
Rohit Sharma Three Sixes Away To Record 400 Sixes In T20s: ఓవరాల్ టీ20 ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మరో మూడు అడుగుల దూరంలో ఉన్నాడు. నేటి నుంచి ప్రారంభంకానున్న రెండో దశ ఐపీఎల్-2021 తొలి మ్యాచ్లోనే రోహిత్ ఈ ఘనతను సాధించే అవకాశం ఉంది. టీ20ల్లో ఇప్పటివరకూ 397 సిక్సర్లు బాదిన హిట్ మ్యాన్.. నేడు చెన్నై సూపర్ కింగ్స్తో జరుగబోయే మ్యాచ్లో మరో మూడు సిక్సర్లు కొడితే, ఈ ఫార్మాట్లో 400 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సర్ల బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. గేల్ ఏకంగా 1042 సిక్సర్లు బాది ఈ జాబితాలో అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గేల్ తర్వాతి స్థానాల్లో విండీస్ యోధులు పోలార్డ్(755), ఆండ్రీ రసెల్(509) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో రోహిత్(397) ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ కంటే ముందు ఆరోన్ ఫించ్(399), ఏబీ డివిలియర్స్(430), షేన్ వాట్సన్(467), బ్రెండన్ మెక్కలమ్(485) ఉన్నారు. ఇక పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ క్రికెటర్ల విషయాకొస్తే.. ఈ లిస్ట్లో రోహిత్ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా(324), విరాట్ కోహ్లి(315), ఎంఎస్ ధోని(303) ఉన్నారు.
ఇదిలా ఉంటే, క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2021 రెండో అంచె నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్ రిచ్ లీగ్.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్తో పునః ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధికంగా 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై(10), బెంగళూరు(10), ముంబై(8) జట్లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి.
చదవండి: మ్యాచ్కు ముందు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.. భయంతో వణికిపోయాం
Comments
Please login to add a commentAdd a comment