Photo Credit: Twitter
మహిళల ఆసియా కప్ 2026లో భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణి తన ప్రదర్శనతో అదరగొడుతుంది. శనివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన శ్రీ చరణి కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసింది. మ్యాచ్లో చేసిన ప్రదర్శనకు గానూ శ్రీ చరణి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకుంది. అవార్డు తీసుకున్న అనంతరం శ్రీ చరణి మాట్లాడింది.
‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. మహిళల క్రికెట్ ఆడుతూ దేశానికి సేవ చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నా. అయితే ప్రతీ మ్యాచ్కు జట్టులోని స్పిన్నర్లమంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. నాతో పాటు ప్రేమ రావత్, దీప్తి శర్మ, రాధా యాదవ్ కలిసి మ్యాచ్లో ఎలా బౌలింగ్ చేయాలనేది చర్చించుకుంటాం. దీప్తి, రాధా దీదీలు చెప్పే ప్రతి సలహాను మైదానంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాం.
50 వికెట్ల మార్క్కు ఒక్క వికెట్ దూరంలోఎ ఉన్నప్పటికీ, వాటిని నేను పట్టించుకోను. బౌలింగ్పైనే నా దృష్టంతా పెట్టాలనుకుంటున్నా. ఇక నాతో పాటు బౌలింగ్లో వికెట్లు తీసిన ప్రేమ రావత్కు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఆమెది సహజమైన ప్రతిభ. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ సమానంగా ఉంటాయి. బౌలర్లకు సహకరించే వికెట్పై సుమారు 120 పరుగులు అనేది మంచి స్కోరు కింద లెక్కే. ఇకపై కూడా నా ప్రదర్శనను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.
మ్యాచ్ విషయానికొస్తే పాకిస్తాన్పై భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌటైంది. మునీబా అలీ (13), షావల్ జుల్ఫికర్ (14) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. శ్రీ చరణి, ప్రేమ రావత్లు చెరో 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత జట్టు 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. హర్మన్ ప్రీత్ (18 నాటౌట్), దీప్తి శర్మ (12 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా 3 వికెట్లు పడగొట్టింది.


