బంగ్లా ప్లేయర్‌ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు | Parvez Hossain Emon Shines With Maiden T20I To, Bangladesh Beat UAE By 27 Runs In 1st T20I | Sakshi
Sakshi News home page

బంగ్లా ప్లేయర్‌ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు

May 18 2025 9:17 AM | Updated on May 18 2025 12:10 PM

Parvez Hossain Emon Shines With Maiden T20I To, Bangladesh Beat UAE By 27 Runs In 1st T20I

రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం​ యూఏఈలో పర్యటిస్త్ను బంగ్లాదేశ్‌ విజయంతో బోణీ కొట్టింది. నిన్న (మే 17) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఆతిథ్య జట్టును 27 పరుగుల తేడాతో ఓడించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం​ ఛేదనకు దిగిన యూఏఈ 164 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది.

ఎమోన్‌ విధ్వంసకర శతకం
ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్‌ పర్వేజ్‌ హొస్సేన్‌ ఎమోన్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. మిగతా ఎనిమిది మంది బంగ్లా బ్యాటర్లు కలిపి 66 బంతుల్లో 70 పరుగులు మాత్రమే చేశారు. యూఏఈ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 21 పరుగులిచ్చారు.

రికార్డు శతకం
ఎమోన్‌ విధ్వంసకర సెంచరీ సాధించిన క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో తమీమ్‌ ఇక్బాల్‌ (2016 టీ20 వరల్డ్‌కప్‌లో ఒమన్‌పై) తర్వాత బంగ్లా తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఎమోన్‌ చేసిన సెంచరీ (53 బంతుల్లో) టీ20ల్లో బంగ్లా తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డైంది. తమీమ్‌ ఒమన్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు.

తమీమ్‌ 27 ఏళ్ల వయసులో సెంచరీ చేయగా.. ఎమోన్‌ 22 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా బంగ్లా తరఫున అతి చిన్న వయసులో టీ20 సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఎమోన్‌ కొట్టిన 9 సిక్సర్లు టీ20ల్లో ఆ జట్టు తరఫున (ఓ మ్యాచ్‌లో) అత్యధికం. గతంలో ఈ రికార్డు రిషద్‌ హొస్సేన్‌ (2024లో శ్రీలంకపై 7 సిక్సర్లు) పేరిట ఉండేది.

సత్తా చాటిన బౌలర్లు
192 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్లు తంజిమ్‌ (4-0-22-2), మెహిది హసన్‌ (4-0-55-2), హసన్‌ మహమూద్‌ (4-0-33-3), ముస్తాఫిజుర్‌ (4-0-17-2), తన్వీర్‌ ఇస్లాం (4-0-30-1) సత్తా చాటడంతో 20 ఓవర్లలో వికెట్లన్నీ కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు తరఫున కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం​ (54), ఆసిఫ్‌ ఖాన్‌ (42), రాహుల్‌ చోప్రా (35) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మే 19న షార్జా వేదికగా జరుగనుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement