సీఎంను కలిసిన పద్మశాలీసంఘం నాయకులు | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన పద్మశాలీసంఘం నాయకులు

Published Mon, Mar 24 2025 7:03 AM | Last Updated on Mon, Mar 24 2025 7:01 AM

ఆమనగల్లు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆదివారం ఆమనగల్లు పట్టణానికి చెందిన పద్మశాలీసంఘం నాయకులు కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆయనను ఆమనగల్లు భక్తమార్కండేయ దేవస్థాన కమిటీ అధ్యక్షుడు ఎంగలి బాలకృష్ణయ్య, పద్మశాలీసంఘం నాయకులు అప్పం శ్రీనివాస్‌, మసున మురళీధర్‌, యాదగిరి కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమనగల్లు భక్త మార్కండేయస్వామి దేవాలయ ఆవరణలో కమ్యునిటీహాలు, వసతిగృహం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని సీఎంకు వినతిపత్రం అందించారు.

శ్రీశైలం–హైదరాబాద్‌ రహదారిని విస్తరించండి

కడ్తాల్‌: శ్రీశైలం– హైదరాబాద్‌ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని స్థానిక బీజేపీ నాయకులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ రాష్ట్ర నాయకుడు ఆచారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌765) రద్దీగా మారిందని, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. విస్తరణతో రద్దీని, ప్రమాదాలను నివారించొచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే రోడ్డుకు సంబంధించి డీపీఆర్‌ పూర్తయిందని, త్వరలోనే టెండర్లు పిలిచి రోడ్డు విస్తరణ పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిలాల్‌నాయక్‌, పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్‌దోనాదుల, కౌన్సిల్‌ సభ్యుడు శ్రీశైలంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

లేబర్‌ అడ్డాల వద్ద

సౌకర్యాలు కల్పించాలి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన

కార్యదర్శి పానుగంటి పర్వతాలు

మొయినాబాద్‌: భవన నిర్మాణ కార్మికుల లేబర్‌ అడ్డాల వద్ద ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లేబర్‌ అడ్డాల వద్ద మౌలిక సదుపాయాలు లేక కార్మికులు గంటల తరబడి రోడ్లపైనే పనికోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తాగునీరు, టాయిలెట్స్‌ లేక మహిళా కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. బడా నిర్మాణ సంస్థలు తక్కువ కూలీ ఇచ్చి 12–14 గంటలు పనిచేయించుకుంటున్నాయని ఆరోపించారు. ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతే ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే సొంత ఊళ్లకు పంపిస్తున్నారని.. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలానే వెలుగుచూశాయన్నారు. ఇలాంటి సమస్యలన్నింటిపై భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో చర్చించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్‌ 21, 22తేదీల్లో శంషాబాద్‌లో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని.. ఈ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్‌ 21న శంషాబాద్‌లో జరిగే ర్యాలీ, బహిరంగ సభకు భవన నిర్మాణ కార్మికులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌రెడ్డి, కార్యదర్శి సత్యానారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన పద్మశాలీసంఘం నాయకులు 1
1/1

సీఎంను కలిసిన పద్మశాలీసంఘం నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement