
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. శ్రీథర్ త్వరలో జరుగబోయే న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్లతో ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్గా బాధ్యతలు చేపడతాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో శ్రీథర్ ఒప్పందం దీర్ఘకాలిక ఒప్పందంగా ఉండే అవకాశం ఉంది.
శ్రీథర్కు కోచింగ్ విభాగంలో అపార అనుభవం ఉంది. అతను 2021 టీ20 వరల్డ్కప్ వరకు రవిశాస్త్రి అండర్లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా పని చేశాడు. 2008-14 వరకు అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ ఫీల్డింగ్ మరియు స్పిన్ బౌలింగ్ కోచ్గా పని చేశాడు. అలాగే 2014 ఇండియా అండర్-19 వరల్డ్కప్ స్క్వాడ్కు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించాడు.
శ్రీథర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కూడా పని చేశాడు. స్వతహాగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అయిన శ్రీథర్ ఆఫ్ఘన్ జట్టుకు బౌలింగ్ కోచ్గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. శ్రీథర్.. ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ అండర్లో పని చేయనున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడనుంది.
ఈ మ్యాచ్కు భారత్లోని నోయిడా వేదిక కానుంది. ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఆ జట్టుకు నోయిడాను హోం గ్రౌండ్గా ఆఫర్ చేసింది. సెప్టెంబర్ 18 నుంచి ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ షార్జా వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment