ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేత భారత్‌.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం | India Win Champions Trophy 2025 By Beating New Zealand In Final | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేత భారత్‌.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం

Published Sun, Mar 9 2025 10:27 PM | Last Updated on Sun, Mar 9 2025 10:56 PM

India Win Champions Trophy 2025 By Beating New Zealand In Final

పాకిస్తాన్‌, దుబాయ్‌ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్‌ వేదికగా ఇవాళ  (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్‌ మిచెల్‌ (63), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. 

ఆదిలో రచిన్‌ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ (15), కేన్‌ విలియమ్సన్‌ (11), టామ్‌ లాథమ్‌ (14),మిచెల్‌ సాంట్నర్‌ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. కుల్దీప్‌, వరుణ్‌, జడ్డూ, అక్షర్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి న్యూజిలాండ్‌ బ్యాటర్లు భారీ స్కోర్‌ చేయకుండా కట్టడి చేశారు.

అనంతరం స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఛేదనలో రోహిత్‌ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్‌ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్‌ 17 పరుగుల వ్యవధిలో గిల్‌, కోహ్లి (1), రోహిత్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఈ దశలో శ్రేయస్‌ అయ్యర్‌ (48), అక్షర్‌ పటేల్‌ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్‌, అక్షర్‌ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో టీమిండియా మరోసారి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్‌ మధ్యలో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్‌ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.

ఈ దశలో కేఎల్‌ రాహుల్‌ (34 నాటౌట్‌).. హార్దిక్‌ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్‌) కలిసి మ్యాచ్‌ విన్నింగ్‌ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సాంట్నర్‌, బ్రేస్‌వెల్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్‌, రచిన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్‌ రవీంద్రకు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు లభించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement