
బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ప్రకటించాడు. టీమిండియతో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ షకీబ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్టు సిరీస్ తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు.
ఈ మేరకు షకీబ్ కాన్పూర్లో మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్లో మిర్పూర్లో సౌతాఫ్రికాతో ఆడబోయే మ్యాచ్ నా కెరీర్లో ఆఖరిది. సొంతగడ్డపై నా అభిమానుల మధ్య టెస్టు కెరీర్ ముగించడం సంతోషకరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ నాకెంతో చేసింది. పేరు, ప్రతిష్ట అన్నీ ఇచ్చింది. అందుకే నా ఆఖరి టెస్టు స్వదేశంలోనే ఆడాలని నిర్ణయించుకున్నా’’ అని పేర్కొన్నాడు.
అక్కడకు వెళ్తే బయటకు రాకపోవచ్చు
ఇక బంగ్లాదేశ్లో తన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘బంగ్లాదేశీ పౌరుడిగా.. ఇండియా నుంచి అక్కడికి వెళ్లేందుకు నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాకపోవచ్చు. అయితే, ఒక్కసారి అక్కడకు వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు బంగ్లాదేశ్లోని పరిస్థితుల గురించి ఎప్పటికపుడు నాకు చెబుతూనే ఉన్నారు. నేను కూడా ప్రస్తుతం సందిగ్దావస్థలోనే ఉన్నాను’’ అని షకీబ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.
ఎంపీ పదవి పోయింది
కాగా బంగ్లాదేశ్లో కొంతకాలంగా చెలరేగిన అల్లర్లు రాజకీయ సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన అవామీ లీగ్ హెడ్షేక్ హసీనా భారత్లో తలదాచుకున్నారు. ఆమె ప్రభుత్వం రద్దు కావడంతో.. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన షకీబ్ పదవి కూడా ఊడిపోయింది.
హత్య కేసు నమోదు
ఆ సమయంలో కెనడా లీగ్తో బిజీగా ఉన్న షకీబ్.. నేరుగా పాకిస్తాన్తో టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే, షకీబ్ బంగ్లాదేశ్లో లేని సమయంలో అతడిపై హత్య కేసు నమోదైంది. దేశంలో చెలరేగిన అల్లర్లలో తన కుమారుడు చనిపోవడానికి కారణం ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ సభ్యులు కారణమంటూ ఓ వ్యక్తి షకీబ్పైకూడా కేసు పెట్టాడు.
దీంతో అతడిని అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, బంగ్లా బోర్డు మాత్రం ఆటగాడిగా షకీబ్ దేశానికి ఎంతో సేవ చేశాడని.. అతడిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జట్టుతో కలిసి షకీబ్ పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆడాడు.
బంగ్లా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీ
బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన గొప్ప ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్. ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. బంగ్లా తరఫున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. ఇప్పటి వరకు 70 మ్యాచ్లు ఆడి 4600 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. అదే విధంగా.. టెస్టుల్లో 242 వికెట్లు పడగొట్టాడు.
ఇక టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా తన చివరి అంతర్జాతీయ టీ2మ్యాచ్ ఆడిన షకీబ్ అల్ హసన్.. దేశం తరఫున 129 పొట్టి మ్యాచ్లలో 2551 రన్స్ చేయడంతో పాటు.. 149 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు 247 వన్డేల్లో 7570 పరుగుల సాధించి.. 317 వికెట్లు కూల్చాడు.
చదవండి: IND Vs BAN: ఇలా అయితే కష్టం కోహ్లి!.. 15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్!
Comments
Please login to add a commentAdd a comment