
Photo Courtesy: IPL
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ (2022)లో మునుపెన్నడూ లేని విధంగా పరుగుల కోసం పరితపించిపోతున్న విరాట్ కోహ్లి.. నిన్న (మే 13) పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలి బంతికి సింగల్ తీయడం ద్వారా ఐపీఎల్లో 6500 పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లి.. క్యాష్ రిచ్ లీగ్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో కోహ్లి మినహా మరే ఇతర ఆటగాడు ఈ మైలరాయిని చేరుకోలేదు.
ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతన్న (13 మ్యాచ్ల్లో 236 పరుగులు) కోహ్లి.. పంజాబ్తో మ్యాచ్లో 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 20 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరుత్సాహపరిచాడు. కోహ్లి తన ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో 220 మ్యాచ్లు ఆడి 36.22 సగటున 6519 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 43 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి తర్వాత ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధవన్ (6186) రెండో స్థానంలో డేవిడ్ వార్నర్ (5876), రోహిత్ శర్మ (5829), సురేశ్ రైనా (5528) వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. బెయిర్ స్టో (29 బంతుల్లో 66; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), లివింగ్స్టోన్ (42 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ల సహకారంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసి, 54 పరుగుల తేడాతో దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. తద్వారా ప్లే ఆఫ్స్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకుంది.
చదవండి: ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశం ఎంత?.. కోహ్లిపై డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment