‘జగన్‌కు షర్మిల రాసిన లేఖ బాబుకు ఎలా చేరింది?’ | Ysrcp Mp Vijayasai Reddy Comments On Sharmila | Sakshi
Sakshi News home page

‘జగన్‌కు షర్మిల రాసిన లేఖ బాబుకు ఎలా చేరింది?’

Published Sun, Oct 27 2024 11:35 AM | Last Updated on Sun, Oct 27 2024 12:40 PM

Ysrcp Mp Vijayasai Reddy Comments On Sharmila

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కాకూడదనే అజెండాతోనే షర్మిల పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చు.. ఆమెది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా అంటూ  ఆయన ధ్వజమ్తెతారు.

చంద్రబాబుతో కలిసికుట్ర..
‘‘షర్మిల ప్రెస్‌మీట్లు 95 శాతం జగన్‌ను విమర్శించడానికే.. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల ప్రెస్‌మీట్లు. షర్మిల.. బాబుతో కలిసి పనిచేస్తున్నారు. తల్లికి, చెల్లికి అన్యాయం అంటూ చంద్రబాబు చెప్పించారు. జగన్‌పై మహిళల్లో వ్యతిరేకత రావాలని బాబు మాట్లాడిస్తున్నారు. జగన్‌కు షర్మిల రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరింది?’’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

 వైఎస్సార్‌ మరణానికి ముందు బాబు మాటలు గుర్తులేవా?
‘‘వైఎస్సార్‌ ఘోరమైన మరణం పొందుతారని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్‌ మరణానికి ముందు చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తులేదా?. ప్రత్యర్థికి మేలు చేసేందుకు సొంత అన్నకు అన్యాయం చేస్తున్నారు. ఎల్లో మీడియాతో కలిసి జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మీ తండ్రి మరణానికి కారణమైన వ్యక్తులతో చేతులు కలుపుతారా?. చంద్రబాబుతో కలిసి జగన్‌పై కుట్ర పన్నడం న్యాయమేనా?. షర్మిల చేసే పనికి దివంగత వైఎస్సార్‌ ఆత్మ క్షోభిస్తుంది.’’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.

బాబు మేలు కోసం సొంత అన్ననే మోసం చేస్తావా?
‘‘చంద్రబాబు అత్యంత దుర్మార్గుడు.. ఆయనతో స్నేహం ఎంతమాత్రం మంచిది కాదు. వైఎస్సార్‌ మృతికి కారణమైన కాంగ్రెస్‌,బాబుతో చేతులు కలుపుతారా?. మీ అన్నను జైల్లో పెట్టి హింసించిన కాంగ్రెస్‌లో ఉంటారా?. చంద్రబాబు మేలు కోసం సొంత అన్నను మోసం చేస్తారా?. ఇలాంటి విషపు పామును ఎక్కడా చూడలేదు. వైఎస్సార్‌ ఉన్నప్పుడే జగన్‌, షర్మిలకు ఆస్తులు పంచారు. చెల్లిపై ప్రేమతో జగన్‌ తన ఆస్తిలో 40 శాతం వాటా ఇస్తామన్నారు. కోర్టు కేసుల పరిష్కారం  తర్వాత ఇస్తామన్నారు. కానీ మీరు రిటర్న్‌ గిఫ్ట్‌గా ఏం ఇచ్చారు?. షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ డీడ్స్‌, జగన్‌ సంతకాలు లేకుండా దొంగ సంతకాలతో నిబంధనలు ఉల్లంఘించారు. జగన్‌ను జైలుకు పంపడానికే చంద్రబాబుతో షర్మిల లాలూచీ పడ్డారు.

..షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయితే జగన్‌ బెయిల్‌ రద్దు అవుతుంది.ఈ విషయం తెలిసే జగన్‌ బెయిల్‌ క్యాన్సిల్‌ అయ్యేలా కుట్ర చేశారు. జగన్‌ను జైలుకు పంపడమే చంద్రబాబు, షర్మిల లక్ష్యం. నష్టాలతో నడిచిన సంస్థలను జగన్‌ లాభాల్లోకి తెచ్చారు. నష్టాల్లో ఉన్నప్పుడు షర్మిల ఏం చేశారు? జగన్‌ అతి మంచితనం ఆయనకు అనర్థాలను తెచ్చిపెడుతోంది.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..!
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement