ఐపీఎల్‌ 2025 ఫైనల్లో ఓడినా భారీగా పెరిగిన శ్రేయస్‌ అయ్యర్‌ బ్రాండ్‌ విలువ | Despite The IPL Final Setback, PBKS Captain Shreyas Iyer Brand Value Skyrocket | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2025 ఫైనల్లో ఓడినా భారీగా పెరిగిన శ్రేయస్‌ అయ్యర్‌ బ్రాండ్‌ విలువ

Jun 5 2025 2:38 PM | Updated on Jun 5 2025 3:33 PM

Despite The IPL Final Setback, PBKS Captain Shreyas Iyer Brand Value Skyrocket

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైన పంజాబ్‌ కింగ్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ సీజన్‌ ఆధ్యాంతం విశేషంగా రాణించిన ఆ జట్టు, తుది సమరంలో ఒత్తిడిలోనై ఆర్సీబీకి తలవంచింది. ఈ సీజన్‌లోనే పంజాబ్‌ పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌.. ఆ జట్టును అద్బుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగంతానూ రాణించి, సహచరులకు మార్గదర్శకంగా నిలిచాడు.

ఈ సీజన్‌లో పంజాబ్‌ టైటిల్‌ గెలవకపోయినప్పటికీ శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా 100కు 100 శాతం మార్కులు సాధించాడు. ఈ సీజన్‌తో కెప్టెన్‌గా శ్రేయస్‌ ఇమేజ్‌ నింగికెగిసింది. ఐపీఎల్‌ చరిత్రలో మూడు సార్లు, మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో ఓడినా శ్రేయస్‌ బ్రాండ్‌ విలువ కూడా భారీగా పెరగడం మరో విశేషం. శ్రేయస్‌ ప్రస్తుతం ఒక రోజు యాడ్‌లో నటిస్తే రూ.1.5 కోట్లు వసూలు చేస్తున్నాడు.

శ్రేయస్‌ ఫీజు త్వరలోనే మరింత పెరుగుతుందని అతని ఎండార్స్‌మెంట్ వ్యవహారాలు చూసే నిఖిల్ బార్డియా తెలిపారు. నిఖిల్‌ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని RISE వరల్డ్‌వైడ్‌కు అధిపతిగా ఉన్నాడు. ఐపీఎల్‌-2025లో విజయవంతమైన కెప్టెన్సీ శ్రేయస్‌కు  నాలుగైదు భారీ ఒప్పందాలు తెచ్చిపెడుతుందని నిఖిల్‌ అన్నారు. దీంతో శ్రేయస్‌ బ్రాండ్‌ విలువ 20-25 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.

అయ్యర్ ప్రస్తుతం నైక్, డ్రీమ్11, ఇన్‌క్రెడ్ ఫైనాన్స్ వంటి బ్రాండ్‌లతో స్వల్పకాలిక నాన్-ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్‌ కలిగి ఉన్నాడు. ఐపీఎల్‌ 2025 ప్రదర్శన తర్వాత శ్రేయస్‌కు ఆడియో, పురుషుల గ్రూమింగ్ బ్రాండ్‌లు, ప్రోటీన్ సప్లిమెంట్ బ్రాండ్‌లు, సువాసన సంస్థల నుండి విచారణలు వస్తున్నాయి. శ్రేయస్‌తో ఎండార్స్‌మెంట్ ఒప్పందాలకు డిమాండ్ పెరిగినప్పటికీ, ఏజెన్సీ ఫీజులు పెంచాలని యోచించడం లేదని నిఖిల్‌ తెలిపారు.

కాగా, శ్రేయస్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 50.33 సగటుతో 604 పరుగులు చేసి, పంజాబ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రేయస్‌ ఒత్తిడిని తట్టుకుని 41 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో  87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా పంజాబ్‌ ఆ మ్యాచ్‌లో విజయం సాధించి 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరింది.

వ్యక్తితంగా శ్రేయస్‌కు ఇది వరుసగా రెండో ఫైనల్‌. గత సీజన్‌లో శ్రేయస్‌ కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చడమే కాకుండా ఛాంపియన్‌గా నిలబెట్టాడు. గతేడాది జరిగిన మెగా వేలంలో శ్రేయస్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.26.75 కోట్ల ధర వెచ్చింది సొంతం చేసుకుంది. తద్వారా శ్రేయస్‌ ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అదే మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు దక్కించుకుంది. పంత్‌ ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement