
టోక్యో: నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడల కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారితోపాటు హైప్రొఫైల్ అథ్లెట్లు(గోల్ఫ్ మాజీ నంబర్ వన్ ఆడమ్ స్కాట్, ఫుట్బాల్ స్టార్ నెయ్మార్, టెన్నిస్ స్టార్లు ఫెదరర్, నదాల్, సెరెనా విలియమ్స్ తదితరులు) ఈసారి ఒలింపిక్స్కు దూరంగా ఉండటంతో.. టోక్యో వేదికగా జరగనున్న ఈ క్రీడలపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాజా సర్వే ఒకటి తేల్చింది.
ఇప్సోస్ అనే సంస్థ 28 దేశాల్లో నిర్వహించిన సర్వేలో కేవలం 46 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్పై ఆసక్తిగా ఉన్నట్లు తేలింది. ఇక విశ్వక్రీడలకు వేదిక అయిన జపాన్లో అయితే కేవలం 35 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తేలడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఈ గేమ్స్కు ప్రేక్షకులెవరినీ అనుమతించడం లేదు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన అథ్లెట్లు టోక్యో చేరుకోగా, వారిలో కొందరికి కరోనా పాజిటివ్గా తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment