
సిగరెట్ అమ్మినా సీరియస్ యాక్షన్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) అధికారులు కేవలం మాదకద్రవ్యాల క్రయవిక్రయాల పైనే కాదు...సిగరెట్ల అమ్మకంలో జరుగుతున్న చట్టం ఉల్లంఘనలపైనా దృష్టి పెడుతున్నారు. నగర వ్యాప్తంగా పలువురు వ్యాపారులు మైనర్లకు సిగరెట్లు అమ్ముతున్నారంటూవచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. ఇవి శుక్రవారంపశ్చిమ మండలంలోని ఇద్దరు వ్యాపారులను పట్టుకుని, వారిపై స్థానిక ఠాణాల్లో కేసు నమోదు చేయించాయి.
మాదక ద్రవ్యాలకు ముందు సిగరెట్...
టీజీఏఎన్బీ అధికారులు గడిచిన కొన్నేళ్లుగా నగరంలో జరుగుతున్న మాదక ద్రవ్యాల దందాను అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా కళాశాలలు, పాఠశాలలతో పాటు ఇతర విద్యా సంస్థలపై పటిష్ట నిఘా ఉంచారు. వాటిలో, సమీపంలో, సంబంధించిన టీజీఏఎన్బీకి చిక్కిన వారిలో గంజాయి తాగుతున్న వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. అతి తక్కువ మంది ఇతర మాదకద్రవ్యాలను బానిసలుగా మారారు. ఆయా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్న టీజీఏఎన్బీ అధికారులు వాళ్లు ఈ వ్యసనానికి బానిసకావడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కీలక విషయం అధికారులకు తెలిసింది. ఇతర మాదకద్రవ్యాలు వినియోగానికి ముందు వారంతా గంజాయి సేవించేవారని బయటపడింది. దీనికి ముందు సిగరెట్ కాల్చడంతో ఈ ఊబిలోకి దిగినట్లు పలువురు బయటపెట్టారు.
చట్టం స్పష్టంగా చెబుతున్నప్పటికీ..
తల్లిదండ్రులు, కుటుంబీకుల పర్యవేక్షణ లేకపోవడం, మెచ్యూరిటీ తక్కువగా ఉండటంతో పాటు వివిధ కారణాల నేపథ్యంలో మైనర్లు వ్యసనాలకు తేలిగ్గా ఆకర్షితులై, బానిసలుగా మారుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే జువైనల్ జస్టిస్ యాక్ట్ (జేజేఏ), సిగిరెట్ అండ్ అదర్ టుబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ (కాట్పా) ప్రకారం మైనర్లకు మద్యం, సిగరెట్లు, మాదకద్రవాలు తదితరాల విక్రయంపై నిషేధం ఉంది. అయితే మద్యం విక్రయాల విషయంలో నిబంధనలు కొంతవరకు అమలు అవుతున్నాయి. సిగరెట్ల విక్రయించకూడదనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. పోలీసులు సైతం అప్పుడప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు తప్ప మైనర్లకు విక్రయం విషయం పట్టించుకోవట్లేదు.
మైనర్లకు విక్రయాలపై టీజీఏఎన్బీ నజర్
నగర వ్యాప్తంగా నిఘా ఉంచిన బృందాలు
ఇలా చిక్కిన వ్యాపారులపైఠాణాల్లో కేసులు
రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు
ఈ నేపథ్యంలోనే టీజీఏఎన్బీకి ఇటీవల కాలంలో మైనర్లకు సిగరెట్ల విక్రయంపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని సీరియస్గా తీసుకున్న డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వీరు తమ సెల్ఫోన్లతో పాటు రహస్య కెమెరాలను వినియోగించి నిఘా ఉంచుతున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఈ తరహా సిగరెట్ల విక్రయాలను రహస్యంగా చిత్రీకరిస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని ఆ వ్యాపారులను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. ఆ అధికారులే స్థానిక పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు ఇస్తూ వీడియోలు అందిచడం ద్వారా వ్యాపారులపై జేజేఏ, కాట్పాల్లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తున్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్లో ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేయించారు. ఈ డ్రైవ్ కొనసాగించాలని సందీప్ శాండిల్య నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment