
సాక్షి, కరీంనగర్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సెంచరీ కొడతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ నమోదైందని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ విమర్శలు చేస్తూ పోలింగ్పై తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత బుధవారం తొలిసారి కరీంనగర్కు వచ్చిన కవిత పాత బజార్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి అభిషేకం నిర్వహించి గౌరీమాత పూజలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్తో కలిసి శివాలయంతో పాటు దాని ప్రక్కనే ఉన్న కరీముల్లాషా దర్గాను సందర్శించి చాదర్ కప్పి ప్రార్థనలు చేశారు. ( గణేష్ గుప్తాకు సీఎం కేసీఆర్ పరామర్శ)
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బండి సంజయ్ ఎంపీ అయి రెండేళ్లు అవుతున్న సందర్భంగా కరీంనగర్కు ఏం చేశారో ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్కు రావలసిన త్రిబుల్ ఐటీ ఎందుకు రాకుండా పోయిందో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. కరీంనగర్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకై కృషి చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment