
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించడంపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఒత్తిళ్లు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రౌత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం తమ పార్టీ పత్రిక సామ్నాలో రోక్తోక్ అనే తన కాలమ్లో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడం ముంబై పోలీసులను అవమానించినట్లేనన్నారు. సీబీఐని కేంద్రం ఎలా దుర్వినియోగం చేసుకుందో తన కాలమ్లో పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర ఏజెన్సీ అయినప్పటికీ, అది నిష్పాక్షికంగా దర్యాప్తు జరపదని అనేకసార్లు నిరూపించబడిందని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి : సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి ఇదే: రియా)
‘పలు రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని నిషేధించాయి. శారదా చిట్ ఫండ్ కేసులో జోక్యం చేసుకున్నందుకు సీబీఐకి వ్యతిరేకంగా బెంగాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అంతేకాదు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో ఉన్నప్పుడు సీబీఐపై ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల కేసును సీబీఐకి బదిలీ చేయడాన్ని వారు వ్యతిరేకించారు. సుశాంత్ కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తే తప్పేంటి? అని సంజయ్ ప్రశ్నించారు. అలాగే ఓ వర్గం మీడియా సహాయంతో బీజేపీ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.
(చదవండి : సుశాంత్ తండ్రికి హర్యానా సీఎం పరామర్శ)
Comments
Please login to add a commentAdd a comment