
నల్లగొండ: సీఎం కేసీఆర్ అసమర్థత వల్లనే నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని నల్లగొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు ఆరోపించారు. శనివారం నల్లగొండలోని ఉత్తమ్ నివాసంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతీవిషయంలో కేసీఆర్ కేంద్రానికి మద్దతు పలుకుతూ వచ్చారని.. కానీ, కేంద్రం మాత్రం నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు.
అనుమతి తీసుకున్న తర్వాతే ప్రాజెక్టుల పనులు చేపట్టాలని కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని, అయితే ఏపీలో ప్రాజెక్టులు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయని తెలిపారు. కృష్ణా బోర్డుపై విడుదల చేసిన నోటిఫికేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకురావాలని సూచించారు. శ్రీశైలం సొరంగమార్గం పూర్తయితే గ్రావిటీ ద్వారా సాగునీరు అందడంతోపాటు కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందన్నారు. సీఎం దళితులపై కపట ప్రేమ కురిపిస్తున్నారని, ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వకపోతే నియోజకవర్గాల్లో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.