
మద్యం తాగివాంతులు చేసుకుని..
వలస కూలీ మృతి
మొయినాబాద్: మద్యం తాగి వాంతులు చేసుకుని ఓ వలస కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధి అజీజ్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నీలాంచల్ బెహెర(33) బతుకు దెరువుకోసం 3 ఏళ్ల క్రితం అజీజ్నగర్కు వలస వచ్చాడు. సోడా కంపెనీలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో మద్యం తాగి పడుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో అక్కడే పనిచేసే అతని బంధువు ఈశ్వర్ మహకుల్ భోజనం చేయడానికి నీలాంచల్ను నిద్ర లేపాడు. ఆ సమయంలో వాంతులు చేసుకుని మళ్లీ పడుకున్నాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నిద్రలేపే ప్రయత్నం చేయగా.. అతను లేవలేదు. వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచిగాంధీకి తీసుకెళ్లగా.. బెహెర చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
నెలరోజుల క్రితం ఆత్మహత్య?
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
గచ్చిబౌలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆలస్యంగా లభ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానం ఎదురుగా ఉండే గుట్టవైపు వేపచెట్టుకు 35–40 ఏళ్ళ వయసున్న ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం స్థానికులు అటువైపు వెళ్లగా దుర్వాసన రావడంతో గమనించి మొబైల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా..మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లుగా గుర్తించారు. కింద ఒక బ్యాగు అందులో షర్టులు, ప్యాంట్లు, ఒక కంటి అద్దాలు పెట్టుకొనే బాక్సు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దాదాపు నెల క్రితం ఈ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment