భారత ఫుట్బాల్ జట్టుకు అవమానం ఎదురైంది. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించని కారణంగా ఆటగాళ్లతో పాటు కోచ్ను స్టేడియంలోకి అనుమతించలేదు. ఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా మార్చి 31న కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో హాంకాంగ్తో భారత జట్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశానికి కోచ్ ఖలీద్ జమీల్, ఆటగాళ్లు అషిక్ కురియన్, సహల్ అబ్దుల్, బిజోయ్ వర్గీస్ స్టేడియానికి వచ్చారు. కానీ గ్రేటర్ కొచ్చిన్ డెవలప్మెంట్ అథారిటీకి కేరళ ఫుట్బాల్ సంఘం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకపోవడంతో ఆటగాళ్లను, కోచ్ను లోపలికి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు.
అయితే మీడియా సమావేశానికి ముందు ఇలాంటి ఘటన జరగడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని కోచ్ ఖలీద్ జమీల్ తెలిపాడు. అయితే దశాబ్ద కాలంలో కొచ్చిలో భారత ఫుట్బాల్ జట్టు మ్యాచ్ ఆడనుండడం ఇదే తొలిసారి. అయితే కోచ్, ఆటగాళ్లను అడ్డుకోవడంపై కేరళ ఫుట్బాల్ అసోసియేషన్ (కేఏఎఫ్) అధ్యక్షుడు నవాస్ మీరన్ స్పందించాడు.
‘ఆసియా కప్ క్వాలిఫయర్ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. సమాచార లోపం వల్ల ఈ సమస్య ఏర్పడింది. దీనిని త్వరలోనే పరిష్కరిస్తాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే నివేదికల ప్రకారం స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు గ్రేటర్ కొచ్చి డెవలప్మెంట్ అథారిటీ తమకు రూ. 20 నుంచి 25 లక్షలు చెల్లించడంతో పాటు రూ. 3 లక్షలు అద్దె కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది.
అయితే చెల్లింపులకు కేఎఫ్ఏ సమయం కోరినప్పటికీ, విషయం తెలియని జీసీడీఏ సిబ్బంది కోచ్, ఆటగాళ్లను అడ్డుకున్నట్లు తెలిసింది. గతేడాది ఫిబ్రవరిలో చెల్లింపు వివాదం కారణంగా ఇండియన్ సూపర్లీగ్ (ఐఎస్ఎల్)లోనూ కేరళ బ్లాస్టర్స్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.


