ఆ రెండు బోట్లు ఎవరివి? ఏమయ్యాయి? | TDP Yellow Media Continue Blaming YSRCP On Prakasam Barrage Incident | Sakshi
Sakshi News home page

ఆ రెండు బోట్లు ఎవరివి? ఏమయ్యాయి?

Published Wed, Sep 11 2024 6:16 PM | Last Updated on Wed, Sep 11 2024 6:53 PM

TDP Yellow Media Continue Blaming YSRCP On Prakasam Barrage Incident

ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనలో కుట్ర కోణం ఉంది. కావాలనే వీటిని పంపించారు. ఆ బోట్లపై వైఎస్సార్‌సీపీ రంగులు ఉన్నాయి. కాబట్టి, ఇది ఆ పార్టీ నేతల కుట్రే.. అంటూ గత వారం రోజులుగా సీఎం చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ నేతలు.. వీళ్లకు తోడైన అనుకూల మీడియా-సోషల్‌ మీడియా పేజీలు కథనాలను అరిగిపోయేలా ప్రచారం చేస్తున్నాయి. అదే టైంలో బోట్ల యాజమానుల్ని పోలీసులు అరెస్ట్‌ చేయగానే.. వాళ్లు వైఎస్సార్‌సీపీ నేతలంటూ ప్రచారం మొదలుపెట్టాయి. అయితే..

ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటన కేసులో అరెస్టైన ఇద్దరూ టీడీపీకి చెందినవాళ్లే. ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది వైస్సార్‌సీపీ. దీంతో ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగిపోయింది. అయినా కూడా వైఎస్సార్‌సీపీపై బుదర జల్లడం ఆపలేదు టీడీపీ. ఇంకోవైపు.. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు బ్యారేజీని ఢీ కొట్టిన మరో రెండు బోట్ల గురించి మాత్రం పెదవి విప్పడం లేదు.

ఆగస్ట్ 30, 31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్ 1 రాత్రి నాటికి ప్రకాశం బ్యారేజీకి దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో 70 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఆ సమయంలోనే ఆ వరద ప్రవాహంలో గొల్లపూడి వైపు నుంచి బోట్లు కొట్టుకుని వచ్చాయి. అందులో రెండు బోట్లు అప్పటికే దిగువకు వదులుతున్న నీటితో పాటు కొట్టుకుపోగా.. మరో మూడు బోట్లు మాత్రం బ్యారేజ్‌ పిల్లర్లను ఢీకొట్టి అక్కడే పిల్లర్లు, గేట్ల మధ్య ఇరుక్కుపోయాయి. ఆ బోట్లు ఢీకొట్టడంతో పిల్లర్ నెంబర్ 69కి సంబంధించిన కౌంటర్ వెయిట్ (కాంక్రీట్ బీమ్) విరిగింది.

ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్‌ను బోట్లు ఢీకొట్టిన ఘటనలో విజయవాడ వన్ టౌన్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్లే కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి, సూరాయపాలేనికి చెందిన కోమటి రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరూ వైఎస్సార్‌సీపీ వాళ్లంటూ టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. అయితే వైఎస్సార్‌సీపీ అసలు విషయాన్ని బయటపెట్టింది.

కోమటి రామ్మెహన్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధి కోమటి జయరాం బంధువు. రెండో నిందితుడు ఉషాద్రి కూడా టీడీపీకి చెందిన వ్యక్తే. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ గెలిచాక విజయోత్సవ ర్యాలీలు సైతం ఆ బోట్లలో నిర్వహించారు కూడా. అయితే..

ఘటన జరిగి ఇన్నిరోజులైనా పోలీసులు, ప్రభుత్వం, టీడీపీ అనుకూల మీడియా.. ఇలా అందరి ప్రకటనలు నిలిచిపోయిన ఆ మూడు బోట్లపైనే నడుస్తోంది. కేవలం వాటి రంగు ఆధారంగా కుట్రకోణంలో వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించాలనే కుట్ర బలంగా నడుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో ఇదే కోణాన్ని హైలెట్‌ చేస్తున్నారు. మరి బ్యారేజ్‌ కౌంటర్‌ వెయిట్స్‌ను ఢీ కొట్టిన ఆ రెండు పడవలు ఎవరివి?.. 

ఇక్కడ దిగువకు కొట్టుకుపోయిన ఆ రెండు బోట్లను పోలీసులు గుర్తించలేదు. వాటి యాజమానులను అదుపులోకి తీసుకుని విచారించలేదు. వాస్తవానికి వరద ఉధృతిని ఆ బోట్లతో పాటు టూరిజంకు చెందిన చిన్నాచితకా బోట్లు కూడా కొట్టుకుపోయాయి. కానీ, ప్రభుత్వం కళ్లు మాత్రం ఆగిపోయిన ఆ బ్లూ రంగు బోట్ల మీదే ఉండిపోయింది. అందుకే ఇది వైఎస్సార్‌సీపీ పనేనంటూ అసత్య ప్రచారం చేస్తోంది. దానికి తగ్గ కోణంలోనే.. ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తు సాగింది. మరోవైపు.. వాస్తవాల్ని మరుగున పెట్టి విషప్రచారం కొనసాగిస్తూనే ఉంది ఎల్లో మీడియా. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement