
పరిమిత ఓవర్ల క్రికెట్కు ఉన్న ఆదరణను కాపాడుకుంటూనే ఈ ఫార్మాట్లలో వేగం పెంచే దిశగా అడుగులు వేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. డిసెంబర్ 12 నుంచి పొట్టి ఫార్మాట్లో కొత్త రూల్ను అమల్లోకి తేనుంది. విండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ నుంచి ఐసీసీ "స్టాప్ క్లాక్" అనే నిబంధనను ఆచరణలోకి పెట్టనుంది. ఈ నిబంధన వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ ఇటీవల వెల్లడించింది. స్టాప్ క్లాక్ రూల్ పురుషుల వన్డే, టీ20 ఫార్మాట్లలో అమల్లో ఉంటుంది.
స్టాప్ క్లాక్ నిబంధన ఏంటంటే..
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓవర్కు ఓవర్కు మధ్య అధిక సమయం వృధా అవుతుందని భావిస్తున్న ఐసీసీ.. ఈ ఫార్మాట్లలో మరింత వేగం పెంచేందుకు ఓవర్కు ఓవర్కు మధ్య 60 సెకెన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైమ్గా ఫిక్స్ చేసింది. బౌలింగ్ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్ వేసేందుకు బౌలర్ను దించాల్సి ఉంటుంది. రెండుసార్లు ఈ నిర్దిష్ట వ్యవధి దాటితే మూడోసారికి బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు.
ఈ పరుగులు బ్యాటింగ్ టీమ్ స్కోర్కు యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. నవంబర్ 21న అహ్మదాబాద్లో జరిగిన బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది.