Photo Courtesy: IPL 2026
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్కింగ్స్ది చెరగని ప్రస్థానం. ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ సహా అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన జట్టుగా, ఎక్కువసార్లు ప్లేఆఫ్ చేరిన జట్టుగా సీఎస్కే చరిత్ర సృష్టించింది. వీటన్నింటికి మూల కారణం ఎంఎస్ ధోని అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో ధోని ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
గాయంతో తొలి అంచె పోటీలకు దూరంగా ఉన్న ధోని గాయం నుంచి కోలుకున్నప్పటికీ రెండో అంచె పోటీల్లోనూ బరిలోకి దిగలేదు. దీంతో ధోని ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించినట్లేనంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ధోనికి సీఎస్కే జట్టు సభ్యులు గాడ్ ఆప్ ఆనర్ ఇచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విషయంలోకి వెళితే.. శనివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ముగిసిన తర్వాత సీఎస్కే జట్టు సభ్యులు ధోనికి హార్డ్ ఆఫ్ గానర్ ఇవ్వడం కనిపించింది. సీఎస్కే సాధించిన ఐదు ఐపీఎల్ ట్రోఫీలతో పాటు చాంపియన్స్ లీగ్ ట్రోఫీలు, ధోని సాధించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను స్టాండ్స్పై ఉంచారు. ఆ తర్వాత ఆటగాళ్లంతా ధోనికి చప్పట్లతో స్టేజీ మీదకు ఆహ్వానించారు.
ఆ తర్వాత ప్రస్తుత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్తో కలిసి ధోని తాను ఐపీఎల్లో సాధించిన ఐదు ట్రోఫీలతో ఫొటో సెషన్కు ఫోజిచ్చాడు. ఆ తర్వాత సైలెంట్గా కిందకు దిగిన ధోని తలను కిందకు వేసుకుంటూ భారంగా అడుగులు వేయడం కనిపించింది. ఇదంతా చూస్తుంటే ధోని ఐపీఎల్కు గుడ్బై చెప్పినట్లుగా అనిపిస్తోంది. సీఎస్కే సొంతగడ్డపై మ్యాచ్ ఆడడం మరో ముఖ్య విషయం.
ఇదే మంచి తరుణమని భావించిన ధోని సీఎస్కే అభిమానుల సమక్షంలో ఐపీఎల్కు గుడ్బై ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే ధోని సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే వీడ్కోలు పలకడంపై సీఎస్కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది నిజం కాదని, కచ్చితంగా ధోని మాకోసం ఒక మ్యాచ్ ఆడి తీరుతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
2023లో ఆఖరిసారి ధోని నేతృత్వంలో ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన సీఎస్కే ఆ తర్వాత రెండు సీజన్లలో లీగ్ దశకే పరిమితమైంది. ఐపీఎల్లో ధోని ఇప్పటివరకు 278 మ్యాచ్లాడి 5,439 పరుగులు సాధించాడు. ఇందులో 24 అర్థశతకాలు ఉన్నాయి. 2023 సీజన్ తర్వాత ధోని నుంచి రుతురాజ్ గైక్వాడ్ పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు.
ఇక ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కే ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో మూడు విజయాలు మాత్రమే సాధించి పట్టికలో ఏడో స్థానంలో ఉంది.ప్లేఆఫ్ చేరాలంటే ఇకపై సీఎస్కే మిగిలిన ఐదు మ్యాచ్లు కచ్చితంగా గెలవాల్సిందే. ఏ ఒక్కటి ఓడినా సీఎస్కే ప్లేఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టమవుతాయి. ఇక శనివారం ముంబై ఇండియన్స్పై సీఎస్కే 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
Bro silently retired and we didn't notice it 💔 pic.twitter.com/nOygR2qcaB
— GOAT¹⁸ 🇬🇧 (@SaviorKohli) May 2, 2026


