![Pawan Jallad arrives at Tihar before scheduled hanging in Nirbhaya case - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/30/pawan.jpg.webp?itok=c0DGHZIH)
సాక్షి, న్యూఢిల్లీ: 2012 నిర్భయ హత్యాచార ఘటనలో దోషులకు మరో రెండు రోజుల్లో ఉరి శిక్ష అమలు కానున్న నేపథ్యంలో మీరట్కు చెందిన తలారి పవన్ జల్లాద్ తీహార్ జైలుకు చేరుకున్నారు. ఉరి శిక్ష అమలు సంబంధించిన వస్తువులను పర్యవేక్షించనున్నారని తీహార్ జైలు అధికారులు గురువారం వెల్లడించారు. మూడవ తరానికి చెందిన పవన్ జైలు ప్రాంగణంలోనే ఉంటారని, తాడు బలం, ఇతర సంబంధిత వస్తువులను తనిఖీ చేస్తారని తెలిపారు.
న్యాయపరమైన చిక్కులేవీ ఎదురుకాకుండా వుంటే నిర్భయ కేసులో నలుగురు దోషులైన పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు వచ్చే నెల 1వ తేదీన ఉరిశిక్ష అమలు కానున్న విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో నలుగురిని ఉరి తీసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు దోషుల వరుస పిటిషన్లతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఉరిశిక్ష అమలు ఒకసారి వాయిదా పడింది. తమ ఉరిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేయగా దీన్ని కొట్టివేసింది. మరోవైపు, ఉరిశిక్షను యావజ్జీ ఖైదుగా మార్చాలని కోరుతూ నిర్భయ దోషి అక్షయ్ కుమార్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఎన్వి రమణ, అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమన్, ఆర్ బానుమతి, అశోక్ భూషణ్తో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అయితే అక్షయ్ కుమార్ సింగ్ ఇప్పుడు రాష్ట్రపతిని క్షమాబిక్ష కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై మరోసారి సందిగ్ధత నెలకొంది.
చదవండి : నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు
Comments
Please login to add a commentAdd a comment