భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2026లో భాగంగా శనివారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో తరపున అర్జున్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో అర్జున్ పర్వాలేదన్పించాడు.
జూనియర్ టెండూల్కర్ తన 4 ఓవర్ల కోటాలో ఓ వికెట్ సాధించాడు. బ్యాటింగ్లో అతడు 5 పరుగులు చేశాడు. అయితే లక్నో తరపున అర్జున్ అరంగేట్రం చేసిన సందర్భంగా సచిన్ టెండూల్కర్ ఎక్స్లో భావోద్వేగ పోస్ట్ చేశాడు. తొలి 13 మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైనా, పట్టు వీడకుండా ఆఖరి మ్యాచ్లో లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న కొడుకును సచిన్ అభినందించాడు.
"వెల్ డన్, అర్జున్. ఈ సీజన్లో నీ ప్రవర్తన చూసి గర్వపడుతున్నాను. నీపై నీకు నమ్మకం ఉంచి, ఓపికగా కష్టపడుతూ, చివరి మ్యాచ్ వరకు అవకాశం రాకపోయినా పాజిటివ్గా ఉన్నావు. క్రికెట్ అనేది కేవలం ప్రతిభనే కాదు, మన సహనాన్ని కూడా పరీక్షిస్తుంది.
ఈ రోజు నువ్వు ఆ రెండింటినీ చాలా అద్భుతంగా హ్యాండల్ చేశావు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండు. ఆటను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండు. నేను కూడా ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అని ఎక్స్ వేదికగా సచిన్ రాసుకొచ్చారు. కాగా ఈ ఏడాది సీజన్ వేలానికి ముందు అర్జున్ను రూ.30 లక్షల బేస్ ప్రైస్కు ముంబై ఇండియన్స్ నుంచి లక్నో ట్రేడ్ చేసుకుంది.


