సిరీస్‌ విజయంపై గురి | Indian womens second ODI against Ireland today | Sakshi

సిరీస్‌ విజయంపై గురి

Jan 12 2025 2:34 AM | Updated on Jan 12 2025 2:34 AM

Indian womens second ODI against Ireland today

నేడు ఐర్లాండ్‌తో భారత మహిళల రెండో వన్డే 

ఉదయం 11 గంటల నుంచి స్పోర్ట్స్‌18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం

రాజ్‌కోట్‌: స్వదేశంలో వరుస విజయాల జోరు కొనసాగిస్తున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. యంగ్‌ ప్లేయర్లు సత్తా చాటడంతో ఐర్లాండ్‌పై తొలి వన్డేలో ఘన విజయం సాధించిన స్మృతి మంధన సారథ్యంలోని భారత జట్టు... ఆదివారం రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్‌లో ప్రతీక రావల్, తేజల్‌ హసబ్నిస్‌ అర్ధ శతకాలతో సత్తా చాటడంతో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ సమిష్టిగా రాణించి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది. 

శుక్రవారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న భారత జట్టు... ఫీల్డింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. సులువైన క్యాచ్‌లను సైతం జారవిడిచి ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచి్చంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గైర్హాజరీలో స్మృతి మంధన మరోసారి జట్టును నడిపించనుండగా... ప్రతీక రావల్‌ ఫామ్‌ కొనసాగించాలని చూస్తోంది. 

గత మ్యాచ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోయిన హర్లీన్‌ డియోల్, జెమీమా రోడ్రిగ్స్‌ కూడా మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే టీమిండియాకు తిరుగుండదు. తేజల్, రిచా ఘోస్, దీప్తి శర్మతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే టిటాస్‌ సాధు, సయాలీ, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ కీలకం కానున్నారు.

ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో రిజర్వ్‌ బెంచ్‌ సత్తా పరీక్షించుకునేందుకు ఈ సిరీస్‌ ఉపయోగపడనుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకొని ఆత్మవిశ్వాసం నింపుకున్న ఐర్లాండ్‌ అదే జోష్‌లో సిరీస్‌ సమం చేయడంతో పాటు... భారత్‌పై తొలి విజయం సాధించాలని చూస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement