
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యలపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పది సవరణలు ప్రతిపాదించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవడం, వైజాగ్ రైల్వేజోన్ నోటిఫై చేయకపోవడం, రెండేళ్లవుతున్నా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్వహణ జరగకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ సవరణలు ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు 2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయానికి ఆమోదం అంశం, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాలను ప్రస్తావించకపోవడంపై సవరణలు ప్రతిపాదించారు.
ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీకి ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ అమలుపై విధివిధానాలను ప్రస్తావించకపోవడంపై సవరణ ప్రతిపాదించారు. పార్లమెంట్, రాష్ట్ర శాసన సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్దేశించిన బిల్లు 2010 మార్చిలో రాజ్యసభలో ఆమోదం పొందిందని, దాని గురించి రాష్ట్రపతి ప్రస్తావించలేదని సవరణ పెట్టారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశంపై, నదుల అనుసంధానం, ఉపాధి పని దినాలు 100 నుంచి 150 రోజులకు పెంచడంపై, పీఎం కిసాన్ సమ్మాన్ సాయాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై విజయసాయిరెడ్డి సవరణలు ప్రతిపాదించారు.
స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలని విజయసాయిరెడ్డి కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలు ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం చేయాలన్న ఆలోచనను కేంద్రం విరమించుకోవాలన్నారు. వైఎస్సార్ హయాంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎనలేని కృషి చేశారని, అదే స్ఫూర్తితో ఇప్పుడు తాము కూడా ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాజీలేని పంథాను అనుసరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment