
లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది.
లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ తాజాగా ముగియడంతో ఈడీ ఆయన్ని ఈ ఉదయం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. దీంతో.. కాసేపట్లో ఆయన్ని జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఇంకోవైపు.. తీహార్ జైల్లో కేజ్రీవాల్కు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది రిక్వెస్ట్ పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక ఆహారం, మందులు, అలాగే పుస్తకాలను అనుమతించాలని కోరారు. అదనంగా మతపరమైన లాకెట్ ధరించేందుకు కేజ్రీవాల్ను అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణ కోసం రావాలంటూ తొమ్మిది సార్లు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఊరట కోసం కేజ్రీవాల్ కోర్టులను ఆశ్రయించినా లాభం లేకపోయింది. దీంతో.. సివిల్ లేన్స్లోని నివాసంలో మార్చి 22వ తేదీన తనిఖీల పేరుతో వెళ్లిన ఈడీ.. కొన్ని గంటలకే ఆయన్ని అరెస్ట్ చేసి తమ లాకప్కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టైన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డుల్లోకి ఎక్కారు.
Comments
Please login to add a commentAdd a comment