తల్లి కలలను కల్లలు చేస్తూ శాశ్వతంగా ఆమెకు దూరమైంది. చికిత్స పొందుతున్న క్రమంలో ఏనాడు కనీసం గుక్కెడు మంచి నీళ్లు కూడా తాగకుండానే ఈ ప్రపంచాన్ని విడిచివెళ్లిపోయింది. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి కోలుకోవడం ఏ తల్లికైనా సాధ్యం కాదు. ఆశాదేవి కూడా ఇందుకు అతీతురాలు కాదు. కూతురిని తలుచుకుని అందరిలాగే కుంగిపోయింది. బిడ్డ జ్ఞాపకాలతో పిచ్చిపట్టినదానిలా అయిపోయింది. అయితే ఇలా ఏడుస్తూ కూర్చుంటే.. తన కూతురికి న్యాయం జరగదనే సత్యం ఆమెకు తొందరగానే బోధపడింది. అందుకే తనకు కడుపుకోత మిగిల్చిన వాళ్లకు సరైన శిక్ష పడేలా చేసేందుకు నడుం బిగించింది. ఓ తల్లిగా తాను సర్వం కోల్పోయినా.. మనసును బండరాయి చేసుకుంది. బాధను దిగమింగి తనలోని శక్తినంతటినీ కూడగట్టుకుని ఏడేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తోంది.( ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’: నిర్భయ దోషి భార్య) ఈ క్రమంలో ఆశాదేవికి ఎదురైన చేదు అనుభవాలకు లెక్కేలేదు. ‘‘ఆడపిల్లను ఒంటరిగా ఎందుకు బయటకు పంపిస్తారు. అలా అబ్బాయిలతో స్నేహం చేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురుకాక ఇంకేమవుతుంది. రాత్రీ పగలూ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఇలాగే అవుతుంది’’అని సామాన్యుల నుంచి దోషుల లాయర్ వరకు ప్రతీ ఒక్కరు సూటిపోటి మాటలతో ఆమెను చిత్రవధ చేశారు. అయినా వాటన్నింటినీ ఆమె లెక్కచేయలేదు. తన కూతురి కోసం వీధుల్లో నిరసన కార్యక్రమాలకు దిగిన యువత ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగింది. జిల్లా కోర్టు మొదలు.. హైకోర్టు.. సుప్రీంకోర్టు ఇలా న్యాయం కోసం ఆమె ఎక్కని కోర్టు మెట్టులేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో మార్చి 13, 2014లో అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారనడానికి సరైన ఆధారాలు లభించిన మీదట నిర్భయ దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే వాళ్లు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దిగువకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లారు.(ఉరితీయొద్దు.. సరిహద్దుకు పంపండి : దోషుల లాయర్) ఈ నేపథ్యంలో 2017 మే 5న నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆశాదేవి మనస్సు కాస్త శాంతించింది. ఇక మరణశిక్ష అమలే తరువాయి అని ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ తీర్పును కేవలం ఆశాదేవి మాత్రమే కాదు సగటు ఆడపిల్లల తల్లితండ్రులు, నిర్భయకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరు స్వాగతించారు. అయితే శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వచ్చినంత మాత్రాన అది సత్వరమే అమలు కాదని తెలుసుకోవడానికి ఆశాదేవికి ఎక్కువ సమయం పట్టలేదు. అయినా ఆమె తన పోరాటం ఆపలేదు. భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో అలుపెరుగక కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యతను మారుతున్న ప్రభుత్వాలు, ప్రసంగాలు దంచే నాయకులకు గుర్తుచేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అనేక పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు, న్యాయ ప్రక్రియల అనంతరం జనవరి 22, 2020లో ఉరిశిక్ష అమలు చేసేందుకు ఢిల్లీ పటియాలా హౌజ్కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. అయితే దోషుల వరుస పిటిషన్లతో.. ఫిబ్రవరి 1 తర్వాత మార్చి 3కు వాయిదా పడింది. అనంతరం మార్చి 20న నలుగురు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ ఉరితీయాలంటూ తాజా డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ.. తాజాగా నిర్బయ దోషులు మరోసారి కోర్టు తలుపు తడుతున్నారు. భారత్లో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు ఏ పాపం తెలియదని.. తమను బలిపశువులు చేశారంటూ ఐసీజేకు విన్నవించారు. (‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’) మరోవైపు వారి కుటుంబ సభ్యులు తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాయగా.. దోషుల్లో ఒకడైన అక్షయ్ భార్య మంగళవారం ఔరంగాబాద్ కుటుంబ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు తాము దాఖలు చేసిన పిటిషన్ల విచారణ పూర్తయ్యేంత వరకు శిక్ష అమలు నిలిపివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు దోషులు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మరోసారి శిక్ష అమలు వాయిదా పడుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇన్నిసార్లు వాయిదాల గురించి వింటున్న, ఈ కేసు గురించిన వార్తలు చదువుతున్న మనకే ఇంతగా విసుగు వస్తుంటే.. ఇక ఆశాదేవి మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా భూదేవి అంత సహనంతో.. తన కూతురికి ఆలస్యంగానైనా తప్పక న్యాయం జరుగుతుందనే ఆశతో ఆమె ఎదురుచూస్తోంది. ఆ నలుగురికి ఎన్నడూ ఉరిశిక్ష అమలు కానివ్వని దోషుల తరపు లాయర్ తనను సవాలు చేసినా పోరాట పటిమతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతోందని ఒక్కోసారి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేసినా.. మానవ హక్కుల సంఘాల తీరును విమర్శించినా.. దాని వెనుక తల్లి ప్రేమ, ఏడేళ్ల సంఘర్షణ, మానసిక వేదనే తప్ప మరే ఇతర కారణాలు లేవన్న విషయాన్ని గ్రహించాలి. ఇంకోవిషయం... ఇన్నేళ్లుగా ఇంతగా పోరాడుతున్న ఆశాదేవి సంపన్నురాలేమీ కాదు. మెడలో కేవలం నల్లపూసల గొలుసు మాత్రమే ధరించే సాధారణ గృహిణి. భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పొలం అమ్మేసి మరీ కూతురిని చదివించిన వ్యక్తికి భార్య. ఇక గురువారం నాడు దోషులకు ఏ అవకాశాలు లేవంటూ కోర్టులు వారి పిటిషన్లను కొట్టివేసిన నేపథ్యంలో ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘వారిని ఉరితీయబోతున్నారు. ఏడేళ్ల తర్వాత నా కూతురి ఆత్మకు శాంతి చేకూరబోతోంది. నాకు కూడా మనశ్శాంతి కలుగుతుంది’’ అని ఆశాదేవి వ్యాఖ్యానించారు.(‘నిర్భయకు ఇక న్యాయం జరుగుతుంది’) దేశ వ్యాప్తంగా సాగుతున్న అకృత్యాల గురించి.. ఆ దోషులను(నిర్భయ దోషులు) కోర్టులో చూసిన ప్రతీసారీ నేను చచ్చిపోయినట్లుగా అనిపిస్తుంది. నాలాగే నా కూతురికి ఈ పరిస్థితి ఎదురవనందుకు సంతోషం. వాళ్లను చూసేందుకు ఈ రోజు నా కూతురు బతికి లేనందుకు కాస్త సంతోషంగా ఉంది. లేకుంటే తాను కూడా ఎంతో వేదన అనుభవించేది. న్యాయం కోసం నేను చాలా ఓపికగా పోరాడుతున్నాను. అయితే 2012 నాటికి.. నేటికీ ఏమీ మారలేదు. ఈ న్యాయపోరాటంలో నాకు నేనే ప్రశ్నగా మారాను. అయినా మా కూతుళ్లు ఏం తప్పు చేశారు. వాళ్లపై ఎందుకు అత్యాచారాలకు పాల్పడి కాల్చివేస్తున్నారు. తల్లిదండ్రులుగా మా తప్పేం ఉంది. మేము ఇంకా ఎన్నాళ్లు న్యాయం కోసం ఎదురుచూడాలి. ఓవైపు న్యాయపోరాటం జరుగుతుండగానే.. మరోవైపు అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ దహనాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి సమస్యలకు వ్యవస్థ, సమాజం ఎందుకు పరిష్కారాలను కనుగొనలేకపోతుంది. ముఖేశ్ సింగ్ తల్లి తనను అభ్యర్థించిన సందర్భంలో.. మా కూతురిని కోల్పోయాం. రక్తపు మడుగులో మునిగిన తన శరీరాన్ని చూశా. తన శరీరంపై ఉన్న గాయాలు.. తనపై క్రూర మృగాలు దాడి చేశాయా అన్నట్లు ఉన్నాయి. ఆనాటి నుంచి నా కళ్ల నుంచి రక్తం కారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ... దయ చూపమని అర్థించడం నాపై ఎటువంటి ప్రభావం చూపదు. ఏడేళ్లుగా ఏడ్చీ ఏడ్చీ నేనొక బండరాయిలా మారాను. అత్యంత దారుణ పరిస్థితుల్లో నా కూతురు కొట్టుమిట్టాడటం కళ్లారా చూశాను. రోజూ చస్తూ.. బతుకుతున్నాను. అందుకే నాకు ఎలాంటి భావోద్వేగాలు ఉండవు. రక్తపు కన్నీరు కారుస్తూ న్యాయ పోరాటం చేస్తున్నా. రాజకీయ పార్టీల పరస్పర విమర్శల నేపథ్యంలో నా కూతురిని చంపిన వారికి వేలకొద్దీ అవకాశాలు లభిస్తున్నాయి. కానీ మాకు ఏ హక్కులు లేవా? ఇన్నేళ్లలో నేను ఇంతవరకు రాజకీయాల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే ఒక్క విషయం.. 2012లో ఎవరైతే నా కూతురి కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారో.. ఈ రోజు వాళ్లే నా కూతురి చావును అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. 2014లో అధికారంలోకి వస్తే మహిళలపై దాడులు జరగవని చెప్పారు. రెండోసారి కూడా అధికారం చేపట్టి వేల కొద్దీ పనులు చేశారు. ట్రిపుల్ తలాక్ వంటి కీలక అంశాల్లో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నా కూతురి విషయంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోండి. చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఆ నలుగురికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయండి. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్డెస్క్ -
ఉరితీయొద్దు.. సరిహద్దుకు పంపండి
న్యూఢిల్లీ: ‘‘వాళ్లను భారత్- పాకిస్తాన్ సరిహద్దుకు పంపండి లేదా డోక్లాంకు పంపండి. అంతేగానీ వాళ్లను ఉరితీయకండి. వాళ్లు దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాను అఫిడవిట్ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. డిసెంబరు 16, 2012లో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు రామ్ సింగ్, ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ సహా ఓ మైనర్ సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ బాధితురాలు సింగపూర్లోని ఆస్పత్రిలో కన్నుమూసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ప్రధాన దోషి రామ్సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా... మైనర్ విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు దోషులు ముఖేశ్, పవన్, అక్షయ్, వినయ్లకు ఉరిశిక్ష ఖరారు కాగా అనేక పరిణామాల అనంతర, మూడుసార్లు ఉరిశిక్ష అమలు వాయిదా పడిన తర్వాత.. తాజాగా మార్చి 20న ఉరితీత ఖరారు చేస్తూ డెత్వారెంట్లు జారీ అయ్యాయి. (వాళ్లకు ఏ అవకాశాలు లేవన్న కోర్టు.. కానీ మళ్లీ) ఈ క్రమంలో వారిని శిక్ష నుంచి తప్పించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్న ఏపీ సింగ్.. వరుస పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు వేయిస్తూ వారికి అండగా నిలిచారు. ఇక తాజాగా నిర్భయ దోషులకు ఎటువంటి చట్టపరమైన అవకాశాలు లేవంటూ ఢిల్లీ కోర్టు పేర్కొనగా.. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. నిర్భయ దోషులు సైనికుల్లా పనిచేస్తారని.. వారికి దేశ సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరడం విశేషం. కాగా నిర్భయ ఘటన జరిగిన సమయంలో దోషులను సమర్థించిన ఏపీ సింగ్.. రాత్రిపూట అమ్మాయిలు బయట తిరిగితే ఇలాంటి ఘటనలే జరుగుతాయని... తన కూతురు ఇలా బాయ్ఫ్రెండ్తో తిరిగితే చంపేసే వాడినంటూ లింగవివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నిర్భయ దోషులు ఉగ్రవాదులు కాదని.. వారిని క్రూరమైన నేరస్తులుగా చిత్రీకరించి ఎప్పుడో చంపేశారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (దోషులను నాలుగుసార్లు చంపేశారు : ఏపీ సింగ్) నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’ AP Singh, 2012 Delhi gangrape case convicts lawyer before Patiala House Court: Send them to Indo-Pak border, send them to Doklam, but don't hang them. They are ready to serve the country. I can file an affidavit in this regard. (file pic) pic.twitter.com/6FMSxcpn9e — ANI (@ANI) March 19, 2020 -
నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరితీతకు ఇంకా కొన్ని గంటలే(అన్నీ సజావుగా సాగితే) మిగిలి ఉన్న వేళ వరుసగా వాళ్లకు కోర్టులు షాకిస్తున్నాయి. నిర్భయ దోషులు పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ దాఖలు చేసిన వివిధ పిటిషన్లను ఢిల్లీ కోర్టు, ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేశాయి. సుప్రీంకోర్టు సైతం పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్ను గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మరో కొన్ని గంటల్లో వారిని ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే డమ్మీ ఉరి కూడా పూర్తైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు వద్ద గురువారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. (నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు) ఈ నేపథ్యంలో దోషుల పిటిషన్లపై వాదోపవాదాలు జరుగుతున్న వేళ అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవి కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను తన పక్కనే కూర్చోబెట్టుకున్న ఆమె... చెప్పులతో తన ముఖంపై కొట్టుకుంటూ... బిగ్గరగా ఏడ్చారు. ఈ క్రమంలో స్పృహ తప్పిపడిపోయారు. మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ అదే విధంగా చేస్తూ... ‘‘నాకు బతకాలని లేదు. శిక్ష అమలైతే నేను చచ్చిపోతా’’ అంటూ బెదిరింపులకు దిగారు. కాగా అక్షయ్ భార్య ఇదివరకే తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘‘ నా భర్త అమాయకుడు. ఆయనను ఉరి తీసేముందు నాకు చట్టపరంగా విడాకులు కావాలి. ఎందుకంటే నేను అత్యాచార దోషి భార్యగా ఉండాలనుకోవడం లేదు’’ అని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక నిర్భయ దోషులను మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలంటూ డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉరిశిక్షను నిలిపివేసేందుకు దోషులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.(‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’) నిర్భయ కేసు: 20న ఉరి; విడాకులు కోరిన అక్షయ్ భార్య నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి -
వాళ్లకు ఏ అవకాశాలు లేవన్న కోర్టు.. కానీ మళ్లీ
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు గురువారం స్పష్టం చేసింది. మార్చి 20న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరితీయాలంటూ ఢిల్లీ కోర్టు డెత్వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాము దాఖలు చేసిన పలు పిటిషన్లు, అభ్యర్థనలు పెండింగ్లో ఉండటం, రెండోసారి క్షమాభిక్ష కోరే అవకాశాలు పరిశీలించేంత వరకు ఉరిని నిలుపుల చేయాలని బుధవారం వీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం.. దోషులకు ఇక ఏ అవకాశాలు లేవని పేర్కొంది. ఈ సందర్భంగా వారు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఇదిలా ఉండగా... ఈ కేసులో దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను గురువారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చిన విషయం తెలిసిందే.(‘నిర్భయకు ఇక న్యాయం జరుగుతుంది’) మరోవైపు దోషి అక్షయ్ ఠాకూర్ గురువారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి తన క్షమాభిక్షను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో అక్షయ్ లాయర్ ఏపీ సింగ్ తన వాదనలు వినిపిస్తూ.. అక్షయ్ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిన అంశం మిగిలిన ముగ్గురు దోషులు, అతడితో సంబంధం కలిగి ఉన్న ప్రతీ ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం... ‘‘మీరు రెండోసారి క్షమాభిక్ష పిటిషన్ను దాఖలు చేస్తే దానిని రాష్ట్రపతి తిరస్కరించారు. ఇప్పుడు దానిపై న్యాయ సమీక్ష చేయాల్సిన అవసరం ఏముంది?’’ అని ప్రశ్నించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు అవుతుందా లేదా అన్న విషయంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక నిర్భయ తల్లి ఆశాదేవి మాత్రం తన కూతురికి రేపు న్యాయం జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. (నిర్భయ దోషుల ఉరికి డమ్మీ పూర్తి) -
‘నిర్భయకు ఇక న్యాయం జరుగుతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయకు రేపటిరోజున న్యాయం జరిగి తీరుతుందని ఆమె తల్లి ఆశాదేవి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని హత్యాచార కేసులో ఉరి శిక్ష ఖరారైన నలుగురు దోషులకు కోర్టు పలు అవకాశాలు ఇవ్వడాన్ని ఆమె ప్రస్తావించారు. దోషులు ఎన్నో సాకులతో తమ శిక్షను వాయిదా వేసుకునే ఎత్తుగడలు కోర్టుకు తెలిసివచ్చిందని ఇక శిక్ష నుంచి వారు తప్పించుకోలేరని అన్నారు. నిర్భయకు రేపటిరోజున న్యాయం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఈ కేసులో దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను గురువారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. నిర్భయ కేసులో తనకు విధించిన మరణ శిక్షను సవాల్ చేస్తూ పవన్ గుప్తా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2012లో నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్నని, దిగువ కోర్టులు ఈ వాస్తవాన్ని విస్మరించాయని తన పిటిషన్లో పవన్ పేర్కొన్నారు. నేరం జరిగినప్పుడు తాను మైనర్ను కావడంతో తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షకు మార్చాలని ఆయన కోరారు. అంతకుముందు ఇదే వాదనతో పవన్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. 2012, డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో వైద్య విద్యార్ధినిపై హత్యాచార ఘటనలో ఉరి శిక్ష పడిన నలుగురు నిందితుల్లో పవన్ ఒకరు. నిర్భయ దోషులకు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఉరి శిక్ష, ఈ నెల 20న తెల్లవారుజామున 5:30 గంటలకు ఖరారైన సంగతి తెలిసిందే. చదవండి : నిర్భయ దోషుల ఉరికి డమ్మీ పూర్తి -
నిర్భయ దోషుల ఉరికి డమ్మీ పూర్తి
న్యూఢిల్లీ/ఔరంగాబాద్: నిర్భయ దోషుల ఉరికి సర్వం సిద్ధమవుతోంది. మీరట్ నుంచి తలారి పవన్ తీహార్ జైలుకు చేరుకొని బుధవారం డమ్మీ ఉరి వేసి తాళ్లను పరీక్షించారని జైలు అధికారులు తెలిపారు. దోషులకు ఉరి వేసేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన మనీలా తాళ్లను ఉపయోగిస్తారు. తలారి పవన్ వీటినే పరీక్షించారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఉరి, ఈ నెల 20న తెల్లవారుజామున 5:30 గంటలకు ఖరారైన సంగతి తెలిసిందే. నలుగురు దోషుల్లో ఒకరు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను తాజాగా కోర్టు కొట్టేసింది. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్లో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్ ఠాకూర్ భార్య తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఔరంగాబాద్ కోర్టులో కేసువేశారు. రేప్ చేసిన వ్యక్తికి భార్యగా కొనసాగడం తనకు ఇష్టంలేదని పునీతా మంగళవారం పిటిషన్ దాఖలు చేయగా గురువారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. -
డమ్మీ ఉరి పూర్తి, 20న ఉరి శిక్ష అమలు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2012 నిర్భయ సామూహిక హత్యాచార కేసులో దోషుల ఉరి శిక్ష అమలుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం తలారి పవన్ జల్లాద్ డమ్మీ ఉరి కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 20 న ఉరి తీయడానికి రెండు రోజుల ముందే తీహార్ జైలులో నలుగురు మరణశిక్షకు సంబంధించి డమ్మీ ఉరిని నిర్వహించినట్టు తలారి పవన్ బుధవారం తెలిపారు. మంగళవారం మీరట్ నుండి వచ్చి తాడులను పరీక్షించడానికి డమ్మీ ఉరిశిక్షను అమలు చేశామన్నారు. తీహార్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మరోసారి అన్ని సన్నాహాలతో, బుధవారం 'డమ్మీ ట్రయల్' జరిగినట్టు తీహార్ జైలు అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ తెలిపారు. జైలు నెంబర్ -3 ఉరి గదిలో జైలు అధికారుల సమక్షంలో దీన్ని నిర్వహించామని, ఉరి శిక్ష అమలుకు ముందు ఇలాంటి పరీక్షలు సాధారణమైన విషయమని ఆయన తెలిపారు. తద్వారా ఉరి సమయంలోఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్ధారించుకునేందుకు డమ్మీ ట్రయల్ ఉంటుందన్నారు. ఇది అరగంట పాటు కొనసాగిందని సీనియర్ అధికారి చెప్పారు. మరోవైపు శిక్ష ఖరారైనప్పటినుంచి దోషులు నలుగురు న్యాయ పరమైన అవకాశాలను వినియోగించు కుంటూ, శిక్ష అమలుపై అవరోధాలతో మరణ శిక్షనుంచి విజయవంతంగా తప్పించుకుంటున్నారు. తాజాగా విడాకులు ఇప్పించాల్సిందిగా అక్షయ్ భార్య పిటిషన్ దాఖలు చేసింది. ఇది ఇలా వుంటే ఉరిశిక్ష అమలు పై స్టే విధించాలని కోరుతూ దోషులు మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీ చేసిన కోర్టు, నిర్భయ దోషుల తాజా పిటిషన్ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించనున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 20 ఉరి శిక్ష అమలవుతుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ కేసులో ఆరుగురు దోషలుగా తేలగా, విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల తరువాత తిహార్ జైలులో ఆరవ నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ జువైనల్ హోంనుంచి విడుదలయ్యాడు. మిగిలిన దోషులు నలుగురు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లకు విధించిన ఉరిశిక్ష అమలు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. కోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు శిక్ష అమలు కావాల్సి వుంది. -
నిర్భయ: తీహార్ జైలు అధికారులకు నోటీసులు
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషుల ఉరిశిక్ష అమలుకు రంగం సిద్ధమైన వేళ వారు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ కోర్టు తలుపుతట్టారు. తాము దాఖలు చేసిన పలు పిటిషన్లు, అభ్యర్థనలు పెండింగ్లో ఉన్న కారణంగా... రెండోసారి క్షమాభిక్ష కోరే అవకాశాలు పరిశీలించాల్సి ఉన్నందున ఉరిని నిలుపుల చేయాలని కోరారు. ఈ క్రమంలో నిర్భయ దోషుల తాజా పిటిషన్ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది. కాగా 2012, డిసెంబరు 16 నాటి నిర్భయ అత్యాచార కాండలో ఆరుగురు వ్యక్తులు దోషులుగా తేలగా... ప్రధాన దోషి రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరో దోషి మైనర్ కావడంతో సాధారణ జైలు శిక్ష తర్వాత అతడిని విడుదల చేశారు. (నిర్భయ కేసు: విడాకులు కోరిన అక్షయ్ భార్య) ఇక మిగిలిన నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్లకు ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పటికే మూడుసార్లు వారిని ఉరితీసేందుకు డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు వారు పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో ఉరి వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మార్చి 20న ఉదయం ఆ నలుగురికి మరణ శిక్ష విధించాలనే ఆదేశాల నేపథ్యంలో వరుసగా మరోసారి పిటిషన్లు దాఖలు చేస్తూ ఈసారి కూడా శిక్ష అమలు తేదీని వాయిదా వేసేందుకు దోషులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారిని ఉరి తీస్తారా లేదా అన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. (నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి) మరో ట్విస్టు: ఐసీజేకు నిర్భయ దోషులు! శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి -
నిర్భయ కేసు: 20న ఉరి; విడాకులు కోరిన అక్షయ్ భార్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరి నుంచి తప్పించుకునే మార్గాలు అన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. ఈ సమయంలో నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ మరో పిటిషన్ను తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు మంగళవారం రోజున ఔరంగాబాద్ ప్యామిలీ కోర్టులో విడాకుల కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ‘‘అత్యాచారం కేసులో నా భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ నా భర్త నిర్దోషి. రేప్ కేసులో ఉరితీసిన దోషి భార్యగా నేను ఉండాలనుకోవడం లేదు’’ అంటూ ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ మార్చి 19న విచారణకు రానుంది. ఈ విషయం గురించి పునీత తరఫు న్యాయవాది ముకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘హిందూ వివాహ చట్టం 13(2)(11) ప్రకారం కొన్ని ప్రత్యేక కేసుల్లో విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రత్యేక కేసుల్లో అత్యాచారం కూడా ఉంది. తన భర్త అత్యాచారం కేసులో దోషి అని తేలితే భార్య విడాకులు తీసుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు. అయితే కొందరు న్యాయనిపుణులు ఆమె పిటిషన్ను విమర్శిస్తున్నారు. నేరం జరిగిన 8 ఏళ్ల తర్వాత, శిక్ష పడిన చాలా రోజుల తర్వాత విడాకుల పిటిషన్ వేస్తే కోర్టు అక్షయ్ కుమార్కు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అన్నారు. చదవండి: నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి కాగా, నిర్భయ కేసులో నలుగురు దోషులకు మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2012లో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆరుగురు దోషుల్లో ఒకరు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. ప్రధాన దోషి రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముఖేశ్ సింగ్ తల్లి విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్హెచ్ఆర్సీ నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ తల్లి ఉరిశిక్ష అమలుపై జోక్యం చేసుకోవాలని జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ను తోసిపుచ్చినట్లు ఎన్హెచ్ఆర్సీ అధికారులు తెలిపారు. చదవండి: అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు -
నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ వరుసగా మరోసారి తాజా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. శిక్ష నుంచి తప్పించుకునేందుకు న్యాయపరంగా తనకు ఉన్న హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ సమర్థనీయం కాదంటూ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు దోషులు అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాధితురాలి సన్నిహితులు చెప్పిన తప్పుడు సాక్ష్యం ఆధారంగా శిక్ష ఖరారు చేసి తమను బలిపశువులు చేశారంటూ ఐసీజేలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.(మరో ట్విస్టు: ఐసీజేకు నిర్భయ దోషులు!) ఇక తాజాగా ముఖేశ్ సింగ్ మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో అసలు తాను ఢిల్లీలో లేనని.. డిసెంబరు 17, 2012లో తనను పోలీసులు రాజస్తాన్లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువచ్చారు గనుక.. తనకు ఉరిశిక్ష రద్దు చేయాలని పిటిషన్లో కోరాడు. అదే విధంగా తీహార్ జైలులో అధికారులు తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించాడు. ఈ పిటిషన్పై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ధర్మేంద్ర రాణా పేర్కొనగా... ముఖేశ్ సింగ్ ఉరిశిక్ష తేదీని మరోసారి వాయిదా వేయించాలనే దురుద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేశాడని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ముఖేశ్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తోంది.(ఇంకా ఏం మిగిలి ఉంది: సుప్రీంకోర్టు) -
అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: నిర్భయ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ నలుగురు దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తలుపు తట్టారు. ఈ కేసు విచారణ తప్పులతడకగా సాగిందని, తమను బలిపశువులుగా చేసి, అన్యాయంగా శిక్ష విధించారని ఆరోపించారు. ‘మాకు పాలీగ్రాఫ్, లై డిటెక్టర్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పరీక్షలు కూడా చేయాలని కోరినా దర్యాప్తు అధికారులు పట్టించుకోలేదు. బాధితురాలి సన్నిహితులు చెప్పిన తప్పుడు సాక్ష్యం ఆధారంగా శిక్ష ఖరారు చేసి, మమ్మల్ని బలిపశువులుగా మార్చారు. దీనిపై ఐసీజే జోక్యం చేసుకుని తక్షణమే విచారణ జరపాలి’ అని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నలుగురు దోషులకు న్యాయపరమైన వెసులుబాటు మార్గాలు ఇంకా మిగిలి ఉండగానే తీహార్ జైలు అధికారులు ఈ నెల 20వ తేదీన ఉరిశిక్ష అమలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని దోషుల తరఫున లాయర్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు. అంతకుముందు.. న్యాయపరమైన తన హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ సమర్ధనీయం కాదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్లను కూడా తిరస్కరిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన దోషులు ముకేశ్ సింగ్(32), అక్షయ్ సింగ్(31), పవన్గుప్తా(25), వినయ్ శర్మ(26)కు ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఈనెల 5వ తేదీన తాజాగా న్యాయస్థానం వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తీహార్ జైలు అధికారులు తలారి పవన్ జల్లాడ్ను పంపాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ అధికారులకు లేఖ రాశారు. ముకేశ్, పవన్, వినయ్లు ఆఖరిసారిగా తమ కుటుంబసభ్యులను ముఖాముఖి కలుసుకున్నారు. అక్షయ్ కుటుంబసభ్యులు కూడా ఒకట్రెండు రోజుల్లో రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు ఇప్పటివరకు మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. -
మరో ట్విస్టు: ఐసీజేకు నిర్భయ దోషులు!
న్యూఢిల్లీ: ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ నిర్భయ దోషులు మరోసారి శిక్షను వాయిదా వేసేందుకు పావులు కదుపుతున్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ ఐసీజేలో ఈ మేరకు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ సోమవారం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరో దోషి ముఖేశ్ సింగ్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసిన నేపథ్యంలో ఈ ముగ్గురు ఐసీజేను ఆశ్రయించడం గమనార్హం. కాగా 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిని అత్యంత దారుణంగా హింసించి మరీ ఆరుగురు అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. దీనస్థితిలో ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. (ఇంకా ఏం మిగిలి ఉంది: సుప్రీంకోర్టు) ఈ క్రమంలో ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు నిందితులు రామ్సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించగా.. అప్పటి నుంచి శిక్ష అమలును వాయిదా వేసేందుకు దోషులు చట్టంలోని వివిధ సెక్షన్లను ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు తమను తాము కాపాడుకుంటున్నారు. ఇక మార్చి 20న నలుగురు దోషులను ఉరితీయాలంటూ డెత్ వారెంట్లు జారీ అయిన నేపథ్యంలో... తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతికి లేఖ రాయడం గమనార్హం.(‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’) చదవండి: శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి -
‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా ఉన్న ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు రాష్ట్రప్రతి రామ్నాథ్ కోవింద్కు ఆదివారం లేఖ రాశారు. తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని అభ్యర్థించారు. ‘‘కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని మిమ్మల్ని, బాధితురాలి తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నాం. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగవు. అదే విధంగా కోర్టు కూడా ఒకరికి బదులు ఐదుగురు వ్యక్తులను ఉరి తీసే పరిస్థితి రాదు’’ అని లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా.. ‘‘మన దేశంలో మహాపాపులను కూడా క్షమించారు. ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు. క్షమాగుణంలో కూడా శక్తి ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. కారుణ్య మరణం కోరిన వాళ్లలో దోషుల తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, పిల్లలు కూడా ఉన్నారు.(శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి) కాగా 2012లో పారా మెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేశ్ సింగ్ సహా మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. బాధితురాలిపై అత్యంత పాశవికంగా దాడి చేయడంతో ఆమె ప్రాణాలతో పోరాడి చివరకు సింగపూర్లోని ఆస్పత్రిలో కన్నుమూసింది. ఈ క్రమంలో అనేక వాయిదాల అనంతరం దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించగా.. శిక్ష అమలులో జాప్యం నెలకొంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడగా.. మార్చి 20న ఉరితీసేందుకు తాజాగా డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ముఖేశ్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సోమవారం అతడి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. (ఇంకా ఏం మిగిలి ఉంది: సుప్రీంకోర్టు) -
ఇంకా ఏం మిగిలి ఉంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ సింగ్ తాజా విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజాగా మరోసారి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరిన అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి అవకాశం మిగల్లేదు. నీకు క్షమాభిక్ష అడిగే అవకాశం లభించింది. అది తిరస్కరించబడింది. వారెంట్లు జారీ అయ్యాయి. క్యూరేటివ్ పిటిషన్ కూడా కొట్టివేశాం. ఇంకా ఏం మిగిలి ఉంది’’అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఉరిశిక్షను నిలుపుదల చేసే అవకాశాలు లేవని పేర్కొంది. (శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి) ఈ సందర్భంగా తన పట్ల నేరపూరిత కుట్ర పన్నారంటూ తన మాజీ లాయర్ వృందా గ్రోవర్పై చర్యలు తీసుకోవాలన్న ముఖేశ్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. రివ్యూ పిటిషన్ కొట్టివేసిన తర్వాత తేదీ నుంచి మూడేళ్లలోపు మరోసారి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుందని తన లాయర్ ఎంఎల్ శర్మ ద్వారా ముఖేశ్ గత వారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు ఉన్న అన్ని హక్కులను పునరుద్ధరించాలని, మరోసారి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు, క్షమాభిక్ష అడిగేందుకు జూలై 2021 నాటి వరకు అనుమతినివ్వాలని కోరాడు. ‘‘కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, వృందా గ్రోవర్తో పాటు సెషన్స్, హైకోర్టు సుప్రీంకోర్టుల్లో వాదించిన న్యాయమూర్తులు కలిసి పన్నిన కుట్రకు నేను బలయ్యాను. సెషన్స్ కోర్టు ఉత్తర్వులను బూచిగా చూపించి పలు పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు’’ అని ముఖేష్ తన పిటిషన్లో ఆరోపణలు గుప్పించాడు. కాగా నిర్భయ దోషులకు మార్చి 20న ఉదయం 5.30 నిమిషాలకు ఉరిశిక్ష అమలు చేసేందుకు డెత్వారెంట్లు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మరణశిక్ష అమలు తేదీని వాయిదా వేసేందుకు దోషులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.(మళ్లీ న్యాయ హక్కులు ఇవ్వండి) -
ఉమెన్స్ డే : రష్మి వ్యంగ్యాస్త్రాలు
యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. సామాజిక అంశాలపై స్పందించడంతో పాటు.. మూగ జీవాల రక్షణపై ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అంతేకాకుండా తన గురించి అసభ్యంగా కామెంట్లు చేసేవారికి ధీటైన సమాధానాలు కూడా ఇస్తారు. ఆదివారం(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ట్విటర్ వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి ట్వీట్లో మమ్మల్ని సూపర్ ఉమెన్ చేయడం ఆపండి అని ఓ ఫొటోను షేర్ చేశారు. మరో ట్వీట్లో మాత్రం కాస్త వ్యంగ్యంగా స్పందించారు. ‘ఓ మహిళ 8 ఏళ్ల నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న దేశంలో.. మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. హ్యాపీ ఉమెన్స్ డే’ అని రష్మి ట్వీట్ చేశారు. నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరు పెడుతున్న ఫొటోను కూడా ఆమె అందుకు జత చేశారు. నెటిజన్కు రష్మి కౌంటర్.. అంతకుముందు తనను ప్రశ్నించిన ఓ నెటిజన్కు రష్మి గట్టి కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ‘హోలీ వస్తుంది. కుక్కలపై రంగులు చల్లకండి. మనపై రంగు పడితే సబ్బుతో కడుక్కోవచ్చు. కానీ అవి ఆ పని చేయలేవు’ అని రష్మి ఓ ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై ఓ నెటిజన్ ‘అచ్చా.. ఈద్ సమయంలో ట్వీట్ చేయండి. హోలీ, దీపావళి ఉన్నప్పుడే మన పండగల ప్రతిష్టను తగ్గించేలా మీకు ఇలాంటివి గుర్తుకువస్తాయి’ అని ట్వీట్ చేశారు. దీనిపై రష్మి స్పందించారు. ఇలాంటి అర్థంలేని చెత్త కామెంట్లు చేసేటప్పుడు ఒకసారి చేసిన ట్వీట్లు అన్ని జాగ్రత్తగా చూడండి అని ఫైర్ అయ్యారు. కాగా, నటిగా కేరీర్ ఆరంభించిన రష్మి.. జబర్దస్త్ యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్గా నటించారు.(చదవండి : అనసూయకు చాలెంజ్ విసిరిన రష్మీ) #HappyWomensDay2020 pic.twitter.com/9vcTW6T5vM — rashmi gautam (@rashmigautam27) March 8, 2020 Go thru all my tweets before shitting nonsense on my wall https://t.co/YMubRobP7P — rashmi gautam (@rashmigautam27) March 8, 2020 -
మళ్లీ న్యాయ హక్కులు ఇవ్వండి
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. న్యాయవాదులు తప్పుదోవ పట్టించిన కారణంగా న్యాయపరంగా తనకు ఉన్న హక్కులన్నింటినీ మళ్లీ దఖలుపరచాలని కోరుతూ ఎం.ఎల్ శర్మ అనే న్యాయవాది ద్వారా శుక్రవారం ఓ పిటిషన్ వేశారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, కోర్టు సహాయకారిగా వ్యవహరించిన న్యాయవాది వృందా గ్రోవర్లు తనపై నేరపూరిత కుట్ర పన్నారని, మోసానికి పాల్పడ్డారని ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కూడా ముఖేష్ తన తాజా పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు తన క్యూరేటివ్ పిటిషన్ను కొట్టేసిన నాటి నుంచి న్యాయస్థానాలు ఇప్పటివరకూ జారీ చేసిన అన్ని ఉత్తర్వులను కొట్టివేయాలని, రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడాన్ని కూడా రద్దు చేయాలని కోరాడు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశముంది. సంతకాల కోసం బెదిరించారు ‘‘కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, వృందా గ్రోవర్తోపాటు సెషన్స్, హైకోర్టు సుప్రీంకోర్టుల్లో వాదించిన న్యాయమూర్తులు కలిసి పన్నిన కుట్రకు నేను బలయ్యాను. సెషన్స్ కోర్టు ఉత్తర్వులను బూచిగా చూపించి పలు పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు’ అని ముఖేష్ తన పిటిషన్లో పేర్కొన్నారు. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సంతకాలు పెట్టించాలని సెషన్స్ కోర్టు ఆదేశించినట్లు ప్రతివాదులు ముఖేష్ సింగ్తో చెప్పారని వివరించారు. -
శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి
న్యూఢిల్లీ: ‘‘నాకు చావు అంటే భయం లేదు. నా కూతురిపై ఆ మృగాళ్లు అత్యాచారం చేసిన రోజే నేను చచ్చిపోయాను. ఇప్పుడు కూడా నేను వాళ్లను నిందించాలనుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలోని లొసుగులు అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్న తీరును విమర్శిస్తున్నా’’ అని అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. దోషులకు వెంటనే శిక్ష అమలు చేయడం వల్ల తన కూతురు లాంటి ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడే సాహసం ఇకముందు ఎవరూ చేయలేరని పేర్కొన్నారు. ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం, పలు సార్లు దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేలు, అనేక పిటిషన్ల అనంతరం నిర్భయ దోషులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఆశాదేవి.. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. డిసెంబరు 16, 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తుచేసుకున్నారు. తన కూతురిపై జరిగిన అత్యాచార కాండ, హత్య, దోషులకు శిక్ష వేయించడానికి తాము చేసిన పోరాటం గురించి పంచుకున్నారు. మానవ హక్కుల పేరిట దోషులను రక్షిస్తున్నారంటూ విమర్శించారు. మరోసారి నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడితే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.(నిర్భయ దోషులను ఎప్పుడో చంపేశారు) తన జాడ తెలియలేదు.. శరీరమంతా రక్తం ‘‘ఆరోజు ఆదివారం. దాదాపు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో నిర్భయ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రెండు- మూడు గంటల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పింది. రాత్రి ఎనిమిది అవుతున్నా తన నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో తనకు పలుమార్లు ఫోన్ చేశాం. కానీ కాల్ కట్ అయ్యింది. వెంటనే నేను, నా కొడుకు బస్టాండ్కు వెళ్లి తనకోసం వెతికాం. అయినా తన జాడ తెలియరాలేదు. దాదాపు రాత్రి 10 గంటలకు అనుకుంటా. నిర్భయ వాళ్ల నాన్న ఇంటి వచ్చారు. ఆయన కూడా తనకోసం వెదకడం ఆరంభించారు. పదకొండు గంటల వరకు మేం బయటే నిల్చుని ఉన్నాం. తనకోసం ఎదురుచూస్తున్నాం. ఇంతలో సఫ్దార్జంగ్ ఆస్పత్రి నుంచి కాల్ వచ్చింది. మా ఆయన ఫోన్ ఎత్తగానే.. నిర్భయ ఆస్పత్రిలో ఉందని.. తనకు గాయాలయ్యాయని చెప్పారు. వెంటనే మేం అక్కడికి చేరుకున్నాం. ఆలోగా తనను ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. నన్ను చూడగానే నిర్భయ ఏడ్వడం మొదలుపెట్టింది. (తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని) తన శరీరమంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నాకు ఒక్కసారిగా ఏం అర్థంకాలేదు. నేర తీవ్రతను కూడా అంచనా వేయలేకపోయాం. అప్పుడే తన మీద ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. తన పెదాలు చీరుకుపోయి ఉన్నాయి. తన తల మీద చర్మం అంతా ఊడిపోయింది. ఒంటి నిండా కోతలు, గాయాలు, వాటి నుంచి కారుతున్న రక్తం. కొన్నిచోట్ల మాంసం కూడా బయటకు వచ్చింది. తన పరిస్థితి చూసి డాక్టర్లకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. తనను ఎలా బతికించాలో వారికి అంతుపట్టలేదు. ఇరవై ఏళ్ల కెరీర్లో తాను ఎంతో మందిని బతికించాను గానీ.... ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఓ సీనియర్ డాక్టర్ మాకు చెప్పారు. అంటే నా కూతురి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా మాలో ఆశ చావలేదు. తనకు స్పృహ వస్తుందని ఎంతగానో ఎదురుచూశాం. ఆశించినట్టే తను కళ్లు తెరిచింది. తనకు నయం అవుతుందని భావించాం. అయితే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తను బతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. తనకు స్పృహ వచ్చిన వెంటనే మంచినీళ్లు కావాలని అడిగింది. కానీ డాక్టర్లు అందుకు నిరాకరించారు. చెంచాడు నీళ్లు తాగేందుకు కూడా తన శరీరంలో ఏ వ్యవస్థ సహకరించదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నా కూతురు దాదాపు 10- 20 రోజులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. కానీ ఈ ప్రపంచం నుంచి ఒక్క చుక్క మంచినీరు కూడా తీసుకోలేకపోయింది’’అని ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటూ ఆశాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.(‘నా కూతురు బతికిలేదు.. చాలా సంతోషం’) తన న్యాయం పోరాటం గురించి చెబుతూ... ‘‘ గడిచిన ఏడు- ఎనిమిదేళ్ల కాలంలో మేం ఎక్కని కోర్టు మెట్టులేదు. మొదట జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు.. అనంతరం సుప్రీంకోర్టు ఇలా అన్నిచోట్లకు వెళ్లాం. సర్వోన్నత న్యాయస్థానం దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే మాకు న్యాయం జరిగినట్లేనని భావించాం. దోషుల రివ్యూ పిటిషన్ను 2018లో కోర్టు తిరస్కరించగానే సంతోషపడ్డాం. అప్పటి నుంచి నేటి దాకా ప్రతీ విచారణకు నేను హాజరవుతూనే ఉన్నాను. నా కుటుంబాన్ని వదిలేసి మరీ కోర్టుల చుట్టూ తిరిగాను. న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. (లాయర్ను తొలగించా.. టైం కావాలి: నిర్భయ దోషి) అయితే నా కూతురి పట్ల అత్యంత హేయంగా వ్యవహరించిన ఆ మృగాళ్లు తమ లాయర్ను అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తారని నేను అస్సలు ఊహించలేదు. వాళ్లను నేరస్థులుగా చిత్రీకరించామని వాళ్లకు వాళ్లు చెప్పుకోవచ్చు. వాళ్ల తీరు నన్నెంతగానో బాధ పెట్టి ఉండవచ్చు. వాళ్ల ఎత్తుగడల వల్ల... నా కూతురి మీద అత్యాచారం జరిగిందని నేను పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోంది. ఈ అయినా నేను పోరాటం ఆపలేదు. ఎందుకంటే ఇలాంటి అకృత్యాలు కేవలం నా కూతురి ఘటనతోనే ఆగిపోలేదు. ఆగిపోవు కూడా. వాళ్ల ఉరిశిక్ష వాయిదా పడటం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. ఇలాంటి దోషుల వల్లే న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయి.(సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా..) మానవ హక్కుల పేరిట వ్యాపారం.. ఇక ఎప్పుడైతే దోషుల మెడకు ఉరి బిగుసుకుపోతుందని వాళ్ల కుటుంబాలకు, లాయర్కు తెలుస్తుందో.. అప్పుడే వాళ్లు పేదవాళ్లు అనే సంగతి గుర్తుకువస్తుంది. ఇంకో విషయం.. ప్రపంచ మానవ హక్కుల సంస్థ.. ఇలాంటి నేరస్థుల హక్కుల గురించి మాట్లాడుతుంది. వాళ్లకు మద్దతుగా నిలుస్తుంది. పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి పేరు సంపాదించుకుంటుంది. మానవ హక్కుల పేరిట పెద్ద వ్యాపారమే చేస్తోంది’’అని ఆశాదేవి విమర్శించారు. ఒకవేళ ఇలాంటి నేరగాళ్లు బెయిలు మీద బయటకు వస్తే.. బాధితులను, బాధితుల కుటుంబాలను చంపడానికైనా సిద్ధపడతారు. తగులబెట్టేందుకు కూడా వెనుకాడరు. మన కూతుళ్లు సురక్షితంగా ఉండాలంటే.. ఇలాంటి మృగాళ్లను ఉరితీయాల్సిందే’’ అని అభిప్రాయపడ్డారు.(దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి) -
20న నిర్భయ దోషుల ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి వేయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన దారులు ముగిశాయని, కాబట్టి ఉరి తేదీ ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. దోషుల్లో ఒకడైన పవన్ ఇటీవల రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడం.. దాన్ని రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరి తేదీలు ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును చేరింది. దీంతో ఈ నెల 20న ఉదయం అయిదున్నరకు ఉరి వేయాల్సిందిగా అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా తెలిపారు. దీనికి ఎలాంటి నోటీసు అవసరం లేదని ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి స్పందిస్తూ.. ఈ నెల 20 ఉదయం తమ జీవితాల్లో వెలుగు నింపే ఉదయమని చెప్పారు. దోషుల మరణాన్ని చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చట్టంలోని లొసుగులను దోషులు చక్కగా ఉపయోగించుకుంటున్నారని, ఏది జరగకూడదో అదే జరుగుతోందని శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్నా తెలిపింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజలు కోర్టుల మీద నమ్మకం కోల్పోరని భావిస్తున్నట్లు చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఖరారు చేశాక అవి అమలు జరిగితీరాలని చెప్పింది. దానిపై 23న విచారిస్తాం: సుప్రీంకోర్టు నిర్భయ కేసు దోషులను ఒకేసారి ఉరితీయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 23న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఒకే నేరానికి సంబంధించిన దోషులను వేరువేరుగా ఉరి తీసే అంశంపై లోతుగా పరిశీలన జరుపుతామని చెప్పింది. ఢిల్లీలోని ట్రయల్ కోర్టు మార్చి 20న దోషులకు ఉరిని ఖరారు చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. దోషులు చట్టంలోని లొసుగులతో ఆడుకుంటున్నారని చెప్పారు. ఈ నెల 23న విచారణ జరుగుతుందని, ఇకపై వాయిదాలు ఉండబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. -
నిర్భయ దోషులను ఎప్పుడో చంపేశారు
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార కేసులో ఇద్దరు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తాల తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్ న్యాయ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను మార్చి 20న ఉరితీయాలంటూ పటియాల హౌస్కోర్టు కొత్త డెత్వారెంట్లు జారీచేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డెత్వారెంట్ల జారీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దోషులకు నాలుగు సార్లు డెత్వారెంట్ల జారీచేసి, వారిని నాలుగు సార్లు చంపేశారు. వారేమీ ఉగ్రవాదులు కాదు. భయంకరమైన నేరస్తులుగా చిత్రీకరించి మీడియా వారిని ఎప్పూడో చంపేసింది’ అని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను న్యాయవ్యవస్థ చేసిన హత్యగా ఆయన వర్ణించారు. కాగా ఢిల్లీ నడిబొడ్డున ఘోరమైన ఘటనకు పాల్పడిన నలుగురు దోషులను ఉరిశిక్ష నుంచి కాపాడుతున్న దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పేరు ఇటీవల సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. (వారి చావును చూడాలనుంది) నిర్భయపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాకుండా, చట్టంలోని అవకాశాలను ఉపయోగించుకుని, పదే పదే ఉరిశిక్షను వాయిదా వేయిస్తున్నందుకు కూడా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. నిర్భయపై అత్యాచారం జరగడానికి ఆమె వేసుకున్న దుస్తులూ, ఆమె జీవన విధానం కారణమని ఆయన గతంలో లింగ వివక్షతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ‘నా కూతురు ఇలా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంటే సజీవంగా దహనం చేసేవాడిని. ఇలాంటి ఘటన జరగనిచ్చేవాడిని కాదు’ అని కూడా అన్నారు.కాగా దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అంశాలు దాదాపు మూసుకుపోయాయి. నలుగురు దోషుల రివ్యూ పిటిషన్లతో పాటు క్షమాభిక్ష పిటిషన్ను కూడా దాఖలు చేయడం, తిరస్కరించడం వంటిని పూర్తి అయ్యాయి. దీంతో మార్చి 20న ఖచ్చితంగా శిక్ష అమలై తీరుతుందని నిర్భయ తరఫు న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్లు) -
వారి చావును చూడాలనుంది : ఆశాదేవి
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార దోషులకు పటియాల హౌస్కోర్టు తాజాగా డెత్వారెంట్లు జారీచేయడంపై ఆమె తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. దోషుల ఉరితీతపై గురువారం విచారణ సందర్భంగా కోర్టు వద్దకు చేరుకున్న ఆమె.. తీర్పు అనంతరం ఆమె తరఫున వాదించిన న్యాయవాదిని కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. డెత్వారెంట్లు జారీ అనంతరం ఆశాదేవి మీడియా మాట్లాడారు. ‘నా కూతురిపై అత్యాచారం జరిపిన నలుగురు దోషులను ఉరితీసే సమయం ఆసన్నమైంది. నలుగురు కామాంధులను ఉరితీసిన రోజే నా కూతురికి న్యాయం జరిగినట్టు. అదే మాకు పెద్ద విజయం. ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటం విచారం. ఇక వారికున్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోయాయి. దోషులు చట్టం నుంచి ఇక తప్పించుకోలేరు. అవకాశం ఉంటే.. వారి చావును నాకు చూడాలని ఉంది’ అని అన్నారు. (నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ) నిజానికి ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం 6 గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉరితీత మూడోసారి వాయిదాపడింది. తాజాగా ట్రయల్కోర్టు కొత్త డెత్వారెంట్లు జారీచేస్తూ మార్చి 20న ఉరితీయాలని ఆదేశించింది. అయితే దోషులకు ఉన్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోవడంతో ఈసారి శిక్ష అమలు జరిగి తీరుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్లు జారీ
-
నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్లు
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార కేసులో దోషులకు ఢిల్లీ పటియాల హౌస్కోర్టు కొత్త డెత్వారెంట్లు జారీచేసింది. మార్చి 20న ఉదయం 5.30 నిమిషాలకు నలుగురు దోషులను ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. తీహార్ జైల్లో దోషులను ఉరితీయానున్నారు. కాగా ఈ విధంగా డెత్వారెంట్లు జారీచేయడం ఇది నాలుగోసారి. గత మూడుసార్లు దోషులను కోర్టులను ఆశ్రయించడంతో ఉరితీత వాయిదా పడిన విషయం తెలిసిందే. నిజానికి, ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం ఆరు గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించడంతో శిక్షను నిలిపివేశారు. -
అన్ని పూర్తయ్యాయి, ఇక మిగిలింది ఉరే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2012 నిర్భయ సామూహిక హత్యాచార కేసులో దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తాజాగా తోసిపుచ్చారు. దీంతో మరణశిక్షను తప్పించుకునేందుకు మొత్తం నలుగురు దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు దాదాపు పూర్తి అయ్యాయి. దీంతో నిర్బయ దోషుల ఉరిశిక్షకు లైన్ క్లియర్ అయినట్టుగానే భావించవచ్చు. అయితే రాష్ట్రపతి నిర్ణయంపై పవన్ గుప్తా న్యాయ సమీక్షను కోరే అవకాశం లేకపోలేదు. ఈ నెలలో దోషులను ఉరితీస్తారని ఆశిద్దామంటూ నిర్భయ తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తాజా పరిణామంపై నిర్భయ తల్లిదండ్రుల తరపు వాదిస్తున్న న్యాయవాది సీమా ఖుష్వాహా మాట్లాడుతూ ఇక మిగిలింది ఉరిశిక్ష అమలేనని పేర్కొన్నారు. నలుగురు దోషుల ఉరిశిక్షకు సంబంధించిన తాజా తేదీని నిర్ణయించేలా ఢిల్లీ కోర్టును అశ్రయించనున్నామని తెలిపారు. అక్షయ్ ఠాకూర్ (31) పవన్ గుప్తా (25) వినయ్ శర్మ (26) ముఖేష్ సింగ్ (32) దోషులందరికి అన్ని అవకాశాలు ముగిసాయి...ఇక ఇపుడు నిర్ణయించే తేదీ తుది తేదీ అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు ఉరిశిక్ష అమలు వివిధ న్యాయపరమైన అడ్డంకుల కారణంగా ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. Seema Khushwaha, Lawyer of Nirbhaya's parents: We are moving a fresh application in Delhi court to fix a fresh date for the execution of the four convicts. All the convicts have exhausted their complete rights. The date which will be fixed now will be the final date. pic.twitter.com/UADL2sobsa — ANI (@ANI) March 4, 2020 -
ఉరి మళ్లీ వాయిదా
-
వాయిదాల ఉరి.. న్యాయమేదరి?
న్యూఢిల్లీ: యావత్ దేశాన్నీ కుదిపేసిన నిర్భయ పై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు శతవిధాలా యత్నిస్తున్నారు. న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రతిసారీ నిర్భయ తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. మృత్యువు తరుముకొస్తున్న ప్రతి సందర్భంలోనూ దోషుల తరఫు న్యాయవాదులు చట్టపరిధిలో శిక్ష అమలును అడ్డుకుంటూనే ఉన్నారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా పడడం ఇది మూడోసారి. న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకునే హక్కు దోషులకుందన్న న్యాయ నిబంధనల నేపథ్యంలో మరణశిక్ష వాయిదా పడుతూ వస్తోంది. మరణశిక్ష పడిన దోషులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా, లేదా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవడం ద్వారా శిక్ష అమలు కొంతకాలం వాయిదా పడేలా చేసుకోవచ్చు. ఒకసారి క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించినట్టయితే, తిరస్కరణను సవాల్ చేస్తూ కూడా కోర్టుకి వెళ్ళొచ్చు. ఇలాంటి అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటూ మరణశిక్షని వాయిదా వేస్తూ వచ్చారు దోషులు. చివరకు తలగోడకేసి కొట్టుకొని కూడా అనారోగ్యం, గాయాలు అయ్యాయన్న నెపంతో ఉరిశిక్షని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ► జనవరి 22, 2020: ఈ కేసులో జనవరి 7న ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు దోషులు నలుగురినీ జనవరి 22న ఉరితీయాలని తీర్పునిచ్చింది. ► ఫిబ్రవరి 1, 2020: అయితే ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించారు. క్షమాభిక్ష తిరస్కరణ అనంతరం ఉరిశిక్షకు 14 రోజుల గడువివ్వాలన్న నిబంధనల మేరకు జనవరి 17న ఢిల్లీ కోర్టు నిర్భయ దోషుల ఉరిశిక్షను తిరిగి వాయిదా వేసి, ఫిబ్రవరి 1న దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంది. ► పవన్ గుప్తా 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్నంటూ జనవరి 17న సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దీంతో రెండోసారి ఉరి ఆగిపోయింది. ► మార్చి 3, 2020: తిరిగి ఫిబ్రవరి 17న కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసింది. దీనిప్రకారం మార్చి 3న నలుగురికీ ఉరిశిక్ష అమలు జరగాల్సి ఉంది. సోమవారం తాజాగా మూడోసారి మరణశిక్ష వాయిదా పడింది. -
ఉరి మూడోసారీ?
న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరిశిక్ష అమలు మూడోసారి కూడా వాయిదాపడింది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. క్షమాభిక్ష ఒక ముఖ్యమైన రాజ్యాంగబద్ధ అవకాశం అని కోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి, ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ నేటి(మార్చి 3) ఉదయం ఆరు గంటలకు ఉరితీయాల్సి ఉంది. తాజా, ఆదేశాలతో ఆ ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండగా మరణ శిక్ష విధించడం సరికాదని అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రానా స్పష్టం చేశారు. బాధితుల వైపునుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్ప టికీ.. ఏ దోషి అయినా తనకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలనూ వినియోగించుకోకుండా ఆపకూడదని ఆయన పేర్కొన్నారు. క్షమాభిక్ష పిటిషన్ ఒక ముఖ్యమైన చట్టబద్ధ అవకాశం అనీ, అందుకే ఉరిని వాయిదా వేయడానికి తాను సంకోచించడం లేదన్నారు. మరణ శిక్షపై స్టే విధించాలన్న పవన్ గుప్తా చేసుకున్న విజ్ఞప్తిపై ఆదేశాలను రిజర్వులో ఉంచిన కోర్టు.. క్యూరేటివ్, మెర్సీ పిటిషన్లను ఆలస్యంగా దాఖలు చేయడంపై దోషి తరపు న్యాయవాది ఏపీ సింగ్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. జాగ్రత్త’ అని ఆయనపై మండిపడింది. ఎవరైనా తప్పు చేస్తే పరిణామాలెలా ఉంటాయోమీకు తెలుసనే అనుకుంటున్నామని హెచ్చరించింది. విచారణ మంగళవారం కొనసాగుతుందని తెలిపింది. (నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా?) కాగా, పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్ని సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరణ శిక్షపై స్టే విధించాలని కోరుతూ అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలు దాఖలుచేసుకున్న పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ముకేశ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్ల క్షమాభిక్ష పిటిషన్లను ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరణను సవాల్ చేస్తూ ముకేశ్, వినయ్ కుమార్లు విడివిడిగా దాఖలు చేసుకున్న పిటిషన్లను సైతం సుప్రీంకోర్టు గతంలో కోర్టు తోసిపుచ్చింది. అయితే అక్షయ్ కుమార్ మాత్రం తన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకి వెళ్లలేదు. వ్యవస్థ వైఫల్యం: నిర్భయ తల్లి నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష మరోమారు వాయిదాపడడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోందనీ, ఈ దేశంలో న్యాయం ఎలా ఆలస్యం అవుతోందో ప్రపంచమంతా గమనిస్తోందనీ ఆమె వ్యాఖ్యానించారు. రోజు రోజుకీ విశ్వాసాన్ని కోల్పోతున్నాననీ, అయినా గట్టిగా నిలబడతాననీ, ఏం చేసినా దోషులకు ఉరిశిక్ష పడాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. అయితే కోర్టులు మాత్రం చోద్యం చూస్తూ కూర్చుంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. (నిర్భయ కేసు : మరో కీలక పరిణామం) ఇది వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ దేశంలో న్యాయం ఎలా ఆలస్యం అవుతోందో ప్రపంచమంతా గమనిస్తోంది. ఏం చేసినా దోషులకు ఉరిశిక్ష పడాల్సిందే. – నిర్భయ తల్లి ఆశాదేవి ఎవరీ ఏపీ సింగ్? నిర్భయ హత్యాచారం కేసులో ఇద్దరు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తాల తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారారు. నిర్భయపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాకుండా, చట్టంలోని అవకాశాలను ఉపయోగించుకుని, పదే పదే ఉరిశిక్షను వాయిదా వేయిస్తున్నందుకు కూడా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. నిర్భయపై అత్యాచారం జరగడానికి ఆమె వేసుకున్న దుస్తులూ, ఆమె జీవన విధానం కారణమని ఆయన గతంలో లింగ వివక్షతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నా కూతురు ఇలా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంటే సజీవంగా దహనం చేసేవాడిని. ఇలాంటి ఘటన జరగనిచ్చేవాడిని కాదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పదే పదే ఉరిశిక్ష అమలు వాయిదా పడుతుండటంపై ఆప్ నేత మనీశ్ సిసోడియా ‘వ్యవస్థని నవ్వుల పాలు చేస్తున్నారు’ అని విమర్శించారు. -
నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా
-
నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. డెత్వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై పటియాల హౌస్కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దోషులను ఉరి తీయవద్దంటూ తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. పిటిషన్పై విచారణ ముగిసే వరకు ఉరి నిలుపుదల చేయాలని పేర్కొంది. మార్చి 3న (మంగళవారం) నలుగురు దోషులను ఉరితీయాలంటూ ఇదివరకే కోర్టు డెత్వారెంట్లు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా శిక్ష అమలుపై స్టే ఇవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. (క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి) గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1, మార్చి3 ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్ వారెంట్లపై పటియాల కోర్టు స్టే ఇచ్చింది. మరోవైపు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్ను రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మార్చి 3న దోషులను ఉరి తీయడం దాదాపు ఖరారే అనుకున్నారంతా. ఈ క్రమంలోనే ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. -
నిర్భయ: ‘వారి పట్ల మానవ కనికరం అవసరం’
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు రేపు (మంగళవారం) ఉరి శిక్ష విధించనున్న నేపథ్యంలో దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీం కోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్భయ దోషుల అవయవాలను దానం చేయాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. ఓ వ్యక్తి చనిపోవడం వల్ల.. ఆ కుటుంబానికి తీరని శోకం మిగులుతుందని, అవయవ దానం కోసం దోషుల మృతదేహాలను ముక్కలు చేయడం సరికాదని చెప్పింది. వారి పట్ల మానవ కనికరం కలిగి ఉండాలని పేర్కొంది. అవయవ దానం అనేది స్వచ్ఛందంగా జరగాలని సుప్రీంకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. (చదవండి: క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి) ఉరిశిక్ష ఎదుర్కోనున్న నలుగురు దోషుల అవయవాలు దానం చేసే వీలు కల్పించాలని మాజీ న్యాయమూర్తి ఎంఎఫ్ సల్దానా తన పిటిషన్లో కోరారు. ఇకపై మరణ శిక్షకు గురైన వారి అవయవాలను సైతం దానం చేసే దిశగా మార్గదర్శకాలు జారీ చేయాలని సల్దానా పిటిషన్లో పేర్కొన్నారు. దీంతోపాటు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్గుప్తా దాఖలు చేసిన పిటిషన్ను సైతం సుప్రీం కోర్టు నేడు కొట్టివేసింది. ఇక పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొన్ని గంటల వ్యవధిలోనే తిరస్కరించారు. అలాగే డెత్వారెంట్పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు కూడా నిరాకరించింది. దీంతో నలుగురు దోషులను రేపు (మంగళవారం) ఉదయం ఆరుగంటలకు తీహార్ జైల్లో ఉరితీయానున్నారు. దీని కొరకు జైలు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. -
క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి
-
క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న నిర్భయ అత్యాచార, హత్య దోషుల ఉరిశిక్షలో కీలక పరిణామం చోటుచేసకుంది. దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్ను రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. శిక్ష అమలుకు సమయం దగ్గరపడుతుండటంతో.. సోమవారం ఉదయమే ఆయన క్షమాభిక్ష పెట్టుకున్నారు. దీనిని పరిశీలించిన రాష్ట్రపతి క్షమాభిక్షకు దోషులు అనర్హులని తిరస్కరించారు. కాగా ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ పవన్గుప్తా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం ఇదివరకే కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే డెత్వారెంట్పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు కూడా నిరాకరించింది. దీంతో నలుగురు దోషులను రేపు (మంగళవారం) ఉదయం ఆరుగంటలకు తీహార్ జైల్లో ఉరితీసే అవకాశం ఉంది. -
నిర్భయ దోషులకు రేపే ఉరి ...
-
నిర్భయ దోషులకు రేపే ఉరి..!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ తొలగింది. డెత్వారెంట్పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు నిరాకరించింది. దీంతో రేపు(మార్చి 3) ఉదయం 6గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. మరోవైపు తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త పెట్టుకున్న పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. దీంతో నలుగురు దోషులకు రేపు తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలు అయ్యే అవకాశం ఉంది. (చదవండి : మార్చి 3న ఉరితీయండి ) అయితే పవన్కి ఇంకా రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. మరో వైపు ఈ కేసులో ఉరి అమలు వాయిదా పడేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంతో గతంలో రెండు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అన్నీ అడ్డంకులు తొలిగిపోవడంతో రేపు ఉదయం ఆరు గంటలకు నలుగురు నిందితులను తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. -
నిర్భయ కేసు : మరో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార కేసులో మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. 2012 సామూహిక హత్యాచార కేసులో దోషి పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త పెట్టుకున్న పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. ఈ పిటిషన్ విచారణకు ఎలాంటి కొత్త అంశాలు లేవని స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల (అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమాన్, భానుమతి, అశోక్ భూషణ్) ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అయితే రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం పవన్ గుప్తాకు ఇంకా మిగిలే ఉంది. చదవండి : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా?