
సాక్షి, అమరావతి: చరిత్రలో రాష్ట్రంలోను, ఉమ్మడి రాష్ట్రంలోను బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీచరణ్ చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల్లో 68.18 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే.
అదే టీడీపీ హయాంలో శాసనమండలిలో టీడీపీ సభ్యుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 37.5 శాతమే. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన బీసీలను తోకలు కత్తిరిస్తానని అవహేళన చేసిన చంద్రబాబు.. గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు రాజ్యసభకు అవకాశం కల్పించకుండా.. ఓడిపోతారని తెలిసినప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆయా వర్గాల పట్ల తనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో బయటపెట్టుకున్నారు.
సామాజిక సాధికారత కోసం నిబద్ధతతో వైఎస్ జగన్ పని చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో కురుబ సామాజికవర్గానికి చెందిన నాకు మంత్రి పదవి ఇవ్వడమే అందుకు నిదర్శనం. మా సామాజికవర్గంలో నేనే మొదటి మహిళా మంత్రిని. జగన్ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’ అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment