
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్.. గురువారం మేఘాలయతో జరిగిన మ్యాచ్లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
143 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 28 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా ఉర్విల్ పటేల్ రికార్డును అభిషేక్ సమం చేశాడు.
ఇదే టోర్నీలో నవంబర్ 27న త్రిపురపై 28 బంతుల్లో ఉర్విల్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్తో ఉర్విల్ సరసన అభిషేక్ నిలిచాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 29 బంతులు ఎదుర్కొన్న శర్మ 11 ఫోర్లు, 8 సిక్స్లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 143 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్.. 3 వికెట్లు కోల్పోయి కేవలం 9.3 ఓవర్లలోనే చేధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.
మేఘాలయ బ్యాటర్లలో అర్పిత్ భతేవారా(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అభిషేక్ శర్మ, రమణ్దీప్ సింగ్ తలా రెండో వికెట్లు పడగొట్టగా.. అశ్విని కుమార్, ధలేవాల్ ఒక్కో వికెట్ తీశారు.
చదవండి: ఆసీస్తో రెండో టెస్టు.. టీమిండియా ఓపెనర్లుగా వారే: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment