breaking news
cricket news
-
ఐర్లాండ్ బయల్దేరిన టీమిండియా.. ప్రత్యేక ఆకర్షణగా వైభవ్!
ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా మంగళవారం చెన్నై నుంచి బయల్దేరింది. ఈ నేపథ్యంలో సిరీస్కు ఎంపికైన నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చెన్నై అంతర్జాతీయ ఎయిర్పోర్టులో టీమిండియా బృందం ప్రత్యేక ఫ్లైట్ ఎక్కింది. 'ఐర్లాండ్ టూర్కు సిద్ధం’ అన్నట్లుగా వైభవ్ సూర్యవంశీ తన సహచర ప్లేయర్ అభిషేక్ శర్మతో కలిసి సెల్ఫీని పంచుకున్నాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఇదే తొలి అంతర్జాతీయ సిరీస్ కానుండడం విశేషం. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో ఆడనున్న వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కనున్నాడు. శ్రీలంక పర్యటనలో ఇండియా-ఏ జట్టు ట్రై సిరీస్ విజేతగా నిలవడంలో వైభవ్ కూడా కీలకపాత్ర పోషించాడు. శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన ఫైనల్లో వైభవ్ 29 బంతుల్లోనే 94 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఊపులోనే ఐర్లాండ్తో టీ20 సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికైనప్పటికీ తుదిజట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్లో వైభవ్ తన ప్రతాపం చూపించాల్సిన అవసరముంది. ఇక డుబ్లిన్ వేదికగా రెండు వన్డేలు ఆడనున్న టీమిండియా ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 1 నుంచి 11 మధ్య ఐదు టీ20 మ్యాచ్లు, ఆ తర్వాత జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. వన్డే జట్టును గిల్ నడిపించనుండగా, టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇదే తొలి సిరీస్ కానుంది. VAIBHAV SOORYAVANSHI HAS DEPARTED TO CREATE HISTORY IN IRELAND. 🇮🇳- Youngest ever to receive the Indian jersey. 🔥 pic.twitter.com/uq2ZxEceWQ— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2026Read: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్.. అల్జీరియా సంచలన విజయం -
ఇంగ్లండ్తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచరీ వీరుడికి నో చాన్స్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసి జోష్ మీదున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై టీ20లతో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఇంగ్లండ్ టూర్కు ముందు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే, ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కోహ్లి ఆడుతాడా లేదా అనే సందేహం ఉండేది. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడని తెలిపిన బీసీసీఐ ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో ఆడబోయే టీమిండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ తుదిజట్టులో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఆఫ్గన్తో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ శతకం బాదిన సంగతి తెలిసిందే. అంతకముందు ఐపీఎల్లోనూ ఇషాన్ ఎస్ఆర్హెచ్ తరఫున తన బ్యాటింగ్తో అలరించిన సంగతి తెలిసిందే.ఇక జట్టు విషయానికొస్తే.. టాపార్డర్లో ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ, వన్డౌన్లో కోహ్లి రానున్నారు. ఆఫ్గన్తో వన్డే సిరీస్లో కెప్టెన్ గిల్ అదరగొట్టాడు. మూడు వన్డేలు కలిపి 238 పరుగులు చేసిన గిల్ ఖాతాలో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో బ్యాటర్ రోహిత్ శర్మ తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించనప్పటికీ మూడో వన్డేలో తనదైన ఇన్నింగ్స్తో అలరించాడు. ఆఫ్గన్తో సిరీస్లో 143 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి గాయం కారణంగా ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇక మిడిలార్డర్లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్తో పాటు ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్లను ఎంపిక చేశారు. ఇక వన్డేల్లో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బ్యాటింగ్కు రానుండగా, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. నితీశ్కుమార్ రెడ్డి ప్రస్తుతానికి జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, గాయంతో అతడు ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. ఆల్రౌండర్ కోటాలో అక్షర్పటేల్ ఏడో స్థానంలో ఆడడం గ్యారంటీ, బౌలింగ్ కోటాలో బుమ్రా, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణలకు చోటు కల్పించింది. ఇంగ్లండ్ వన్డేలకు భారత ప్లేయింగ్ ఎలెవన్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, నితీశ్కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే షెడ్యూల్1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ మధ్యాహ్నం 3:302వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:303వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30Read: నితీశ్రెడ్డికి గాయం.. ఇంగ్లండ్ టూర్కు దూరం! -
నితీశ్రెడ్డికి గాయం.. ఇంగ్లండ్ టూర్కు దూరం!
టీమిండియా ఆల్రౌండర్, తెలుగు క్రికెటర్ నితీశ్కుమార్ రెడ్డి ఐర్లాండ్తో పాటు ఇంగ్లండ్ టూర్కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న నితీశ్ రెడ్డి రెండు సిరీస్ల నుంచి వైదొలినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రక టన విడుదల చేయాల్సి ఉంది. నితీశ్రెడ్డిని బెంగళూరులోని బీసీసీఐ రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించే అవకాశముంది. కాగా ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్లు ఆడనున్న టీమిండియా ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇక గాయపడిన నితీశ్కుమార్ రెడ్డి స్థానంలో ముంబై ఆల్రౌండర్ సుయాన్ష్ హెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం. శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్లో సూర్యాన్ష్ మంచి ప్రదర్శన కనబరిచి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. సిరీస్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చిన సూర్యాన్ష్ 149 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో రెండు వికెట్లు తీశాడు. అయితే అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ సమయంలోనే తొడ కండరాల నొప్పితో రెండో వన్డేకు నితీశ్ రెడ్డి దూరమయ్యాడు. అయితే చివరి వన్డేలో ఆడిన నితీశ్ రెడ్డి మరోమారు తొడ కండరాల గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో నితీశ్రెడ్డి నాలుగు వారాల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఆఫ్గన్తో ఏకైక టెస్టుతో పాటు వన్డే సిరీస్కు నితీశ్ రెడ్డి చోటు దక్కించుకున్నప్పటికీ కేవలం ఒక టెస్టుతో పాటు వన్డే మాత్రమే ఆడాడు. ఇక ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా మంగళవారం రాత్రి బెల్ఫాస్ట్కు బయల్దేరనుంది.Some #TeamIndia News: Nitish Reddy's left quadriceps injury has aggravated. He is out of UK Tour. Rehab will take some time @BCCI #Cricket— Kushan Sarkar (@kushansarkar) June 23, 2026చదవండి: బీసీసీఐకి సునీల్ గావస్కర్ కీలక విజ్ఞప్తి! -
బీసీసీఐకి సునీల్ గావస్కర్ కీలక విజ్ఞప్తి!
భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించే అంశమై బీసీసీఐకి కీలక విజ్ఞప్తి చేశారు. వరుస సిరీస్లతో బిజీగా ఉండే భారత క్రికెటర్లకు ప్రతీ ఏడాది ఒక నెలపాటు విశ్రాంతి ఇస్తే బాగుంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతంగా గత రెండేళ్లుగా టీమిండియా వరుస సిరీస్లతో బిజీగా మారిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే టీ20 ప్రపంచకప్, ఆపై ఐపీఎల్ రెండు నెలల పాటు సాగింది. ఆ తర్వాత ఆరు రోజుల గ్యాప్తో భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరిగింది. ఇలా వరుస సిరీస్లతో ఆటగాళ్లు అలసిపోవడమే గాక, గాయాల బారిన పడుతున్నారని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఆఫ్గన్, ఐర్లాండ్ వంటి చిన్న దేశాల్లో క్రికెట్ను ప్రోత్సహించి, వారి ఆర్థిక ఎదుగుదలకు సహాయపడడంలో బీసీసీఐ మంచి పనే చేస్తోందన్నారు. కానీ ఇదే సమయంలో మన క్రికెటర్ల ఆరోగ్యం, ఫిట్నెస్పై కూడా దృష్టి సారించాలని, ఏడాదిలో మన ఆటగాళ్లకు ఒక నెల విశ్రాంతి ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే భారత్లో క్రికెటర్లకు కొదువ లేదని, ప్రతిభావంతులు పుష్కలంగా ఉన్నారని, కాబట్టి వీలైనంతమేర సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పిస్తూ ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ రొటేట్ చేయాలని తెలిపారు. అఫ్గానిస్తాన్తో టెస్టులో గిల్, రాహుల్ శతకాలు సాధించారని, బుమ్రాకు విశ్రాంతినిచ్చి మానవ్ సుతార్కు అవకాశమిచ్చి మంచి పని చేశారని కొనియాడారు. ఇలా చేయడం వల్ల జట్టులో కీలక ప్లేయర్కు తగినంత విశ్రాంతి దొరికి మేజర్ సిరీస్కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక అభిమానుల గురించి కూడా బీసీసీఐ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అండర్-19 మ్యాచ్లు ఎక్కువగా నిర్వహిస్తే యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, దీనివల్ల టీమిండియాకు అదనపు జట్లు తయారయ్యేందుకు ఇది మరింత దోహద పడుతుందని తెలిపారు.ఇక ఆఫ్గన్తో వన్డే సిరీస్ క్లీన్స్వీప్ చేసిన భారత జట్టు తర్వాత ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో బిజీ కానుంది. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.చదవండి: హాలండ్ జోరు.. ఉత్కంఠ పోరులో నార్వే విజయం -
‘చాలా బాధపడ్డాను.. సత్తా చాటేందుకు ఇదే మంచి సమయం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్ధమాన క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించే అందరి దృష్టిలో పడేందుకు తెలంగాణ టి20 లీగ్ (టీజీ టీ20) తగిన అవకాశం కల్పిస్తోందని పేస్ బౌలర్ సీవీ మిలింద్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ లో హైదరాబాద్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్న మిలింద్... టీజీ టి20లో అన్విత ఖమ్మం ఏసెస్ టీమ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్లో విజయంతో ఏసెస్ శుభారంభం చేసింది. 'టోర్నీ తొలి మ్యాచ్లోనే మా జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. తర్వాత మ్యాచ్ల్లోనూ మంచి ఫలితాలు సాధించి ఏసెస్కు టైటిల్ అందించాలని పట్టుదలగా ఉన్నా' అని మిలింద్ చెప్పాడు. ‘ఇతర రాష్ట్రాల టీ20 లీగ్లను చూసినప్పుడల్లా మన వద్ద ఇలాంటి టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుందా అని అనుకునేవాళ్లం. ఎట్టకేలకు ఇప్పుడు హెచ్సీఏ అధికారికంగా లీగ్ జరపడం సంతోషంగా ఉంది' అని మిలింద్ వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా హెచ్సీఏ లీగ్స్లో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొంటారని... అయితే వారి ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించదని మిలింద్ అభిప్రాయపడ్డాడు. అలాంటి క్రికెటర్లకు తమ సత్తా చాటి మున్ముందు కెరీర్లో ఎదిగేందుకు టీజీ టి20 లీగ్ సరైన వేదిక అని అతను చెప్పాడు. ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ అంశం వేలం, వారికి దక్కిన మొత్తం గురించి కాదు. కుర్రాళ్ల ప్రతిభకు సరైన అవకాశం. ఆటగాళ్ల కోణంలో చూస్తే అన్ని విధాలా లీగ్ సరైన ప్రయత్నం' అని మిలింద్ విశ్లేషించాడు.వ్యక్తిగతంగా చూస్తే తమ ఖమ్మం ఏసెస్ యాజమాన్యం అన్ని విధాలా టీమ్కు అండగా నిలిచిందని మిలింద్ వెల్లడించాడు. 'అన్విత గ్రూప్ సరైన ప్రణాళికతో టీమ్ ను సిద్ధం చేసింది. మేమంతా నగర శివార్లలో పది రోజులకు పైగా జరిగిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొన్నాం. మా టీమ్ యజమాని అనూప్ అక్కడే ఉండి టీమ్ బాండింగ్కు ఎంతో సహకరించాడు.. ఓవరాల్గా కూడా టోర్నీలో ఐపీఎల్ తరహా వాతావరణం కనిపించడం సానుకూలాంశం' అని మిలింద్ విశ్లేషించాడు. -
హర్మన్ సేనకు మిథాలీరాజ్ కీలక సూచన
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ పర్వాలేదని పించినప్పటికీ బౌలింగ్లో పూర్తిగా తేలిపోవడం హర్మన్ సేన కొంపముంచింది. ఇక మ్యాచ్లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులకు సంబంధించి హర్మన్ సేనకు పలు కీలక సూచనలు చేసింది.జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీరాజ్ మాట్లాడింది. ‘భారత జట్టుకు ఇది చాలా నిరుత్సాహపరిచే గేమ్. ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే హర్మన్ సేన పట్టికలో టాప్లో ఉండేది. కానీ ఇప్పుడు సెమీస్ రేసులో ఉండాలంటే బలమైన ఆస్ట్రేలియాను చిత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో పలు మార్పులు చేసుకుంటే ఆసీస్పై విజయం అంత కష్టమేమి కాకపోవచ్చు. కెప్టెన్ హర్మన్ప్రీత్ గత రెండు మ్యాచ్ల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చింది. మంచి ఫామ్లో ఉన్న ఆమె తన పాత స్థానమైన నాలుగులో బ్యాటింగ్కు రావాలి.. ఆ స్థానంలో వస్తున్న జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో జెమిమా ఐదో స్థానంలో ఆడిన అనుభవముంది. స్పిన్నర్లను బాగా ఆడగలదనే పేరు కలిగిన జెమిమా ఐదో స్థానంలో బ్యాటింగ్ రావడం వల్ల, ఆ సమయానికి ఎక్కువగా స్పిన్నర్లను ఎదుర్కొనే అవకాశం వస్తోంది. దీనివల్ల ఆమె వేగంగా పరుగులు చేయగలదు. స్పిన్ బౌలింగ్లోనే జెమీమా స్కూప్స్, స్వీప్ షాట్లు కచ్చితంగా ఆడగలదు. మరోవైపు హర్మన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ రావడం వల్ల చివరి ఓవర్లలోనే ఆమె వేగంగా ఆడేందుకు ఆస్కారముంటుంది. ఇక బౌలింగ్లో శ్రీచరణి తన ప్రదర్శనతో అదరగొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఆడుతున్నప్పటికీ అక్కడి పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంలో విజయవంతమవుతోంది. తన బౌలింగ్లో పేస్ వైవిధ్యం కనిపిస్తోంది. లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ వేస్తున్నశ్రీచరణి రాబోయే రోజుల్లో జట్టుకు కీలక బౌలర్గా మారనుంది.’ అని మిథాలీ చెప్పుకొచ్చింది. ఇక భారత జట్టు తమ తర్వాతి మ్యాచ్ జూన్ 25న (గురువారం) బంగ్లాదేశ్తో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 28న (ఆదివారం) ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఈ రెండింట గెలిస్తే భారత్ నేరుగా సెమీస్లో అడుగుపెట్టనుంది. ఒక్క మ్యాచ్లో ఓడినా నెట్ రన్రేట్ కీలకం కానుంది.చదవండి: ఐర్లాండ్తో టీ20 సిరీస్.. వైభవ్తో పాటు వీళ్లకు కీలకమే! -
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. వైభవ్తో పాటు వీళ్లకు కీలకమే!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా సీనియర్ బృందం నేరుగా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ గ్యాప్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో యువకులతో నిండిన జట్టు ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. అయ్యర్కు కెప్టెన్గా ఇదే తొలి టీ20 సిరీస్ కానుండగా, వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. వీరిద్దరితో పాటు మరికొందరు కొత్త క్రికెటర్లకు కూడా రాణించేందుకు ఇదే మంచి అవకాశం కానుంది. మిగతావారి సంగతి పక్కనబెడితే ఒక నలుగురు క్రికెటర్లకు మాత్రం ఐర్లాండ్ సిరీస్ కీలకం కానుంది. వాళ్లే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ రవి బిష్ణోయి.శ్రేయస్ అయ్యర్..ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా 2025 సీజన్లో పంజాబ్ను ఫైనల్ చేర్చిన శ్రేయస్ అయ్యర్ 2024 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ను విజేతగా నిలిపాడు. అయితే 2026 సీజన్లో పంజాబ్ ప్లేఆఫ్ చేరడంలో విఫలమైనప్పటికీ కెప్టెన్గా, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ సక్సెస్ అయ్యాడు. తన కెప్టెన్సీతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సూర్యకుమార్ను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలు శ్రేయస్కు అప్పగించారు. ఐర్లాండ్తో సిరీస్ కెప్టెన్గా అయ్యర్కు మొదటి సిరీస్ కానుంది. అయితే బ్యాటర్గా తనను తాను ఎప్పుడో నిరూపించుకున్న అయ్యర్ ఇక కెప్టెన్గా ఐపీఎల్ ప్రదర్శనను చూపిస్తాడా లేదా అన్నది చూడాలి. 2028లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. మరి వారి అంచనాలను ఎంతమేర అందుకుంటాడనేది ఐర్లాండ్ సిరీస్తో తేలిపోనుంది.వైభవ్ సూర్యవంశీ..ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఆదివారం ముగిసిన ట్రై సిరీస్ ఫైనల్లో టీ20 తరహా బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. కొద్దిలో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకముందు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున విధ్వంసం సృష్టించిన వైభవ్ 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎగురేసుకుపోయాడు. వన్డే క్రికెట్లోనూ టీ20 తరహా ఆటతీరును ప్రదర్శించిన వైభవ్ పొట్టి ఫార్మాట్లో మరింత రెచ్చిపోయేందుకు ఆస్కారముంది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడం వైభవ్పై అంచనాలను పెంచేసింది. ఇంగ్లండ్తో టూర్కు ముందు ఐర్లాండ్ టీ20 సిరీస్లో అంచనాలను అందుకొని భారీ స్కోర్లతో చెలరేగాలని వైభవ్ భావిస్తున్నాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన వైభవ్కు ఆ జట్టులో చోటు దక్కడం కాస్త కష్టమే అయినప్పటికీ, ఐర్లాండ్తో సిరీస్లో రాణిస్తే ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ ఆడే అవకాశాలు మెండుగా ఉంటాయి.నితీశ్కుమార్ రెడ్డి..హార్దిక్ పాండ్యా గాయపడడంతో ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు నితీశ్కుమార్ రెడ్డికి ఇదే మంచి అవకాశం. ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ తరఫున ఆడిన నితీశ్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్లో కీలక సమయాల్లో రాణించగలడన్న పేరున్న నితీశ్కుమార్ ఐర్లాండ్తో టీ20 సిరీస్లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్న నితీశ్రెడ్డి టీ20 జట్టులోనూ తన స్థానాన్ని నిలుపుకునేందుకు ఐర్లాండ్ టూర్ మంచి అవకాశం అని చెప్పొచ్చు.రవి బిష్ణోయి..ఐర్లాండ్తో టీ20 సిరీస్కు గాయంతో వరుణ్ చక్రవర్తి దూరం కావడంతో అతడి స్థానంలో రవి బిష్ణోయి చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వన్డేలకు పరిమితం కావడంతో టీ20ల్లో రాణించేందుకు రవి బిష్ణోయికు ఐర్లాండ్సిరీస్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన రవి బిష్ణోయి 9 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్తో సిరీస్లో రవి బిష్ణోయి ఫ్రంట్లైన్ స్పిన్నర్గా సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జూన్ 26 (శుక్రవారం) బెల్ఫాస్ట్ వేదికగా జరగనుంది.Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన! -
స్లో ఓవర్రేట్ దెబ్బ.. ఇంగ్లండ్కు భారీ షాక్!
న్యూజిలాండ్తో రెండో టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్కు మరో గట్టి షాక్ తగిలింది. కివీస్తో రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్లలో 12 పాయింట్లు కోత విధించింది. ఈ నిర్ణయంతో ఇంగ్లండ్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈసారి ఐసీసీ వరల్డ్టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడాలన్న ఇంగ్లండ్ కల నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ పాయింట్స్ పర్సంటేజీ మాత్రం 34.72 నుంచి 26.38కి పడిపోయింది. ఇంగ్లండ్ 12 టెస్టులాడి 4 విజయాలు, ఏడు ఓటములు, ఒక డ్రాతో ఏడో స్థానంలో ఉంది. ఇక టీమిండియా 9 టెస్టులు ఆడి 4 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. 2027లో జరగనున్న ఐసీసీ వరల్డ్టెస్టు చాంపియన్షిప్ పైనల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఆడిన 8 మ్యాచ్ల్లో ఏడు విజయాలు, ఒక ఓటమితో పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా 4 టెస్టుల్లో 3 విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది.ఇంగ్లండ్, న్యూజిలాండ్ రెండో టెస్టు విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్ 253 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 463 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాట్ హెన్రీ ధాటికి 209 పరుగులకే కుప్పకూలింది. మాట్ హెన్రీ ఆరు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. చెరో విజయంతో ఇరుజట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో టెస్టు ట్రెంట్బ్రిడ్జి వేదికగా జూన్ 25 నుంచి మొదలుకానుంది. నైట్క్లబ్ వివాదంతో రెండో టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్లు మూడో టెస్టుకు జట్టుతో చేరనున్నారు.England have been fined 50% of their match fees and docked 12 WTC points for maintaining slow overrate against New Zealand. pic.twitter.com/YgnKhbdPcH— Mufaddal Vohra (@mufaddal_vohra) June 22, 2026Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన! -
కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం!
ముక్కోణపు వన్డే టోర్నీలో భాగంగా భారత సంచలనం వైభవ్ సూర్యవంశీ తనకు కోపమొస్తే ఆ విధ్వంసం ఎంతలా ఉంటుందో లంక ఆటగాళ్లకు రుచి చూపించాడు. మొన్నటికి మొన్న లంక-ఏ ఆటగాళ్లతో గొడవకు దిగి వైభవ్ సూర్యవంశీ విమర్శలకు గురయ్యాడు. బ్యాటింగ్లో విఫలం కావడానికి తోడు తన చర్యతో చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. అయితే తనపై వచ్చిన విమర్శలకు, అనవసరంగా గెలికిన లంక ఆటగాళ్లకు ఒక్క ఇన్నింగ్స్తో దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. ఎందుకురా అనసవరంగా పెట్టుకున్నాం వీడితో అనేంతలా వైభవ్ రెచ్చిపోయాడు. క్రీజులోకి దిగిందే మొదలు బాదడమే పరమావధిగా పెట్టుకున్న వైభవ్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలచిన వైభవ్ 28 బంతుల వరకు విధ్వంసాన్ని కొనసాగించాడు. ఇక తొలి 11 బంతుల్లో వైభవ్ వరుసగా 4,4,4,6,6,0,6,4,4,6,6 బాదడం విశేషం. తాను ఎదుర్కొన్న 11 బంతుల్లో ఒక డాట్ బాల్ మినహా మిగతా అన్ని బంతులను గమనిస్తే ఫోర్లు, సిక్సర్లే కనిపిస్తాయి. దీన్నిబట్టే వైభవ్ విధ్వంసం ఎలా సాగిందనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన పేరిట లిఖించుకున్న వైభవ్ ఆ తర్వాత సెంచరీ వైపు పరిగెత్తాడు. చూస్తుండగానే 90ల్లోకి వచ్చిన వైభవ్ 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ కాస్త కొంచెం ఓపిక వహించి ఉండుంటే లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా తన పేరిట లిఖించుకునేవాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నప్పటికీ వైభవ్ ఆడిన 94 పరుగుల ఇన్నింగ్స్ తన కెరీర్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో సైతం ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే అండర్-19 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లో సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ మెక్గుర్క్ 29 బంతుల్లో సెంచరీ సాధించడం ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో అందుకున్న రికార్డు శతకం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇక దేశవాలీ క్రికెట్లో 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ప్రదేశ్పై 36 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్లో శతక్కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. మొత్తం మీద తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మిస్చేసుకున్న వైభవ్ తనను అనవసరంగా గెలికి తప్పు చేసిన లంక ఆటగాళ్లకు బ్యాటింగ్ పవర్ రుచి చూపించడంతో పాటు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే 25 ఓవర్లు ముగిసేసరికి ఇండియా-ఏ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (40), రుతురాజ్ గైక్వాడ్ (31 పరుగులు) క్రీజులో ఉన్నారు. Never mess with a Ego kid😭🔥🔥🔥Scored 11 balls 50 in IND A Finals😭😭With 5 sixes and 5 fours🥵🥵🥵🥵🥵#INDAvsSLA #vaibhav pic.twitter.com/rGQdowLjhh— Prabhas Devotee 🔥 (@SainathPb45) June 21, 20264,4,4,6,6,0,6,4,4,6,6 BY VAIBHAV SOORYAVANSHI IN HIS FIRST 11 BALLS 🥹- 15 YEAR OLD KID IS HAMMERING SRI LANKA. #indvssla pic.twitter.com/VzO2tm9uUb— Arman Cricket Updates (@arman7590) June 21, 2026Read: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు -
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంక-ఏతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. లీగ్ దశలో లంక- ఏ ఆటగాళ్లతో గొడవను పర్సనల్గా తీసుకున్న వైభవ్ మ్యాచ్ ఆరంభం నుంచే లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. గతంలో లిస్ట్-ఏ క్రికెట్లో 2005లో శ్రీలంక క్రికెటర్ కౌషల్య వీరరత్నే 12 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.అంతేకాదు వన్డే ఫార్మాట్లోనూ సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఏబీ డివిలియర్స్ 2015లో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో 16 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. వెస్టిండీస్ బ్యాటర్ మాథ్యూ ఫోర్డ్ కూడా 2025లో ఐర్లాండ్తో వన్డేలో 16 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించాడు. అయితే వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నది అనధికారిక వన్డే మ్యాచ్ కావడంతో అంతర్జాతీయంగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు మాత్రం ఏబీ డివిలియర్స్, మాథ్యూ ఫోర్డ్ పేరిటే ఉంది. ఇక టీ20 క్రికెట్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో సాధించిన ఫిఫ్టీ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అయితే క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లోనైనా వైభవ్ సూర్యవంశీ (11 బంతుల్లో 50 పరుగులు)దే అత్యుత్తమం కావడం విశేషం. 10 FOURS & 8 SIXES IN JUST 29 BALLS FOR VAIBHAV SOORYAVANSHI IN TRI SERIES FINAL 🥶🔥pic.twitter.com/3x16I9ONwb— Johns. (@CricCrazyJohns) June 21, 2026India A's Vaibhav Sooryavanshi smashed the fastest-ever List A fifty, reaching the milestone in just 11 balls against Sri Lanka A in the Tri-Series final. pic.twitter.com/vnzipNcZ6U— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) June 21, 2026 HEARTBREAK FOR VAIBHAV SOORYAVANSHI. 💔- 94 (29) with 10 fours and 8 sixes in the Tri-Series Final against Sri Lanka. Vaibhav absolutely ruled the Final and answered everyone who were doubting him. 🫡15 YEAR OLD IS SHOWING THE WORLD HIS SLAYING POWERS. 🇮🇳 pic.twitter.com/vk4RX8hFb6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2026Read: టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ -
లంకతో ఫైనల్ మ్యాచ్.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్
శ్రీలంక పర్యటనలో ట్రై సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక-ఏ, ఇండియా-ఏ జట్టు తలప డుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక-ఏ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ దూకుడుగా ఆడుతోంది. వైభవ్ ధాటికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతడికి ప్రియాన్ష్ ఆర్య (22 బ్యాటింగ్) సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకుల్ రాయ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(w), అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే(సి), రవిందు ఫెర్నాండో, వనుజా సహన్, మహ్మద్ షిరాజ్, విజయకాంత్ వియాస్కాంత్, దులజ్ సముదిత, కుగతస్ మతులన్ -
టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్కు టోర్నీలో ఇది హ్యాట్రిక్ పరాజయం. ఇంతకముందు భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాకిస్తాన్ మహిళల జట్టు తాజాగా శనివారం బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో నాకౌట్ దశకు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకముందు ఆస్ట్రేలియా జట్టు నెదర్లాండ్స్పై భారీ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్కు చేరుకోవడంతో పాకిస్తాన్తో పాటు నెదర్లాండ్స్ కూడా మూడు ఓటములతో టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్ (39 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) తొలి వికెట్కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్ 26 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది.పాకిస్తాన్ క్రికెట్కు ప్రస్తుతం సంధికాలం నడుస్తోంది. అటు పురుషులు.. ఇటు మహిళల జట్టు టీ20 ప్రపంచకప్లో నాకౌట్ చేరడంలో విఫలమయ్యాయి. ఫిబ్రవరిలో జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ సూపర్-8 దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్ అయింది. తాజాగా మహిళల జట్టు కూడా పురుషుల జట్టునే అనుసరించింది. టీ20 ప్రపంచకప్లో భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ చేతుల్లో హ్యాట్రిక్ ఓటములు చవిచూసి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. 2009 ఆరంభ టీ20 ప్రపంచకప్ నుంచి ప్రతీసారి బరిలోకి దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు ఏనాడు ఫస్ట్ రౌండ్ దాటింది లేదు. ఈసారి కూడా ఆ చెత్త రికార్డును బద్దలు కొట్టడంలో విఫలమైంది.మరోవైపు ఇదే గ్రూప్లో ఉన్న భారత మహిళల జట్టు మాత్రం రెండు విజయాలతో ఆసీస్ తర్వాతి స్థానంలో ఉంది. ఇవాళ సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్లో గెలిచి నాకౌట్కు చేరుకోవాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది. Pakistan Women's became the first Asian Team to get Eliminated from the Women's T20 World Cup 2026- Lost against India- Lost against South Africa- Lost against Bangladesh pic.twitter.com/UBcGqBOC9S— Ajay Jadeja (@AjayJadeja171) June 20, 2026చదవండి: 11 ఫోర్లు, 13 సిక్సర్లతో విధ్వంసం.. టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డు! -
జో రూట్ ఒంటరి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చరిత్రే!
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. 463 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టపోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (75 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇంగ్లండ్ విజయానికి మరో 281 పరుగులు అవసరం కాగా.. న్యూజిలాండ్ విజయానికి మరో 5 వికెట్లు అవసరం. ఇప్పటికైతే గెలుపు అవకాశాలు న్యూజిలాండ్ వైపే ఉన్నప్పటికీ ఇంగ్లండ్ విజయం సాధిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే.ప్రస్తుతం జోర్డాన్ కాక్స్ (0) క్రీజులో ఉన్నాడు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు హ్యారీ బ్రూక్ (58) అర్ధసెంచరీతో రాణించాడు. రూట్, బ్రూక్ కలిసి నాలుగో వికెట్కు 97 పరుగులు జోడించారు. వీరిద్దరు ఉన్నంతసేపు మ్యాచ్ ఇంగ్లండ్ వైపే మొగ్గు చూపినప్పటికీ బ్రూక్ వెనుదిరగడం, ఆ వెంటనే వికెట్ కీపర్ జేమ్స్ రూ కూడా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక గెలుపు సంగతి పక్కనబెడితే కాక్స్ మినహా మిగతా అంతా టెయిలెండర్లే కావడంతో రూట్ చివరి వరకు నిలిస్తేనే ఇంగ్లండ్ కనీసం మ్యాచ్ను డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 362 పరుగులకు ఆలౌటైంది. హెన్రీ నికోల్స్ 121 పరుగులు చేసి ఔటవ్వగా, డారిల్ మిచెల్ (68), నాథన్ స్మిత్ (38) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, మాథ్యూ ఫిషర్ చెరో 3 వికెట్లు తీయగా, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో కివీస్ 115 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.Read: నోరు మూసుకున్నందుకు రెడ్కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి! -
‘నాపై దేశద్రోహి ముద్ర’.. గంభీర్పై శ్రీశాంత్ ఆరోపణలు
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ లల్లన్టాప్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన మాటలతో సంచలనాల పరంపరకు తెరతీశాడు. శుక్రవారం మాజీ స్పిన్నర్ హర్భజన్కు సవాల్ విసిరిన శ్రీశాంత్, ఆ తర్వాత గంభీర్ కోచ్గా పనికిరాడని, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిని మెంటార్ లేదా కోచ్గా ఎంపిక చేయాలని పేర్కొన్నాడు. తాజాగా గంభీర్పై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. 2023లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ సందర్భంగా గంభీర్ తనను దేశద్రోహి అని తిట్టినట్లు శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. లల్లన్టాప్కు ఇచ్చిన ఇంటర్య్వూలోనే శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీశాంత్ మాట్లాడుతూ.. ‘2023 లెజెండ్ లీగ్ టోర్నీలో మేమిద్దరం ప్రత్యర్థులుగా ఆడాము. నేను వేసిన తొలి బంతినే గంభీర్ ఫ్లిక్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. అయితే అతడి గేమ్ ఏంటో నాకు తెలుసు. ఆ వెంటనే నేను బౌన్సర్ను సంధించాను. ఆ సమయంలోనే గంభీర్ నన్ను ఒక ఫిక్సర్గా పిలిచాడు. దీంతో గంభీర్ దగ్గరకు వచ్చి భయ్యా నువ్వు బాగానే ఉన్నావా? అని అడిగాను. ఎందుకంటే నేను వేసిన బౌన్సర్ అతడికి తాకింది. కానీ గంభీర్ మాత్రం ఒక అసభ్య పదజాలం వాడడంతో పాటు మళ్లీ ఒకసారి ఫిక్సర్, దేశద్రోహి అని పిలిచాడు’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియా జట్టులో గంభీర్,శ్రీశాంత్ సభ్యులుగా ఉండడం విశేషం. అయితే క్రికెట్ నుంచి దూరమైన తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీశాంత్పై నిషేధం పడిన సమయంలో గంభీర్ అతడిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఏడేళ్ల నిషేధం తర్వాత 2020లో శ్రీశాంత్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆకట్టుకోలేక ఆటకు వీడ్కోలు పలికాడు. ఆటకు గుడ్బై చెప్పిన గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా వచ్చాడు. అతడి పర్యవేక్షణలో టీమిండియా 2025 చాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.Read: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన! -
హెన్రీల చేతిలో ఇంగ్లండ్కు చావుదెబ్బ.. కివీస్కు భారీ ఆధిక్యం
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టు నుంచి ఓటమి పాఠాలు నేర్చుకున్న న్యూజిలాండ్ రెండో టెస్టులో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతుంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 56 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ (164 బంతుల్లో 119 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా, డారిల్ మిచెల్ (32 బ్యాటింగ్) అతడికి సహకరిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని న్యూజిలాండ్ ఇప్పటివరకు 352 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో కివీస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఎమిలియో గే (53), డెబ్యూ ఆటగాడు మాథ్యూ ఫిషర్ (50 నాటౌట్) అర్థసెంచరీలు చేయగా, కెప్టెన్ రూట్ (46) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లతో చెలరేగగా, విలియమ్ రూర్కీ 2, కైల్ జేమీసన్, నాథన్ స్మిత్ చెరొక వికెట్ తీశారు. దీంతో తొలుత మాట్ హెన్రీ తన బౌలింగ్తో ఇంగ్లండ్ బ్యాటర్లను చెడుగుడు ఆడుకుంటే.. ఆ తర్వాత మరో హెన్రీ (హెన్రీ నికోల్స్) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టి సెంచరీతో మెరిశాడు. ఈ లెక్కన ఇద్దరు హెన్రీల (మాట్ హెన్రీ, హెన్రీ నికోల్స్) చేతుల్లో ఇంగ్లండ్ చావుదెబ్బ తిన్నట్లయింది. ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో కివీస్కు వంద పరుగుల ఆధిక్యం లభించింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. Read: ఫిఫా చరిత్రలోనే ఫాస్టెస్ట్ గోల్.. మొరాకోదే విజయం -
గంభీర్పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్!
టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ లాంటి వ్యక్తి కోచ్గా పనికిరాడని, అతడి స్థానంలో ధోని లాంటి ఫ్రెండ్లీ వ్యక్తిని కోచ్గా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. శ్రీశాంత్ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. 'లల్లన్టాప్' వెబ్సైట్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.'ముందు కోచ్ను మార్చండి. భారత్కు ఇప్పుడు కావాల్సింది కోచ్ కాదు, ఒక మంచి మెంటార్. ఒక షో సజావుగా సాగడానికి డైరెక్టర్ ఎంత ముఖ్యమో, జట్టుకు కోచ్ కూడా అంతే ముఖ్యం. నాకు సాధారణంగా కోచ్లపై ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ అంతర్జాతీయ జట్లకు సాంప్రదాయ కోచ్ల కంటే మెంటార్ల అవసరమే ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా గంభీర్ అనుసరిస్తున్న కోచింగ్ విధానం ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. ఫెయిల్ అయితే జట్టు నుంచి తీసేస్తామనే భయాన్ని కల్పించి, ఆటగాళ్లను ఒక కఠినమైన వ్యవస్థలోకి నెట్టే కోచ్ జట్టుకు అవసరం లేదు.' అని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోని గురించి శ్రీశాంత్ ప్రస్తావించాడు.'జనాలు ఏమైనా చెప్పుకోవచ్చు.. కానీ ధోని ఆలోచనా విధానం, అతను ఆటగాళ్లలో నింపిన ఆత్మవిశ్వాసమే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. గంభీర్ స్థానంలో ధోనికి కోచ్ బాధ్యతలు అప్పగించాలి.' అని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ గెలవడంలో గంభీర్కు అధిక క్రెడిట్ ఇవ్వడం సరికాదని శ్రీశాంత్ వ్యాఖ్యనించాడు. మైదానంలో చెమటోడ్చి ఆడేది ఆటగాళ్లు, కాబట్టి ఆ గుర్తింపు, క్రెడిట్ వారికే దక్కాలని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ విజయాన్ని ప్రస్తావిస్తూ.. ఆటగాళ్ల ప్రదర్శనే అక్కడ అత్యంత కీలకమని పేర్కొన్నాడు. ఒకవేళ సంజూ శాంసన్ రాణించకపోయినా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ సరిగ్గా చేయకపోయినా, లేదా సమయానికి బౌలింగ్ మార్పులు జరగకపోయినా మనం గెలిచేవాళ్లమా? మైదానంలోకి వచ్చి కోచ్ ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాడా? చెప్పండి అంటూ గంభీర్ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నలు వేశాడు.అంతకముందు మాజీ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు శ్రీశాంత్ సవాల్ విసిరాడు. ఐపీఎల్ చెంపదెబ్బ ఘటన గుర్తుచేసుకున్న శ్రీశాంత్ తన వెనుక స్క్రీన్పై ఉన్న హర్భజన్ను చూపిస్తూ.. 'నీకు నిజంగా దమ్ముంటే నాతో రింగ్లోకి రా.. అక్కడ తేల్చుకుందాం' అని భజ్జీకి సరదాగా సవాల్ విసిరాడురు. తాను ప్రస్తుతం 'బేర్ నకిల్ ఫైటింగ్ లీగ్'తో సంబంధం కలిగి ఉన్నానని.. కోనర్ మెక్ గ్రోర్ వంటి అంతర్జాతీయ ఫైటర్లతో కలిసి పనిచేస్తున్నానని శ్రీశాంత్ పేర్కొన్నాడు. SREESANTH BACKS DHONI-TYPE LEADERSHIP OVER STRICT COACHING 👀🎙️: "India doesn't need a coach who forces players to follow instructions and drops them if they don't. Even MS Dhoni never operated that way. What the team needs is a mentor, and Mahi bhai would be the perfect fit… pic.twitter.com/kbGt6EjHot— Faruk (@uf2151593) June 19, 2026Read: ఆఫ్గన్తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు -
ఆఫ్గన్తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు
స్వదేశంలో అప్గానిస్తాన్తో జరుగున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే చెన్నై వేదికగా మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో టీమిండియా జట్టులో కీలక మార్పు జరగనుంది. మోకాలి గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన హర్షిత్ రానా చివరి వన్డే ఆడనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘హర్షిత్ రానా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రీహాబిలిటేషన్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే ఆడేందుకు టీమిండియాలో జాయిన్ అయ్యాడు’ అని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపారు. ఇక 2026 టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ హర్షిత్ రానా గాయపడ్డాడు. దీంతో టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్కు కూడా దూరమయ్యాడు. అయితే ఫిట్నెస్ నిరూపించుకోకుండానే హర్షిత్ రానాకు ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ఎంపిక చేసిన టీమిండియాలో చోటు లభించడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అతడి ఎంపికపై కూడా క్రీడా వర్గాల్లో కూడా పెద్ద చర్చే నడిచింది. ఈ విషయాలన్నీ పక్కనబెడితే హర్షిత్ రానా అప్గానిస్తాన్తో మూడో వన్డేలో ఆడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 24 ఏళ్ల హర్షిత్ రానా టీమిండియా తరఫున 14 వన్డేలాడి 16 వికెట్లు తీశాడు. చివరగా ఈ ఏడాది న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో హర్షిత్ రానా టీమిండియా తరఫున మ్యాచ్ ఆడాడు. ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆఫ్గన్తో వన్డే సిరీస్లో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. వర్షంతో తొలి వన్డేలో బ్యాటింగ్కు పెద్దగా అవకాశం రాలేదు. అయితే రెండో వన్డేలో మాత్రం కెప్టెన్ గిల్తో పాటు ఇషాన్ కిషన్ సెంచరీల మోత మోగించారు. దీంతో రెండో వన్డేలో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.అఫ్గానిస్థాన్తో మూడో వన్డేకి భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కులదీప్ సింగ్ యాదవ్, ప్రిన్స్ దీప్, కృష్ణ యాదవ్, యువరాజు బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రానా.చదవండి: గాయంతో శ్రేయాంక ఔట్.. ఆమె స్థానంలో ఎవరంటే? -
గాయంతో శ్రేయాంక ఔట్.. ఆమె స్థానంలో ఎవరంటే?
భారత క్రికెటర్ శ్రేయాంక పాటిల్ గాయంతో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా శ్రేయాంక పాటిల్ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రేమా రావత్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో రెండు వరుస విజయాలతో జోష్ మీదున్న హర్మన్ సేనకు శ్రేయాంక పాటిల్ గాయపడడం ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.ఇక ప్రేమా రావత్కు అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రానప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డబ్ల్యూపీఎల్లో తన లెగ్-స్పిన్తో ఆకట్టుకుంది. అంతేకాకుండా, దేశీయ సర్క్యూట్లో ఉత్తరాఖండ్ తరఫున కూడా ప్రేమా రావత్ రాణించింది. అంతేకాదు ఆమె ఇండియా-ఎ తరఫున కూడా కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు నమోదు చేసి బీసీసీఐ దృష్టిలో పడింది.కాగా టోర్నీలో భాగంగా బుధవారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. ఫీల్డింగ్ చేసే క్రమంలో ఆమె కుడి కాలి మడమ తిరగబడింది. దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం పాటిల్ను ఆసుపత్రికి తరలించారు. కాగా రిపోర్టులో శ్రేయాంక చీలమండకు గాయమైనట్లు తేలింది. ఆమె కోలుకునేందుకు కనీసం ఆరు వారాలు పట్టే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో శ్రేయాంకను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. శిబిరంలోనే శ్రేయాంక పాటిల్ చికిత్స తీసుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే శ్రేయాంకకు గాయాలు కొత్తేమి కాదు. గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్తో ఆమె పునరాగమనం చేసింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఇప్పుడు వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇక పాకిస్తాన్, నెదర్లాండ్స్లపై వరుసగా భారీ విజయాలు సాధించిన హర్మన్ సేన గ్రూప్-ఎ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోనుంది. -
క్రికెటర్లు తిలక్ వర్మ, సిరాజ్లకు లీగల్ నోటీసులు!
భారత స్టార్ క్రికెటర్లు తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. బీసీసీఐ నుంచి అనుమతి లేకుండానే హెచ్సీఏ నిర్వహిస్తున్న టీజీ 20 లీగ్కు ప్రచారం చేయడాన్ని తప్పుబడుతూ నోటీసులు జారీ చేసినట్లు టీసీఏ జనరల్ సెక్రటరీ గురవారెడ్డి తెలిపారు. కాగా వీరిద్దరితో పాటు టీజీ 20 లీగ్ ఆపరేషన్స్ హెడ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సహా ప్రచార కర్తలుగా ఉన్న సినీ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్ దగ్గుబాటిలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు టీసీఏ తెలిపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుమతి లేని టీజీ20కి ప్రచారం చేయడం అక్రమమని పేర్కొన్న టీసీఏ చర్యలకు ఉపక్రమించింది.టీసీఏ ఆరోపణల ప్రకారం బీసీసీఐ అనుమతి లేకుండానే హెచ్సీఏ టీజీ 20 లీగ్ను నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందింది. అందుకే టీజీ20 లీగ్కు ఆడనున్న క్రికెటర్లతో పాటు ప్రచారకర్తలుగా హీరోలకు, లీగ్ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడుకు కూడా లీగల్ నోటీసులు అందించినట్లు టీసీఏ పేర్కొంది.హెచ్సీఏ ఆధ్వర్యంలో టీ20 తరహాలో టీజీ20 క్రికెట్ లీగకు శ్రీకారం చుట్టారు. ఈ టోర్నీలో 8 క్రికెట్ జట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం జట్లున్నాయి. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ జులై 11న ఫైనల్తో ముగియనుంది.Read: కెనడా ప్లేయర్కు విరిగిన కాలు; కట్చేస్తే ఖతార్కు చుక్కలు! -
IND vs AFG: చెలరేగిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోరు
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (58), కెప్టెన్ తిలక్ వర్మ (59), కుమార్ కుషాగ్ర (58) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆఫ్గన్ బౌలర్లలో ఫరీదూన్, ఫర్మానుల్లా, అబ్దుల్లా అహ్మద్జయ్ తలా 2 వికెట్లు తీశారు.ఐపీఎల్లో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ ట్రై సిరీస్లో మరోసారి విఫలమయ్యాడు. 28 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్ నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య నిలకడ ప్రదర్శించి అర్థసెంచరీ సాధించడంతో పాటు రుతురాజ్ (30) పర్వాలేదనిపించడంతో భారత్ రన్రేట్ ఎక్కడా తగ్గలేదు. రుతురాజ్, ప్రియాన్ష్లు ఔటైన తర్వాత తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రలు భారత ఇన్నింగ్స్ను నడిపించారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 114 పరుగులు జోడించారు. ఫిఫ్టీలు పూర్తి చేసుకున్న అనంతరం స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. ఈ క్రమంలో నిషాంత్ సింధు (21 నాటౌట్), విప్రజ్ నిగమ్ (30) మెరుపులతో ఇండియా-ఏ స్కోరు 300 మార్క్ను దాటింది.Read: చరిత్రకు అడుగుదూరంలో గిల్.. రోహిత్ను ఊరిస్తున్న రికార్డు! -
చరిత్రకు అడుగుదూరంలో గిల్.. రోహిత్ను ఊరిస్తున్న రికార్డు!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటికే తొలి వన్డే గెలిచిన టీమిండియా రెండో విజయంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ఇవాళ రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన సీనియర్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఆఫ్గన్తో రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే లిస్ట్-ఏ క్రికెట్లో 14వేల పరుగులు మైలురాయిని అందుకోనున్నాడు. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ కూడా ఒక అరుదైన ఫీట్కు అడుగు దూరంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్గా గిల్కు ఇదే మొదటి సిరీస్. ఇప్పటికే టీమిండియా తొలి వన్డే గెలిచింది. రెండో వన్డేలోనూ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ వశం కానుంది. ఈ క్రమంలో స్వదేశంలో తొలి వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్గా గిల్ నిలవనున్నాడు. ఇక రెండో వన్డేకు కుల్దీప్ యాదవ్, జైస్వాల్కు చోటు దక్కే అవకాశముందని ఇప్పటికే గిల్ ప్రకటించాడు. ఇక తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ అజేయ ఇన్నింగ్స్కు తోడు కేఎల్ రాహుల్ దనాధన్ ఇన్నింగ్స్తో టీమిండియా సులువుగానే గెలిచింది. అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ విజయంతో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీ సాధించాడు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ (84 నాటౌట్), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.Read: కాన్వేకు ప్రమోషన్.. కివీస్ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే! -
కాన్వేకు ప్రమోషన్.. కివీస్ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే!
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ (2026-27) రెన్యువల్ జాబితాను విడుదల చేసింది. కివీస్ సీనియర్ ఆటగాడు డెవాన్ కాన్వే సెంట్రల్ కాంట్రాక్ట్లో తిరిగి చోటు దక్కించుకున్నాడు. కొన్నేళ్లుగా టీ20 లీగ్స్లో బిజీగా గడుపుతూ వచ్చిన కాన్వే గత రెండేళ్లుగా కివీస్ సెంట్రల్ కాంట్రాక్ట్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇటీవలే న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పడంతో కివీస్ బోర్డు తాజాగా సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను సవరించింది. ఈ నేపథ్యంలోనే విలియమ్సన్ స్థానంలో కాన్వేకు చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ కూడా సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకున్నాడు. గతసారి కాంట్రాక్టు దక్కించుకోలేకపోయిన పలువురు ప్రముఖ ఆటగాళ్లను తాజా జాబితాలో చేర్చగా; అదే సమయంలో అందులో కొందరు మాత్రం తమను టెస్ట్ కాంట్రాక్టు జాబితాలో చేర్చవద్దని బోర్డును కోరినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని వారాల్లో ప్రకటించనున్న సాధారణ కాంట్రాక్ట్ లిస్టులో టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్తో పాటు జాక్ ఫోక్స్, మిచ్ హే కూడా చోటు దక్కించుకునే అవకాశముంది. కివీస్కు మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాళ్లుగా ఉన్న మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, మాట్ హెన్రీలు సహా మిగతా క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ నేటి నుంచి ఓవల్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది.న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా: టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్చదవండి: అల్జీరియాపై గెలుపు.. కంటతడి పెట్టిన మెస్సీ! -
ఆఫ్గన్-ఏతో కీలక మ్యాచ్.. మారని వైభవ్ ఆటతీరు!
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్తో ఇండియా-ఏ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే ఇండియా-ఏ జట్టు ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్లో లంక ఆటగాళ్లతో గొడవ అనంతరం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న మ్యాచ్ కావడంతో అతడిపై భారీ అంచనాలున్నాయి. వైభవ్ తాను ఆడిన గత మూడు మ్యాచ్ల్లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. దీంతో ఈ మ్యాచ్లో రాణించి ఎలాగైనా ఫామ్ అందుకోవాలని భావించిన వైభవ్కు నిరాశే ఎదురైంది. అప్పటికే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వైభవ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 28 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్ ఫరీదూన్ బౌలింగ్లో ఖాలిద్ తనివాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్గన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (48), రుతురాజ్ (3) క్రీజులో ఉన్నారు. ఇక మ్యాచ్లో రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. ప్రబ్సిమ్రన్తో పాటు ఆయుశ్ బదోని ఈ మ్యాచ్కు దూరమైనట్లు తెలిపాడు. మరోవైపు ఆఫ్గన్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగింది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఆఫ్గన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్అఫ్గానిస్తాన్-ఏ: ఇమ్రాన్ మీర్(కెప్టెన్), హసన్ ఈసాఖిల్, ఖలీద్ తనివాల్, ఫైసల్ షినోజాదా, బహిర్ షా, ఫర్మానుల్లా సఫీ, షమ్స్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ ఇషాక్(వికెట్ కీపర్), జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదూన్ దావూద్జాయ్Read: టీమిండియాతో జాయిన్ అవనున్న వైభవ్, తిలక్ వర్మ -
టీమిండియాతో జాయిన్ అవనున్న వైభవ్, తిలక్ వర్మ
గత కొన్ని రోజులుగా తన ఆటతీరుతో హాట్టాపిక్గా మారిపోయిన వైభవ్ సూర్యవంశీ లంక ఆటగాళ్లతో గొడవ వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇండియా-ఏ జట్టు తరఫున ట్రై సిరీస్ ఆడేందుకు లంక పర్యటనకు వచ్చిన వైభవ్ సూర్యవంశీ టీమిండియాతో జాయిన్ అవ్వనున్నాడు. వైభవ్ సూర్యవంశీతో పాటు యువ జట్టుకు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ కూడా జూన్ 22న చెన్నైలో భారత సీనియర్ జట్టుతో కలవనున్నాడు. చెన్నై నుంచి భారత జట్టు ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడేందుకు బెల్ఫాస్ట్కు బయల్దేరి వెళ్లనుంది. జూన్ 21న ట్రై సిరీస్ ఫైనల్ జరగనుంది. ఒకవేళ ఇండియా-ఏ జట్టు ఫైనల్ చేరితే ఆ సిరీస్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్, తిలక్లు నేరుగా చెన్నైకి వచ్చి జట్టుతో కలవనున్నారు. ఒకవేళ ఇవాళ ఆఫ్గన్తో మ్యాచ్లో ఓడితే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిబాట పట్టనుంది. ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్ను ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ను జూన్ 26న ఆడనుంది. ఇక బీసీసీఐ టీమిండియా టీ20 కొత్త కెప్టెన్గా సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను నియమించింది.చదవండి: ఆఫ్గన్-ఏతో కీలక మ్యాచ్.. నిలకడగా ఆడుతున్న వైభవ్ -
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్కు జాక్పాట్.. టీమిండియాకు ఎంపిక!
ట్రై సిరీస్లో భాగంగా శ్రీలంక-ఏతో మ్యాచ్లో ఓటమితో ఫైనల్ అవకాశాలను ఇండియా-ఏ క్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటమి బాధలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు గుడ్న్యూస్ అందింది. గాయపడిన యద్వీర్ సింగ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు అశోక్ శర్మను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అశోక్ శర్మ తక్షణమే శ్రీలంకకు బయల్దేరనున్నాడు. బుధవారం అప్గానిస్తాన్తో జరగనున్న మ్యాచ్లో అశోక్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అశోక్ శర్మ గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం విశేషం. ఆరు వికెట్లే తీసినప్పటికీ అతడి స్పీడ్ బౌలింగ్ ఇవాళ ఇండియా-ఏ జట్టులోకి పిలుపు వచ్చేలా చేసింది. ఇక యద్వీర్ సింగ్ భుజం గాయంతో ఇండియా-ఏ ఆడిన మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేయడంలో ఇబ్బంది పడిన యద్వీర్ బెంచ్కే పరిమితమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అశోక్ శర్మను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. గాయంతో బాధపడుతున్న యద్వీర్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ అతడిని ఆదేశించింది.బుధవారం అఫ్గానిస్తాన్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్లో గెలవడమే కాదు భారీ రన్రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గన్పై ఇండియా గెలిచి, శ్రీలంకపై ఆఫ్గన్ గెలిస్తే.. ఇరుజట్లు నాలుగు మ్యాచ్ల్లో రెండేసి విజయాలతో ఉంటాయి. అప్పుడు నెట్రన్రేట్ కీలకం కానుంది. చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్! -
కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్!
ట్రై సిరీస్లో శ్రీలంక-ఏతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ జట్టు ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ గొడవ హైలైట్గా నిలిచింది. తప్పు ఎవరిదైనా వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. 15 ఏళ్ల వయసులో ఇంత అగ్రెసివ్ పనికి రాదని, ఓర్పు వహిస్తేనే జట్టులో ఎక్కువకాలం చోటు ఉంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీకి కోహ్లి అడ్వైజ్ ఇస్తున్న ఫొటో తాజాగా సోషల్ మీడియాలో మరోసారి వైరలయ్యింది. ఆ ఫొటోలో కోహ్లి వైభవ్ భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది కూడా వైభవ్ వెల్లడించాడు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు ప్రత్యర్థి ఏం మాట్లాడుతున్నా పట్టించుకోవద్దు. ఆటపైనే మన దృష్టి ఉండాలి. కెరీర్ ఎదుగుదలలో ఓపిక చాలా అవసరం. అది ఉన్నప్పుడే మనకు క్రికెట్లో లాంగ్ కెరీర్కు ఆస్కారం ఉంటుంది’ అని కోహ్లి తనతో చెప్పినట్లు వైభవ్ పేర్కొన్నాడు. అయితే తాజాగా లంకతో మ్యాచ్లో వైభవ్ అగ్రెసివ్ ప్రవర్తన చూస్తుంటే కోహ్లీ చెప్పిన మాటలు ఏవీ అతడు చెవికె క్కించుకోలేదనిపిస్తోంది. కోహ్లి ఇచ్చిన సూచనలు, సలహాలు తూ.చా. తప్పకుండా పాటించి ఉంటే ఇవాళ వైభవ్ ప్రవర్తన ఇలా ఉండేది కాదని పలువురు సీనియర్లు పేర్కొంటున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్గా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2025లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంలోనూ వైభవ్ ఇదే దూకుడు ప్రదర్శించాడు. ఆనాడు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ పేసర్ అలీ రెజా వైభవ్ను ఔట్ చేశాడు. ఈ సమయంలో పాక్ బౌలర్ వైభవ్ను కించపరిచే విధంగా మాట్లాడాడు. అయితే ఉడుకురక్తంతో ఉన్న వైభవ్ కూడా అంతే ఘాటుగా స్పందించాడు. అలీ రెజావైపు చూస్తూ చేతి వేలితో సైగ చేస్తూ, దూషిస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరలయ్యింది.టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అంటేనే దూకుడుకు పెట్టింది పేరు. తన అగ్రెసివ్ ప్రవర్తనతో విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. అయితే కోహ్లి మైదానంలో ఉన్నంతసేపు మాత్రం హుందాగానే ప్రవర్తిస్తాడు. ప్రత్యర్థిపై ఎంత కోపం ఉన్నా మైదానంలో ఎక్కువశాతం ఫన్నీమోడ్లోనే ఉండడానికే ప్రయత్నం చేస్తుంటాడు. మంచి విషయం ఆలస్యంగా.. కానీ ఒక చెడ్డ విషయం వేగంగా వ్యాప్తి చెందుతున్న మాట వైభవ్ విషయంలో నిజమైంది. ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో అందరి చేత శెభాష్ అనిపించుకున్న వైభవ్ ఇప్పుడు తన ప్రవర్తనతో అందరి దృష్టిలో బ్యాడ్గా మారిపోతున్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికైనా తన అగ్రెసివ్ ప్రవర్తనను తగ్గించుకొని ఆడితే క్రికెట్లో ఎక్కువకాలం కొనసాగేందుకు ఆస్కారం ఉంటుంది.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026King meets Bihari Monster 💀 pic.twitter.com/927R0z8kF3— सीतामढ़ी जिला 🇮🇳 (@SitamarhiJila) June 1, 2026చదవండి: ఓటమితో లెక్కలు తారుమారు.. ఇండియా-ఏ ఫైనల్ చేరడం కష్టమే! -
ఓటమితో లెక్కలు తారుమారు.. ఇండియా-ఏ ఫైనల్ చేరడం కష్టమే!
ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు శ్రీలంక-ఏ చేతిలో సూపర్ ఓవర్ ఓటమి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఓటమి కారణంగా ఇండియా-ఏ జట్టు ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించి శుభారంభం చేసిన ఇండియా-ఏ ఆ తర్వాత అఫ్గానిస్తాన్-ఏతో జరిగిన మ్యాచ్లో అనూహ్య ఓటమి చవిచూసింది. ఇక సోమవారం లంకతో జరిగిన మ్యాచ్లో హైడ్రామా నడుమ సూపర్ ఓవర్లో ఓటమిపాలై రెండో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్ల్లో రెండింట ఓడి ఒక మ్యాచ్లో గెలిచి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.ఆఫ్గన్పై గెలిచినా..బుధవారం అఫ్గానిస్తాన్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్లో గెలవడమే కాదు భారీ రన్రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గన్పై ఇండియా గెలిచి, శ్రీలంకపై ఆఫ్గన్ గెలిస్తే.. ఇరుజట్లు నాలుగు మ్యాచ్ల్లో రెండేసి విజయాలతో ఉంటాయి.కీలకం కానున్న నెట్ రన్రేట్ అప్పుడు నెట్ రన్రేట్ కీలకం కానుంది. ఈ రెండు జట్లలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. అయితే ప్రస్తుతం రన్రేట్ విషయంలో అఫ్గానిస్తాన్ (-1.392)తో పోలిస్తే ఇండియా-ఏ (+0.330)ది పైచేయిగా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ లంకతో చివరి మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే మాత్రం మెరుగైన రన్రేట్తో ఫైనల్కు వెళ్లే అవకాశముంది. కాబట్టి ఆఫ్గన్కు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే వారిపై భారీ తేడాతో గెలవడం ఇప్పుడు ఇండియా-ఏ జట్టు ముందున్న తక్షణ కర్తవ్యం. అయితే శ్రీలంకతో మ్యాచ్లో టాపార్డర్, మిడిలార్డర్ పూర్తిగా విఫలమవ్వడం జట్టు కొంపముంచింది. లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్ హెగ్డె, విప్రజ్ నిగమ్లు ఆడకపోయుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. శ్రీలంకతో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో లంక జట్టు కూడా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 16 పరుగులు చేయగా, భారత్ 9 పరుగులకే పరిమితమయ్యి ఓటమి చవిచూసింది.Read: లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్పై నిషేధం తప్పదా! -
లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్పై నిషేధం తప్పదా!
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ హైలైట్గా నిలిచింది. లంక ఆటగాళ్ల తప్పు అటుంచితే, వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. మరి ఈ గొడవతో వైభవ్ సూర్యవంశీపై నిషేధం పడనుందా అనేది ఒకసారి తెలుసుకుందాం. నిజానికి ఒక అంతర్జాతీయ మ్యాచ్లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది. అయితే వైభవ్, లంక ఆటగాదళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. కేవలం మ్యాచ్ రిఫరీ నుంచి జరిమానా ఎదుర్కొనేందుకు ఆస్కారముంది. అంతేకాదు బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.అసలేం జరిగింది?మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు స్వల్ప గొడవ జరిగింది. వైభవ్, సూర్యాంశ్లను ఉద్దేశించి లంక ఆటగాళ్లు ఏదో అనడంతో క్రికెటర్లు ఒకరిపై మరొకరు దూసుకొచ్చారు. సూర్యాంశ్ వైపు వెళుతున్న విశేన్ హలంబాగేను వైభవ్ అడ్డుకోగా... అతడిని కూడా లంక ఆటగాడు తోసేశాడు. సీనియర్ ఆటగాడు డిక్వెలా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడిపించాల్సి వచ్చింది. తిరిగి వెళుతూ కూడా 15 ఏళ్ల వైభవ్ మీ సంగతి చూస్తా అన్నట్లుగా హెచ్చరిస్తూ సైగలు చేయడం కనిపించింది. జాతీయ జట్టులో చోటుఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్ను ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసింది. తాజా ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రంకు ముందే వైభవ్ సూర్యవంశీ నిషేధం ఎదుర్కోనున్నాడా అనేది చూడాలి. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ రాణించడంలో విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్లు కలిపి 69 పరుగులు మాత్రమే చేసిన వైభవ్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. టీ20, వన్డే ఫార్మాట్లలో ఒకేలా ఆడుతానంటే కుదరదు.. కొంచెం ఓపిక వహించాల్సిన అవసరముందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026 -
సూర్యాన్ష్ మెరుపులు.. ఇండియా-ఏ భారీ స్కోరు
ముక్కోనఫు వన్డే సిరీస్లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో ఇండియా-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (21) మరోసారి నిరాశపరచగా, రుతురాజ్ గైక్వాడ్ (37), కెప్టెన్ తిలక్ వర్మ (23) పర్వాలేదనిపించారు. ఒక దశలో 143 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇండియా-ఏ జట్టును సూర్యాన్ష్, విప్రజ్ ఆదుకున్నారు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్, విప్రజ్ నిగమ్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. ఈ ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్కు 104 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో విజయ్కాంత్ వియస్కాంత్ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్! -
పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వచ్చాకా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు ఏఐను తప్పుడు సంకేతాలకు వాడడం అలవాటుగా మార్చుకున్నారు. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్కు సంబంధించిన ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ వద్దకు వచ్చిన పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన హర్మన్ప్రీత్ ఆమె గొంతు పట్టుకొని నెట్టేసింది. దీంతో అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దరిని విడదీయడం వీడియోలో కన్పించింది. ఇది చూసిన కొంతమంది అభిమానులు మ్యాచ్లో ఇంత పెద్ద గొడవ ఎప్పుడు జరిగిందా అని రిప్లేల మీద రిప్లేలు చూశారు. నిజానికి మ్యాచ్లో ఎక్కడా గొడవ జరిగిన దాఖలాలు లేవు. అయితే కొందరు ఆకతాయిలు ఏఐ మాయతో పాత వీడియో క్లిప్పింగ్లను జత చేర్చి ఈ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఇదీ అసలు సంగతి. అయితే ఐసీసీ ఈ ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ వీడియోల వల్ల ఆటకు ఉండే క్రీడాస్ఫూర్తి దెబ్బతింటుందని, ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని కఠినంగా హెచ్చరించింది. అయితే భారత ఇన్నింగ్స్ సమయంలో జెమీమా రోడ్రిగ్స్ ఔటైన సమయంలో మాత్రం పాక్ ప్లేయర్లు కాస్త ఓవరాక్షన్ చేశారు. తస్మియా రుబాబ్ బౌలింగ్లో రోడ్రిగ్స్ మిడాన్ దిశగా షాట్ ఆడింది. అయితే అక్కడే ఉన్న నటాలియా పెర్వాయిజ్ క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలో పాక్ ఫీల్డర్ శ్రుతి మించి రోడ్రిగ్స్ నడుచుకుంటూ వెళుతున్న తరుణంలో ఆమెను చూస్తే బంతిని బలంగా నేలకేసి కొట్టడం వివాదంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని నిర్ణయించిన బీసీసీఐ నిన్నటి మహిళల మ్యాచ్లోనూ దానిని కంటిన్యూ చేసింది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మంధాన (68), రిచా (34), హర్మన్ ప్రీత్ (36) రాణించారు. అనంతరం పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది.చదవండి: ట్యునీషియాపై విజయం.. సంబరాలు చేసుకోని స్వీడన్! -
హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన మూడో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయాన్ని అందుకుంది. విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, బ్యాటింగ్లో రూథర్ఫోర్డ్, హోల్డర్ మెరుపులు మెరిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. దునిత్ వెల్లలాగె (43 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా, కమిల్ మిశారా (28), నిస్సాంక (26) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 5 వికెట్లు తీయగా, అకిల్ హొసెన్, మాథ్యూ ఫోర్డె, జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది. 53 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ను రోవ్మెన్ పావెల్ (33), రూథర్ఫోర్డ్ (54 నాటౌట్) చక్కదిద్దడమే గాక జట్టును విజయంవైపు నడిపించారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 81 పరుగులు జోడించారు. విజయానికి చేరువవుతున్న క్రమంలో పావెల్ ఔటైనప్పటికీ, క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ (5 బంతుల్లో 21 నాటౌట్) మూడు భారీ సిక్సర్లు బాది వెస్టిండీస్ను గెలిపించాడు. లంక బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు తీయగా, వెల్లలాగె, దుష్మంత చమీర, తీక్షణ తలా ఒక వికెట్ తీశారు. షమర్ జోసెఫ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలుచుకున్నాడు. 2024 తర్వాత వెస్టిండీస్ తమ సొంతగడ్డపై టీ20 సిరీస్ నెగ్గడం విశేషం. ఇరుజట్ల మధ్య జూన్ 25 నుంచి అంటిగ్వా వేదికగా తొలి టెస్టు జరగనుంది.మ్యాచ్లో నమోదైన పలు రికార్డులు..👉ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షమర్ జోసెఫ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సబీనా పార్క్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా షమర్ జోసెఫ్ నిలిచాడు. గతంలో ఈ మైదానంలో ఐర్లాండ్కు బౌలర్ అలెక్స్ కుసాక్ (4/11) అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును జోసెఫ్ బద్దలు కొట్టాడు.👉టీ20 క్రికెట్లో వెస్టిండీస్ తరఫున ఐదు వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్గా షమర్ జోసెఫ్ నిలిచాడు. ఇక శ్రీలంకతో మ్యాచ్లో ఐదు వికెట్ల హాల్ అందుకున్న రెండో బౌలర్గా జోసెఫ్ నిలిచాడు. గతంలో ఓషెన్ థామన్ ఈ ఫీట్ సాధించాడు.👉శ్రీలంకతో మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షమర్ జోసెఫ్ టీ20 క్రికెట్లో 50 వికెట్ల మార్క్ పూర్తి చేసుకున్నాడు.చదవండి: శ్రీలంక-ఏతో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో -
శ్రీలంక-ఏతో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో
శ్రీలంక పర్యటనలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో విజయవంతంగా కొనసాగుతుంది. ట్రై సిరీస్లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ మరోసారి నిరాశపరిచాడు. మంచి ఈజ్తోనే బ్యాటింగ్ ప్రారంభించినప్పటికీ వైభవ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 14 బంతుల్లో 21 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ సాహన్ అరాచిగే బౌలింగ్లో వనుజా సాహన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంకతో జరిగిన తొలి మ్యాచ్లో 14 పరుగులు చేసిన వైభవ్ ఆఫ్గన్తో మ్యాచ్లో 22 బంతుల్లో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. తాజాగా లంకతో జరుగుతున్న మ్యాచ్లో క్రీజులో ఎక్కువసేపు నిలుస్తాడనుకున్నప్పటికీ విఫలమయ్యాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్తో రెచ్చిపోయారు. ‘వన్డే క్రికెట్లో వైభవ్ సూర్యవం ప్లాఫ్ షో కొనసాగుతోంది’.. ‘టీ20 ఆట వన్డేల్లో పనికిరాదు’.. ‘ఓవర్ హైప్ వల్ల ఆడలేకపోతున్నాడు’ అంటూ కామెంట్లు చేశారు.ఇక మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం భారత-ఏ జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.మ్యాచ్కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తిలక్ వర్మ తెలిపాడు. యశ్ ఠాకూర్, అనుకుల్ రాయ్ తుదిజట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రీలంక జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకూల్ రాయ్, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, విషెన్ హలంబాగే, సదీర సమరవిక్రమ, అహన్ విక్రమసింఘే, సహన్ అరాచ్చిగే(కెప్టెన్), వనుజా సహన్, విజయకాంత్ వియస్కాంత్, కుగతస్ మతులన్, చమిక కరుణరత్నే, మహ్మద్ షిరాజ్. -
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. 'హనుమంతుడి దయ వల్లే ఇదంతా'
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే విజయంలో దీప్తి శర్మ కీలకపాత్ర పోషించింది. బ్యాటింగ్లో విలువైన పరుగులు, బౌలింగ్లో ఐదు వికెట్లు సహా ఫీల్డింగ్లో ఒక రనౌట్ చేసి ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేసింది. తద్వారా చిరకాల ప్రత్యర్థిపై విజయంలో దీప్తి శర్మ కర్త, కర్మ, క్రియగా నిలిచింది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ ఒక అరుదైన రికార్డు సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచింది. పాక్తో మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా 166 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. థాయ్లాండ్కు చెందిన తిపాట్చా పుత్తావాంగ్ (165 వికెట్లు) రెండో స్థానంలో ఉండగా, వాండాకు చెందిన హెన్రిట్టే ఇష్విమే (160 వికెట్లతో) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ (152 వికెట్లు), థాయ్లాండ్కు చెందిన ఒన్నిచా కమ్చోఫూ (148 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి దీప్తి శర్మ ఇప్పటివరకు 354 వికెట్లు పడగొట్టింది. తద్వారా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. తొలి స్థానంలో భారత్కు చెందిన మాజీ బౌలర్ జులన్ గోస్వామి (355 వికెట్లు) ఉండగా, ఇంగ్లండ్కు చెందిన కేథరిన్ బ్రంట్ (335 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీ (332 వికెట్లు), ఇంగ్లండ్కు చెందిన సోఫీ ఎసల్స్టోన్ (327 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లోనూ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది.5/10 – దీప్తి శర్మ vs పాకిస్తాన్, బర్మింగ్హామ్, 2026, 5/11 – జులన్ గోస్వామి vs ఆస్ట్రేలియా, విశాఖపట్నం, 20125/15 – రేణుకా సింగ్ vs ఇంగ్లాండ్, గ్కెబెర్హా, 20235/16 – ప్రియాంక రాయ్ vs పాకిస్థాన్, టౌంటన్, 20095/19 – దీప్తి శర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్బర్గ్, 202628 ఏళ్ల ఆమె మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారతదేశం తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేయగా, టోర్నమెంట్ చరిత్రలో ఏ బౌలర్ అయినా సాధించిన గణాంకాలలో ఇది మూడవ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.మహిళల టీ20 ప్రపంచ కప్లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:5/5 – డియాండ్రా డాటిన్ (వెస్ట్ ఇండీస్) వర్సెస్ బంగ్లాదేశ్, ప్రొవిడెన్స్, 20185/8 – సునే లూస్ (దక్షిణాఫ్రికా) వర్సెస్ ఐర్లాండ్, చెన్నై, 20165/10 – దీప్తి శర్మ (భారతదేశం) వర్సెస్ పాకిస్తాన్, బర్మింగ్హామ్, 2026, ఈరోజు*5/12 – ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా) వర్సెస్ న్యూజిలాండ్, పార్ల్, 20235/15 – రేణుకా సింగ్ (భారత్) వర్సెస్ ఇంగ్లండ్, గ్వేబెర్హా, 2023ఇక మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత దీప్తి మాట్లాడుతూ ఈ ఘనత మొత్తం జట్టుకే చెందుతుందని చెప్పింది. తన విజయానికి హనుమాన్ జీ ఆశీస్సులు కూడా కారణమని పేర్కొంది. ఐసీసీ టోర్నమెంట్లు తనకు ప్రత్యేకమైనవని, అలాంటి వేదికలపై ఆడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపింది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్లపై బౌలింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమని, ప్రతి బంతికి వేగం మారుస్తూ సరైన ప్రాంతాల్లో బంతులు వేయడమే తన విజయ రహస్యమని వివరించింది.BIG NEWS 🚨 India Women Team defeats Pakistan by 64 runs in #T20WC2026 opener!Deepti Sharma wins Player of the Match.She picked up a career-best 5/10 with the ball to restrict Pakistan to 106."Special Thanks to Hanuman ji" - DEEPTI 🔥 pic.twitter.com/h4VZqnXtgJ— News Algebra (@NewsAlgebraIND) June 14, 2026 -
‘మ్యాచ్ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తిశర్మ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడు మంధాన, హర్మన్ మెరుపులతో పాక్పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా మ్యాచ్ విజయం అనంతరం హర్మన్ప్రీత్ మాట్లాడింది. 'మ్యాచ్ విజయంతో చాలా సంతోషంగా ఉన్నా. ముందుగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మ్యాచ్ విజయంలో (స్మృతి మంధాన, దీప్తి శర్మ) ఆ ఇద్దరిదే కీలకపాత్ర. జట్టుకు అవసరమైనప్పుడల్లా వారు ముందుంటారు. ఇవాళ వాళ్లిద్దరూ ఆడిన తీరు చూసి సంతోషంగా అనిపించింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. అయితే ఆరంభంలో వికెట్లు పడడంతో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నాం. అయితే పిచ్పై అవగాహన వచ్చిన తర్వాత మంధాన, నేను స్వేచ్ఛగా ఆడాం. రిచా ఘోష్కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వొచ్చు. కానీ ఆమె ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమని చెప్పింది. ఇవాళ ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. ధనాధన్ ఇన్నింగ్స్తో అభిమానులను అలరించింది. ఇక ఫీల్డింగ్లో కొన్ని తప్పులున్నాయి. రాబోయే మ్యాచ్ల్లో వాటిని సరిచేసుకుంటాం. నెట్ రన్రేట్ అనేది కీలకం కాబట్టి మరింత వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం.' అని చెప్పుకొచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో విజృంభించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించింది. చివర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టింది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మునీబా అలీ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. -
పాక్తో మ్యాచ్.. చరిత్ర సృష్టించిన హర్మన్ప్రీత్
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ ఒక అరుదైన రికార్డు సాధించింది. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా హర్మన్ నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ఇప్పటివరకు ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉంది. మిథాలీరాజ్ 40.33 సగటుతో 726 పరుగులు సాధించింది. తాజాగా హర్మన్ప్రీత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బౌండరీ కొట్టడం ద్వారా మిథాలీరాజ్ రికార్డును బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఇక హర్మన్, మిథాలీ రాజ్ తర్వాత స్మృతి మంధాన 524 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, జెమీమా రోడ్రిగ్స్ 407 పరుగులతో నాలుగో స్థానంలో, పూనమ్ రౌత్ 375 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ (36), రిచా ఘోష్ (7) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్ స్మృతి మంధాన 68 పరుగులు చేసింది.చదవండి: బాస్కెట్బాల్ చరిత్రలో సంచలనం.. 53 ఏళ్ల నిరీక్షణకు తెర! -
పాక్తో మ్యాచ్.. అగ్గి రాజేసిన కెప్టెన్ హర్మన్ప్రీత్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న సమయంలో ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన మాటలతో అగ్గి రాజేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హర్మన్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. తాము ఇక్కడికి క్రికెట్ ఆడడానికి మాత్రమే వచ్చామని, ఎవరితో చేతులు కలపడానికి కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. హర్మన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు వచ్చాము. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. క్రికెట్ మినహా అనవసర విషయాల గురించి మాట్లాడదలచుకోలేము. అయినా నేను క్రికెట్ తప్ప దేని గురించి ఆలోచించడం లేదు. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా క్రికెట్ అనేది మా కల. దాని గురించే మాట్లాడుకుంటాం. మీరు హైవోల్టేజ్ మ్యాచ్ అని చెబుతున్న ప్పటికీ నా దృష్టిలో మాత్రం పాకిస్తాన్తో మ్యాచ్ను ఒక సాధారణ గేమ్గానే చూస్తున్నాను. అయితే పాక్తో ఆడేటప్పుడు ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను అంగీకరిస్తాను. పాక్ ఒక్కటే కాదు తాము ఆడబోయే ప్రతీ మ్యాచ్లోనూ ఒత్తిడి సహజం. కానీ దానిని జయిస్తేనే విజయం మనల్ని వరిస్తుంది. ఎవరితో మ్యాచ్ అయినా మేము అత్యుత్తమ క్రికెట్ ఆడాలని అనుకుంటాము.’ అని చెప్పుకొచ్చింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ఇరుజట్లు తలపడితే ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవారు. కానీ పహల్గాం ఘటన తర్వాత పాక్తో ఆడే ఎలాంటి మ్యాచ్ అయినా సరే ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. బీసీసీఐ కూడా భారత ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆసియా కప్ నుంచి పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి ముందుకు రాలేదు. మహిళల వన్డే ప్రపంచకప్ సమయంలోనూ హర్మన్ సేన పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. కాబట్టి నేటి మ్యాచ్లోనూ భారత మహిళా ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం లేదు. సొంతగడ్డపై జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ను తొలిసారి సొంతం చేసుకున్న హర్మన్ప్రీత్ సేన తాజాగా టీ20 ప్రపంచకప్లోనూ అదే జోరును కనబరచాలని ఉవ్విళ్లూరుతోంది. 2009లో మొదలైన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. 2020 ఎడిషన్లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్తోనే సరిపెట్టుకుంది. 𝘛𝘩𝘦 𝘸𝘰𝘳𝘭𝘥 𝘳𝘦𝘮𝘦𝘮𝘣𝘦𝘳𝘴 𝘾𝙝𝙖𝙢𝙥𝙞𝙤𝙣𝙨 𝘧𝘰𝘳 𝘸𝘩𝘢𝘵 𝘵𝘩𝘦𝘺 𝘥𝘪𝘥 𝘰𝘯𝘤𝘦…𝙂𝙧𝙚𝙖𝙩 𝙏𝙚𝙖𝙢𝙨 𝘢𝘳𝘦 𝘳𝘦𝘮𝘦𝘮𝘣𝘦𝘳𝘦𝘥 𝘧𝘰𝘳 𝘸𝘩𝘢𝘵 𝘵𝘩𝘦𝘺 𝘥𝘰 𝘯𝘦𝘹𝘵 🏆⏳The #WomenInBlue are #T20WorldCup ready 💪 #TeamIndia pic.twitter.com/7fWJN6ootJ— BCCI Women (@BCCIWomen) June 14, 2026చదవండి: ఇండియా-ఏకు భారీ షాక్.. వైభవ్ సూర్యవంశీకి గాయం! -
ఇండియా-ఏకు భారీ షాక్.. వైభవ్ సూర్యవంశీకి గాయం!
ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడేది అనుమానంగానే ఉంది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్కు వచ్చిన వచ్చిన వైభవ్ సూర్యవంశీ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వైభవ్ ప్రాక్టీస్ మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నివేదికలో వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్రత ఎంత అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇక రేపు శ్రీలంక-ఏతో జరగనున్న మ్యాచ్కు వైభవ్ దూరమైతే అతడి స్థానంలో నిశాంత్ సింధును జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఎలాగూ టాపార్డర్లో ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ ఉండడంతో వీరిలో ఇద్దరు ఓపెనర్లుగా వస్తే, ఒకరు వన్డౌన్లో రావడం ఖాయం. కెప్టెన్ తిలక్ వర్మ నాలుగో స్థానంలో ఆడుతాడు. ఇక వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికీ, రెండో మ్యాచ్లో మాత్రం 22 బంతుల్లో 44 పరుగులతో తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.అయితే వైభవ్ సూర్యవంశీ గాయం అప్డేట్పై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రాబోయే ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్ ఆడే టీమిండియా జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్కు గాయం తీవ్రత ఎక్కువగా లేకపోతే రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆడే సువర్ణావకాశం లభిస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన బ్యాటింగ్తో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ అనూహ్యంగా టీమిండియాలోకి ఎంపిక చేసింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు కూడా వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఒకవేళ ఐర్లాండ్తో పర్యటనకు ముందే సూర్యవంశీ ఫిట్నెస్ నిరూపించుకుంటే, సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశం తరఫున అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచే అవకాశముంది. -
ఫైనల్ మ్యాచ్లో హైడ్రామా.. లైవ్లోనే తన్నుకున్న ఆటగాళ్లు!
టీ20 ముంబై లీగ్ 2026 విజేతగా ఎమ్ఎస్సి మరాఠా రాయల్స్ నిలిచింది. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఆర్క్స్ అంధేరిపై 8 పరుగుల తేడాతో విజయం సాధించిన మరాఠా రాయల్స్ డిఫెండింగ్ చాంపియన్ హోదాను నిలుపుకుంది. అయితే మ్యాచ్ ముగిశాకా ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోనే గొడవకు దిగారు. ఒకానొక దశలో ఇద్దరు క్రికెటర్లు దాడి చేసుకునే వరకు వెళ్లారు. దీంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విషయంలోకి వెళితే మరాఠా రాయల్స్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో ఆర్క్స్ అంధేరి ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ వివాదం మొదలైంది. ఆ ఓవర్ రెండో బంతికి అంధేరి బ్యాటర్ గౌరవ్ జతార్ సిక్స్ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఇర్ఫాన్ ఉమైర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో రాయల్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, గౌరవ్ అసహనం వ్యక్తం చేశాడు. గౌరవ్ పెవిలియన్ వైపు వెళ్తుండగా.. డగౌట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మరాఠా రాయల్స్ ఆటగాడు రోహన్ రాజేతో అతనికి మాటల యుద్ధం నడిచింది. మొదట ఫోర్త్ అంపైర్ ఇద్దరినీ విడదీసినప్పటికీ.. వారు మళ్లీ ఒకరినొకరు నెట్టుకుంటూ తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. దీంతో అంధేరి జట్టు సభ్యులతో పాటు మరాఠా రాయల్స్ ఆటగాళ్లు కూడా స్టేడియంలోకి పెరిగెత్తుకుంటూ వచ్చి రోహన్, గౌరవ్లకు సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది.ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 154 పరుగులకే పరిమితమైంది. ఎమ్ఎస్సి బ్యాటర్లలో చిన్మయ్ రాజేష్ సుతార్(61) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ సిద్దేశ్ లాడ్(33) కాస్త దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంధేరి బౌలర్లలో అర్జున్ టెండూల్కర్ రెండు, శివమ్ దూబే, ముషీర్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అనంతరం ఏఆర్సీఎస్ అంధేరి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. దివ్యాన్ష్ సక్సేనా (51) టాప్ స్కోరర్గా నిలిచాడు. మరాఠా బౌలర్లలో ఆదిత్య ధుమాల్, తుషార్ దేశ్పాండే, ఇర్ఫాన్ ఉమెర్ తలా రెండు వికెట్లు తీశారు. తుషార్ దేశ్పాండేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించగా, సువేద్ పార్కర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.The last over drama in T20 Mumbai league 😭🔥💥 pic.twitter.com/XGTvl0II19— Abhinav MSDian™ (@Abhinav_hariom) June 14, 2026చదవండి: 24 ఏళ్ల తర్వాత బరిలోకి.. టర్కీకి షాక్ ఇచ్చిన ఆసీస్! -
ఆఫ్గన్తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు!
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి 16 వేల పరుగుల మార్క్ను దాటడం విశేషం. అయితే మంచి ఈజ్తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్తో సమన్వయం లోపం వల్ల రనౌట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఇదే మ్యాచ్లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్లో 3వేల పరుగుల మార్క్ను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక షై హోప్, ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్లు 67 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించారు.Scaling Mt. 16,000 🗻A monumental milestone unlocked by Rohit Sharma as an opener in international cricket 👏🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/vyC4C0oPvg— BCCI (@BCCI) June 13, 2026 Major Milestone for our Captain 🫡Shubman Gill becomes the fastest Indian and 2⃣nd fastest player overall to amass 3⃣0⃣0⃣0⃣ ODI runs 🙌🔝He also brings up his fifty!Updates ▶️ https://t.co/lCuohEZYAl#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/tdxL7cvo7X— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్, రాహుల్ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్లో కెప్టెన్ శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.Picture-Perfect 🙌#TeamIndia wrap a comprehensive victory by 7️⃣ wickets in Dharamshala ✅They lead the #INDvAFG ODI series by 1️⃣-0️⃣ 👌Scorecard ▶️ https://t.co/lCuohEZYAl @IDFCFIRSTBank pic.twitter.com/RNy13a0PHX— BCCI (@BCCI) June 13, 2026 -
ఉతికారేసిన గుర్బాజ్.. సెంచరీతో పలు రికార్డులు బద్దలు!
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శతకంతో అదరగొట్టాడు. వర్షం అంతరాయంతో 25 ఓవర్లకు కుదించిన ఆటలో ఆఫ్గన్ ఓపెనర్ ఆరంభం నుంచే టీ20 ఆటను ప్రదర్శించాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ఒక ఎండ్లో బ్యాటింగ్ కొనసాగించిన గుర్బాజ్ బౌలింగ్కు వచ్చిన ప్రతీ భారత బౌలర్ను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే గుర్బాజ్ 48 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా గుర్బాజ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.👉అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ తొలి స్థానంలో నిలిచాడు. 48 బంతుల్లోనే గుర్బాజ్ ఈ ఫీట్ అందుకున్నాడు. అంతకముందు మహ్మద్ షెహజాద్ (2010లో స్కాట్లాండ్పై 72 బంతుల్లో), కరీమ్ సాదిక్ (2012లో నెదర్లాండ్స్పై, 72 బంతుల్లో), నౌరోజ్ మంగల్ (2013లో స్కాట్లాండ్పై, 85 బంతుల్లో), మహ్మద్ షెహజాద్ (2019లో ఐర్లాండ్పై, 85 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.👉ఇక వన్డేల్లో భారత్పై ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ రెండో స్థానంలో నిలిచాడు. 2005లో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ఫాల్కనర్ (57 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (57 బంతుల్లో), మైఖెల్ బ్రాస్వెల్ (57 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.👉వన్డేల్లో గుర్బాజ్కు ఇది తొమ్మిదో సెంచరీ. ఆఫ్గన్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు గుర్బాజ్ పేరిటే ఉంది. ఇబ్రహీం జర్దన్, మొహమ్మద్ షెహజాద్లు చెరో ఆరు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.👉వన్డేల్లో ఆఫ్గన్ తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదడం రహ్మనుల్లా గుర్బాజ్కు ఇది నాలుగోసారి. టీమిండియాతో మ్యాచ్లో 8 సిక్సర్లు బాదిన గుర్బాజ్.. గతంలో 2021లో ఐర్లాండ్తో మ్యాచ్లో 9 సిక్సర్లు, 2023లో బంగ్లాదేశ్పై 8 సిక్సర్లు, 2024లో బంగ్లాదేశ్పై 7 సిక్సర్లు కొట్టాడు. -
అఫ్గానిస్తాన్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 195 పరుగులు
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. -
కౌంటీలోనూ అదే జోరు.. బౌలింగ్తో హడలెత్తించిన మానవ్ సుతార్!
టీమిండియా తరఫున అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టిన మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్షిప్లోనూ తన బౌలింగ్తో బెంబెలె త్తిస్తున్నాడు. ఆఫ్గన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ఆడిన తొలి మ్యాచ్లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆఫ్గన్పై ప్రదర్శనతో కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశం దక్కించుకున్న మానవ్ సుతార్ అక్కడ కూడా అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. వార్విక్షైర్ తరఫున బరిలోకి దిగిన మానవ్ సుతార్ యార్క్షైర్తో జరుగుతున్న కౌంటీ మ్యాచ్లో 85 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మానవ్ సుతార్ తీసిన మూడు వికెట్లు కీలకమైనవే కావడం విశేషం. మొదట హాఫ్ సెంచరీ చేసిన సామ్ వైట్మన్ (55)ను పెవిలియన్ చేర్చిన మానవ్ సుతార్.. తన సెంచరీతో యార్క్షైర్ ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలిచిన విలియమ్ లక్స్టన్ (167 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత చివర్లో యార్క్షైర్ భారీ స్కోరు చేయడంలో సహాయపడిన జార్జ్ హిల్ (30)ను ఔట్ చేసి ముచ్చటగా మూడో వికెట్ తీసుకున్నాడు.ఇలా అరంగేట్రం మ్యాచ్లోనే మూడు కీలక వికెట్లు తీసి కౌంటీ క్రికెట్లోనూ మానవ్ సుతార్ అదుర్స్ అనిపించాడు. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్షైర్ 110.4 ఓవర్లలో 469 పరుగులకు ఆలౌటైంది. విలియం లక్స్టన్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ జానీ బెయిర్ స్టో (68)తో పాటు సామ్ వైట్మన్ అర్థసెంచరీ సాధించారు. మానవ్ సుతార్, ఈతన్ బాంబర్, ఎడ్ బెర్నాడ్లు తలా మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ ఆరంభించిన వార్విక్షైర్ 23 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. రాబర్ట్ యేట్స్ (22), సామ్ హెయిన్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.Manav Suthar has his first championship wicket! pic.twitter.com/BmD8DZ2lX7— No Context County Cricket (@NoContextCounty) June 12, 2026Talk about a dream start on debut 🤩🎥 Manav Suthar getting his maiden Test wicket in his very first over 🙌Scorecard ▶️ https://t.co/Au50EfVM30#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MEx9QHwkD0— BCCI (@BCCI) June 7, 2026 -
భారత్ తరఫున అరంగేట్రం.. అతడి ఎంపిక వెనుక గిల్ హస్తం!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న తొలి వన్డేతో టీమిండియా తరఫున గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. హర్ష్దూబేకు కేఎల్ రాహుల్ డెబ్యూ క్యాప్ అందించగా, గుర్నూర్ బ్రార్కు కెప్టెన్ శుబ్మన్ గిల్ క్యాప్ అందించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లపై ఒక లుక్కేద్దాం. వీరిద్దరు అరంగేట్రం చేసినప్పటికీ గుర్నూర్ ఎంపిక వెనుక మాత్రం కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు.గిల్ మెచ్చిన క్రికెటర్..పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్కు సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఆరాధ్య క్రికెటర్. అతడి బౌలింగ్ యాక్షన్ను అచ్చుగుద్దినట్లు అనుకరించడంలో గుర్నూర్ బ్రార్ సుప్రసిద్ధుడు. అయితే గుర్నూర్ చిన్న వయసులో క్రికెట్ కంటే ఫుట్బాల్, టెన్నిస్ ఆటను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే హైట్ అడ్వాంటేజ్ కారణంగా క్రికెట్లోకి వెళితే బాగా రాణిస్తావు అని స్నేహితులు ఇచ్చిన సలహాతో గుర్నూర్ బ్రార్ తననుత తాను పరీక్షించుకోవడానికి క్రికెట్ ట్రయల్స్కు వెళ్లాడు. ఆ తర్వాత రెండేళ్లలోనే ఇండియా అండర్-19 టీమ్కు బౌలింగ్ చేసే స్థాయికి వెళ్లాడు. అక్కడే గుర్నూర్ బ్రార్కు ప్రస్తుత టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ పరిచయమయ్యాడు. అతడి టాలెంట్ను గమనించిన గిల్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అలా పంజాబ్ అండర్-23 జట్టులో చోటు దక్కించుకున్న గుర్నూర్ బ్రార్ 2021లో లిస్ట్-ఏతో పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్కు నెట్బౌలర్గా వచ్చిన గుర్నూర్ బ్రార్కు అనుకోకుండా జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. అప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో ఎంపికయిన గుర్నూర్ బ్రార్ లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గిల్ మరోసారి గుర్నూర్కు అండగా నిలబడి నెట్బౌలర్గా తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్కు సూచించాడు. ఈ సమయంలోనే హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్టార్ బౌలర్ రబాడ ఇచ్చిన సలహాలు గుర్నూర్కు చాలా ఉపయోగపడ్డాయి. అలా ఐపీఎల్ 2025 సీజన్కు ముందు జరిగిన వేలంలో గుర్నూర్ బ్రార్ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ అంత మంచి ప్రదర్శన చేయనప్పటికీ విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్లో అతడి ప్రదర్శన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టిలో పడిన గుర్నూర్ బ్రార్ను గతేడాది ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయడంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది.నిఖార్సైన ఆల్రౌండర్విదర్భకు చెందిన హర్ష్ దూబే నిఖార్సైన ఆల్రౌండర్, 2024-25 రంజీ సీజన్లో విదర్భ టైటిల్ గెలవడంలో హర్ష్ దూబేది కీలకపాత్ర. ఆ సీజన్లో హర్ష్దూబే మొత్తం 69 వికెట్లు పడగొట్టాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ తర్వాతి ఏడాది ఇండియా-ఏ జట్టులోకి ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీలో ప్రదర్శనకు గానూ హర్ష్దూబే బెస్ట్ ఆల్రౌండర్ (లాలా అమర్నాథ్) అవార్డు గెలుచుకున్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో కెప్టెన్గా విదర్భను నడిపించిన హర్ష్దూబే ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. దేశవాలీ క్రికెట్లో ప్రదర్శనతో హర్ష్ దూబేను ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హర్ష్దూబే ఆ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు. 2026 సీజన్కు ఎస్ఆర్హెచ్ అతడిని రిటైన్ చేసుకుంది.ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన హర్ష్దూబే 8 వికెట్లు తీశాడు.నిజానికి ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టు ద్వారానే హర్ష్దూబే అరంగేట్రం చేయాల్సింది. రవీంద్ర జడేజాకు విశ్రాంతి కల్పించడంతో మానవ్ సుతార్, హర్ష్దూబే పేర్లు వినిపించినప్పటికీ మానవ్ సుతార్ను తుదిజట్టులోకి ఎంపిక చేసింది. ఆడిన తొలి మ్యాచ్లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మానవ్ సుతార్ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. 𝗗𝗿𝗲𝗮𝗺 𝗰𝗼𝗺𝗲 𝘁𝗿𝘂𝗲 🧢🇮🇳Congratulations to Harsh Dubey and Gurnoor Brar on receiving their ODI debut caps from KL Rahul and Shubman Gill respectively 👏Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/GoZSxHSHVf— BCCI (@BCCI) June 13, 2026చదవండి: ‘అతడు వంద టెస్టుల గురించి ఆలోచించలేదు’ -
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ సిస్టర్స్
మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. స్కాట్లాండ్ స్టిస్టర్స్ కెప్టెన్ కేథరిన్ బ్రైస్, సారా బ్రైస్లు తమ బ్యాటింగ్తో అభిమానులను అలరించారు. ఈ ఇద్దరు స్వయానా అక్కాచెల్లి కావడం విశేషం. టోర్నీలో భాగంగా గ్రూప్-బిలో శనివారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ మహిళలు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు విఫలమైన వేళ అక్క కేథరిన్ బ్రైస్, ఆమె చెల్లి సారా బ్రైస్ ఐర్లాండ్ బౌలర్లను చితక్కొట్టారు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు శతక భాగస్వామ్యం (106 పరుగులు) నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ సిస్టర్స్ తమ బ్యాటింగ్తో అభిమానులను అలరించడమే గాక ఆ జట్టు తరఫున టీ20 ప్రపంచకప్లో శతకం భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు.39 బంతుల్లో 60 పరుగులు చేసిన కేథరిన్ బ్రైస్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక 35 బంతుల్లో 49 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో అర్థసెంచరీ చేజార్చుకున్న సారా బ్రైస్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.కాగా పురుషుల క్రికెట్లో బ్రదర్స్ కలిసి ఆడిన జట్టు ఏదైనా ఉందంటే ఐర్లాండ్ జట్టు మాత్రమే. ఈ జట్టులోనే ఎక్కువగా అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు ఉన్నాయి. ఓబ్రియన్ బ్రదర్స్ (కెవిన్, నీల్), టెక్టర్ బ్రదర్స్ (హ్యారీ, టిమ్, జాక్), అడెయిర్ బ్రదర్స్ (మార్క్, రాస్)లు ఐర్లాండ్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. A stunning 1️⃣0️⃣6️⃣ run partnership from Kathryn and Sarah Bryce 💪 pic.twitter.com/Hiviy2S6ZV— Cricket Scotland (@CricketScotland) June 13, 2026చదవండి: పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న బంగ్లా క్రికెటర్! -
పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న బంగ్లా క్రికెటర్!
బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెటర్, ఆఫ్-స్పిన్నర్ మొహమ్మద్ నయీమ్ హసన్ పోలీసుల చేతిలో చావుదెబ్బలు తినడం సంచలనం కలిగించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాను క్రికెటర్ అని చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని బంగ్లా క్రికెటర్ వాపోయాడు. ఈ విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నయీమ్ హసన్పై దాడిని ఖండిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలీసు కమిషనర్ క్షమాపణ..కాగా క్రికెటర్ నయీమ్ హసన్పై పోలీసుల దాడి విషయాన్ని తెలుసుకున్న చట్టోగ్రామ్ మెట్రోపాలిటన్ పోలీస్ (సీఎంపీ) కమిషనర్ హసన్ మహమ్మద్ షౌకత్ అతడి నివాసానికి వెళ్లాడు. నయీమ్ హసన్ను వేధించారనే ఆరోపణలపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఘటనపై నయీమ్ హసన్కు క్షమాపణ చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..బంగ్లాదేశ్లో జరిగే ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ముగించుకుని నయీమ్ హసన్ విమానంలో ఢాకా నుంచి చిట్టగాంగ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా, శుక్రవారం రాత్రి సుమారు 11:25 గంటల సమయంలో లంకన్ బజార్ ఫ్లైఓవర్ కింద పోలీసులు ఆయన ప్రయాణిస్తున్న ఆటోను ఆపారు. ఆ తర్వాత నయీమ్ హసన్ను ఆటో నుంచి బలవంతంగా దించి పోలీసు వాహనం ఎక్కించారు. తాను క్రికెటర్ను అని చెప్పినప్పటికీ మాట వినిపించుకోకుండా తనపై దౌర్జన్యంగా దాడి చేశారని నయీమ్ హసన్ తెలిపాడు. అతడు మాట్లాడుతూ..‘వారు డ్రైవర్ నుంచి పత్రాలు తీసుకున్నారు. అవసరమైతే నా బ్యాగ్ కూడా తనిఖీ చేసుకోమని నేను వారితో చెప్పాను. కానీ వారు నా గొంతు పట్టుకుని.. 'కారు ఎక్కు' అంటూ వారి వాహనంలోకి తీసుకెళ్లారు. ఎందుకు నా గొంతు పట్టుకున్నారు? అని నేను ప్రశ్నించగా, వారు నన్ను బయటకు తోసేసి, కొట్టి, అసభ్యకరంగా తిట్టారు. నేను దేశం తరఫున టెస్ట్ మ్యాచ్లు ఆడే జాతీయ క్రికెటర్ను అని చెప్పినా మొదట వినిపించుకోలేదు. ఆ తర్వాత నేను బోర్డుకు సమాచారం అందించడం, వాళ్లకు పై అధికారుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో వదిలేశారు’ అని నయీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక త్వరలో జింబాబ్వేతో జరగనున్న టెస్ట్ సిరీస్కు బంగ్లాదేశ్ జట్టులో నయీమ్ హసన్కు చోటు దక్కింది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2018లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మొహమ్మద్ నయీమ్ హసన్ 14 టెస్టుల్లో 235 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో 48 వికెట్లు పడగొట్టాడు.చదవండి: సెమీస్లో ముగిసిన పీవీ సింధు పోరాటం -
రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్తో తొలి వన్డేకు డౌట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రసిధ్ క్రిష్ణ వేసిన బంతిని ఆడే క్రమంలో రోహిత్ మిస్ చేయడంతో అతడి కుడిచేతి బొటనవేలిని బలంగా తాకింది. అయితే రోహిత్ శర్మ మాత్రం తన ప్రాక్టీస్ను కొనసాగించాడు. కానీ అర్ష్దీప్ సింగ్ వేసిన బంతులను ఆడడంలో రోహిత్ ఇబ్బంది పడడం చూస్తుంటే చేతివేలి గాయం పెద్దదిగానే కనిపిస్తోంది. దీంతో ఆఫ్గన్తో తొలి వన్డేలో రోహిత్ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ గాయంతో దూరమైతే గిల్తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. అప్పుడు వన్డౌన్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు రానున్నాడు. ఇక మరో సీనియర్ విరాట్ కోహ్లీ కండరాల గాయంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్, కోహ్లీకి చివరి టోర్నీ కానుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఇద్దరు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఇక రోహిత్ గాయంతో దూరమయ్యే అవకాశాలు ఉంటే మాత్రం అతడి స్థానంలో జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్.Rohit Sharma very rusty in the nets so far. Prasidh Krishna delivery hits him on the right thumb, plenty hitting the maker’s mark on the bat and then thick outside edge to a Arshdeep Singh delivery. pic.twitter.com/65M2pKVVeF— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 12, 2026చదవండి: ఫ్యాబ్-4: ఇద్దరు పోయారు.. మరో ఇద్దరు మిగిలారు! -
ఫ్యాబ్-4: ఇద్దరు పోయారు.. మరో ఇద్దరు మిగిలారు!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. అయితే కివీస్ క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్గా పేరు పొందిన కేన్ విలియమ్సన్ దాదాపు రెండు దశాబ్దాల పాటు బ్లాక్క్యాప్స్ బ్యాటింగ్ లైనప్కు వెన్నుముకలా నిలిచాడు. వివాదరహితుడిగా పేరున్న విలియమ్సన్ నిష్రమణ సగటు అభిమానిని బాధించే అంశం. అయితే టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ (టీమిండియా), జో రూట్ (ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)లను 2014లో దివంగత క్రికెటర్ మార్టిన్ క్రో ముద్దుగా ఫ్యాబ్-4 అని అభివర్ణించారు. ఈ తరంలో ఈ నలుగురు అత్యంత గొప్ప టెస్టు క్రికెటర్లని ఆయన కొనియాడారు. అందుకు తగ్గట్లే ఈ ఫ్యాబ్-4 తమ ఆటతో అభిమానుల మనసులు దోచుకున్నారు. అయితే ఫ్యాబ్-4 క్రమంగా కూలిపోతోంది. తాజాగా విలియమ్సన్ రిటైర్మెంట్తో ఈ ఫ్యాబ్-4 కాస్తా ఇప్పుడు ఫ్యాబ్-2గా మారిపోయింది. ఇప్పటికే కోహ్లీ టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పగా, తాజాగా కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. మిగిలిన ఇద్దరు క్రికెటర్లు జో రూట్, స్టీవ్ స్మిత్ కూడా మహా అయితే మరో రెండేళ్లు ఆడే అవకాశముంది. వీళ్లిద్దరూ కూడా రిటైరైతే ఫ్యాబ్-4 కథ కంచికి చేరనుంది.ఇక 16 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్న కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున 110 టెస్టులు, 175 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి 378 మ్యాచ్లాడిన కేన్ విలియమ్సన్ 19,346 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్గా కేన్ మామ కివీస్ తరఫున 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టీ20లకు సారథ్యం వహించాడు. కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్ 2021 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2015 వన్డే ప్రపంచకప్తో పాటు 2021 టీ20 ప్రపంచకప్లో ఫైనల్ చేరినప్పటికీ, రన్నరప్తోనే సరిపెట్టుకుంది.చదవండి: జస్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే! -
అతడిని విస్మరించొద్దు.. సెలెక్టర్లకు మాజీ క్రికెటర్ హెచ్చరిక!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు క్రికెట్లో వేగంగా ఆడుతాడనే పేరుంది. కానీ వన్డే, టీ20 క్రికెట్లో మాత్రం పంత్ ఆట పూర్తి విరుద్ధంగా ఉంటుంది. వేగంగా ఆడాల్సిన వన్డే, టీ20 క్రికెట్లో సరిగ్గా ఆడకపోవడం.. ఆచితూచి ఆడాల్సిన టెస్టు క్రికెట్లో వేగాన్ని చూపించడం పంత్ నైజం. అయితే ఇటీవలే పేలవ ఫామ్ కారణంగా వన్డే, టీ20 క్రికెట్లో చోటు కోల్పోయిన పంత్ టెస్టు జట్టులో మాత్రం స్థానం నిలుపుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల ఆటలో పంత్ ఆట ఇక ముగిసినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకవ్యాఖ్యలు చేశాడు. జియో హాట్స్టార్ ఇంటర్వ్యూలో పఠాన్ మాట్లాడాడు. పంత్ను వైట్బాల్ జట్టు నుంచి తొలగించినప్పటికీ 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో అతడిని పూర్తిగా విస్మరించివద్దని సెలెక్షన్ కమిటీని కోరాడు. 'వన్డే క్రికెట్ నుంచి తప్పించారనే నిరాశ వాదాన్ని వదిలేసి మళ్లీ ట్రాక్ ఎక్కితే పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాలో చోటు దక్కించుకోవడం పంత్కు పెద్ద కష్టమేమి కాదు. ఈ విషయంలో పంత్ తన సహచర క్రికెటర్లను ఆదర్శంగా తీసుకోవాలి. వన్డేల్లో వికెట్ కీపర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ తొలి ఛాయిస్. ఓపెనర్గా, అవసరమైతే ఐదు లేదా ఆరో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు. అతడికి బ్యాకప్గా ఇషాన్ కిషన్ ను తీసుకొచ్చారు. ఇషాన్ కూడా టాపార్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. షార్ట్పిచ్ బంతులను కూడా చక్కగా ఆడగలడు. బీసీసీఐకి మూడో ఆప్షన్ సంజు శాంసన్. అతడికి ఎప్పుడు అవకాశం వచ్చినా వన్డేల్లో సత్తా చాటడంలో ముందుంటాడు. గత టీ20 ప్రపంచకప్లోనూ శాంసన్ పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడటం చూశాం. పంత్ విషయంలో మాత్రం సెలక్టర్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2027 వన్డే ప్రపంచ కప్ సెలక్షన్స్లో పూర్తిగా అతడిని పక్కన పెట్టొద్దు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ఫామ్ గొప్పగా లేదని తెలుసు. గతంలో ఇషాన్ కిషన్ కూడా జట్టులో నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత రాణించి మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సారథిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని జార్ఖండ్కు అందించాడు. అందుకే అతడిని పంత్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వైట్బాల్ క్రికెట్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలి.' అని ఇర్ఫాన్ తెలిపాడు. పంత్ చివరిసారిగా 2024లో వన్డే మ్యాచ్ ఆడాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా జట్టులో ఉన్నప్పటికీ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ పంత్ కెప్టెన్గా, ఆటగాడిగా విఫలమయ్యాడు. లక్నో సూపర్జెయింట్స్ తరఫున 14 మ్యాచ్లాడిన పంత్ 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్గా జట్టును నడిపించడంలో విఫలమైన పంత్ పాయింట్ల పట్టికలో లక్నోను ఆఖరి స్థానంలో నిలిపాడు. దీంతో లక్నో యాజమాన్యం పంత్ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఐపీఎల్లో చెత్త ప్రదర్శన చేసినప్పటికీ ఇటీవలే ఆఫ్గన్తో జరిగిన టెస్టులో మాత్రం పంత్ ఆకట్టుకున్నాడు. 121 బంతులాడిన పంత్ 81 పరుగులు సాధించాడు. ఇక సౌతాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు రోహిత్, కోహ్లీలను నేరుగా ఎంపిక చేస్తారనే ఊహాగానాలను పఠాన్ తోసిపుచ్చాడు.చదవండి: అంతర్జాతీయ క్రికెట్కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన!
అప్గానిస్తాన్తో వన్డే సిరీస్కు గాయంతో దూరమైన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూలైలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ లెక్కన అభిమానులకు కోహ్లీ విషయంలో ఇది గుడ్న్యూస్.జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలోనే కోహ్లీ కండరాల గాయంతో సతమతమయ్యాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో చివరిదాకా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ కండరాల గాయం తీవ్రత పెరిగిపోయింది. దీంతో ఫైనల్ పూర్తయిన మరుసటి రోజే కోహ్లీ తన కాలిని స్కాన్ చేయించుకున్నాడు. రిపోర్ట్లో కోహ్లి కాలిలో ఉండే డిస్టల్ సెమిమెంబ్రానోనస్ టెండన్ టియర్లో చీలిక వచ్చినట్లు తేలింది. డిస్టల్ సెమిమెంబ్రానోనస్ అనేది మోకాలి వెనుక భాగంలో ఉంటుంది. దీనిలో చీలిక వస్తే అది కాలి కండరాలను తీవ్రంగా బాధిస్తోంది. ఇది అత్యంత అరుదుగా జరుగుతుందని, కోలుకోవడానికి ఒక్కోసారి ఆరు నెలలు సమయం పడుతుందని వైద్యబృందం తెలిపింది. కానీ కోహ్లీ విషయంలో అద్భుతం జరిగిందని, అతడి అసామాన్యమైన ఫిట్నెస్ కారణంగా నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటాడని పేర్కొన్నారు. దీంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడనే వార్తలు వస్తున్న వేళ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్లో ఇప్పటికే చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 37 ఏళ్ల కోహ్లీ కెరీర్లో ఇప్పటివరకు 85 అంతర్జాతీయ సెంచరీలున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి ఆఖరి టోర్నీ అని ప్రచారం జరుగుతున్న వేళ టీమిండియా ఆ టోర్నీ వచ్చేలోగా స్వదేశం, విదేశం కలిపి సుమారు 28 నుంచి 30 వన్డేల వరకు ఆడే అవకాశముంది. ఇందులోనే ఆసియా కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఉన్నాయి. ఈ లెక్కన సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు.చదవండి: భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం? -
ఐదేళ్ల తర్వాత హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో ఇవాళ (జూన్ 11) జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టులో ఓ ఆశ్చర్యం చోటు చేసుకుంది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ ముందుగా ప్రకటించిన జట్టులో లేకపోయినా, అనూహ్యంగా తుది జట్టులో ప్రత్యక్షమయ్యాడు. మరో ఆశ్చర్యం ఏంటంటే, మెరిడిత్ దాదాపుగా ఐదేళ్లుగా వన్డే జట్టులో లేడు. అలాంటి ఆటగాడు హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం కావడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.ముందుగా జట్టులో లేని మెరిడిత్ను తుది జట్టులో తీసుకోవడం ఆసీస్ వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. తొలి వన్డేలో భారీ ఓటమి తర్వాత సిరీస్ను కాపాడుకోవాలన్న ఒత్తిడిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెరిడిత్ చివరిగా 2021 జులైలో వెస్టిండీస్పై ఓ వన్డే ఆడాడు. ఇదే అతని కెరీర్లో చివరిది, మొదటది. ఆ మ్యాచ్లో 5 ఓవర్లు వేసిన మెరిడిత్ 36 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత అతను వన్డేల్లో అవకాశాలు రాక, టీ20 ఫార్మాట్కు మాత్రమే పరిమితం అయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్ బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో ఆ జట్టు మరింత దారుణంగా ఖాతా తెరవకుండానే ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. ఆ దేశ వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత మూడు వన్డేల్లోనూ ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. తాజా ఉదంతంలో ఓపెనర్లు షార్ట్, కన్నోల్లీ, నాలుగో నంబర్ ఆటగాడు రెన్షా డకౌట్లయ్యారు.లబూషేన్ (55 నాటౌట్), బార్ట్లెట్ (52) బాధ్యతాయుతంగా ఆడటంతో ఆసీస్ అతికష్టం మీద 42 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతానికి మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్, బార్ట్లెట్తో పాటు కెప్టెన్ ఇంగ్లిస్ (34), గ్రీన్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మరో బ్యాటర్ (జంపా) కూడా డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (7-2-27-3), తస్కిన్ అహ్మద్ (8-1-33-3) చెలరేగి బౌలింగ్ చేశారు. ఆసీస్ ఈ మ్యాచ్ కూడా కోల్పోతే, వరుసగా రెండో సిరీస్ను చేజార్చుకున్నట్లవుతుంది. ఈ సిరీస్కు ముందు పాక్ చేతిలోనూ ఆసీస్ 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆసీస్ నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. -
పాక్ కెప్టెన్పై వేటు.. హెడ్కోచ్పై వేళాడుతున్న కత్తి!
పాకిస్తాన్ టెస్టు కెప్టెన్సీ పదవి నుంచి షాన్ మసూద్ను తొలగించే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. షాన్ మసూద్తో పాటు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నతాధికారులు వారాంతంలో సమావేశం కానున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ పర్యటనలో బంగ్లా చేతిలో పాకిస్తాన్ 0-2తో టెస్టు సిరీస్లో వైట్వాష్ కావడంతో షాన్ మసూద్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించిన సల్మాన్ అలీ అఘాకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు వినిపించాయి. దీంతో షాన్ మసూద్, కోచ్ సర్ఫరాజ్ అహ్మద్లు రాబోయే ఇంగ్లండ్, వెస్టిండీస్ టూర్ వరకు కొనసాగుతారా లేక తొలగిస్తారా అనేది మీటింగ్లో తేలిపోనుంది. ఇదే విషయంపై పీసీబీ సెలెక్టర్ ఒకరు స్పందించారు. ‘పాకిస్తాన్ టెస్టు కెప్టెన్గా సల్మాన్ అలీని నియమించడానికి బోర్డు అధికారులు ఇప్పటికే అనుమతి ఇచ్చారని, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నాం. ఇక సర్ఫరాజ్ అహ్మద్ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ హెడ్కోచ్ను కూడా మార్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. సర్ఫరాజ్ స్థానంలో మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ హెడ్కోచ్గా వచ్చే చాన్స్ ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సల్మాన్ అలీ అఘా పరిమిత ఓవర్ల కెప్టెన్గా కొనసాగుతున్నాడు. టెస్టు జట్టుకు కూడా అతడే నాయకత్వం వహించనుండడం లాంఛనం కానుంది. అయితే హెడ్కోచ్ పదవికి యూనిస్ఖాన్తో పాటు మరో మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం జరిగే మీటింగ్లో ఈ విషయాలపై పూర్తి స్పష్టత రానుంది.చదవండి: ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీ ఎంతో తెలుసా? -
సెలెక్షన్ కమిటీపై భువనేశ్వర్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తనను జాతీయ జట్టకు ఎంపిక చేయకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను ఎంపిక చేయాలని ఎవరిని అడుక్కోనని, టాలెంట్ను గుర్తించి జట్టులోకి ఎంపిక చేస్తే ఆడుతానంటూ భువీ కుండబద్దలు కొట్టాడు. టీమిండియాకు చాలాకాలం క్రితమే దూరమైన 36 ఏళ్ల భువనేశ్వర్ ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆర్సీబీ తరఫున ఆడిన భువనేశ్వర్ 28 వికెట్లతో అదరగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో భువనేశ్వర్ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఇటీవలే ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆసియా గేమ్స్కు సంబంధించి టీమిండియా జట్లను ప్రకటించిన బీసీసీఐ భువనేశ్వర్కు మరోసారి మొండిచేయి చూపించింది. అయితే రెస్ట్ పేరుతో సిరాజ్ను ఈ టోర్నీల నుంచి తప్పించడంతో భువీ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. కానీ అనూహ్యంగా సిరాజ్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో భువనేశ్వర్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే బుధవారం భువనేశ్వర్ కుమార్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇంటర్య్వూ ఇచ్చాడు. 'నేను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. కానీ నా మనసులో ఉన్న మాటలను బయటపెట్టకపోవడం నా నైజం. ప్రతీ ఒక్కరు తమ పని తాము చేస్తున్నట్లే నా పని నేను చేస్తున్నా. బీసీసీఐ సెలెక్టర్లు కూడా వారి పని చేస్తున్నారు. ఎంపిక చేయడం, చేయకపోవడం వారి బాధ్యత. నేను సరిపోతానని భావిస్తే, వాళ్లే ఎంపిక చేస్తారు. నన్ను ఎంపిక చేయమని ఎవరిని అడగను. టీమిండియా తరఫున ఆడాలనే కోరిక ఇప్పటికీ నాలో బలంగా ఉంది. నేను మెరుగైన ప్రదర్శన చేస్తున్నా. టీమిండియా తరఫున ఆడడాన్ని ఇప్పటికీ ఒక అదృష్టంగానే భావిస్తాను.' అని ముగించాడు.టీమిండియాకు ఎంతోకాలం ఫ్రంట్లైన్ బౌలర్గా సేవలందించిన భువనేశ్వర్ 2022లో టీమిండియా తరఫున చివరిసారి ఆడాడు. నేపియర్లో న్యూజిలాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ భువీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్కు పరిమితమైన తర్వాత సీనియర్లను పక్కనబెట్టి, యువ బౌలర్లకు అవకాశం ఇచ్చేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపింది. దీంతో భువనేశ్వర్ కుమార్ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో 2018లోనే భువీ టెస్టు కెరీర్ ముగిసిపోయింది. మరి ఈ లెక్కన భువనేశ్వర్ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడా అంటే చెప్పడం కష్టమే. 36 ఏళ్ల వయసులోనే తన బౌలింగ్లో పదును తగ్గని భువనేశ్వర్ను ఆడించాలనుకుంటే మాత్రం ఇదే మంచి అవకాశం. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో చాలా మార్పులు జరగనున్నాయి. రోహిత్, కోహ్లీ, జడేజా వంటి క్రికెటర్లు వీడ్కోలు పలికే అవకాశముంది. ఇప్పటికే ఐపీఎల్ పుణ్యమా అని ప్రిన్స్యాదవ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా వంటి బౌలర్లు రేపటి భారత బౌలింగ్ భవిష్యత్తుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నారు.చదవండి: స్టోక్స్పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్? -
స్టోక్స్పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్?
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సహచర బౌలర్ గస్ అట్కిన్సన్లు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బోర్డు అనుమతి లేకుండా నైట్క్లబ్కు వెళ్లిన స్టోక్స్, అట్కిన్సన్ ఫూటుగా తాగి బీర్బాటిళ్లు విసిరేసి అపరిచితులపై దాడి చేశారు. దీంతో జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు న్యూజిలాండ్తో రెండో టెస్టుకు వీరిద్దరిని సస్పెండ్ చేసే అవకాశముంది. స్టోక్స్, అట్కిన్సన్పై చర్యలు తీసుకోవడానికి ముందు మరింత సమాచారం సేకరిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. సమాచార సేకరణలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఈసీబీ పేర్కొంది. ఈసీబీ తెలిపిన ప్రకారం.. స్టోక్స్ దాడి చేయడానికి ముందే రగ్బీ ఆటగాడు, 21 ఏళ్ల టోటోవా ఔవా స్టోక్స్, అట్కిన్సన్లపై పిడిగుద్దుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. టోటోవా ఔవాను కించపరిచే విధంగా స్టోక్స్ మాట్లాడాడని, ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నైట్క్లబ్లోనే స్టోక్స్, అట్కిన్సన్లతో టోటోవా ఔవాతో పాటు అతడి సహచరులు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టోక్స్ను కిందపడేసి టోటోవా పిడి గుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన అట్కిన్సన్ను కూడా చితకబాదాడు. అయితే గొడవ పతాక స్థాయికి చేరడంతో బౌన్సర్లు వారందరిని బయటికి పంపించేశారు. అయితే బయటికి వచ్చాకా స్టోక్స్, అట్కిన్సన్లు తమ వద్ద ఉన్న బీర్ బాటిళ్లను విసిరి టోటోవా అనుచరులను కిందపడేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడడం వీడియోలో బయటపడింది. ఈ దాడికి ముందే టోటోవా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఈసీబీ తెలిపింది. ఈ సమాచారం మొత్తం తమకు నైట్క్లబ్ సీసీటీవీ ఫుటేజీలో దొరికిందని వెల్లడించిన ఈసీబీ.. స్టోక్స్, అట్కిన్సన్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ స్టోక్స్పై వేటు పడితే కివీస్తో రెండో టెస్టుకు హ్యారీ బ్రూక్ జట్టును నడిపించనున్నాడు.ఎవరీ టోటోవా?ఇంగ్లండ్ క్రికెటర్ స్టోక్స్పై పిడిగుద్దుల వర్షం కురిపించిన టోటోవా ఔవా ఎవరని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. రగ్బీ ప్లేయర్ అయిన టోటోవా సరసెన్స్ అకాడమీలో రగ్బీ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఇప్పటివరకు రగ్బీ మ్యాచ్ ఆడలేదు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 125 కిలోల బరువుతో బాహుబలి రూపంతో ఆకర్షిస్తున్నాడు. స్టోక్స్తో గొడవపడిన టోటోవా ఔవా రాత్రికిత్రే స్టార్ అయి పోయాడు.Ben Stokes, the real street fighter 😭 waiting for the new fight video pic.twitter.com/iK0at0nSvg— Santoshvk18 (@269signofff) June 8, 2026చదవండి: మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరం! -
మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరం!
అప్గానిస్తాన్తో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమయ్యాడు. అయితే మంగళవారమే రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా తమ ఫిట్నెస్ను నిరూపించుకొని క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందినట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఈ ఇద్దరు ఆడుతారని బీసీసీఐ తెలిపింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. రీఎంట్రీ కోసం సీవోఈలో శిక్షణ తీసుకుంటున్న పాండ్యా బౌలింగ్ వేస్తున్న క్రమంలో అతడి కాలు బెణికినట్లు సమాచారం. దీంతో అతడు కోలుకోవడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయం కావడంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని మెడికల్ టీమ్ వెల్లడించింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు పాండ్యా దూరమైనట్లే. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక సీవోఈ నుంచి క్లియరెన్స్ పొందిన రోహిత్ శర్మ మాత్రం ఆఫ్గన్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో పాండ్యా వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో సీజన్ ఆఖర్లో ముంబై జట్టుకు దూరమైన పాండ్యా నేరుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి చేరుకున్నాడు. పాండ్యా కోలుకొని ఫిట్నెస్ క్లియరెన్స్ కూడా సాధించడంతో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఈ ఆల్రౌండర్ మళ్లీ గాయానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో చీలమండ గాయంతో పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్ను 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి పాండ్యా వరుస గాయాలతో సతమతమవుతూనే వస్తున్నాడు.చదవండి: మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం -
గెలిచామన్న గర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్!
బంగ్లాదేశ్ తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత ఆసీస్ను మట్టికరిపించిన బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే గెలిచామన్న గర్వమో లేక పొగరో తెలియదు కానీ బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రానా ఆస్ట్రేలియా కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ను స్లెడ్జింగ్ చేయడం మ్యాచ్లో హాట్టాపిక్గా మారింది. విషయంలోకి వెళితే.. 285 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ గోల్డెన్ డక్గా వెనుదిరగ్గా, మార్నస్ లబుషేన్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో కూపర్కు జత కలిసిన ఇంగ్లిస్ ఆసీస్ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. వీరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో నహీద్ రానా 11వ ఓవర్లో బౌలింగ్కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఇంగ్లిస్ను పెవిలియన్ చేర్చాడు. ఔట్సైడ్ అయిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో ఇంగ్లిస్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇంగ్లిస్ పెవిలియన్ వైపు వెళుతున్న తరుణంలో నహీద్ రానా అతడిని ఉద్దేశించి ఏదో అన్నాడు. ఇది విన్న ఇంగ్లిస్ నేరుగా నహీద్ రానావైపు దూసుకొచ్చి ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ ఇంగ్లిస్ను అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత నహీద్ రానా వద్దకు వచ్చిన మెహదీ హసన్.. ఎమోషన్ కంట్రోల్ చేసుకో అని అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడాడు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు. Big Wicket for Bangladesh! Josh Inglis departs. Caught by Litton Das, bowled by Nahid Rana! pic.twitter.com/waRZRvW6mX— Bangladesh Cricket (@BCBtigers) June 9, 2026చదవండి: 'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్ అరుదైన ఫీట్!
వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షార్పణమైంది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను లంక 1-0తో కైవసం చేసుకుంది. దీంతో విండీస్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన మూడో కెప్టెన్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో అర్జున రణతుంగ, ఆటపట్టు ఈ ఫీట్ను సాధించారు. జమైకా వేదికగా జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది.కనీసం టాస్ వేసేందుకు కూడా వరుణుడు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని, మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో వన్డే కూడా వర్షార్పణమైన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో మాత్రం శ్రీలంక జట్టు 41 పరుగుల తేడాతో గెలిచింది. కరీబియన్ గడ్డపై 13 ఏళ్ల తర్వాత లంక విజయం సాధించడం విశేషం. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ గురువారం నుంచి మొదలుకానుంది. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్లు కూడా జరగనున్నాయి.చదవండి: రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్! -
రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పాండ్యాకు బీసీసీఐ సీఓఈ స్పోర్ట్స్ బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన పలు మ్యాచ్ సిమ్యులేషన్లలో పాండ్యా పాల్గొన్నాడని, ఎక్కడా అసౌకర్యంగా కనిపించలేదని మెడికల్ బృందం తెలిపింది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న భారత్, ఆఫ్గన్ తొలి వన్డేలో పాండ్యా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ శుభవార్త చెప్పాడు. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు రోహిత్, పాండ్యా అందుబాటులో ఉంటారని తెలిపాడు. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్కు సంబంధించి సర్టిఫికెట్ను మెడికల్ సీవోఈ బృందం ఇంకా అందించలేదు. అయితే తనకు అందిన సమాచారం మేరకు రోహిత్, పాండ్యా ఫిట్నెస్ నిరూపించుకున్నారని, అయితే మెడికల్ టీమ్ ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదని తెలిపాడు. అయితే వారి నుంచి ఒక్కసారి క్లియరెన్స్ వస్తే మాత్రం రోహిత్, పాండ్యాలు ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఆడతారని స్పష్టం చేశాడు. కానీ వన్డే సిరీస్లో ఈ ఇద్దరూ పాల్గొనాలంటే పాండ్యా, రోహిత్లు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్లకు అందుబాటులో లేడు. కండరాల గాయంతో గ్రూప్ దశలో ఐదు మ్యాచ్కు దూరమవ్వగా, పాండ్యా లీగ్ ఆఖరి దశలో వెన్నునొప్పి కారణంగా చివరి మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత పాండ్యా, రోహిత్ శర్మలు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి వచ్చారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు! -
వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు!
టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ శ్రీలంక-ఏతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో విఫలమయ్యాడు. ఓపెనర్గా వచ్చిన వైభవ్ 12 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడు ఫోర్లతో ఊపు మీద కనిపించినప్పటికీ మొహమ్మద్ షిరాజ్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన వైభవ్ మిడాఫ్లో దొరికిపోయాడు. వైభవ్ కొట్టిన బంతిని సాహన్ అరాచిగే ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో వైభవ్ చెలరేగుతాడని ఆశించిన అభిమానులు నిరాశే ఎదురైంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన నెట్ సెషన్లో వైభవ్ కొంత సమయం రక్షణాత్మక బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాడు. సాధారణంగా దూకుడైన ఆటకు పెట్టింది పేరైన వైభవ్ వన్డే మ్యాచ్ కావడంతో పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇవాళ్టి మ్యాచ్లో మాత్రం వైభవ్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇండియా-ఏ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 7 ఓవర్లు ముగిసేసరికి ఇండియా జట్టు 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (12), రుతురాజ్ గైక్వాడ్ (2) పరుగులతో ఆడుతున్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్లో తనడైన ముద్ర వేశాడు. దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికించిన వైభవ్.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.టీ20 ఫార్మాట్ లో ఇప్పటికే తన ముద్ర వేసిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న యువ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతడి దూకుడైన శైలి, భారీ షాట్లు ఆడగల సామర్థ్యం భారత క్రికెట్ వర్గాల్లో అంచనాలు పెంచాయి. ఇప్పుడు శ్రీలంక-ఏ, ఆ తర్వాత అఫ్గానిస్థాన్-ఏ జట్లపై కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు.గతేడాది ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్లో యూఏఈపై ఇండియా-ఏ తరఫున వైభవ్ కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు బాదిన విషయం ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఆ ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బుడ్డాడు.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా అదే స్థాయి ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.Vaibhav Suryavanshi started brightly with a few beautiful strokes, but his innings was cut short on 14 off 12 balls, including three boundaries. pic.twitter.com/a2RiJi4SNn— CofCricket (@CofCricket) June 9, 2026చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం! -
అతడికి షరతులు వర్తించవా?.. అగార్కర్కు చురకలు!
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్కు సంబంధించి టీమిండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో ఆటగాళ్ల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్కు ముందు గాయానికి గురైన పేసర్ హర్షిత్ రాణా అప్పటినుంచి ఒక్క మ్యాచ్ ఆడకపోయినప్పటికీ మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. హర్షిత్ రాణా ఎంపికపై భారత మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేశ్ అసహనం వ్యక్తం చేశాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఏ ప్రాతిపాదికన హర్షిత్ రాణాను ఎంపిక చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి ఎంపికల వల్ల మహ్మద్ షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మాట్లాడుతూ..‘హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు? మోకాలి శస్త్రచికిత్స అనంతరం దేశవాలీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా ఇప్పుడు మూడు జట్లకు ఎంపిక చేయడం పట్ల సమాధానం మాత్రం ఉండదు. కొన్నాళ్లుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీ లాంటి క్రికెటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు. దేశవాలీ క్రికెట్లో ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాలనే నిబంధనను హర్షిత్ రాణా విషయంలో సెలెక్షన్ కమిటీ గాలికొదిలేసింది. కోహ్లీ, రోహిత్ ఇలా ఎవరైనా ఫిట్నెస్ నిరూపించుకుంటూనే జట్టులో చోటు ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. పాండ్యా గాయపడినప్పుడు కూడా జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందేనని అల్టీమేటం జారీ చేశారు. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ను కూడా న్యూజిలాండ్తో వన్డేలకు ముందు విజయ్ హజారే ట్రోఫీ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని కోరారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ హర్షిత్ రాణా విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడికి ఈ షరతులు ఎందుకు వర్తించవనేది అగార్కర్ సమాధానం చెప్పాలి.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక హర్షిత్ రాణా 2026 టీ20 ప్రపంచకప్కు టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ వార్మప్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 సీజన్కు కూడా దూరంగా ఉన్నాడు.చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం! -
టీ20 ముంబై లీగ్లో అర్జున్ టెండూల్కర్ విధ్వంసం!
టీ20 ముంబై లీగ్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ విజృంభించాడు. టోర్నీలో ఏఆర్సీఎస్ అంధేరీ తరఫున ఆడుతున్న అర్జున్ సోమవారం బాంద్రా బ్లాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. మొదట బౌలింగ్లో మూడు వికెట్లు (3-1-11-3) కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో వన్డౌన్లో వచ్చిన అర్జున్ టెండూల్కర్ 34 బంతుల్లోనే 66 పరుగులు అజేయ ఇన్నింగ్స్తో మ్యాచ్లో వన్మ్యాన్ షో ప్రదర్శన చేశాడు. అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 25 బంతుల్లోనే ఫిప్టీ మార్క్ను అందుకున్న అర్జున్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అర్జున్ విధ్వంసంతో అంధేరీ 145 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ముషీర్ఖాన్ (38 బంతుల్లో 58 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్ అర్జున్ టెండూల్కర్ ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. ఓమ్ కేశ్కామత్ (36 బంతుల్లో 49) టాప్ స్కోరర్ కాగా, సాగర్ ఛాబ్రియా (23 బంతుల్లో 44) రాణించాడు. అర్జున్ మూడు వికెట్లు తీయగా, ప్రసూన్ సింగ్ 2, అజమ్ మిశ్రా, శివమ్ దూబే, ముషీర్ ఖాన్, ప్రగ్నేశ్లు తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆడింది ఒక్క మ్యాచ్ అయినప్పటికీ, తన ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసిన అర్జున్ 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.Arjun Tendulkar picked up a wicket in his very first over, but the funniest part was Musheer Khan going in for the high-five 😭 Arjun hit his hand so hard Musheer was genuinely shocked and started telling everyone on the field to look at how hard he got hit 😂💀 pic.twitter.com/ldx9GCD2po— OldMonkOfCricket (@OldMonkofCric) June 9, 2026Match 16 | AA v BB: A performance to remember! Arjun Tendulkar bags the Player of the Match honours.📌 June 1-13 | Wankhede Stadium.🎟️ Tickets live at the link in bio. 🎥 Watch live on Jio Hotstar and Star Sports.🌐 Track live on https://t.co/2GVUXSuuuk and the T20 Mumbai… pic.twitter.com/2C4JBSxKVw— T20 Mumbai (@T20Mumbai) June 8, 2026Arjun Tendulkar hit such a massive six in today’s T20 Mumbai League match that the ball landed in the stands and struck a young child. The child appeared to be in a lot of pain and started crying loudly.😢 pic.twitter.com/yJIyGc3Oit— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 8, 2026 -
'ఆర్సీబీలోకి రావడమే ఇష్టం లేదు'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును(ఆర్సీబీ) వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలిపిన అరుదైన కెప్టెన్గా రజత్ పాటీదార్ నిలిచాడు. వరుసగా ఒక జట్టుకు రెండు టైటిల్స్ అందించిన కెప్టెన్ల జాబితాలోనూ (ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ) పాటీదార్ చోటు దక్కించుకున్నాడు. తాజాగా పాటీదార్ మొదట్లో తనకు ఆర్సీబీకి ఆడడం ఇష్టం ఉండేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. యూట్యూబ్ చానెల్లో రోటోరిస్ సిరీస్లో జరిగిన ఇంటర్వ్యూలో పాటీదార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2021లో ఆర్సీబీ జట్టులో చేరిన తనను మొదట ఒక ప్రత్యామ్నాయ ఆటగాడిగా మాత్రమే చూశారని, అదే సమయంలో తన పెళ్లి ఉండడంతో మొదట ఆర్సీబీలో చేరేందుకు ఇష్టపడలేదని వెల్లడించాడు. పాటీదార్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పింది నిజమే. ఆర్సీబీ జట్టులోకి రావడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను తొలిసారి ఆ జట్టులోకి వచ్చిన సమ యంలో ప్రత్యామ్నాయంగానే చూశారు. తుది జట్టులో చోటు ఇవ్వరన్న విషయం క్లారిటీ ఉండడంతో ఆర్సీబీకి ఆడేందుకు సంకోచించాను. ఆర్సీబీలో జాయిన అయిన మొదట్లో కూడా అలాంటి సంకేతాలే వచ్చాయి. మేము నిన్ను ప్రత్యామ్నాయంగా మాత్రమే తీసుకున్నాం. కాబట్టి ప్రశాంతంగా ఉండు. ఎవరైనా గాయపడితే నీకు అవకాశం వస్తుంది అని ఆర్సీబీ యాజమాన్యం క్లియర్గా చెప్పింది. దీంతో ఆర్సీబీలోకి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అదే సమయంలో నా పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఒకవేళ ఆర్సీబీలోకి వచ్చినా బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చేది’ అని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ 2021 సీజన్కు ముందు జరిగిన మినీ వేలంలో పాటిదార్ను ఆర్సీబీ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో పెద్దగా ఆడే అవకాశం రాని పాటీదార్ నాలుగు మ్యాచ్ల్లో 71 పరుగులు మాత్రమే చేశాడు. 2022 ఐపీఎల్ మెగావేలంలో పాటీదార్ను ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే సీజన్ మధ్యలో లవ్నిత్ సిసోడియా గాయపడడంతో అతడి స్థానంలో పాటీదార్ను తీసుకుంది. ఈసారి పాటీదార్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సీజన్ ఎలిమినేటర్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో పాటీదార్ అజేయ సెంచరీ ( 112 పరుగులు నాటౌట్) సంచలన ఇన్నింగ్స్తో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత పాటీదార్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఐపీఎల్ 2025 మెగావేలం తర్వాత ఆర్సీబీ పాటీదార్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్గా తొలి సీజన్లోనే పాటీదార్ ఆర్సీబీని చాంపియన్గా నిలిపాడు. తాజాగా ఈ సీజన్లోనూ మరోసారి ఆర్సీబీని చాంపియన్గా నిలిపి లక్కీ కెప్టెన్ అయిపోయాడు. పాటీదార్ కెప్టెన్గానే గాక బ్యాటర్గాను అదరగొట్టాడు. ఈ సీజన్లో పాటీదార్ 15 మ్యాచ్ల్లో 501 పరుగులు సాధించాడు.చదవండి: రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే? -
రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే?
క్రికెట్లో మనకు తెలియని పదాలు చాలానే ఉంటాయి. అయితే ఇందులో మనకు ముఖ్యంగా వినిపించే పదాలు క్యాచ్ అవుట్, రనౌట్, రిటైర్డ్ హర్ట్ అనేవి కామన్గా ఉంటాయి. తాజాగా టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్గన్ రెండో ఇన్నింగ్స్లో షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో అఫ్గానిస్తాన్ 9వ వికెట్ కోల్పోగానే ఆలౌట్ అయినట్లు బిగ్స్క్రీన్పై ప్రత్యక్షమయ్యింది. దీంతో ఆబ్సెంట్ హర్ట్ అనే పదం చర్చకు దారి తీసింది.ఆబ్సెంట్ హర్ట్ అంటే?ఒక ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకముందే, అతను అనారోగ్యంతో లేదా గాయంతో బరిలోకి దిగకపోతే దీనిని ఏబీఎస్ హర్ట్గా సూచిస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని నిరూపిస్తూ కంకషన్ అని ప్రకటిస్తే తప్ప, అతడి స్థానంలో మరొక బ్యాటర్ను ఆడించేందుకు వీలుండదు. ఆ సమయంలో సదరు జట్టు ఒక బ్యాటర్ లేకుండానే ఆటను కొనసాగించాల్సి వస్తుంది. ఆఫ్గన్ బ్యాటర్ అష్రఫ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో జట్టు మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్కు పంపలేదు. దీంతో తొమ్మిదో వికెట్ కోల్పోయిన అనంతరం ఆఫ్గన్ ఆలౌటైన్లు ప్రకటించారు.రిటైర్డ్ హర్ట్ అంటే?ఇక రిటైర్డ్ హర్ట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయానికి గురైతే మైదానం వీడడం, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తాను ఆడగలననుకుంటే మళ్లీ క్రీజులోకి రావడాన్ని రిటైర్డ్ హర్ట్ అని పిలుస్తారు. ఈ రూల్ క్రికెట్లో ఎప్పటినుంచో అమల్లో ఉంది.రిటైర్డ్ ఔట్ అంటే?మ్యాచ్లో ఒక ఆటగాడు గాయం లేదా అంపైర్ అనుమతి లేకుండా తనంతట తానుగా క్రీజు వీడడాన్ని రిటైర్డ్ ఔట్ అంటారు. ఇలా చేస్తే మళ్లీ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉండదు. జట్టు స్కోరు పెంచాలనుకునే క్రమంలో హిట్టర్కు అవకాశం ఇచ్చేందుకు ఈ మధ్యన రిటైర్డ్ ఔట్ను ఆయా జట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.చదవండి: ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్! -
ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మూడో రోజుల్లోనే ముగిసింది. మ్యాచ్లో టీమిండియా ఆఫ్గన్ను ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టీమిండియా స్పిన్నర్లు మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను తిప్పేయడంతో అఫ్గానిస్తాన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా భారీ విజయం సాధించినప్పటికీ ఆఫ్గన్ ఇన్నింగ్స్ ఆఖర్లో గందరగోళం నెలకొంది. ఆఫ్గన్ ఇన్నింగ్స్లో 35.5 ఓవర్లో మొహమ్మద్ సలీమ్ సఫీ 9వ వికెట్గా వెనుదిరిగిన తర్వాత ఆఫ్గన్ ఆలౌటైనట్లు బిగ్స్క్రీన్పై వచ్చింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు సహా మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు. మరో వికెట్ ఉండగానే ఆలౌట్ ప్రకటించడం ఏంటని చర్చించుకున్నారు. అయితే ఫీల్డ్ అంపైర్ వచ్చి 11వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయం కారణంగా ఆబ్సెంట్ హర్ట్ అయ్యాడని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ సమయంలోనే అష్రఫ్ కాలి గాయానికి గురవ్వడంతో బ్యాటింగ్కు రాలేదు. దీంతో టీమిండియా జట్టులో సంబరాలు షురూ అయ్యాయి.మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (100), శుబ్మన్ గిల్ (126) శతకాలతో చెలరేగగా, సాయి సుదర్శన్ (81), పంత్ (81), సుందర్ (52) అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. ఆఫ్గన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో అఫ్గానిస్తాన్ 152 పరుగులకే కుప్పకూలింది. రహమత్ షా (60) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో మానవ్ సుతార్ 6 వికెట్లతో చెలరేగగా, ప్రసిధ్ క్రిష్ణ 3 వికెట్లు తీశాడు. దీంతో ఫాలోఆన్ ఆడిన అఫ్గానిస్తాన్ 112 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: టీమిండియాకు షాక్.. ఆఫ్గన్పై గెలిచినా దండగే! -
టీమిండియాకు షాక్.. ఆఫ్గన్పై గెలిచినా దండగే!
అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక అఫ్గానిస్తాన్ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. అయితే ఆఫ్గన్పై భారీ విజయం సాధించినప్పటికీ వరల్డ్ టెస్టు చాంపియన్షిఫ్ (డబ్ల్యూటీసీ) పట్టికలో భారత్ స్థానం మాత్రం మారకపోవచ్చు. ప్రస్తుతం గిల్ సేన 48.15 పర్సంటేజ్ పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. మరి ఆఫ్గన్పై టెస్టు విజయం సాధించినా డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారకపోవడానికి కారణమేంటనేది తెలుసుకుందాం. అఫ్గానిస్తాన్తో టెస్టు మ్యాచ్ డబ్ల్యూటీసీ చాంపియన్షిప్ సైకిల్లో లేదు. అందుకే ఈ మ్యాచ్లో భారీ విజయం సాధించినా ఎలాంటి పాయింట్లు రావు. అందుకే డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారదు. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 9 టెస్టుల్లో నాలుగింట గెలిచింది. భారత్ తన డబ్ల్యూటీసీ సైకిల్ను ఇంగ్లండ్ టూర్తో మొదలుపెట్టింది. ఇంగ్లండ్తో సిరీస్ను డ్రా చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికా చేతిలో మాత్రం క్లీన్స్వీప్కు గురైంది.అయితే వెస్టిండీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (8 టెస్టుల్లో 7 విజయాలు) 87.50 పర్సంటైల్తో తొలి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (75 పర్సంటైల్తో) రెండో స్థానంలో, శ్రీలంక (66.67 పర్సంటైల్తో) మూడో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (58.33), బంగ్లాదేశ్ (58.33) పర్సంటైల్తో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇంగ్లండ్ (37.88) ఏడో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ (8.33), వెస్టిండీస్ (4.13) పర్సంటైల్ పాయింట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.Leaving New Chandigarh with a massive win under the belt 🇮🇳A complete team performance from #TeamIndia 🤍Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MxUFJHvoq4— BCCI (@BCCI) June 8, 2026చదవండి: ‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్ అసహనం! -
‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్ అసహనం!
జూన్ 11 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి పొట్టి ప్రపంచకప్కు ఇంగ్లండ్ వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్లో పాల్గొంటున్న ఆయా జట్ల కెప్టెన్లు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా లండన్లో ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొంది.ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ హర్మన్ప్రీత్ కౌర్ను ఉద్దేశించి..‘హర్మన్ప్రీత్ కౌర్.. ఇది మీకు చివరి టీ20 ప్రపంచ కప్ అవుతుందా? దీనిపై మీరేమంటారు?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా అసహనానికి గురైన హర్మన్ప్రీత్ కౌర్.. ‘ఇది నా చివరి వరల్డ్ కప్ ఎందుకు అవుతుంది? నేనేమైనా రిటైర్ అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా?’ అంటూ హర్మన్ప్రీత్ ఎదురుప్రశ్న వేశారు. దాంతో సదరు రిపోర్టర్ పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తూ.. ‘లేదు.. నేను కేవలం తెలుసుకోవాలని అడిగాను. ఇది మీ చివరి ప్రపంచకప్ కాదని వినడం నాకు సంతోషంగా ఉంది’ అని రిపోర్టర్ చెప్పారు. అయినప్పటికీ తగ్గని హర్మన్ప్రీత్ కౌర్.. ‘మరి అలాంటప్పుడు అసలు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు?’ అంటూ నిలదీశారు. హర్మన్ మాట్లాడుతూ.. వన్డే వరల్డ్కప్ నెగ్గడంతో సహజంగానే మాపై అంచనాలు ఉంటాయి. భారీ అంచనాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆ అంచనాలను అందుకుంటూనే ఆటపై పూర్తి ఫోకస్ను ఉండేలా చూసుకోవాలి. కానీ వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్లు వేర్వేరు. ఈ రెండింటికీ వ్యత్యాసం ఉంటుంది. మ్యాచ్ల విషయంలో ప్రజలు ఎంతో భావోద్వేగంతో ఉంటారు. వారు ఎప్పటికప్పుడు మమ్మల్ని నిశితంగా పరిశీలిస్తారు. ’ అని చెప్పుకొచ్చింది. గతేడాది సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ను గెలిచిన హర్మన్సేనపై భారీ అంచనాలున్నాయి. జూన్ 14 నుంచి భారత్ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా దాయాది పాకిస్తాన్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. -
టెస్టు క్రికెట్పై ఇంగ్లండ్ కెప్టెన్ ఆందోళన.. ముంచింది మీరేగా!
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంప్రదాయ టెస్టు క్రికెట్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయంతో శుభారంభం చేసినప్పటికీ, మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన స్టోక్స్ టెస్టు క్రికెట్ చచ్చిపోయే స్థితిలో ఉందంటూ పేర్కొన్నాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్స్ మాట్లాడుతూ.. ‘లార్డ్స్ టెస్టులో మేము న్యూజిలాండ్ను 115 పరుగుల తేడాతో ఓడించినప్పటికీ నేను సంతోషంగా లేను. లార్డ్స్ పిచ్ టెస్టు క్రికెట్కు ఉత్తమమైనది కాదనేది నా అభిప్రాయం. ఐదు రోజుల పాటు జరగాల్సిన టెస్టు మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోవడమనేది ఆశ్యర్యం కలిగించింది. టెస్టు క్రికెట్ను అమితంగా ఇష్టపడే నాలాంటి వ్యక్తి .. ఇలాంటి వాటివల్ల మేలు జరుగుతుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. అయితే దీనికి గ్రౌండ్ నిర్వాహకులను తప్పుబట్టలేం. పిచ్ క్యురేటర్ కానీ, గ్రౌండ్స్మన్ కానీ ఒక అంచనాతోనే పిచ్ను రూపొందిస్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాచ్లు రెండు లేదా మూడు రోజుల్లో ముగిసిపోతే టెస్టు క్రికెట్ మనుగడకు ప్రమాదం పొంచి ఉంటుంది.2025-26 యాషెస్ సిరీస్లోనూ మాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆనాడు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టులు రెండు రోజుల్లోనే ముగిశాయి. ఆసీస్లో ఇలా జరగడంపై అప్పుడు కూడా ఆందోళన వ్యక్తం చేశాను. తాజాగా మా సొంతగడ్డపై కూడా ఒక టెస్టు మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోవడంతో ప్రశ్నలన్నీ నావైపు తిరిగాయి. టెస్టు క్రికెట్ అనేది నా దృష్టిలో ఎన్నటికీ అత్యుత్తమ ఫార్మాట్. అది ఎప్పటికీ కనుమరుగవకూడదని బలంగా నమ్ముతాను.’ అని చెప్పుకొచ్చాడు.అయితే స్టోక్స్ వ్యాఖ్యలను క్రికెట్ అభిమానులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘సంప్రదాయ టెస్టు క్రికెట్కు బజ్బాల్ ఆటను పరిచయం చేసిందే మీరు.. ఐదురోజులు సాగాల్సిన మ్యాచ్లను బజ్బాల్ ఆటతో రెండు లేదా మూడు రోజుల్లో ముగించే మహత్తర కార్యక్రమానికి ఆద్యులు మీరేగా’ అంటూ కామెంట్లు చేశారు.ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. కివీస్పై 115 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. ఓలీ రాబిన్సన్ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరో విశేషమేమిటంటే ఈ మ్యాచ్లో అన్ని వికెట్లు పేస్ బౌలర్లే పడగొట్టడం విశేషం. ఇక రెండో టెస్టు జూన్ 17 నుంచి ఓవల్ వేదికగా జరగనుంది.చదవండి: సీఎం విజయ్తో చెస్ సంచలనం ప్రజ్ఞానంద -
మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియన్స్!
టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కు కూడా గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సూర్యకుమార్ను అన్ఫాలో చేసింది. టిట్ ఫర్ టాట్ అన్న తరహాలో సూర్యకుమార్ కూడా తన ఇన్స్టా అకౌంట్లో ముంబై ఇండియన్స్ పేజీని అన్ఫాలో చేయడమే గాక పేజీ నుంచి ముంబై ఇండియన్స్కు సంబంధించిన అన్ని ఫొటోలు, వీడియోలను తొలగించాడు. ప్రస్తుతం సూర్య ఇన అకౌంట్లో దీంతో ముంబై ఇండియన్స్తో సూర్యకుమార్కు బంధం ముగిసినట్లేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం అభిమానులు నిద్రలేచేసరికే ఇదంతా జరిగిపోవడంతో సూర్యకుమార్కు బ్యాడ్టైం నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది. మొన్న కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు లేకుండా చేసి బీసీసీఐ అవమానిస్తే.. ఇవాళ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ను అన్ఫాలో చేసి అవమానించిందని అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.సూర్యకుమార్ బయోను అభిమానులు పరిశీలించి చూడగా.. అతడి బయోలో ముంబై ఇండియన్స్తో పాటు ముంబై అనే పదాన్ని కూడా తొలగించాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ఇన్స్టా అకౌంట్లో ముంబై ఇండియన్స్కు సంబంధించి కేవలం ఒక్క ఫొటో మాత్రమే ఉంది. అది కూడా ధోని, రోహిత్ శర్మలతో కలిసి దిగిన ఫొటో ఉంది. సూర్య కంటే ముందే ముంబై ఇండియన్స్ను వీడుతున్నట్లు వార్తలు వచ్చిన ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా సూర్యకుమార్ అన్ఫాలో చేయడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్లో సూర్యకుమార్ పేలవ ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్లాడిన సూర్యకుమార్ 270 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. అతడి ఖాతాలో రెండు అర్థసెంచరీలు మాత్రమే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018లో కేకేఆర్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చిన సూర్యకుమార్ అప్పటి నుంచి ఎనిమిదేళ్లుగా ముంబైకే ఆడుతూ వచ్చాడు. ఇందులో ముంబై రెండుసార్లు (2019, 2020) ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాను మూడోసారి టీ20 చాంపియన్స్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ తాజాగా అతడి టీ20 కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి దూరమయ్యేలా చేసింది. శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్ను చేయడంతో ఇక టీమిండియాలో సూర్యకుమార్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్కు గుడ్బై చెప్పనున్నట్లు అటు సూర్యకుమార్ కానీ.. ఇటు ముంబై ఇండియన్స్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు సూర్యకుమార్ ముంబైని వీడుతాడా లేదా ఇవన్నీ ఊహాగానాలకే పరిమితమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.Suryakumar Yadav removed Mumbai Indians and Mumbai from his bio. He unfollowed Mumbai Indians. MI unfollowed him. He deleted all MI related pics and videos from his insta id. He changed his pfp too. What's cooking? pic.twitter.com/PL6ErA6tDc— SKY n Supla Shot (@sky_63_mr_t20i) June 7, 2026 -
తప్పు మీద తప్పు.. ఆఫ్గన్ కొంపముంచిన కెప్టెన్!
టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ తప్పు మీద తప్పులు చేస్తోంది. తొలిరోజు కేఎల్ రాహుల్ ఔట్ విషయంలో రివ్యూలు తీసుకోవడంలో తడబడ్డ అఫ్గానిస్తాన్ రెండో రోజు ఆటలోనూ అదే తప్పును పునరావృతం చేసింది. ఫలితంగా టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక మ్యాచ్పై పట్టు సాధించేలా చేసింది. తొలిరోజు ఆటలో కేఎల్ రాహుల్ 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు అజ్మతుల్లా ఒమర్జయ్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ మిస్ అయ్యాడు. దీంతో బంతి అతడి బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ చేతుల్లో పడింది. కీపర్ అఫ్సర్ జజయ్ ఔట్ అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ ఔటివ్వలేదు. అయితే కెప్టెన్ హస్మతుల్లా షాహిది కీపర్ను అడిగినప్పటికీ అతడు క్లారిటీతో లేకపోవడం వల్ల రివ్యూ వెళ్లలేదు.ఆ తర్వాత రిప్లేలో రాహుల్ బ్యాట్కు బంతి తాకినట్లు స్పైక్ రావడం కనిపించింది. దీంతో 16 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రాహుల్ ఆ తర్వాత శతకం బాదాడు. తొలిరోజు చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్వని అఫ్గానిస్తాన్ రెండోరోజు ఆటలోనూ అదే తప్పిదం చేసింది. ఈసారి గిల్ విషయంలో రివ్యూకు తీసుకోవడంలో విఫలమైంది. ఇన్నింగ్స్ 89వ ఓవర్లో ఒమర్జయ్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాకింది. అయితే ఆఫ్గన్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. అయితే ఒమర్జయ్ రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదిని కోరినప్పటికీ, అతడు బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అవుతుందేమోనని భావించి రివ్యూ కోరలేదు. కానీ రిప్లేలో బ్యాట్కు బంతి ఎక్కడా తగలకుండా లెగ్ స్టంప్ను ఎగరేస్తున్నట్లు కనిపించింది. ఒకవేళ రివ్యూకు వెళ్లి ఉంటే గిల్ 109 పరుగుల వద్దే వెనుదిరిగేవాడు. ఈ రెండు తప్పుల తర్వాత కూడా ఆఫ్గన్ తమ లెక్కను సరిచేసుకోలేకపోయింది. ఆ మరుసటి బంతికే రిషబ్ పంత్ కూడా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒమర్జయ్ వేసిన బంతిని పంత్ షాడ్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. దీంతో బంతి కీపర్ అఫ్సర్ చేతిలో పడింది. అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔటివ్వలేదు.సెకండ్ స్లిప్లో ఉన్న రహమనుల్లా గుర్బాజ్ మాత్రం బంతి పంత్ బ్యాట్కు తగిలిందని, రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదికి కాన్ఫిడెంట్గా చెప్పాడు. కానీ షాహిది మాత్రం రివ్యూకు వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ అయినట్లు స్పైక్ రావడంతో కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. అలా 54 పరుగుల వద్ద ఔట్ ప్రమాదం నుంచి బయటపడిన పంత్ తన స్కోరుకు మరో 27 పరుగుల జత చేసుకున్నాడు. ఇలా మూడుసార్లు కీలక ఆటగాళ్లను ఔట్ చేసే విషయంలో ఆఫ్గన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ రివ్యూ తీసుకోవడంలో విఫలమై ఆఫ్గన్ కొంపముంచాడు. అతడి తప్పుల వల్ల టీమిండియా 550 పరుగుల మార్క్ను అందుకోగలిగింది. ఒకవేళ సరైన సమయంలో రివ్యూలు తీసుకొని ఉంటే టీమిండియా ఆట నాలుగు వందల్లోపే ముగిసి ఉండేది. మ్యాచ్ విషయానికొస్తే భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తవ్వగానే గిల్ డిక్లేర్కు పిలుపునిచ్చాడు. కేఎల్ రాహుల్, గిల్ సెంచరీలు చేయగా.. పంత్, సాయి సుదర్శన్, సుందర్లు అర్థసెంచరీలతో మెరిశారు. ఆఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో మెరవగా, జియావుర్ రెహమాన్, హస్మతుల్లా చెరొక వికెట్ తీశారు.చదవండి: ఆత్రుత ఎందుకు పంత్.. ఓపిక వహించాల్సింది! -
గంభీర్ మాట లెక్కచేయని పంత్.. ఆత్రుత ఎందుకు?
ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా 500 పరుగుల దిశగా పయనిస్తోంది. మ్యాచ్లో కేఎల్ రాహుల్, గిల్ శతకాలు నమోదు చేయగా, పంత్ మాత్రం సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 121 బంతులాడిన పంత్ 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. షాహిది వేసిన ఇన్నింగ్స్ 103వ ఓవర్ నాలుగో బంతిని పంత్ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్కు తాకి గాల్లోకి లేచిన బంతిని ఫీల్డర్ అజ్మతుల్లా ఒమర్జయ్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైన పంత్ ఆఫ్గన్తో టెస్టులో మాత్రం మంచి ఈజ్తోనే బ్యాటింగ్ ప్రారంభించాడు. అయితే పంత్ బ్యాటింగ్ దిగడానికి ముందు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ డిఫెన్స్మోడ్కు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ బ్యాటింగ్ చేయాలని సూచించాడు. కానీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి తన శైలికి తగినట్లు ఫాస్ట్గా ఆడేందుకే పంత్ ప్రాధాన్యమిచ్చాడు. అయితే సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కాస్త తగ్గి ఆడుంటే బాగుండేది. భారీ షాట్ ఆడాలనే ఆత్రుతతో బంతిని బలంగా బాదినప్పటికీ టైమింగ్ కుదరక నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘కోచ్ గంభీర్ మాట లెక్కచేయకుండా ఆడావు.. మూల్యం చెల్లించుకున్నావు’.. ‘పంత్ నువ్వు మారవా.. అంత నిర్లక్ష్యం పనికిరాదు’.. ‘నిర్లక్ష్యం పంత్ కొంపముంచింది’.. ‘తొందరెందుకు పంత్.. కాస్త ఓపిక వహిస్తే సెంచరీ అయ్యేదిగా’ అంటూ అభిమానులు కామెంట్లు చేశారు. అయితే సెంచరీ మిస్ అయినప్పటికీ పంత్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. ఆఫ్గన్తో టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (14), మానవ్ సుతార్ (9) పరుగులతో ఆడుతున్నారు. 500 పరుగల మార్క్ చేరిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది. ఆఫ్గన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ నాలుగు వికెట్లు తీయగా, జిహుర్ రెహ్మాన్, హష్మతుల్లా చెరొక వికెట్ తీశారు.Gautam Gambhir Instructs Rishabh Pant to Play Defensively Even Before He Enters to Bat 🙏 pic.twitter.com/UgVFRkzFqi— RP17 Gang™ (@RP17Gang) June 6, 202681 RUNS BY RISHABH PANT - highest score by an Indian wicketkeeper in Tests vs Afghanistan. pic.twitter.com/1St7OXFEJN— RP17 Gang™ (@RP17Gang) June 7, 2026చదవండి: టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన! -
టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన!
భారత జట్టు టీ20 కెప్టెన్గా తనను నియమించడంపై శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించాడు. ముంబై టీ20 లీగ్లో ముంబై ఫాల్కన్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడాడు. 'చాలా సంతోషంగా ఉంది. ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే పెద్ద విషయం. అలాంటిది ఒక జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అనుభూతి. ఇది నా గౌరవాన్ని, బాధ్యతను పెంచింది. ఇన్నేళ్లుగా నాకు మద్దతిస్తూ అండగా నిలబడిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. టీ20 కెప్టెన్సీ ఇచ్చిన జోష్తో ఇవాళ ముంబై ఫాల్కన్స్ తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. నిజంగా నాకు ఇది కేక్పై ఐసింగ్లాగా అనిపించింది. అయితే ఇవాళ మ్యాచ్లో నాకు ప్రత్యర్థిగా ఉన్న సూర్యకుమార్ దగ్గరికి వెళ్లి అతడిని ఆప్యాయంగా పలకరించాను. అతడు కూడా నాకు కెప్టెన్సీ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇది నా జోష్ను డబుల్ చేసింది.' అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. సూర్యకుమార్ సారథ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుపై శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోరర్గా నిలవగా.. నూతన్ కుమార్ (34)పర్వాలేదనిపించాడు. ఫాల్కన్స్ బౌలర్లలో ప్రతమేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ అయ్యర్ విజృంభణతో 16.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాడు. ట్రంప్ నైట్స్ బౌలర్లలో హితేశ్ కడమ్ 2 వికెట్లు తీశాడు.What a day for @ShreyasIyer15 😍Named #TeamIndia's T20I captain, then followed it up with a match-winning knock against Triumphs Knights MNE! 👏Watch #T20Mumbai on Star Sports & JioHotstar! pic.twitter.com/m6BeCZV1XW— Star Sports (@StarSportsIndia) June 7, 2026क्या शानदार पल है! मैच के दौरान वानखेड़े स्टेडियम में Suryakumar Yadavने Shreyas Iyer को गले लगाया। 🥹❤️मुंबई के लड़के एक-दूसरे का साथ देते हुए। 🫂❤️ pic.twitter.com/YiZmJmHaNR— 𝓢𝓸𝓷 𝓢𝓲𝓷𝓰𝓱 𝓨𝓪𝓭𝓪𝓿 (@SONSINGH_Ya) June 7, 2026చదవండి: టెస్టులో సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ! -
టెస్టులో సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ!
15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రికెట్లో హాట్టాపిక్గా మారిపోయాడు. అరంగేట్రంకు ముందే అంతర్జాతీయ రికార్డులన్నీ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ఎంపికైన వైభవ్ను ఇప్పుడు టెస్టుల్లోకి కూడా తీసుకుంటే బాగుంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ అనధికారిక టెస్టు మ్యాచ్లో సెంచరీ చేసిన వీడియోనూ ఎక్స్లో షేర్ చేసుకున్నారు. 2025 అక్టోబర్లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత అండర్-19 జట్టు బ్రిస్బేన్ వేదికగా యూత్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 78 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అప్పటికే ఐపీఎల్ 18వ సీజన్ ఆడిన వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసాన్ని అనధికారిక టెస్టులోనూ కొనసాగించాడు. ఆ మ్యాచ్లో 86 బంతుల్లో 113 పరుగులు చేసిన సూర్యవంశీ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్కు 152 పరుగుల భాగస్వామ్యాన్ని జతచేశాడు. అంతేకాదు వైభవ్ విధ్వంసంతో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టెస్టులోనూ టీ20 తరహా ఆటతో విజృంభించిన వైభవ్ను సంప్రదాయ క్రికెట్లోనూ ఆడించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఐపీఎల్కు, అంతర్జాతీయ మ్యాచ్లకు చాలా తేడా ఉంటుందని, మొదట టీ20 ఫార్మాట్లో తనను తాను నిరూపించుకోవాలని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలున్నాయి. Just look at the dominance of Vaibhav Suryavanshi in test cricket.🤯- Vaibhav Suryavanshi playing test cricket like T20.😊pic.twitter.com/NvljSRcTAi— Cricket Central (@CricketCentrl) June 5, 2026చదవండి: చరిత్ర సృష్టించిన వైశాలీ.. అన్న బాటలోనే చెల్లి! -
కెప్టెన్సీ తెచ్చిన జోష్.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం!
టీమిండియా టీ20 కెప్టెన్గా ప్రమోషన్ కొట్టేసిన శ్రేయస్ అయ్యర్ టీ20 ముంబై లీగ్లో తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. మొదట మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఆ తర్వాత కెప్టెన్గా తన జట్టును గెలిపించడమే గాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. టోర్నీలో భాగంగా శనివారం సూర్యకుమార్ సారథ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుపై శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోరర్గా నిలవగా.. నూతన్ కుమార్ (34) పర్వాలేదనిపించాడు. ఫాల్కన్స్ బౌలర్లలో ప్రతమేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ అయ్యర్ విజృంభణతో 16.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాడు. ట్రంప్ నైట్స్ బౌలర్లలో హితేశ్ కడమ్ 2 వికెట్లు తీశాడు. మొత్తం మీద టీమిండియా టీ20 కెప్టెన్గా ఎంపికైన రోజునే ముంబై టీ20లీగ్లోనూ శ్రేయస్ విజృంభించడం చూస్తుంటే కెప్టెన్సీ ఇచ్చిన ఆనందం రెట్టింపు అయింది. ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ సూర్యకుమార్ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను అయ్యర్కు అప్పగించింది.ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ప్రకటించిన మూడు వేర్వేరు జట్లకు అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా మూడు జట్లలో చోటు సంపాదించి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. What a day for @ShreyasIyer15 😍Named #TeamIndia's T20I captain, then followed it up with a match-winning knock against Triumphs Knights MNE! 👏Watch #T20Mumbai on Star Sports & JioHotstar! pic.twitter.com/m6BeCZV1XW— Star Sports (@StarSportsIndia) June 7, 2026 View this post on Instagram A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)చదవండి: సూర్యను తొలగించడంపై రోహిత్ స్పందన! -
సూర్యను తొలగించడంపై రోహిత్ స్పందన!
టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయడంపై సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ స్పందించాడు. కెప్టెన్సీ అనేది అంత సులభంగా రాదని అయ్యర్ను చూస్తే తనకు స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. 2024లో కేకేఆర్కు టైటిల్ అందించిన అయ్యర్ మరుసటి ఏడాది పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చాడు. ఐపీఎల్లో కెప్టెన్గా అతడి ప్రదర్శనలే ఇవాళ టీమిండియా టీ20 కెప్టెన్ను చేసిందని పేర్కొన్నాడు. అక్కడ నేర్చుకున్న విషయాలు ఇవాళ భారత కెప్టెన్సీకి అవసరమైన అనుభవాన్ని అందించనుందని తెలిపాడు. టీ20 ముంబై లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రోహిత్ శర్మ శనివారం మ్యాచ్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ ఆటతీరు చూసుకుంటే అతడు కెప్టెన్గా అద్భుతాలు చేయబోతున్నాడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ముంబై క్రికెటర్లకు ఏదీ సులభంగా రాదని, కెప్టెన్సీ అనే హోదాను కష్టపడి సంపాదించుకోవాలన్న విషయం శ్రేయస్కు తెలుసు.’అని వివరించాడు. సూర్యకుమార్ను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించడంపై కూడా రోహిత్ స్పందించాడు. ‘టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ తనదైన ముద్ర వేశాడు. సూర్యకుమార్కు కెప్టెన్సీ అంత సులభంగా దక్కలేదన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే సూర్యకుమార్ జట్టులోకి వచ్చే సమయానికే అతడి వయసు 31 లేదా 32 ఉంటుంది. ఆ వయసులో ఫామ్లో ఉండడమే గొప్ప విషయం. కానీ సూర్య దానిని అధిగమించడమే కాదు టీ20 క్రికెట్లో ఆటగాడిగా, కెప్టెన్గా తనదైన ముద్ర వేశాడు. ఎల్లప్పుడూ పోరాడడంలో సూర్య ముందుండే వాడు. భారత్కు మూడో టీ20 ప్రపంచకప్ రావడంలో కెప్టెన్గా అతడి పాత్ర అమోఘం. తనకు వచ్చిన అవకాశాలను సూర్య రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఐదేళ్లలోనే అతడు టీమిండియాకు ఎంతో చేశాడు. ముంబై ఆటగాళ్లలోనే ఇది స్వతహాగా ఉన్న లక్షణం. ఏదీ ఊరికే రాదు, కష్టపడి సంపాదించుకోవాల్సిందే అన్న విషయం మా క్రికెటర్లకు తెలుసు.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ గాయం కారణంగా అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానమే. గాయంతో బాధపడుతున్న భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ఈనెల 8న సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ)లో చేరనున్నాడు. బెంగళూరులోని ఈ సెంటర్లో అతడి ఫిట్నెస్ను పరీక్షించనున్నారు. మూడు రోజుల పాటు సీఓఈలో ఉండి, ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్తో వన్డే సిరీస్ కోసం జట్టుతో చేరనున్నాడు.Rohit Sharma congraluating Shreyas Iyer for becoming the T20 Captain of India ❤️- The Mumbai Boys! pic.twitter.com/vcDf8yrPXW— Johns. (@CricCrazyJohns) June 6, 2026చదవండి: క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన కేఎల్ రాహుల్! -
బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెటర్.. భారత జట్టులోకి స్వాగతం!
శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్ కోసం ఇప్పటికే భారత-ఏ జట్టు ఆ గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో తెలుగు కుర్రాడు షేక్ రషీద్కు చోటు దక్కడం ఆసక్తికర అంశంగా మారింది. ధ్రువ్ జురేల్ నేతృత్వంలోని జట్టులో సాయి సుదర్శన్, పడిక్కల్, రుతురాజ్, ఆయుష్ బదోని వంటి ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. 2021 అండర్-19 ఆసియా కప్ టోర్నీ ద్వారా షేక్ రషీద్ తొలిసారి బీసీసీఐ దృష్టిలో పడ్డాడు. జట్టు టైటిల్ గెలవడంలో షేక్ రషీద్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్కు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ఆరంభంలోనే కోవిడ్ బారిన పడ్డాడు. అయితే లీగ్ దశ ఆఖరికి చేరుకున్న క్రమంలో తిరిగి జట్టులోకి వచ్చిన రషీద్ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 108 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఫైనల్లోనూ కీలక హాఫ్ సెంచరీతో మెరిసిన షేక్ రషీద్ టీమిండియా టైటిల్ గెలవడంలోనూ సహాయపడ్డాడు.ఎవరీ షేక్ రషీద్?ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్ క్రికెట్ ప్రయాణం అడ్డంకులతో సాగింది. అతడి తండ్రి షేక్ వలీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొడుకు లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కష్టపడ్డాడు. తండ్రి త్యాగంతో ఇవాళ ఇండియా-ఏ జట్టుకు ఎంపికైన షేక్ రషీద్ త్వరలోనే జాతీయ జట్టుకు కూడా ఎంపికవ్వాలని కోరుకుందాం. అండర్-19 టీ20 ప్రపంచకప్ అతడికి గుర్తింపు తెచ్చినప్పటికీ దేశవాలీ క్రికెట్లో రాణించాలంటే రంజీ మ్యాచ్లు ఆడడం తప్పనిసరి. అందుకే 2022లో ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన షేక్ రషీద్ ఓర్పు, టెక్నిక్, సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యాన్ని అలవరుచుకున్నాడు. 2025-26 రంజీ సీజన్లో షేక్ రషీద్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో షేక్ర రషీద్ మూడు శతకాలతో 627 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 27 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన షేక్ రషీద్ 46 సగటుతో 1831 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలున్నాయి. లంక పర్యటనలో ముందుగా శ్రీలంక, అఫ్గానిస్తాన్తో కలిసి ఇండియా-ఏ ట్రై వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి.శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, ఎన్ జగదీశన్, అమన్ మోఖడే, షేక్ రషీద్, జీషన్ అన్సారీఇండియా-ఏ టూర్ ఆఫ్ శ్రీలంక షెడ్యూల్జూన్ 25- తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)జులై 2- రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)చదవండి: గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు! -
గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు!
ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులేస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకంతో చెలరేగిత్, కెప్టెన్ గిల్ కూడా సెంచరీ దిశగా పరిగెడుతున్నాడు. సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ విషయం పక్కనబెడితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో తన చేతిలో ఒక అంతుచిక్కని పదార్థంతో కెమెరా కంటికి చిక్కాడు. అయితే అవి హోమియోపతి మెడిసిన్స్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే చిన్న డబ్బాలో రౌండ్గా ఉన్న పిల్స్ను చేతిలోకి తీసుకున్న గంభీర్ వాటిని నోటిలో పెట్టుకోవడం కనిపించింది. బహుశా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గంభీర్ ఆ పిల్స్ను వాడుతున్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అవకాశం చిక్కితే చాలు గంభీర్ను విమర్శించడమే పనిగా పెట్టుకునే కొందరు ఆకతాయిలు తమ నోటికి పనిచెప్పారు. సోషల్ మీడియా వేదికగా అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టడం కనిపించింది. 'గంభీర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని, వెంటనే అరెస్ట్ చేయాలని కొందరు పేర్కొంటే.. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణాన్ని గంభీర్ పూర్తిగా చెడగొడుతున్నాడని, అతన్ని వెంటనే కోచ్ పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని' కామెంట్లు చేయడం గమనార్హం.అయితే ఆఫ్గన్తో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ ఆకట్టుకున్నాడు. గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్లో సాయి సుదర్శన్ 104 బంతులెదుర్కొని 13 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు రావాలని గంభీర్ తనకు చెప్పాడని సాయి సుదర్శన్ మ్యాచ్ విరామ సమయంలో పేర్కొన్నాడు. జైస్వాల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి సాయి సుదర్శన్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలిరోజే టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. గిల్ (103), పంత్ (50) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ (100) శతకం సాధించాడు. 🚨DRUG DEALER GAUTAM GAMBHIR 🚨Gautam Gambhir was seen taking drugs while on-going India vs Afghanistan test match 👀 pic.twitter.com/9gJOYoy7jg— ; (@ReignofDhoni) June 6, 2026చదవండి: ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్! -
ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా బ్యాటర్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్ శతకంతో సరికొత్త రికార్డులు నెలకొల్పగా.. తాజాగా టీమిండియా సారథి శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా గిల్ నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు. అంతేకాదు కెప్టెన్ అయిన తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ గిల్ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో గిల్ 11వ స్థానంలో నిలిచాడు. ఆఫ్గన్పై సాధించిన అర్థసెంచరీ గిల్కు తొమ్మిదోది కావడం విశేషం.ఇక గిల్ ఇప్పటివరకు 40 టెస్టు మ్యాచ్లాడి 2,843 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 8 అర్థసెంచరీలున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. 68 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (65), రిషబ్ పంత్ (25) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ శతకం చేసిన వెంటనే ఔట్ అయ్యాడు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)చదవండి: తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్ను తప్పించాం! -
తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్ను తప్పించాం!
తెలుగు క్రికెటర్ నంబూరి తిలక్ వర్మకు బీసీసీఐ వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం బీసీసీఐ ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్తో పాటు ఆసియా గేమ్స్కు టీమిండియా జట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీలకు వేర్వేరుగా ప్రకటించిన జట్లలో తిలక్ వర్మ చోటు దక్కించుకోవడమే గాక, శ్రేయస్ అయ్యర్కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. అయితే ఉన్నపళంగా అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను తిలక్ వర్మకు అప్పగించడంపై బీసీసీఐ స్పందించింది. జట్లను ప్రకటించిన అనంతరం సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడాడు. ‘రాబోయే రెండేళ్ల కాలంలో టీమిండియా చాలా టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులోనే 2028 టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. అక్షర్పటేల్ అప్పటి వరకు జట్టులో ఉంటాడా లేదా అనేది సందేహం. అందుకే మాకు తిలక్ వర్మ డిప్యూటీ కెప్టెన్ పదవికి సరైనోడిలా కనిపించాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పటికీ, రాబోయే రెండేళ్ల సైకిల్ను దృష్టిలో పెట్టుకొని తిలక్ వర్మను డిప్యూటీగా ఎంపిక చేయాలని నిర్ణయించాం. అందునా తిలక్ వర్మ ఒక అద్భుత ఆటగాడు. డిప్యూటీ కెప్టెన్గా అదనపు బాధ్యతలు ఇవ్వడం ద్వారా మరింత నేర్చుకుంటాడన్నది మా నమ్మకం.’ అని చెప్పుకొచ్చాడు. అజిత్ అగార్కర్ చెప్పినట్లుగానే తిలక్ వర్మ కొన్నేళ్లుగా భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. 2024లో సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలు బాదిన తిలక్ వర్మ, ఆ గడ్డపై 3-1 తేడాతో సిరీస్ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక గతేడాది ఆసియా కప్ ఫైనల్లో భారత్ గెలవడంలో తిలక్ వర్మదే కీలకపాత్ర. ఆ మ్యాచ్లో 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటిదాకా బ్యాటర్గా రాణించిన తిలక్ వర్మ ఇకపై వైస్ కెప్టెన్సీ బాధ్యతలు సవాల్ విసరనున్నాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్తో పాటు 2028 టీ20 ప్రపంచకప్పై దృష్టి సారించిన నేపథ్యంలో తిలక్ వర్మ బ్యాటర్గా భారత బ్యాటింగ్లో మూల స్తంభాల్లో ఒకడిగా ఉండడంతో పాటు డిప్యూటీ నాయకత్వ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక అక్షర్పటేల్ వైస్కెప్టెన్ పదవిని కోల్పోయినప్పటికీ సీనియర్ స్పిన్నర్గా జట్టులో చోటు కాపాడుకున్నాడు.ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.చదవండి: కనిపించని సూర్యకుమార్ పేరు.. కెరీర్కు ఎండ్కార్డ్! -
కనిపించని సూర్యకుమార్ పేరు.. కెరీర్కు ఎండ్కార్డ్!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్గా ముద్రపడిన సూర్యకుమార్ కెరీర్కు ఎండ్కార్డ్ పడింది. తాజాగా శనివారం ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్, ఆసియా గేమ్స్కు ప్రకటించిన టీమిండియా జట్టులో సూర్యకుమార్కు చోటు దక్కలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కనీసం సూర్య పేరును ప్రస్తావించలేదని స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ కెరీర్ ఇలా అర్థంతరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. టీమిండియాకు ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకు వీడ్కోలు పలుకుతూ బీసీసీఐ చివరి మ్యాచ్ ఏమైనా ఆడిస్తుందేమో అని అభిమానులు ఆశించారు. కానీ బీసీసీఐ తన పంథా మార్చి ఫామ్లో లేని ఆటగాళ్లను నిరభ్యరంతంగా జట్టు నుంచి పక్కనబెట్టేస్తుంది. కొన్ని రోజులుగా కెప్టెన్సీ పదవి నుంచి మాత్రమే సూర్యను తప్పిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, ఇవాళ ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ పేరు కనిపించకపోవడంతో అతడి కెరీర్కు ముగింపు పడినట్లయింది.తుఫానులా దూసుకొచ్చిన సూర్య31 ఏళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ అనతికాలంలోనే టీ20 క్రికెట్లో స్టార్ హోదాను పొందాడు. టీ20 స్పెషలిస్ట్గా పేరు పొందిన సూర్య మైదానం నలువైపులా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. దీంతో సూర్యకుమార్ జట్టు పగ్గాలు చేపట్టాడు. కెప్టెన్గా, బ్యాటర్గా అసమాన ప్రదర్శన కనబరిచిన సూర్య ఆట 2025 నుంచి పతనం దిశగా సాగింది. కెప్టెన్సీ ఒత్తిడిలో తన సహజసిద్ధమైన ఆటకు దూరంగా జరిగిన సూర్యకుమార్ ఫామ్లేమితో తంటాలు పడ్డాడు. టీ20 ప్రపంచకప్లోనూ సూర్య పెద్దగా రాణించింది లేదు. అయితే టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచకప్కు సూర్య కెప్టెన్ హోదాలో ఉండడమే అతడికి దక్కిన ఘనత అని చెప్పొచ్చు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లోనూ సూర్యకుమార్ పేలవ ప్రదర్శన చేయడంతో అతడి కెరీర్పై నీలినీడలు కమ్ముకున్నాయి. సీనియర్ అయినా, అనుభవం ఉన్నా సరే ఫామ్లో ఉన్న ఆటగాడిగే తన మద్దతు ఉంటుందని కోచ్ గౌతమ్ గంభీర్ కుండబద్ధలు కొట్టడంతో సూర్యకుమార్ కెప్టెన్సీతో పాటు జట్టులో అతడి చోటు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా గేమ్స్కు ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ చోటు కోల్పోయాడు. సూర్యకుమార్ టీమిండియా తరఫున 113 టీ20లు ఆడి 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 25 అర్థసెంచరీలున్నాయి. దీంతో పాటు సూర్యకుమార్ 37 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తంమీద టీమిండియాలోకి తుఫానులా దూసుకొచ్చిన సూర్యకుమార్ ఐదేళ్లు తిరక్కుండానే అశనిపాతంలా కిందకు పడిపోవడం గమనార్హం. చివరగా ఎన్నేళ్లు ఆడామాన్నది కాదు.. ఆడిన కొద్దికాలంలోనే తన పేరును చరితార్థం చేసుకున్న సూర్యకుమార్కు హ్యాట్సాఫ్. గుడ్బై మిస్టర్ 360.. సూర్యకుమార్ యాదవ్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే! -
క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన కేఎల్ రాహుల్!
ముల్లన్పూర్ వేదికగా భారత్, అప్గానిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో కేఎల్ రాహుల్ అర్థసెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్తో కలిసి నిలకడగా ఆడుతున్న రాహుల్ రెండో వికెట్కు అతడితో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 36 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 153 పరుగులు చేసింది. అయితే మ్యాచ్లో కేఎల్ రాహుల్కు ఒక లైఫ్ లభించింది. జియావు్ రెహ్మాన్ వేసిన 11వ ఓవర్ మొదటి బంతిని కేఎల్ రాహుల్ కట్ షాటే ఆడే ప్రయత్నం చేశాడు. అయితే సరైన టైమింగ్ కుదరక బంతి బ్యాట్ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే క్యాచ్ అవుట్ అంటూ కీపర్ సహా ఆఫ్గన్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అప్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది రివ్యూ వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడు. అయితే బౌలర్తో పాటు సెకండ్ స్లిప్లో ఉన్న రహ్మనుల్లా గుర్బాజ్లు ఆత్మవిశ్వాసంతో రివ్యూకు వెళ్లాలని కెప్టెన్కు చెప్పినప్పటికీ, కీపర్ సందేహం వ్యక్తం చేయడంతో హష్మతుల్లా డీఆర్ఎస్కు వెళ్లలేదు. అయితే ఆ తర్వాత రిప్లేలో బంతి కేఎల్ రాహుల్ బ్యాట్కు తగిలినట్లు స్పైక్వచ్చింది. దీంతో రివ్యూ తీసుకోకుండా తప్పు చేశానే అని హష్మతుల్లా తెగ బాధపడిపోయాడు. అయితే చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం వల్ల లాభం లేనట్లే రివ్యూ వెళ్లకుండా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం. ఈ విషయం పక్కనబెడితే కేఎల్ రాహుల్ తాను ఔట్ అని తెలిసినప్పటికీ బంతి ఎడ్జ్ అవ్వలేదంటూ అంపైర్కు సైగ చేసి పక్కదారి పట్టించాడని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ అభిమానులు మండిపడ్డారు. తాను ఔట్ కావద్దని ప్రతీ ఆటగాడిగా స్వార్థం ఉండడం సహజమేనని, కానీ కేఎల్ రాహుల్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తూ అంపైర్ ఔట్ ఇవ్వకున్నా తనంతట తాను మైదానం వీడి ఉంటే అతడిపై గౌరవం పెరిగి ఉండేదని కామెంట్లు చేస్తున్నారు. అలా కాకుండా స్పోర్ట్స్ స్పిరిట్కు విరుద్ధంగా రాహుల్ చర్య ఉందని విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో ఒక లైఫ్ పొందిన కేఎల్ రాహుల్ టీమిండియా 107 పరుగుల వద్ద ఉన్నప్పుడు అర్థశతకం మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు బౌండరీలు ఉన్నాయి. ఈ అర్థశతకంతో కేఎల్ రాహుల్ 9వేల ఫస్ట్క్లాస్ పరుగులు కూడా పూర్తి చేసుకోవడం విశేషం.Rahul confused the AFG team and made them believe it was his bat's sound. Well Played Rahul 👏 https://t.co/enVYHa7AKe pic.twitter.com/OaWR4MrhLu— Varun (@The_MythBreaker) June 6, 2026చదవండి: పంథా మార్చిన బీసీసీఐ.. బలవంతంగా పంపుతున్న వైనం! -
పంథా మార్చిన బీసీసీఐ.. బలవంతంగా పంపుతున్న వైనం!
బీసీసీఐ తన పంథా మార్చేసిందా? ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు రిటైర్ అవుతున్నారంటే వీడ్కోలు మ్యాచ్తో పాటు ఘనంగా సత్కారాలు, సన్మానాలు జరిగేవి. ఆటగాడు కోరుకున్న చోటే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా సన్నాహకాలు చేసే వారు. కానీ ఇప్పుడు అదంతా గతం గతః అన్నట్లుగా తయారైంది. సరైన ప్రదర్శన చేయకుండా జట్టుకు భారంగా మారిన సదరు ఆటగాడికి వీడ్కోలు మ్యాచ్ లేకపోగా బలవంతంగా జట్టు నుంచి పంపించే మహత్తర కార్యక్రమానికి తెర లేచింది. తాజాగా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో బీసీసీఐ అవలంబిస్తోన్న వైఖరి ఇందుకు ఉదాహరణ.బీసీసీఐ నుంచి ఘనంగా వీడ్కోలు అందుకన్న క్రికెటర్లలో సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, హర్భజన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. అయితే ఈ మధ్య కాలంలో ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోతే రిటైర్మెంట్కు సమయం వచ్చేసిందంటూ వార్తలు రావడం, ఆ తర్వాత కనీస వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే వాళ్లు రిటైర్ ఇవ్వడం జరిగిపోతున్నాయి. తాజాగా సూర్యకుమార్ను ముందు టీ20 కెప్టెన్గా తొలగించిన బీసీసీఐ ఇప్పుడు బలవంతంగా జట్టులో నుంచి పంపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీమిండియాలోకి లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతికాలంలోనే సూర్యకుమార్ టీ20 క్రికెట్లో స్టార్ హోదా పొందాడు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్తో పాటు 2026 టీ20 ప్రపంచకప్ను నిలుపుకోవడం విశేషం. ధోని, రోహిత్ తర్వాత భారత్కు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్గా సూర్యకుమార్ నిలిచాడు. గంగూలీ, ద్రవిడ్, కోహ్లీలకు సాధ్యం కాని ఐసీసీ మేజర్ టైటిల్ సూర్య ఖాతాలో ఉండడం గమనార్హం. మరి ఇలాంటి హోదా పొందిన సూర్యకుమార్కు, కేవలం టీ20 స్పెషలిస్ట్గా ముద్రపడిన వ్యక్తికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరముంది. అంతేకాని పొమ్మనలేక పొగబెట్టడం అన్న తరహాలో బీసీసీఐ ప్రవర్తించడంపై టీమిండియా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ కెప్టెన్సీ పదవి నుంచి తొలగ2ఇంచారు కాబట్టి కనీసం ఆఫ్గన్తో టీ20 సిరీస్కు అతడిని పరిగణలోకి తీసుకొని సెండాఫ్ మ్యాచ్ ఆడేలా అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.గతంలో అలా..భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ 1986లో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. కానీ అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ఖాన్.. తమతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాలని గావస్కర్ను కోరాడు. దీనికి గావాస్కర్ ఒప్పుకోవడం, బీసీసీఐ కూడా ఓకే అనడంతో 1987లో పాక్తో టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత ఘనంగా వీడ్కోలు పలికాడు. పనిలో పనిగా గావస్కర్ 10వేల పరుగులు కూడా పూర్తయ్యాయి. అలా గావస్కర్ తన వీడ్కోలు మ్యాచ్ను ఎన్నటికీ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది.టెండూల్కర్ 200వ టెస్టు మ్యాచ్భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ ఎలాంటి వీడ్కోలు ఇచ్చిందో అందరికీ తెలిసిందే. అతడి వందో సెంచరీ కోసం కొన్నేళ్లు వేచి చూడాల్సి వచ్చినా బీసీసీఐ అతడిని పక్కకు పెట్టలేదు. 2014లో ముంబైలోని తన హొంగ్రౌండ్లో 200వ టెస్టు మ్యాచ్ ఆడిన సచిన్కు స్టేడియం మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఆ మధురానుభూతులు ఇప్పటికీ తన కళ్ల ముందు ఉన్నాయని సచిన్ చాలాసార్లు పేర్కొన్నాడు.షాక్ ఇచ్చిన ధోని..భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా ఎంఎస్ ధోనికి పేరుంది. రెండు ప్రపంచకప్లతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని సాధించిన ధోనికి 2019 వరల్డ్కప్లో సెమీస్ మ్యాచ్ చివరిది అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. 2019లో ఆటకు దూరమైన ధోని.. తాను తలచుకుంటే బీసీసీఐకి చెప్పి ఒక వీడ్కోలు మ్యాచ్ ఆడడం పెద్ద విషయం కాదు. కానీ ధోని అలా చేయలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం రావాలనే ఉద్దేశంతో 2020 ఆగస్టు 15 సాయంత్రం ఏడు గంటలకు తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్లో కేవలం ఒక పోస్టు పెట్టి ప్రకటించాడు.గంభీర్ రాక.. మారిన పరిస్థితులుటీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ భారత హెడ్కోచ్గా వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనుభవానికి ప్రాధాన్యమివ్వకుండా ఫామ్లో ఉన్న ఆటగాడికే తన మద్దతు ఉంటుందని గంభీర్ వచ్చిన కొత్తలోనే కుండబద్దలు కొట్టాడు. తన సమకాలీన క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇలాంటి వైఖరినే వ్యవహరించాడు. 2024లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్లో ఈ ఇద్దరు విఫలమయ్యారు. దీంతో తాము టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందని భావించిన రోహిత్, కోహ్లీలు స్వల్ప వ్యవధిలో గుడ్బై చెప్పేశారు. అలా కాదని వీళ్లిద్దరు బీసీసీఐకి తమకు ఒక చివరి టెస్టు మ్యాచ్ ఏర్పాటు చేయాలని అడిగి ఉంటే సమాధానం ఎలా వచ్చి ఉండేదో. ఇప్పుడు సూర్యకుమార్ వంతు వచ్చింది. ఒకప్పుడు మిస్టర్ 360 డిగ్రీస్ క్రికెటర్గా పేరు పొందిన సూర్యకుమార్ ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా మిగిలిపోయాడు. టీమిండియా క్రికెట్కు అతడు అందించిన రెండు కప్పులను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ అతడికి ఆఖరి టీ20 మ్యాచ్ ఆడే అవకాశం కల్పించాలని కోరుకుందాం.చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో! -
టీమిండియాకు షాక్.. ఆరు నెలలు ఆటకు దూరమైన కోహ్లీ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో జూలైలో ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు కోహ్లీ దూరమైనట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వచ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్టనుంది. దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోహ్లీ పునరావాసం పొందే అవకాశముంది. కాగా కోహ్లీ తన గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్లో కండరాల్లో చీలిక వచ్చినట్లు రిపోర్ట్లో తేలింది.' అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ -
కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించినట్లుగా అనిపిస్తోంది. ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందం న్యూజిలాండ్కు ఎక్కువసేపు నిలవలేదు. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. 61/6 క్రితంరోజు స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎక్కువసేపు నిలవలేకపోయింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కైల్ జేమీసన్ (38 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. గ్లెన్ ఫిలిప్స్ (34) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 5 వికెట్లతో చెలరేగగా, జోష్ టంగ్ 3, అకిన్సన్లు రెండు వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ తడబడినప్పటికీ టీ విరామ సమయానికి 42 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (31), అకిన్సన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ఎమిలియో గే (57) అర్థసెంచరీ సాధించగా, బెన్ డకెట్ (33) పర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ మూడు వికెట్లు తీయగా, విలియం రూర్కీ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 193 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బౌలర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్పై మరో మూడు రోజులు ఆట మిగిలి ఉండడంతో ఇంగ్లండ్కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. That fifth-wicket feeling 🥰🤝 @IGcom pic.twitter.com/aeRVZsTyz3— England Cricket (@englandcricket) June 5, 2026చదవండి: వైభవ్ క్రేజ్.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొదలు! -
వైభవ్ క్రేజ్.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొదలు!
ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడిచింది. ఈ సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడంతో పాటు మోస్ట్ వాల్యుబల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంపై దిగ్గజాలు సహా మాజీ క్రికెటర్లు అభినందించారు. వైభవ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు విదేశాలకు కూడా పాకింది. విదేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు కూడా వైభవ్ను టీమిండియాకు ఎంపిక చేయాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన వచ్చింది. మ్యాచ్ తొలిరోజు మధ్యలో వర్షం పడడంతో విరామ సమయంలో కామెంటేటర్ సైమన్ డౌల్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. అతని బ్యాటింగ్ అద్భుతమంటూ, నేరుగా భారత జట్టులోకి తీసుకుంటారేమోనని పేర్కొన్నాడు. దీనికి సహచర కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్, ఇయన్ వార్డ్ కూడా.. 'అవును వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసినట్లుంది'అంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంపికపై ఇంకా సమయం ఉందని బీసీసీఐ పేర్కొంది. 15 ఏళ్లే కావడంతో అతడికి క్రికెటర్గా చాలా భవిష్యత్తు ఉందని, ఈలోగా ఇండియా-ఏ తరఫున తన ఆటను చూపించే అవకాశమిస్తున్నట్లు తెలిపింది. లంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియా-ఏ జట్టు శ్రీలంక-ఏ, అఫ్గానిస్తాన్-ఏ జట్లతో ట్రై సిరీస్ ఆడనుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఆడుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 151 పరుగుల లీడ్లో ఉంది."Open the batting with Sooryavanshi!" 😅👀 pic.twitter.com/PL21ZRvWFA— Sky Sports Cricket (@SkyCricket) June 4, 2026చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో! -
అఫ్గానిస్తాన్కు షాక్.. గుడ్బై చెప్పనున్న రషీద్ ఖాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్టు రిటైర్మెంట్పై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్కు రషీద్ ఖాన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో చాలాసేపు బౌలింగ్ చేయాల్సి రావడంతో, దీర్ఘకాలిక వెన్నునొప్పి వల్ల ఎక్కువ బంతులు వేయలేనని రషీద్ ఖాన్ గతం లోనే స్పష్టం చేశాడు. అయితే తాజాగా రషీద్ ఖాన్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా అనే దానిపై ఆ జట్టు కోచ్ రిచర్డ్ ఫైబస్ స్పం దించారు. 'రషీద్ ఖాన్ దీర్ఘకాలిక నడుమునొప్పితో బాధపడుతున్నాడు. టెస్టు క్రికెట్కు దూరమవ్వాలని రషీద్ ఎప్పుడో నిర్ణయిం చుకున్నాడు.అతడు దేశంతో పాటు చాలా ప్రైవేటు లీగ్స్లో ఆడుతుంటాడు. అయితే రషీద్ మా జట్టుకు ఫ్రంట్లైన్ బౌలర్ కావడంతో అతడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది. టెస్టు క్రికెట్కు దూరంగా ఉండాలని భావిస్తున్న రషీద్తో నేను రెడ్బాల్ క్రికెట్లో కొనసాగాలని అడుగుతాను. కానీ ఆడతాడా లేదా అన్నది అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.27 ఏళ్ల రషీద్ ఖాన్ 2023 వన్డే ప్రపంచకప్కు ముందు నుంచే వెన్నుగాయం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తోంది. అప్పటినుంచి ఎక్కువసేపు బౌలింగ్ చేయడంలో రషీద్ ఖాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో తాను టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా అని రషీద్ ఖాన్ తెలిపాడు. కాబట్టి టెస్టు క్రికెట్లో ఆడాలా వద్దా అనేది అతడి ఇష్టానికే వదిలేస్తున్నాం' అని తెలిపాడు.కాగా రషీద్ ఖాన్ గైర్హాజరీలో అఫ్గానిస్తాన్ జట్టుకు హష్మతుల్లా షాహిది జట్టును నడిపించనున్నాడు. జట్టులో రహమనుల్లా జద్రన్, అఫ్సర్ జజాయ్, ఇక్రమ్ అలీఖిలి, అజ్మతుల్లా ఒమర్జయ్లు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇక అఫ్గానిస్తాన్ 2018లో టెస్టు హోదా పొందింది. అప్పటినుంచి 12 మ్యాచ్లాడగా, నాలుగు విజయాలు, ఏడు ఓటములు, ఒక డ్రా నమోదు చేసింది. అఫ్గానిస్తాన్ చివరగా గతేడాది అక్టోబర్లో జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ ఆడింది. అయితే ఆ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ 73 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్గా వెలుగొందుతున్న రషీద్ ఖాన్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. ఆ జట్టు తరఫున ఆరు టెస్టుల్లో 154 పరుగులు, 45 వికెట్లు; 117 వన్డేల్లో 1,393 పరుగులు, 210 వికెట్లు; 113 టీ20ల్లో 622 పరుగులు, 190 వికెట్లు తీశాడు.చదవండి: ఆసీస్పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్కు బంపరాఫర్! -
ఆసీస్పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్కు బంపరాఫర్!
ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంతో పాకిస్తాన్ జట్టు జోష్లో ఉంది. అయితే సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు ఆల్రౌండర్ షాదాబ్ఖాన్ను అదృష్టం తలుపుతట్టింది.ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్) తొలి ఎడిషన్లో షాదాబ్ ఖాన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. తద్వారా యూరోప్ టీ20 క్రికెట్ లీగ్లో ఆడనున్న తొలి పాక్ క్రికెటర్గా షాదాబ్ ఖాన్ నిలవనున్నాడు. ఇక ఈటీపీఎల్ టోర్నీలో షాదాబ్ ఖాన్ ఎడిన్బర్గ్ క్యాసిల్ రాకర్స్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ఈ ఎడిన్బర్గ్ క్యాసిల్ ఫ్రాంచైజీని మాజీ న్యూజిలాండ్ క్రికెటర్లు కైల్మిల్స్, నాథన్ మెక్కల్లమ్లు సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్గా ఉండనున్నాడు. టామ్ బ్రూస్, టామ్ కరన్, జేజే స్మట్స్, ఆండ్రీ గౌస్తో కలిసి షాదాబ్ ఖాన్ ఆడనున్నాడు. కాగా ఎడిన్బర్గ్ మంచి ధరకే షాదాబ్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 క్రికెట్లో ఈ పాకిస్తాన్ క్రికెటర్కు మంచి డిమాండ్ ఉంది. పాకిస్తాన్ సూపర్లీగ్లో (పీఎస్ఎల్) ఇస్లామాబాద్ యునైటెడ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న షాదాబ్ ఆ జట్టుకు మూడు పీఎస్ఎల్ టైటిల్స్ అందించడం విశేషం. పీఎస్ఎల్, బీబీఎల్, సీపీఎల్, బీపీఎల్, హండ్రెడ్ టోర్నీ కలిపి 350కి పైగా మ్యాచ్లాడిన షాదాబ్ఖాన్ 3,915 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ తరఫున 124 టీ20ల్లో 1009 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు. యూరోప్లో క్రికెట్ను ప్రోత్సహించే దిశగా స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్లోని స్థానిక క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చేందుకు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ పేరిట కొత్త టోర్నీని తీసుకొచ్చింది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్కు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కో-ఓనర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్లో చాలా మంది మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు కలిపి ఆయా ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్ (ఎడిన్బర్గ్ క్యాసిల్), రాహుల్ ద్రవిడ్ (డబ్లిన్ గార్డియన్స్), గ్లెన్ మ్యాక్స్వెల్ (ఐరిష్ వోల్వ్స్), స్టీవ్ వా (ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్), జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ (రోటర్డామ్ డాకర్స్)కు ఓనర్లుగా ఉన్నారు. ఈటీపీఎల్-2026 టోర్నీ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వేదికగా జరగనుంది.చదవండి: గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా? -
గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో టీమిండియా ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో జరగనున్న టెస్టుతో పాటు వన్డే సిరీస్పై దృష్టి సారించింది. రేపటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు గిల్ నేతృత్వంలోని టీమిండియా స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే పిక్క కండరాల గాయంతో కోహ్లీ ఈ సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు రుతురాజ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసినట్లు నివేదికలు వచ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ భారత-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ వార్తలన్నింటికీ ఫుల్స్టాప్ పడినట్లయింది.లంక పర్యటనలో భారత్.. శ్రీలంక-ఏ, అప్గానిస్తాన్-ఏ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడనుంది. తాజాగా రుతురాజ్ కొలంబోలో దర్శనమివ్వడంతో మరి కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఎటూ తేల్చని బీసీసీఐ?ఆఫ్గన్తో వన్డే సిరీస్కు 15 మందితో జట్టును ప్రకటించడంతో కోహ్లీ దూరమైన అతడి స్థానాన్ని ఆ సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకరితోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఆఫ్గన్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. అతడు కూడా పిక్క కండరాల గాయంతో బాధపడుతుండడం టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జట్టులోని సీనియర్లంతా గాయాల బారిన పడడంతో వన్డే సిరీస్లో అప్గానిస్తాన్ మనకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనసరం లేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ, రోహిత్, పాండ్యాలు దూరమైతే మాత్రం బీసీసీఐ వీరి స్థానంలో కనీసం ఇద్దరినైనా జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. అయితే వన్డే సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో బీసీసీఐ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.ఆఫ్గన్తో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా? -
‘మమ్మల్ని ఆదరించండి’.. మంధాన సంచలన వ్యాఖ్యలు!
మహిళల క్రికెట్ చరిత్రలో మరో అత్యుత్తమ సమరానికి తెరలేవబోతోంది. జూన్ 12 నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వైస్కెప్టెన్ స్మృతి మంధాన సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీ జరుగుతున్నా భారత్-పాక్ మధ్య మ్యాచ్కు మాత్రమే హైప్ ఉందని, మిగిలిన టోర్నీకి కూడా అదే స్థాయిలో ఆదరణ చూపాలని అభిమానులకు విజ్ఞప్తి ఆసక్తి కలిగించింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్, హైప్ సహజమైనదే అయినప్పటికీ.. కేవలం ఆ ఒక్క మ్యాచ్కే పరిమితం కాకుండా టోర్నీ మొత్తానికి భారీ స్థాయిలో ప్రచారం కల్పించాలని ఆమె కోరారు. మహిళల క్రికెట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతోందని, ప్రతి జట్టులోనూ అద్భుతమైన ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని ఆమె గుర్తుచేశారు. అభిమానులు, క్రీడా విశ్లేషకులు, మీడియా సంస్థలు కేవలం భారత్-పాక్ పోరుపైనే కాకుండా, టోర్నమెంట్లో జరిగే మిగిలిన అన్ని మ్యాచ్లపై కూడా అంతే శ్రద్ద పెట్టాలని, అప్పుడే మహిళల క్రికెట్కు నిజమైన గుర్తింపు దక్కుతుందని మంధాన అభిప్రాయపడ్డారు. పురుషుల క్రికెట్తో సమానంగా తాము అద్భుతాలు చేస్తున్నప్పటికీ మహిళల క్రికెట్పై ఇంకా చిన్నచూపేనని పేర్కొన్నారు. స్మృతి మంధాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ టోర్నీ విజయవంతం కావడానికి సోషల్ మీడియా పాత్ర కూడా ఎంతో కీలకమని, ప్రతీ మ్యాచ్ గురించి చర్చ జరగాలని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. మంధాన చెప్పినట్లుగా కేవలం ఒకే ఒక్క హై-వోల్టేజ్ మ్యాచ్ టోర్నీని ముగించకుండా, ప్రతీ లీగ్ మ్యాచ్ను, ప్రతీ జట్టు ప్రదర్శనను హైలైట్ చేయడం వల్ల మహిళల క్రీడలకు మరింత వాణిజ్య పరమైన ఆదరణ, స్పాన్సర్షిప్ లభించే అవకాశం ఉంది. వరల్డ్కప్లో అందరి దృష్టిని ఆకర్షించే అత్యంత కీలకమైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఇక ప్రపంచకప్లో పాల్గొంటున్న అన్ని జట్లు టైటిల్ గెలవడమే లక్ష్యంగా శిక్షణ తీసుకున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. గత కొన్ని సిరీస్లుగా భారత మహిళల జట్టు అద్భుతమైన ఫామ్లో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సమతూకంతో కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం జట్టు బలాన్ని మరింత పెంచింది.చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్లో మెరిసిన టీమిండియా స్టార్! -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్లో మెరిసిన టీమిండియా స్టార్!
టీమిండియా వెటరన్ క్రికెటర్ ఉమేశ్ యాదవ్ చాన్నాళ్ల తర్వాత తన బౌలింగ్తో దర్శనమిచ్చాడు. భారత జట్టులో ఎప్పుడో చోటు కోల్పోయిన ఉమేశ్ ప్రస్తుతం విదర్భ ప్రీమియర్ లీగ్ ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ఈ లీగ్లో నాగ్పూర్ హీరోస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమేశ్ యాదవ్ మంగళవారం ఇండియా వారియర్స్తో మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో ఉమేశ్ యాదవ్ 3 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ వీడియోనూ ఒక అభిమాని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. 'ఎన్ని రోజులకు దర్శనమిచ్చావయ్యా.. నీ బౌలింగ్ చూసి కొన్నేళ్లయింది.. థాంక్యూ ఉమేశ్' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్ టీమిండియా తరఫున 57 టెస్టుల్లో 170 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టీ20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడిన వైభవ్ మొత్తంగా 148 మ్యాచ్ల్లో 144 వికెట్లు పడగొట్టాడు. ధోని సారథ్యంలో 2013 చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియాలో ఉమేశ్ యాదవ్ సభ్యుడిగా ఉన్నాడు. 2015 వన్డే ప్రపంచకప్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉమేశ్ యాదవ్ నిలిచాడు. 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో 310 స్ట్రైక్రేట్తో 10 బంతుల్లోనే 31 పరుగులు చేయడం ఇప్పటికీ ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఉమేశ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన నాగ్పూర్ హీరోస్పై ఇండియన్ వారియర్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (19 బంతుల్లోనే 63 నాటౌట్), శుభమ్ దూబే (33 బంతుల్లో 74 నాటౌట్) మెరిశారు. అనంతరం నాగ్పూర్ హీరోస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్ధేశ్ వత్ (78) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇండియా వారియర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, దర్శన్ నల్కండే, రాహుల్ డోంగర్వార్, గుర్దీప్సింగ్లు తలా రెండు వికెట్లు తీశారు. Saw Umesh Yadav bowling after a long timeFeels NostalgicHe is playing Vidarbha premier league pic.twitter.com/Bp0TwGQez2— Sawai96 (@Aspirant_9457) June 3, 2026చదవండి: వైభవ్ సూర్యవంశీపై పరిశోధనలు! -
దేశవాలీ టోర్నీలో అభిషేక్ విధ్వంసం..
దేశవాలీ టోర్నీ విదర్భ ప్రీమియర్ లీగ్లో సంచలనం నమోదయ్యింది. మంగళవారం ఇండియా వారియర్స్, నాగ్పూర్ హీరోస్ మధ్య జరిగిన మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇటీవలే ఐపీఎల్లో పెద్దగా మెరవని శుభమ్ దూబేతో పాటు అభిషేక్ అగర్వాల్ సంచలన ఇన్నింగ్స్లతో మెరిశారు. ముఖ్యంగా అభిషేక్ అగర్వాల్ కేవలం 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు శుభమ్ దూబే కూడా (33 బంతుల్లో 74 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) తడాఖా చూపించాడు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్కు అజేయంగా 107 పరుగులు జోడించడం దేశవాలీ క్రికెట్లో ఒక రికార్డుగా మిగిలిపోనుంది. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అభిషేక్ అగర్వాల్ ఒక సిక్స్, నాలుగు ఫోర్లు కొట్టి మొత్తంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ 16 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే నాగ్పూర్ హీరోస్పై ఇండియన్ వారియర్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (19 బంతుల్లోనే 63 నాటౌట్), శుభమ్ దూబే (33 బంతుల్లో 74 నాటౌట్) మెరిశారు. అనంతరం నాగ్పూర్ హీరోస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్ధేశ్ వత్ (78) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇండియా వారియర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, దర్శన్ నల్కండే, రాహుల్ డోంగర్వార్, గుర్దీప్సింగ్లు తలా రెండు వికెట్లు తీశారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. బిగ్ న్యూస్ -
వైభవ్ సూర్యవంశీపై పరిశోధనలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్లో సంచలనాలు చేస్తుండడంపై దిగ్గజ క్రికెటర్లు కూడా వైభవ్ను అభినందించకుండా ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలో అతడి జీవితాన్ని, చిన్న వయసులోనే ఒత్తిడిని అధిగమించి ఇవాళ స్టార్ క్రికెటర్ రేంజ్కు ఎదిగిన వైభవ్ సూర్యవంశీ ఘనతను తమ పాఠ్యాంశంలో చేర్చాలని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-ఇండోర్ భావిస్తోంది. త్వరలోనే ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్పై ఐఐఎం-ఇండోర్ పరిశోధనలు చేపట్టనుంది. చిన్న వయసులోనే క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన వైభవ్ సూర్యవంశీపై ఒక ప్రత్యేక కేస్స్టడీ చేయనున్నట్లు ఐఐఎం ఇండోర్ ప్రతినిధులుతెలిపారు. దీంతో వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. చిన్నవయసులోనే స్టార్డమ్ రావడం, చిన్నవయసులోనే స్టార్డమ్ రావడం, కెరీర్ భవిష్యత్తు, ఒత్తిళ్లు, సవాళ్లు.. వాటి ప్రభావాలను వైభవ్ ఎలా అధిగమించాడనే దానిపై తమ సంస్థ అధ్యయనం చేయనుందని ఐఐఎం ఇండోర్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.‘బాల మేధావుల అసాధారణ ప్రదర్శనకు ఎలాంటి కారకాలు దోహదపడుతాయనేవి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందుకోసం చిన్నతనం నుంచే అలవడే వ్యక్తిత్వం, ప్రవర్తన, సాధన పద్దతులు.. కుటుంబం నుంచి అందుతున్న సహకారం, ఉపాధ్యాయులు, కోచ్లు, సీనియర్ల మద్దతుతో వివిధ రంగాల్లో ఎదుగుతున్న పిల్లలపై అధ్యయనం చేయాలని నిర్ణయించాం. స్పోర్ట్స్ విభాగంలో వైభవ్ సూర్యవం శీని ఎంపిక చేసుకున్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని అతడికి తెలియజేశాము.’ అని ఐఐఎం డైరక్టర్ తెలిపారు.బాలల ప్రతిభపై సంస్థ జరిపే అధ్యయనంలో మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవ వనరులు, సమాచారవ్యాప్తి, ప్రవర్తనకు సంబంధించి ప్రత్యేక పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అధ్యయనం కేవలం క్రీడలకే కాకుండా చిన్న వయసులోనే గణితం, సైన్స్, కళలు, ఇతర వృత్తుల్లో రాణిస్తున్న ప్రతిభావంతులపై కూడా జరగనుంది. అయితే ఈ అధ్యయనం పూర్తవ్వడానికి రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశముందని ఐఐఎం ఇండోర్ తెలిపింది.చదవండి: వరల్డ్ నంబర్వన్ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద! -
ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్లీడర్స్తో క్రికెటర్ల బంధం!
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వరుసగా సంచలన విషయాలు వెల్లడిస్తూ వస్తున్నాడు. ఇటీవలే ‘హ్యూమన్ బాంబే’ అనే పాడ్కాస్ట్కు లలిత్ మోదీ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే లక్నో సూపర్జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై విరుచుకుపడిన లలిత్ మోదీ తాజాగా ఐపీఎల్ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చీర్ లీడర్స్తో క్రికెటర్ల ప్రేమాయణాలకు సంబంధించిన విషయాలను బయపెట్టడం ఆసక్తి రేపింది. చీర్లీడర్స్ ఐపీఎల్కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే వారిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నాడు. టోర్నమెంట్ సమయంలో జరిగే మైదానం వెలుపలి వివాదాలలో అధికభాగం ముందు రాసుకునే స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని తెలిపాడు. ఐపీఎల్ చూసే వీక్షకుల రేటింగ్లు పడిపోతే, హైప్ సృష్టించడం కోసం ఐపీఎల్ థింక్-ట్యాంక్ ఉద్దేశపూర్వకంగా మీడియాలో వార్తలను ప్రచారం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు చీర్ లీడర్తో సంబంధం కొనసాగిస్తున్నాడన్న వార్తను తానే వ్యాప్తి చేశానంటూ లలిత్ మోదీ బాంబు పేల్చాడు.అయితే కొందరు క్రికెటర్లు చీర్లీడర్స్తో ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నట్లు వార్తలు సృష్టించడం లాంటివన్నీ ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించాడు.ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించడం, వారు వ్యూయర్షిప్ కోసం దానికి మరింత హంగులు అద్ది రేటింగ్స్ను పెంచుకోవడానికి ఆయుధంలా వాడుకునేవారు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ చీర్ లీడర్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు తాము బహిరంగపరిచిన మాట వాస్తవమే. కానీ కొన్ని చానెళ్లు మాత్రం దిగజారి డికాక్ చీర్లీడర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ రాసుకొచ్చాయి. ఇది వారి టీఆర్పీ రేటింగ్ను పెంచేసి ఉండొచ్చు.. కానీ ఒక క్రికెటర్ కెరీర్కు ఇదొక మాయని మచ్చలా మిగిలిపోతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సౌతాఫ్రికా డికాక్ ఆ చీర్లీడర్నే పెళ్లి చేసుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో చీర్ లీడర్స్ను పెళ్లి చేసుకున్న క్రికెటర్ల గురించి ఒక లుక్కేద్దాం.👉డికాక్, షాషా హర్లీ..సౌతాఫ్రికా సీనియర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, షాషా హర్లీల ప్రేమకథ, వివాహబంధంలోకి అడుగుపెట్టడం ఒక చిన్నపాటి సినిమా కథలాగా ఉంటుంది. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ జరిగిన సమయంలో డికాక్ హైవైల్డ్ లయన్స్ తరఫున ఆడుతున్నాడు. అదే జట్టుకు షాషా హర్లీ చీర్లీడర్గా పనిచేసినట్లు సమాచారం. టోర్నీ జరిగిన సమయంలోనే డికాక్తో షాషా హర్లీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు రిలేషన్షిప్లో మునిగి తేలారు. 2015లో నిశ్చితార్థం చేసుకున్న డికాక్, షాషాహర్లీలు మరుసటి ఏడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2022లో ఈ జంట తమ మొదటి బిడ్డ కియారాకు స్వాగతం పలికారు. అప్పటినుంచి డికాక్ ఏ టోర్నీకి వెళ్లినా షాషా హర్లీ తన వెంటే వస్తూ అతన్ని ఉత్సాహంగా ఉంచుతుంది.👉మహ్మద్ షమీ, హసిన్ జహాన్..చీర్లీడర్ను పెళ్లిచేసుకున్న మరో క్రికెటర్ మహ్మద్ షమీ. 2012 ఐపీఎల్ సీజన్లో మాజీ మోడల్ హసీన్ జహాన్ చీర్లీడర్గా పనిచేసింది. ఈ సీజన్లోనే షమీ మొదటిసారి ఆమెను కలిశాడు. మాటల మధ్యలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత 2014 జూన్ 6న మొరాదాబాద్లో కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత హసీన్ జహాన్ చీర్ లీడర్ పాత్రకు ఫుల్స్టాప్ పెట్టింది. 2015లో ఈ దంపతులు ఐరా షమీకి స్వాగతం పలికారు. అయితే నాలుగేళ్లకే వీరి వివాహబంధం ముగిసింది. షమీపై శారీరక వేధింపులు, గృహహింస కేసులు పెట్టిన హసీన్ జహాన్ షమీతో విడాకులు తీసుకొని విడిపోయింది. అలా క్రికెటర్లలో చీర్ లీడర్స్ను పెళ్లి చేసుకున్న ఇద్దరిలో ఒకరు తమ వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటే.. మరొకరు మాత్రం వివాహబంధం విచ్ఛిన్నం కావడంతో ఒంటరిగా మిగిలిపోయాడు. చదవండి: గంభీర్ తప్పుకోనున్నాడా? టీమిండియాకు కొత్త కోచ్! -
గంభీర్ తప్పుకోనున్నాడా? టీమిండియాకు కొత్త కోచ్!
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా అఫ్గానిస్తాన్తో సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్లకు సంబంధించి జట్టును ప్రకటించారు. గంభీర్ హెడ్కోచ్గా టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సహా 2026 టీ20 ప్రపంచకప్ నెగ్గింది. 2027 వన్డే వరల్డ్కప్ వరకు గంభీరే టీమిండియాకు హెడ్కోచ్గా కొనసాగనున్నాడు. అయితే టీ20 క్రికెట్లో గంభీర్ను కోచ్గా తప్పించి వేరే వాళ్లకు అవకాశమివ్వాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం ఊహాగానాలే అయినప్పటికీ ఇప్పటికిప్పుడు గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త టీ20 కోచ్గా ఎవరు వస్తే బాగుంటుందనే దానిపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయం వెల్లడించాడు. గంభీర్ స్థానంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్కు హెడ్కోచ్గా ఉన్న ఆశిష్ నెహ్రా కోచ్ స్థానానికి సరైన వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడాడు. ‘ఆశిష్ నెహ్రా చాలా స్మార్ట్ క్రికెటర్. క్రికెట్ గురించి అతడితో మాట్లాడితే కచ్చితంగా ఎమెషనల్ అవుతాము. అతడు ఎప్పుడు జట్టు గురించే ఆలోచిస్తాడు. ఆశిష్ నెహ్రా చాలా నిక్కచ్చిగా ఉండే కోచ్. ఆటను చాలా సూక్ష్మంగా అంచనా వేస్తాడు. ఎవరిని నొప్పించడానికి ప్రయత్నించడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడం, వారి కెరీర్ ఎదుగుదలకు నెహ్రా సహయపడుతాడు. ఒక కోచ్గా జట్టును చాలా ప్రభావితం చేయగలడు. ఆటగాళ్లందరినీ ఒకే తాటిపై నడిపించగల సత్తా అతని సొంతం. బీసీసీఐ ఒకవేళ టీ20 క్రికెట్కు కొత్త కోచ్ను చూస్తున్నట్లయితే ఆ పాత్రకు ఆశిష్ నెహ్రా న్యాయం చేయగలడు. నెహ్రాను కేవలం బౌలింగ్ కోచ్గా చూడడం ఆపేయాలి. ఎందుకంటే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు హెడ్కోచ్గా విజయవంతమయ్యాడు. అంతేగాక చాలాకాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆశిష్ నెహ్రాకు వేర్వేరు కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడిన అనుభవముంది. ఒకవేళ టీమిండియాకు కోచ్ పాత్రలో వస్తే హెడ్కోచ్గానే రావాలని కోరుకుంటున్నా’అంటూ తెలిపాడు. కాగా ఐపీఎల్లో ఆశిష్ నెహ్రా హెడ్కోచ్గా గుజరాత్ టైటాన్స్ను విజయవంతంగా నడిపించాడు. 2022లో చాంపియన్స్గా నిలిచిన గుజరాత్ ఆ తర్వాతి సీజన్లో రన్నరప్గా నిలిచింది. 2024 సీజన్లో విఫలమైనప్పటికీ, 2025 సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ ఈ ఏడాది సీజన్లో ఫైనల్ చేరి మరోసారి రన్నరప్గా నిలిచింది.చదవండి: 'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!' -
వారెవ్వా కోహ్లీ.. రోజు వ్యవధిలో ఎంత మార్పు!
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు వృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని మంగవారం సందర్శించారు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి ఆధ్యాత్మిక ఆశ్రమానికి వచ్చాడు. ప్రేమానంద్ మహారాజ్కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లారు. కాగా కోహ్లీ, అనుష్క దంపతులు ఇప్పటికే అనేక సార్లు ఆశ్రమాన్ని విజిట్ చేశారు. ఆశ్రమానికి వెళ్లి బయటకు వస్తున్న కోహ్లీ, అనుష్కకు సంబంధించిన వీడియోలు, ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలా సింపుల్ డ్రెస్సులో ఇద్దరూ ఆశ్రమానికి వెళ్లారు. మాస్క్లతో తమ ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధనలు వినేందుకు తరుచూ అనుష్క, కోహ్లీ జంట ఆశ్రమానికి వెళ్తుంటారు. ఇది చూసిన ఆర్సీబీ అభిమానులు.. ‘వారెవ్వా కోహ్లీ.. ఒక్కరోజులో ఎంత మార్పు’..‘టైటిల్ టు ఆధ్యాత్మికం వైపు అడుగులు’ అంటూ కామెంట్లు చేశారు.గత ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ట్రోఫీ పట్టుకున్న సమయంలో కోహ్లీ నుదురుపై అనుష్కా కిస్ ఇచ్చింది.ఆ తర్వాత ఆర్సీబీ గెలుపు సంబరాలకు సంబంధించిన ఒక ఈవెంట్లోనూ విరుష్క జంట అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. 🎥 | Virat Kohli and Anushka Sharma’s visit to #PremanandMaharaj’s Radha Keli Kunj Ashram in #Vrindavan has gone viral on #socialmedia, with a video showing the couple seeking blessings from the spiritual leader. The visit came days after #RCB’s historic #IPL title triumph, and… pic.twitter.com/QPucsbjK6i— The Statesman (@TheStatesmanLtd) June 2, 2026చదవండి: 'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!' -
కోహ్లీ, పాటీదార్ కాదు.. ఆర్సీబీ రాత మారింది ఆమె వల్లే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది చాంపియన్గా నిలిచింది. అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి 'ఈ సాలా కప్ నమ్దే' అంటూ 17 ఏళ్లుగా టైటిల్ కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది. అప్పటికీ మూడుసార్లు ఫైనల్ చేరినా తుది మెట్టుపై బోల్తా పడడంతో ఇక ఆర్సీబీ టైటిల్ కల కష్టమే అని ఫ్యాన్స్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.కానీ 17 ఏళ్లలో దక్కని టైటిల్ గతేడాది తమ చెంత చేరడంతో ఆర్సీబీ ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ రెండోసారి కప్ ఒడిసిపట్టడంతో రజత్ పాటీదార్ లక్కీ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన మూడో కెప్టెన్గా పాటీదార్ నిలిచాడు. ఈ క్రమంలో పాటీదార్ను ఆర్సీబీకి ట్రోఫీ అందించిన లక్కీ కెప్టెన్ అని పొగుడుతున్నారు.కానీ ఆర్సీబీ రాత అంతకుముందే మారిందని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఆర్సీబీ పురుషుల జట్టు టైటిల్ సాధించ డానికి ముందే మహిళల జట్టు ఆ ఘనత సాధించింది. స్మృతి మందాన నేతృత్వంలోని ఆర్సీబీ వుమెన్ టీం 2024లోనే తొలి టైటిల్ సాధించింది. అయితే 2023లో మొదలైన డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ మహిళల జట్టు కూడా మొదట్లో ఓటమిబాటలోనే నడిచింది. ఆ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయి పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో పురుషుల జట్టు మాదిరే మహిళల జట్టు కూడా ట్రోలింగ్కు గురైంది. అయితే మరుసటి సీజన్లోనే మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ కమ్బ్యాక్ ఇచ్చింది. ఆ సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ వుమెన్ తొలిసారి ఫ్రాంచైజీకి టైటిల్ అందించింది. దీంతో కెప్టెన్గా మంధాన పేరు మార్మోగిపోయింది. 2025 సీజన్లో టైటిల్ సాధించడంలో విఫలమైనప్పటికీ, 2026 సీజన్లో మరోసారి ఆర్సీబీ మహిళల జట్టు చాంపియన్గా నిలిచింది. ముఖ్యంగా కెప్టెన్గా, బ్యాటర్గా మంధాన అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో మంధాన 41 బంతుల్లోనే 87 పరుగులు సాధించి ఒంటిచేత్తో ఆర్సీబీకి రెండో కప్పును అందించింది. దీంతో ఆర్సీబీ కూడా చాంపియన్గా నిలవగలదని మంధాన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది. మహిళల జట్టును ఆదర్శంగా తీసుకున్న పురుషుల జట్టు లెగసీని కంటిన్యూ చేస్తూ ఇవాళ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. రాబోయే రెండు మూడేళ్లు ఆర్సీబీకి చెందిన మహిళల జట్టు డబ్ల్యూపీఎల్లో.. పురుషుల జట్టు ఐపీఎల్లో వరుస టైటిల్స్ సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఆర్సీబీని మార్చిన కోహ్లీ సందేశం..2023 డబ్ల్యూపీఎల్లో వైఫల్యం తర్వాత ఆర్సీబీ మహిళల జట్టుతో కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో మహిళల జట్టుకు 'ఫలితం కోసం ఆశించకుండా 110 శాతం కష్టపడండి' అంటూ కోహ్లీ తన మోటివేషన్ స్పీచ్తో ఆ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలా కోహ్లీ సందేశాన్ని ఒంటబట్టించుకున్న మంధాన సేన 2024 సీజన్లో టైటిల్ను సాధించింది. ఆర్సీబీ తలరాత మార్చింది కోహ్లీ, పాటీదార్ కాదు.. మంధాన అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.𝙀𝙚 𝙎𝙖𝙡𝙖 𝘾𝙪𝙥 𝙉𝙖𝙢𝙙𝙪 x 2⃣ 🏆🏆Smriti Mandhana 🤝 Rajat Patidar #TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/QxVAOX8oq2— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: షకీరా కూడా పనికిరాదు.. ఫ్యాన్స్ను షేక్చేస్తోన్న ఫిఫా పాట! -
వైభవ్ కోసం పడిగాపులు.. అస్సలు తగ్గేదేలే!
రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్లో వండర్కిడ్ అనడంలో సందేహం లేదు. 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికిప్పుడు వేలంలోకి వస్తే 30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ సహా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎంపికైన వైభవ్ రూ.55 లక్షలు అందుకున్నాడు. దీంతో వైభవ్ ఆట మారడంతోనే అతడి బ్రాండ్వాల్యూ కూడా అంతే స్థాయిలో పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు తాను సంతకాలు చేసిన ఎండార్స్మెంట్లకు సంబంధించిన ఫీజులన్నింటిని డబుల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వైభవ్ ఇప్పటికే కాంప్లాన్, రెడ్బుల్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వైభవ్.. ఇటీవలే ఐపీఎల్లో విధ్వంసకర ప్రదర్శనతో అతడితో ఒప్పందం కుదుర్చుకోవడానికి అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ తన ఎండార్స్మెంట్ ఫీజులను రెట్టింపు చేసినట్లు ఒక కంపెనీకి చెందిన అడ్వర్టైజింగ్ అధికారి పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు వైభవ్ ఒక్కో ఒప్పందానికి సుమారు రూ.కోటి చొప్పున సంతకాలు చేశాడు. సీజన్ ముగిసిన తర్వాత మాత్రం అతడు ఒక్కో ఒప్పందానికి రూ. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నాడు. ఆట మారడంతోనే బ్రాండ్ కూడా మారిపోయిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఉన్నత దశలో ఉంది. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని కెరీర్ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం వైభవ్ సమీప భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవడం ఖాయం. క్రికెట్లో ఇప్పటికే వైభవ్ను దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్తో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లతో పోలుస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ వాల్యూలకు ఆకర్షితుడవ్వకుండా కెరీర్ కోసం కష్టపడితే మాత్రం వైభవ్కు ఇంతమించి ఎండార్స్మెంట్లు వస్తాయనడంలో సందేహాం లేదు.చదవండి: కింగ్ పదానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ కపట బుద్ధి! -
కింగ్ పదానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ కపట బుద్ధి!
ఈ తరం క్రికెటర్లలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ జాబితాలో ఆటగాళ్ల పేర్లను వెలికితీస్తే అందులో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటాడు. భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20) కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ చరిత్రకెక్కాడు. కోహ్లీ మూడు ఫార్మాట్లు కలిపి 559 మ్యాచ్ల్లో 28,215 పరుగులు సాధించాడు. ఇందులో 85 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలున్నాయి. అలాంటి కోహ్లీతో కొన్నాళ్ల క్రితం వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పరుగుల పరంగా పోటీ పడ్డ మాట నిజమే. ఒక దశలో కోహ్లీ రికార్డులను కూడా బాబర్ బద్దలుకొట్టాడు. అయితే క్రమేపి బాబర్ ఆజం ఆటలో పదును తగ్గుతూ రావడం.. అదే సమయంలో కోహ్లీ వయసు పెరుగుతున్న కొద్ది బ్యాటింగ్లో జోరు కనబరచడం జరిగిపోయింది. దీంతో బాబర్ ఆజం కోహ్లీకి ఆమడ దూరంలోనే నిలిచిపోయాడు. ఇప్పటివరకు బాబర్ ఆజం మూడు ఫార్మాట్లు కలిపి 15,647 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, 108 అర్థసెంచరీలున్నాయి. అయితే బాబర్ ఆజం టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ మూడు ఫార్మాట్లు కలిపి చూస్తే మాత్రం కోహ్లీ చేసిన పరుగుల్లో బాబర్ సగం కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పోడంటూ ప్రశంసలు కురిపించడం ఆసక్తి రేపింది. 'విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లో 675 పరుగులు సాదించాడు. కానీ అదే సమయంలో బాబర్ ఆజం పీఎస్ఎల్లో కోహ్లీ కంటే నాలుగు తక్కువ ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ 588 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లు కలిపి చూస్తే కోహ్లీవి ఎక్కువ పరుగులు ఉండొచ్చు.. కానీ టీ20 క్రికెట్లో బాబర్ను మించిన బ్యాటర్ లేడు. పరుగులు సాధించడమే కాదు సెంచరీల విషయంలోనూ కోహ్లీపై బాబర్ ఆజందే పైచేయి. అదీగాక కోహ్లీ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. కానీ బాబర్ ఇప్పటికీ మూడు ఫార్మాట్లు నిలకడగా ఆడుతున్నాడు. రాబోయే కాలంలో బాబర్ ఆజం టీ20 క్రికెట్లో ఉన్న రికార్డులన్నింటిని తన పేరిట లిఖించుకోనున్నాడు.' అని చెప్పుకొచ్చాడు. అంతటితో ఊరుకోకుండా తన్వీర్ అహ్మద్ తన ఎక్స్ ఖాతాలో కింగ్ అనే పదానికి బాబర్ ఆజం సరైన నిర్వచనమని, కోహ్లీ దీనికి ఎంతమాత్రం సరిపోడంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం కనిపించింది. 'గత పదేళ్లలో అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీతో పోటీ పడి పరుగులు సాధించిన బాబర్ ఆజం నా దృష్టిలో గొప్ప క్రికెటర్. నేను అతడిని కింగ్ అని పిలుచుకుంటా' అని పేర్కొన్నాడు. తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పరుగుల యంత్రంగా పేరున్న కోహ్లీని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోము.'..'టీమిండియా బ్యాటర్లు బాగా ఆడుతుంటే ఓర్వలేనితనం ఎలా ఉంటుందో పాక్ నిరూపించింది' టీమిండియా అంటే పాక్కు ఎప్పుడు కుళ్లే ఉంటుంది’ అని కామెంట్లు చేస్తున్నారు.కోహ్లీతో సరితూగలేడు.. నిజానికి బాబర్ కంటే ఏడేళ్ల ముందే కోహ్లీ (2008లో) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బాబర్ అడుగుపెట్టే సమయానికే కోహ్లీ స్టార్ క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్తో ఏమాత్రం సరితూగని బాబర్ ఆజంకు కలిసొచ్చే అంశం ఏదైనా ఉందంటే.. వయసు దృష్ట్యా అతడు మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడే అవకాశముంది. అసలు కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చలేము. ఐసీసీ మేజర్ టైటిల్స్ సాధించకపోయినప్పటికీ, కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ను, ఆ తర్వాత ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాల్లో నిలకడ విజయాలు అందుకుంది. మరోవైపు బాబర్ ఆజం కేవలం టీ20 ప్రపంచకప్పుల్లో మాత్రమే టీమిండియాను ఓడించాడు. అందులో కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 ప్రపంచకప్లో 10 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడిపోవడమే బాబర్ ఆజంకు ఉన్న ఏకైక విజయం. అది మినహాయిస్తే కోహ్లీని ఏ విషయంలోనూ బాబర్ ఆజం మ్యాచ్ చేయలేడన్న సంగతి అందరికి తెలిసిందే.చదవండి: కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది? -
కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది?
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో కోహ్లీ(75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించడమే గాక రెండోసారి టైటిల్ అందించాడు.అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి, అనుష్క శర్మల మధ్య జరిగిన ఒక సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఆ వీడియోలో అనుష్క, కోహ్లీ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో, అనుష్క చేతిలో ఒక కవర్ కనిపించింది. ఇది చూసిన కోహ్లీ అందులో ఏముందో తెలుసుకోవడానికి అది ఒకసారి ఇవ్వాలని అడిగాడు. కానీ అనుష్క మాత్రం కోహ్లీకి లెటర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.అయినా కోహ్లీ అదే పనిగా ఆమె చేతి నుంచి లెటర్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనుష్క శర్మ డగౌట్కు చేరుకున్న తర్వాత ఇస్తానులే అని చెప్పింది. దీంతో కోహ్లీ ఏంటి ఇలా చేస్తున్నావనడం వీడియోలో కనిపించింది. ఇది చూసిన అభిమానులు ఇంతకీ ఆ కవర్లో ఏముంది చెప్మా అంటూ కామెంట్లు పెట్టారు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.FUNNY MOMENT AFTER THE FINAL 🤣🔥- Anushka had an envelope.- Virat Kohli was trying to take it.- But Anushka didn't want to give it.- Kohli tried multiple times but failed.- He was curious to know what was inside.Meanwhile, Anushka: "I'll give it to you there." 😅🔥 pic.twitter.com/v8k7jyaZ4z— Jara (@JARA_Memer) June 1, 2026చదవండి: కెనడా క్రికెట్పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం! -
కెనడా క్రికెట్పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెస్టు క్రికెట్లో మార్పులకు ఆమోదముద్ర వేయడంతో పాటు కెనడా క్రికెట్పై సస్పెన్షన్, బంగ్లా క్రికెట్ బోర్డు ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులను నియ మించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ చైర్మన్ జైషా నేతృత్వంలో రెండు రోజులపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఐసీసీ పలు కీలక మార్పులకు ఆమోద ముద్ర వేసింది.అవినీతి ఆరోపణలు..అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కెనడా క్రికెట్ను సస్పెండ్ చేయాలని ఐసీసీ బోర్డు తీర్మానించింది. సభ్యత్వానికి సంబంధించిన బాధ్యతలను ఉల్లంఘించిన కారణమే తక్షణ సస్పెన్షన్కు కారణమని తెలుస్తోంది. అయితే కెనడా క్రికెట్ బోర్డుపై వేటు వేసినప్పటికీ జట్టు ఆటగాళ్ల ప్రయోజనాలను కాపాడడం ఐసీసీ మొదటి ప్రాధాన్యమని తెలిపింది. జాతీయ పాలకమండలిని ప్రభావితం చేసే పాలనపరమైన సమస్యల వల్ల ఆటగాళ్లు నష్టపోకుండా చూడడం తమ బాధ్యత అని ఐసీసీ తెలిపింది.సస్పెన్షన్లో ఉన్న కెనడా క్రికెట్ బోర్డులో సమస్యలను పరిష్కరించడానికి ఐసీసీ నార్మలైజేషన్ కమిటీ పనిచేయనుందని, కెనడా క్రికెట్ బోర్డును తిరిగి కొత్తగా పునరుద్ధరించేందుకు దోహదపడుతుందని పేర్కొంది.పింక్బాల్ ట్రయల్..ఆటలో వెలుతురు సమస్య కారణంగా ఆట నిలిచిపోకుండా ఉండేందుకు, సంప్రదాయ రెడ్ బాల్కు బదులుగా అవసరమైతే పింక్ బాల్ వినియోగాన్ని ట్రయల్గా అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే పింక్ బాల్ ట్రయల్కు షరతులతో అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.ముందుగా ఇరు జట్ల అంగీకారంతో, చెడు వెలుతురు కారణంగా ఆట ఆగే పరిస్థితులు ఉంటే రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ ఉపయోగించేందుకు ట్రయల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనను ఐసీసీ క్రికెట్ కమిటీ (మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో) అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ పరిశీలించి ఓకే చెప్పింది. టెస్టు క్రికెట్లో వెలుతురు తగ్గడం వల్ల ఆట తరచూ నిలిచిపోతుండటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. అధికారిక ప్రకటనలో పూర్తి విధివిధానాలు వెల్లడించకపోయినా, పరిస్థితులు క్షీణిస్తున్నప్పుడు మ్యాచ్ అధికారులు రెడ్ బాల్ నుంచి పింక్ బాల్కు మారే అవకాశం ఇవ్వబడుతుందని సమాచారం. పింక్ బాల్ సాధారణంగా డే-నైట్ టెస్టుల్లో ఉపయోగించబడుతుంది. తక్కువ వెలుతురులో మెరుగైన కనిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓవర్కాస్ట్ పరిస్థితులు, త్వరగా సూర్యాస్తమయం జరిగే దేశాల్లో బాడ్ లైట్ కారణంగా ఆట ఎక్కువగా నిలిచిపోతుండటంతో ఈ నిర్ణయాన్ని ప్రాక్టికల్ సొల్యూషన్గా చూస్తున్నారు.హాక్-ఐ డేటాకు అనుమతిసందేహాస్పద బౌలింగ్ యాక్షన్పై రిపోర్ట్ చేసే సందర్భంలో మ్యాచ్ అధికారులు ఇకపై 'హాక్-ఐ డేటాను ఉపయోగించేందుకు' ఐసీసీ అనుమతి ఇచ్చింది. .వన్డేల్లో హెడ్కోచ్లకు కొత్త అవకాశంఇక వన్డే మ్యాచ్లలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్లు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి లభించింది. ఇప్పటివరకు ఇది కేవలం సబ్స్టిట్యూట్ ప్లేయర్లకే పరిమితమైంది. ప్రతి ఇన్నింగ్స్లో రెండు డ్రింక్స్ బ్రేక్లు ఉండటంతో కోచ్లు మ్యాచ్లో నాలుగు సార్లు ప్రత్యక్షంగా ఆటగాళ్లకు వ్యూహాలను చెప్పే అవకాశం పొందనున్నారు. అయితే కోచ్లు మైదానంలో ఎలాంటి డ్రెస్ కోడ్లో ఉండాలన్నది ఇంకా స్పష్టత రాలేదు.లెగ్-సైడ్ వైడ్ రూల్కు శాశ్వత ఆమోదంఐసీసీ లెగ్-సైడ్ వైడ్పై సవరించిన నిబంధనను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఎంసీసీ క్రికెట్ నిబంధనల్లో మిగిలిన మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.మరికొన్ని నిర్ణయాలు..క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్లో పాల్గొనే జట్లు, టోర్నమెంట్ సైకిల్ సమయంలో ఇతర లిస్ట్-ఏ పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడేందుకు అర్హత కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. మొత్తంగా, టెస్టు క్రికెట్లో ఆట సమయాన్ని పెంచడం, ఆధునిక టెక్నాలజీ వినియోగం, అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వ్యూహాత్మక మార్పుల దిశగా ఐసీసీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్! -
బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్!
ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ను నిలబెట్టుకుంది. అయితే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించడం వైరల్గా మారింది. అయితే టిమ్ డేవిడ్ ఇదంతా ఫన్ మోడ్లో చేయడంతో పెద్దగా వివాదం కాలేదు.విషయంలోకి వెళితే.. ఈ సీజన్లో బీసీసీఐ ఏఐ రోబోట్ చంపాక్ను పరిచయం చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు బంతిని తీసుకురావడం, బ్యాటర్లకు వెల్కమ్ చెప్పడం లాంటి పనులతో రోబో బాగా పాపులర్ అయింది. అయితే ఈ ఏఐ రోబోను టిమ్ డేవిడ్ నాశనం చేసినంత పని చేశాడు. మ్యాచ్ విజయం అనంతరం ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్తో చాంపియన్ ఫొటోలకు ఫోజిచ్చేందుకు వచ్చింది. ఈ సమయంలో టిమ్ డేవిడ్ చాంపియన్ అని రాసి ఉన్న బోర్డు నుంచి బయటకు వచ్చి ఏఐ రోబో చంపాక్ను తన్నాలని చూశాడు. కానీ తన ఆలోచనను విరమించుకొని తిరిగి తన స్థానానికి వెళ్లిపోయాడు. టిమ్ డేవిడ్ చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.The moment when the rest of the players were celebrating with the IPL trophy, Tim David started having fun with Champak. Never change Timmy 😂❤️ pic.twitter.com/CYteAnZ53z— ` (@Atomickolly17) May 31, 2026చదవండి: IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా! -
IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!
ఐపీఎల్లో పరుగుల పండుగ అభిమానులకు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడవలు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ను అలరించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి తాజా 19వ సీజన్ దాకా ఎన్నో గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సీజన్లో అభిమానులకు కిక్ ఇచ్చిన టాప్-10 వివాదాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదంఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్పై ఎంత రగడ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 63 పరుగులతో కోహ్లి ఆర్సీబీని విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ను గిల్ సరిగ్గా పట్టలేదని, చేతుల్లోకి వెళ్లడానికి ముందు బంతి నేలను తాకిందని కోహ్లీ భావించాడు. A chat between Virat Kohli and Shubman Gill on the catch. - The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026అయితే అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాదని, క్రీజు వదలి వెళ్లనని, థర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిపట్టు పట్టాడు. చేసేదేం లేక అంపైర్ తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. కోహ్లీ సంబరాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశతో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.2) షేక్హ్యాండ్ వివాదం..ఈ సీజన్లో అభిమానులకు మరింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడడం, దానికి కోహ్లీ ధీటుగా బదులివ్వడం జరిగిపోయాయి. అయితే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణగలేదు. Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂Kohli you character 🔥 pic.twitter.com/W9CS6KM52t— Avénue.1 (@Avnueone8) May 23, 2026మ్యాచ్ పూర్తైన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో హెడ్ తన వద్దకు వచ్చినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం హెడ్ భార్యను కూడా తాకింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మరి ఈ వివాదానికి ఈ సీజన్తో ముగింపు పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.3) టిమ్ డేవిడ్ అనైతిక చర్యమే 11న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనను విడుదల చేయడంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసినట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చర్యను తప్పుబడుతూ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.4) టాస్ వివాదం..ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరు సందర్భంగా టాస్ సమయంలో నెలకొన్న గందరగోళం వివాదంగా మారింది. మొదట టాస్ వేసినప్పుడు పరాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ మాత్రం పరాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మళ్లీ వేయించాడు. రెండో ప్రయత్నంలో రాజస్తాన్ రాయల్స్కు టాస్ అనుకూలించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్రయత్నంలో గుజరాత్కు టాస్ అనుకూలంగా వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ సమయంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. కానీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ఈ వివాదంపై పెద్దగా చర్చ జరగలేదు.5) అంపైరింగ్పై ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు ఈ సీజన్లో వరుస వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు తమను తీవ్ర ప్రభావితం చేశాయంటూ ఎస్ఆర్హెచ్ బీసీసీఐని ఆశ్రయించడం హైలైట్గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో క్లాసెన్ వివాదాస్పద క్యాచ్, కేకేఆర్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్పై, లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ బంతి బౌండరీ లైన్ను దాటకముందే, ఆ తాడును వెనక్కి నెట్టేయడంపై ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్యపై ఆటగాడికి భారీ జరిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చర్చనీయాంశమైంది.6) పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘటనపంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరేట్) చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం నిషిద్ధం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట పరువుకు భంగం కలిగించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .Vaping is illegal in India . Hello @BCCI is this allowed? #PBKSvsRR pic.twitter.com/banIgJDO6u— Surbhi (@SurrbhiM) April 29, 20267) రాజస్తాన్ డగౌట్ మొబైల్ వివాదంఈ సీజన్లో వివాదాల్లో హైలైట్గా నిలిచిన వాటిలో రాజస్తాన్ రాయల్స్ డగౌట్లో మొబైల్ ఫోన్ కనిపించడమే. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండడం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చర్య పట్ల సీరియస్ అయిన బీసీసీఐ భిందర్ మొబైల్ అనుకోకుండా వాడానని, మెడికల్రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడినట్లు తెలిపాడు. తన చర్య పట్ల క్షమాపణ చెప్పినప్పటికీ, అతడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ రోమి భిందర్కు రూ.లక్ష జరిమానా విధించింది. రోమి భిందర్ చర్యను వ్యతిరేకిస్తూ బీసీసీఐ ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు, నిబంధనలు జారీ చేసింది.8) అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ఐపీఎల్ 2026 సీజన్లో లక్నోతో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. షాట్ ఆడిన అంగ్క్రిష్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గ్రీన్ వద్దని వారించడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ దశలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔What's your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire ! What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026ఈ నేపథ్యంలో తన రన్నింగ్ దిశను మార్చుకున్న రఘువంశీ షమీ వేసిన బంతికి అడ్డు రావడంతో అది అతడి ప్యాడ్లకు తగిలింది. దీంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీని ఔట్గా ప్రకటించాడు.9) అర్ష్దీప్ ఇన్స్టా వివాదంపంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దాదాపు 200 పైగా పోస్టులను తొలగించడం ఆసక్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో పలు వివాదాల నేపథ్యంలో అర్ష్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. టోర్నీ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ సహా జట్టు సమావేశాలకు సంబంధించి కంటెంట్ను సోషల్మీడియాలో షేర్ చేసుకోవద్దంటూ బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరించింది. అందుకే అర్ష్దీప్ తన ఇన్స్టాలో పోస్టులు తొలగించి ఉంటాడని అభిమానులు భావించారు.10) జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదంగుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డర్ డైవ్ చేసి పట్టినప్పటికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్పదమయింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో హోల్డర్ బంతిని తొలుత నేలకు ఆనించినట్లు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ ఔటివ్వడం ఆర్సీబీ డగౌట్లో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. They checked the runout for 1 min and there was indeed a check of that Patidar's catch by Jason Holder, just judged in 17 secsTruly disappointing to see umpiring at this level this season. New day, new lowpic.twitter.com/KGgbi2a7qb— Gautam (@indiantweetrian) April 30, 2026హోల్డర్ పట్టిన క్యాచ్పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాదని తెలుస్తున్నప్పటికీ మూడో అంపైర్ పాటిదార్ను ఔట్ అని ప్రకటించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.చదవండి: భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే! -
ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటిగా నిలిచిపోనుంది. 2022 సీజన్ నుంచి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన నాలుగు సీజన్లలో మూడుసార్లు ఫైనల్ చేరడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 2022లో చాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ 2023లో రన్నరప్గా, 2024 సీజన్లో లీగ్ దశ, 2025 సీజన్లో ప్లేఆఫ్స్, తాజా సీజన్లో మరోసారి రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. అయితే రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్లో ఉత్తమ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లకు రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆడిన తుది జట్టు సహా మొత్తం 15 మందికి సంబంధించిన ఆటగాళ్ల రేటింగ్ను విడుదల చేశారు. 10 పాయింట్లతో కూడిన రేటింగ్లో జట్టును అంతా తానై నడిపించిన కెప్టెన్ శుబ్మన్ గిల్, బౌలర్ కగిసో రబాడ చెరో 9 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, సాయి సుదర్శన్ (8 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. జాసన్ హోల్డర్, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్లు ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఇక వికెట్ కీపర్ జాస్ బట్లర్ 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ చెరో 6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అశోక్ శర్మ, అర్షద్ ఖాన్లు చెరో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, 3 పాయింట్లతో రాహుల్ తెవాటియా ఏడో స్థానంలో నిలిచాడు.ఈ సీజన్లో ద్దగా ప్రభావం చూపని గ్లెన్ ఫిలిప్స్ (2 పాయింట్లు), షారుక్ ఖాన్, నిషాంత్ సింధూ ఒక్కో పాయింట్తో ఆఖరి స్థానాల్లో ఉన్నారు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను చిత్తు చేసిన గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చతికిలపడిన గుజరాత్ రన్నరప్కు పరిమితమైంది.చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
కోహ్లీ వీరవిహారం.. చాంపియన్స్గా ఆర్సీబీ
ఐపీఎల్ 2026 చాంపియన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చేజింగ్ మాస్టర్గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖరి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 పరుగులు) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ తలా వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్), నిషాంత్ సిందూ (20 పరుగులు) ఆడుతున్నారు. రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.కోహ్లీ కమాల్..156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్, కోహ్లీలు కలిసి తొలి వికెట్కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్, పాటీదార్లు రషీద్ఖాన్ బౌలింగ్లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.ఆర్సీబీ అరుదైన ఫీట్ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. గతంలో చెన్నై సూపర్కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్ను సాధించాయి.Finishing off in style 🥳And it's none other than King Kohli 😎👑Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FZNGQ26gBs— IndianPremierLeague (@IPL) May 31, 2026 -
అరుదైన ఫీట్తో భువనేశ్వర్ కొత్త చరిత్ర
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఫీట్ సాధించాడు. 16 మ్యాచ్లాడిన భువనేశ్వర్ 28 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా భువనేశ్వర్ షమీతో కలిసి రికార్డులకెక్కాడు. కాగా ఈ జాబితాలో ఆర్సీబీ తరఫున హర్షల్పటేల్ (32 వికెట్లు, 2021 సీజన్), గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ (28 వికెట్లు, 2023 సీజన్) ఈ ఫీట్ సాధించారు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున జస్ప్రీత్ బుమ్రా (27 వికెట్లు, 2020 సీజన్), రాజస్తాన్ తరఫున చాహల్ (27 వికెట్లు, 2022), గుజరాత్ తరఫున మోహిత్ శర్మ (27 వికెట్లు, 2022) భువనేశ్వర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న భువనేశ్వర్ మరో ఫీట్ కూడా అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ (17 వికెట్లు) షమీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ (19 వికెట్లు) తీసి తొలి స్థానంలో ఉన్నాడు.Bhuvneshwar Kumar in IPL2026 - 𝟮𝟴 wickets (7.95 Eco)*2025 - 17 wickets (9.28 Eco)2024 - 11 wickets (9.35 Eco)2023 - 16 wickets (8.33 Eco)2022 - 12 wickets (7.34 Eco)2021 - 6 wickets (7.97 Eco)2020 - 3 wickets (6.98 Eco)2019 - 13 wickets (7.81 Eco)2018 - 9 wickets… pic.twitter.com/DLOczlJ22e— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) May 31, 2026చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఫైనల్లో ఇప్పటికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజరాత్ టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే గుజరాత్ వికెట్లు పడిన ప్రతీసారి కోహ్లీ హైపర్ యాక్టివ్గా కనిపించాడు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజిల్వుడ్ బౌలింగ్లో గిల్ ఔటైన వెంటనే పిచ్పైకి పరిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. అంతటితో ఆగకుండా సాయి సుదర్శన్ ఔట్ కావడానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లు ప్రతీ బంతికి ముందు కోహ్లీ సాయి సుదర్శన్ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. అదే ఓవర్ నాలుగో బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్కు యత్నించి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చర్యలపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.మరో విషయమేంటంటే.. గత రెండు మ్యాచ్ల్లో హిట్ వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లోనూ అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతిని ఆడే క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోయేలా కనిపించినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసిక్ సలామ్ మూడు వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.pic.twitter.com/E5HLX9ALPr— crictalk (@crictalk7) May 31, 2026చదవండి: అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే! -
అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా తడబడుతోంది. ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే హోంగ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్కు మంచి రికార్డే ఉంది. టాస్ ఓడినా, గెలిచినా 2025 నుంచి చూసుకుంటే అప్పటినుంచి గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ ఐదు మ్యాచ్ల్లోనూ గుజరాత్ విజయాలను సాధించింది. ఇందులో ముంబై ఇండియన్స్పై 36 పరుగులతో, రాజస్తాన్పై 58 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 38 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 82 పరుగులతో, సీఎస్కేపై 89 పరుగులతో విజయాలను అందుకుంది. అయితే ఈసారి జరుగుతున్న ఫైనల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్కు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. పైగా టాస్ సమయంలో గిల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్పై చేజింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు అందుకుంది. అయితే గిల్ మాత్రం తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ గుజరాత్ ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోలేకపోతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. నిషాంత్ సిందూ (20), జాస్ బట్లర్ (10) పరుగులతో ఆడుతున్నారు.🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ -
ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, పడుకున్నా.. ఇలా అతడు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసినప్పటికీ క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలయిన రాజస్తాన్ రాయల్స్ సీజన్ను మూడో స్థానంతో ముగించింది. జట్టు ఓటమి పాలైనప్పటికీ వైభవ్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను మరొక్కసారి చూస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అభిమానులకు ఒక శుభవార్త. అతడి ఆటను చూడలేకపోవచ్చు కానీ అతడిని స్టేడియంలో మరోసారి చూసే అవకాశం మాత్రం దక్కనుంది. అహ్మదాబాద్ వేదికగా నేడు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్కు వైభవ్ సూర్యవంశీ హాజరుకానున్నాడు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో వైభవ్ తళుక్కుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వైభవ్ తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా సన్మానించే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ ఇవాల్టి ఫైనల్లో గిల్, సాయి సుదర్శన్ తక్కువ స్కోర్లకు వెనుదిరిగితే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే చాన్స్ ఉంది. ఈ సీజన్ ఆరంభం నుంచి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన వైభవ్ ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలు సాధించాడు. సీజన్లో 72 సిక్సర్లతో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా నిలిచాడు. ఇక గుజరాత్తో మ్యాచ్లో 47 బంతుల్లో 96 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ పోరులోనూ ఎస్ఆర్హెచ్పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అతడి ఆటతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.VAIBHAV SOORYAVANSHI AT AHMEDABAD TO WATCH IPL FINAL 🔥⭐ [IANS] pic.twitter.com/o7uRx10z3j— Johns. (@CricCrazyJohns) May 31, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్! -
అరుదైన ఫీట్.. టీమిండియా సరసన పాకిస్తాన్
రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఆసీస్తో జరుగుతున్న తొలి వన్డే పాకిస్తాన్కు 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్లో వెయ్యి మ్యాచ్లు పూర్తి చేసుకున్న మూడో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 1075 వన్డే మ్యాచ్లతో భారత్ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, 1020 మ్యాచ్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఈ రెండు దేశాల సరసన పాకిస్తాన్ చోటు సంపాదించింది. ఇక 1000వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా పాక్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ఆస్ట్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ చేతుల మీదుగ2ఆ ప్రత్యేక మెమొంటో అందుకున్నాడు. ఇక పాక్ ఆడుతున్న 1000వ మ్యాచ్ ద్వారా అరాఫత్ మిన్హాస్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం మరో విశేషం. వెయ్యి వన్డేలు ఆడిన మూడు జట్లు విజయాల శాతాన్ని పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా (1019 మ్యాచ్ల్లో 617 విజయాలు, 52.7 శాతం) తొలి స్థానంలో ఉండగా, టీమిండియా (1075 మ్యాచ్ల్లో 571 విజయాలు), పాకిస్తాన్ (999 మ్యాచ్ల్లో 527 విజయాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 23 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (49), మాట్ రెన్షా (21) పరుగులతో ఆడుతున్నారు. Josh Inglis presented a souvenir to Shaheen Afridi on Pakistan’s 1000th ODI match. ❤️ - A lovely gesture by Inglis. 🇵🇰🇦🇺pic.twitter.com/T1SzeQH8PV— Sheri. (@CallMeSheri1_) May 30, 2026చదవండి: వినేశ్కు షాక్.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్! -
అతడు లక్కీ హ్యాండ్.. ఆ జట్టుదే ఐపీఎల్ టైటిల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ మరోసారి చాంపియన్గా నిలవడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగాటోర్నీ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది. లీగ్ దశలో చెరో మ్యాచ్ గెలిచినప్పటికీ, క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవనున్నట్లు, అందుకు జోష్ హాజిల్వుడ్ కారణం కానున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు హాజిల్వుడ్ ఐదు టీ20 టోర్నీ ఫైనల్స్ ఆడితే.. ప్రతీసారి తాను ప్రాతినిధ్యం వహించిన జట్టే చాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ జట్టులో హాజిల్వుడ్ ఉన్నాడు. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన సిడ్నీ సిక్సర్, 2019 బీబీఎల్ విజేత సిడ్నీ సిక్సర్స్, 2021 టీ20 ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టు, 2021 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన సీఎస్కే, 2025 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు.. ఇలా ఐదుసార్లు హాజిల్వుడ్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు 2015, 2023 వన్డే వరల్డ్కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ హాజిల్వుడ్ సభ్యుడిగా ఉండడం విశేషం.దీంతో హాజిల్వుడ్ లక్కీ హ్యాండ్ అని.. అతను ఏ జట్టులో ఉంటే ఆ జట్టు చాంపియన్గా నిలుస్తుందని అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అతడు లక్కీహ్యాండ్ మాత్రమే కాదు, తాను ఆడిన ఐదు ఫైనల్స్లోనూ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఐదు ఫైనల్స్ కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్తో పాటు 2012 చాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్లో మూడు వికెట్లు తీసి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంలో హాజిల్వుడ్ కీలకపాత్ర పోషించాడు. ఆ సీజన్లో 12 ఇన్నింగ్స్ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే భువనేశ్వర్, రసిక్ సలామ్లు రాణిస్తుండడంతో హాజిల్వుడ్కు పెద్దగా ఇబ్బంది ఎదుర్కోవడం లేదు.చదవండి: ‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’ -
‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’
ఐపీఎల్ 2026 సీజన్లో శుక్రవారం క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ అర్థసెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. అయితే ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో హిట్ వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ రాజస్తాన్తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులోనూ మరోసారి హిట్వికెట్గా వెనుదిరగడం గమనార్హం. 150 ఏళ్ల క్రికెట్ చరిత్రలో వరుసగా రెండుసార్లు హిట్వికెట్గా వెనుదిరిగిన ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచిపోయాడు. హిట్వికెట్గా రెండోసారి ఔటవ్వడంపై సాయి సుదర్శన్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ఈసారి బ్యాట్ జారిపోకుండా ఏదైనా కొత్త పద్ధతిని అనుసరిస్తానని నవ్వుతూ పేర్కొన్నాడు. ‘ఈ సమస్యను అధిగమించడానికి కొత్తగా ఏదైనా చేయాలి. అందుకు కొన్ని గ్రిప్ టెక్నిక్స్ ఉపయోగించి బంతులు ఆడే ప్రయత్నం చేస్తాను. ఆర్సీబీతో మ్యాచ్లో బంతిని ఆడే క్రమంలో నా బ్యాట్ చేతిలో నుంచి జారి బౌన్స్ అయి వికెట్ల మీద పడింది. కానీ రాజస్తాన్తో మ్యాచ్లో స్ట్రెయిట్ షాట్ ఆడాలనుకున్నా. కానీ ఈసారి కూడా బంతి బౌండరీ వెళ్లినప్పటికీ బ్యాట్ నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఫైనల్లో ఈ సమస్య రాకుండా ఒక కొత్త పద్ధతిని అనుసరించాలనుకుంటున్నా. అది ఎంతమేర సఫలమవుతుందో చూ డాలి’ అని చెప్పుకొచ్చాడు.ఇక ఈ సీజన్లో సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గుజరాత్ తరఫున ఓపెనింగ్లో వస్తున్న సాయి సుదర్శన్ 16 ఇన్నింగ్స్లో 710 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలున్నాయి. అయితే ఈ సీజన్లో గుజరాత్ ఆడిన తొలి ఆరు మ్యాచ్ల్లో సాయి సుదర్శన్ ఒక ఫిఫ్టీ కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత నుంచి వరుసగా ప్రతి మ్యాచ్లోనూ స్థిరమైన ప్రదర్శనతో కనీసం అర్థసెంచరీ సాధించడం విశేషం. మరో విషయమేంటంటే సాయి సుదర్శన్ వరుసగా రెండో సీజన్లోనూ 700 పరుగుల మార్క్ను అధిగమించాడు. గతంలో క్రిస్ గేల్ మాత్రమే వరుసగా రెండు సీజన్లలో 700 ప్లస్ మార్కును దాటాడు. తాజాగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. Glad he can still see the funny side of it 😅🎥 Sai Sudharsan on his back-to-back bizarre dismissals \|/#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @gujarat_titans pic.twitter.com/nGVrC10SUc— IndianPremierLeague (@IPL) May 29, 2026THE RAREST OF RARE DISMISSALS! TWICE IN TWO INNINGS 😯😯Sai Sudharsan's bat fell onto his own stumps 🫣Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/htGSYpu3YH— IndianPremierLeague (@IPL) May 29, 2026The Sai Sudharsan dismissal. 😄 pic.twitter.com/m0DaXI29aE— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026చదవండి: అభిమానులకు గుడ్న్యూస్.. కానీ 332 కోట్ల మెలిక! -
‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆట ముగిసింది. లీగ్ దశలో చాలా కష్టపడి ప్లేఆఫ్స్ చేరిన రాజస్తాన్ ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసింది. అయితే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి సీజన్ను మూడో స్థానంలో ముగించింది. అలా రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు పరిమితమైనప్పటికీ.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. గత సీజన్లోనే తన మెరుపులను చూపెట్టిన వైభవ్ ఈ సీజన్లో దానిని పరిపూర్ణం చేశాడని చెప్పొచ్చు. ఈ సీజన్లో అతడు కొనసాగించిన బ్యాటింగ్ విధ్వంసం మాములుగా లేదు. ఏదో రెండు మ్యాచ్ల్లో మెరిసి ఆ తర్వాత విఫలమయ్యుంటే వైభవ్ గురించి చర్చ ఉండేది కాదు. కానీ 15 ఏళ్ల వయసులోనే క్రికెట్లో ఉన్న అన్ని షాట్లను అలవోకగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. 16 మ్యాచ్ల్లో 237కు పైగా స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలున్నాయి. క్రీజులోకి అడుగుపెట్టిందే మొదలు ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడమే కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడడం అలవాటు చేసుకోవడం వైభవ్ సూర్యవంశీలో కనిపించిన గొప్ప పరిణితి. ఉదాహరణకు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో కమిన్స్ మొదలుకొని ఏ బౌలర్ను వదలని సూర్యవంశీ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసి ఉంటే ప్రపంచ రికార్డు తన ముంగిట ఉండేదేమో. ఇక గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా అద్భుతమనే చెప్పొచ్చు. జట్టు కష్టాల్లో పడిందన్న విషయాన్ని గుర్తించిన వైభవ్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసినప్పటికీ మెరుపులకు లోటు లేకుండా చూసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ శతకం చేజార్చుకున్న వైభవ్ ఈ సీజన్లో మొత్తం 72 సిక్సర్లు బాది ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇలా సీజన్ ఆద్యంతం తన ఆటతీరుతో అలరించిన వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఐపీఎల్ ద్వారా నీ అద్భుత బ్యాటింగ్ విన్యాసాలను మాకు చూపించినందుకు థ్యాంక్స్’ అని చెబుతూ పోస్టులతో నింపేశారు. ‘15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 2026 సీజన్లో ఒక జట్టును తన భుజస్కందాలపై మోసుకెళ్లిన తీరు అద్భుతం. ఐపీఎల్ ట్రోఫీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ నీ ప్రదర్శన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది వైభవ్’ అని ఒక అభిమాని వైభవ్కు సంబంధించిన ఒక వీడియోనూ పంచుకోవడం హైలైట్గా నిలిచింది.THE COLDEST EDIT ON VAIBHAV SOORYAVANSHI. 🥶 pic.twitter.com/LgDqruGc4A— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2026this IPL will be remembered for a 15 year old carrying an entire team on his shouldersTrophies come and go, but the impact you left will always stay🙏 pic.twitter.com/oPOW5ABYx2— OldMonkOfCricket (@OldMonkOfCric) May 30, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్! -
IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది మరొక రోజులో తేలిపోనుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. వరుసగా రెండోసారి కప్పు కొట్టాలనే ఉత్సాహంతో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్కు ఒక వార్త నిరాశ కలిగిస్తోంది. బెంగళూరు సిటీలో కఠిన ఆంక్షలు విధించడంతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నగర పోలీస్ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ ఆర్సీబీ గనుక రెండో టైటిల్ గెలిస్తే నగరమంతటా భారీ సంఖ్యలో ప్రజలు గూమిగూడతారనే అంచనాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పేర్కొంది.2025 సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవాలను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయోత్సవం తొక్కిసలాటకు దారి తీసి 11 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. దీంతో ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యల కింద బెంగళూరు సిటీ మొత్తం కఠిన ఆంక్షలు విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.కఠిన ఆంక్షలు ఇవే..👉ముందస్తు అనుమతి లేకుండా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయరాదని తెలిపారు. సంబంధిత శాఖల నుంచి ఆమోదం పొందితే తప్ప బహిరంగ ప్రదేశాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదు.👉ఇక ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో సాముహిక విజయోత్సవ సంబరాలు చేసుకోకూడదు.👉ముఖ్యంగా జనం పెద్ద ఎత్తున గూమికూడి విజయోత్సవాల పేరుతో బైక్ ర్యాలీలు, రోడ్లు బ్లాక్ చేస్తూ సంబరాలు చేసుకోవడం పూర్తిగా నిషేధం.👉ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై టపాసులు కాల్చడం లేదా ఇతర కార్యక్రమాలు చేపట్టడం చేయవద్దని సూచించారు.విషాదంలా విజయోత్సవాలు..2025 ఐపీఎల్లో చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవం నిర్వహించింది. ఈ విజయోత్సవం కాస్తా విషాదంగా మారిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవాలకు జనాలు భారీగా తరలివచ్చారు. స్టేడియం నిండిపోవడంతో బయట కూడా సుమారు 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు గూమిగూడారు. భారీ జనసమూహం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యల కింద కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనరేట్ తెలిపింది.గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ..రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ నిలకడగా ఆడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 18 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచి ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. మరోవైపు గుజరాత్ కూడా స్థిరమైన ప్రదర్శన కొనసాగించినప్పటికీ మధ్యలో కొన్ని అపజయాలు పలకరించాయి. కానీ అన్నీ దాటుకొని ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన గుజరాత్కు క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ షాక్ ఇచ్చింది. అయితే క్వాలిఫయర్-2 పోరులో మాత్రం రాజస్తాన్ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా! -
వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా!
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్లో తన బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ ఉపయోగిస్తున్న బ్యాట్ స్పాన్సర్షిప్కు సంబంధించి కళ్లు చెదిరే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వాడుతున్న బ్యాట్కు ఎస్ఎస్ (సరీన్ స్పోర్ట్స్) కంపెనీ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. అయితే ఇకపై వైభవ్ తన బ్యాట్పై ఏడాదికి రూ. 12కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీతో ఉన్న ఒప్పందంతో పోలిస్తే ఇది 24 రేట్లకు ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ఈ కొత్త ఒప్పందం ప్రస్తుత స్పాన్సర్ ఎస్ఎస్తోనే జరిగిందా లేక వేరే కంపెనీ స్పాన్సర్గా వ్యవహరించనుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి వైభవ్ పోటీగా మారనున్నాడు.ప్రస్తుతం కోహ్లీ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎంఆర్ఎఫ్ ఏడాదికి రూ. 12.5 కోట్లు అందుకుంటున్నాడు. అయితే ఎంఆర్ఎఫ్ కూడా వైభవ్ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇలా వైభవ్ తన బ్యాట్తో పరుగుల సునామీ సృష్టించడమే కాదు, ఇప్పుడు బ్యాట్ ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో సంపాదించబోతున్నాడు.Vaibhav Sooryavanshi has received a bat sponsorship offer of 12cr annually. - It’s more than 24 times than his previous bat sponsorship deal. (CricBlogger). pic.twitter.com/ZwQkLN61uf— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2026చదవండి: ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్! -
ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. జట్టును నడిపించడంలో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సీజన్ మధ్యలోనే పాండ్యాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించాలని ముంబై యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పాండ్యా ముంబై ఇండియన్స్కు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అతడు తన సోషల్ మీడియాలో అకౌంట్లో పెట్టిన పోస్టులే ఉదాహరణ. దీనికి తోడు పాండ్యా కెప్టెన్సీ, అతడి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవ్వడంతో ముంబై యాజమాన్యం కూడా పాండ్యాను జట్టు నుంచి రిలీజ్ చేయాలని భావిస్తోంది. ముంబై ఇండియన్స్ నుంచి బయటికి రానున్న హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో ఏ జట్టులోకి వెళ్తే బాగుంటుందనే చర్చ జోరుగా సాగుతుంది. సీఎస్కే లేదా లక్నోకు పాండ్యా కెప్టెన్గా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ జట్టులోకి కూడా హార్దిక్ పాండ్యా వెళ్లే అవకాశం లేకపోలేదు. 2022 ఐపీఎల్ సీజన్లో తొలిసారి ఆడిన గుజరాత్ టైటాన్స్ను చాంపియన్గా నిలిపాడు హార్దిక్ పాండ్యా. తర్వాతి సీజన్లోనూ ఆ జట్టును ఫైనల్ చేర్చాడు. అయితే గుజరాత్ను చాంపియన్గా నిలపడంతో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను భారీ ధరకు జట్టులోకి తీసుకొచ్చింది. రోహిత్ నుంచి జట్టు పగ్గాలు తీసుకున్న పాండ్యా ముంబైని విజయవంతంగా నడిపించడంలో విఫలమయ్యాడు. గతేడాది సీజన్లో ముంబైని ప్లేఆఫ్స్ చేర్చిన పాండ్యా ఈ సీజన్లో అటు కెప్టెన్గా, ఇటు ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. మైదానంలో ఆటగాళ్లతో అగ్రెసివ్గా ఉండడం, జట్టులో సీనియర్లతో సక్రమంగా వ్యవహరించకపోవడం పాండ్యాకు పూర్తి నెగెటివ్గా మారిపోయింది. ఈ క్రమంలోనే తాను ముంబైని వీడుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే సీజన్లో ముంబై ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత పాండ్యా డ్రెసింగ్ రూమ్కు వెళ్తూ ధరించిన జెర్సీని విప్పి అభిమానుల వైపు విసిరేశాడు. అంతేకాదు రాజస్తాన్తో మ్యాచ్ అనంతరం చాలా అలసిపోయానని, మారేందుకు సిద్ధమవుతున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చాడు. మరి ముంబై ఇండియన్స్ను వీడనున్న పాండ్యా ఏ జట్టులోకి వచ్చే అవకాశముందో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.లక్నో సూపర్జెయింట్స్:ముంబై నుంచి బయటకు వస్తే హార్దిక్ పాండ్యా లక్నో సూపర్జెయింట్స్కు కెప్టెన్గా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టు కెప్టెన్గా ఉన్న పంత్ ఇప్పటికే తాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 27 కోట్లు వెచ్చించిన లక్నో యాజమాన్యం కూడా పంత్ ప్రదర్శనపై అసంతృప్తితోనే ఉంది. పంత్ను వదిలేసుకుంటే లక్నో దగ్గరు ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది. ఈ మేరకు హార్దిక్ పాండ్యాను మంచి ధరకు తమ జట్టులోకి తీసుకోవడమే గాక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.ఢిల్లీ క్యాపిటల్స్..ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతున్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ఢిల్లీ డేర్డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చుకున్నప్పటికీ ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ప్రస్తుత ఢిల్లీ కెప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ అంతంతమాత్రంగా రాణించాడు. జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉన్న కేఎల్ రాహుల్కు కెప్టెన్సీపై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో అక్షర్ పటేల్ స్థానంలో హార్దిక్పాండ్యాను కెప్టెన్గా నియమిస్తే ఆల్రౌండర్గానూ సేవలందించే అవకాశం ఉంటుంది. అయితే అక్షర్ పటేల్ను ఢిల్లీ రిలీజ్ చేయకపోవచ్చు.కోల్కతా నైట్రైడర్స్:2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్ ఆ తర్వాత ఉన్నపళంగా అయ్యర్ను వదిలేసుకుంది. దీంతో అజింక్య రహానేను కెప్టెన్గా నియమించింది. అతడి కెప్టెన్సీలో కేకేఆర్ పెద్దగా రాణించింది లేదు. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో ఆరు వరుస పరాజయాలు రహానేపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేశాయి. కామెరున్ గ్రీన్ ట్రేడింగ్లోకి వెళ్తే మాత్రం ముంబై ఇండియన్స్ పాండ్యాను కేకేఆర్కు బదలాయించే అవకాశముంటుంది. అప్పుడు పాండ్యాకు కేకేఆర్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది.చెన్నై సూపర్కింగ్స్:ఇక లక్నో తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వెళ్లేది సీఎస్కే జట్టులోకేనని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సీజన్లో కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే సీజన్లో మధ్యలో వరుస విజయాలతో ఊపందుకున్న సీఎస్కే ఒక దశలో ప్లేఆఫ్ రేసులోనూ నిలిచింది. అయితే ఇప్పటికే రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్ను కూడా రుతురాజ్ స్థానంలో కెప్టెన్ను చేసే అవకాశం లేకపోలేదు. అయితే ప్రశాంత్ వీర్ లేదా శివమ్ దూబేలలో ఒకరిని సీఎస్కే విడుదల చేస్తే మాత్రం ట్రేడింగ్లో సీఎస్కే పాండ్యాను దక్కించుకునే అవకాశముంది.రాజస్తాన్ రాయల్స్:రాజస్తాన్ రాయల్స్ జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ రియాన్ పరాగ్ కెప్టెన్సీ అనుభవలేమి కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాజమాన్య హక్కులు చేతులు మారడంతో వచ్చే సీజన్లో రాజస్తాన్ కొత్త కెప్టెన్ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పాండ్యా రాజస్తాన్లోకి వస్తే మాత్రం రియాన్ పరాగ్ స్థానంలో అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.**Hardik Pandya throws away MI jersey**His way of saying goodbye to Mumbai Indians forever? pic.twitter.com/1fy2YzygzX— Viraj (@virajs1845) May 27, 2026🔴 STRESSED, EXHAUSTED HARDIK PANDYA TELLS MUMBAI INDIANS HE IS DONE🤯- Hardik has informed MI that he wants to leave the franchise after a disappointing IPL 2026 season.[PTI] Hardik was mentally stressed and completely exhausted & set to quit MI pic.twitter.com/1N8i4Sgfzd— Sam (@cricsam02) May 29, 2026చదవండి: ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం! -
ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 పోరుతో కలిపి ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను ఓడించిన రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో బెర్తు దక్కించుకోవడం కోసం క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న (ఆదివారం) జరగనున్న ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ అంచనా వేసింది. క్వాలిఫయర్-2లో విజేతతో పాటు టైటిల్ గెలుచుకోనున్న జట్టును కూడా అంచనా వేసింది. ఏఐ మాయతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్న ఈ రోజుల్లో అది చెప్పిన జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు దూసుకెళ్తుందని అంచనా వేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆర్సీబీ చేతిలో చతికిలపడి గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఆర్సీబీ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవనుందని, ఆ జట్టుకే గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.ఈ సీజన్లో ఆర్సీబీ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఆరంభం నుంచే విజయాలు సాధించి మెరుగైన రన్రేట్తో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. కోహ్లి, పాటిదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్లతో కూడిన బలమైన లైనప్కు తోడు భువనేశ్వర్, హాజిల్వుడ్, రసిక్ సలామ్ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉందని తెలిపింది. అదీగాక క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ను భారీ తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో బరిలోకి దిగనుందని, అదే ఆత్మవిశ్వాసంతో గుజరాత్ను మరోసారి ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకోనుందని తెలిపింది. మరి ఏఐ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.చదవండి: తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే! -
'అతడు వేలంలోకి వస్తే 30 కోట్లు చెల్లిస్తా!'
ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తాజాగా నేడు గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2 పోరులో వైభవ్ ప్రళయం సృస్టిస్తాడా లేక విఫలమవుతాడా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వైభవ్ సూర్యవంశీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ సందర్భంగా హర్భజన్, సెహ్వాగ్లు కామెంటేటర్లుగా వ్యవహరించారు. మాటల సందర్భంలో వైభవ్ వేలంలోకి వస్తే ఎంత ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేస్తావంటూ సెహ్వాగ్కు హర్భజన్ ప్రశ్న సంధించాడు. భజ్జీ ప్రశ్నకు ఏమాత్రం సంకోచించని సెహ్వాగ్.. ఒకవేళ వైభవ్ వేలంలోకి వస్తే గనుక రూ. 30 కోట్లు ఇచ్చి కొనుక్కుంటానంటూ ఆసక్తికర సమాధానమిచ్చాడు. అదే సమయంలో పక్కనే ఉన్న మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా సెహ్వాగ్ ఇచ్చే ఆఫర్కు సమాన మొత్తాన్ని తాను చెల్లిస్తానంటూ బదులిచ్చాడు. ఇక వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ దృష్ట్యా అతడిని భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. అయితే అతను ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు కూడా కాకపోవడం, పైగా 15 ఏళ్లే ఉండడంతో జాతీయ జట్టులోకి అతడి ఎంపికకు ఇంకా సమయం ఉందంటూ బీసీసీఐ పేర్కొంది. అయితే అతడి ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలిపేందుకు ఇండియా-ఎ జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తిలక్ వర్మ నేతృత్వంలో వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్లో ఇండియా-ఎ తరఫున సూర్యవంశీ ఆడనున్నాడు. ఈ సిరీస్లో వైభవ్ సత్తా చాటితే గనుక త్వరలో భారత సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఐపీఎల్ 18వ సీజన్లోనే కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్లు గాలివాటం కాదని తాజా సీజన్ ద్వారా నిరూపించాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలున్నాయి. ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్ తృటిలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) ప్రపంచ రికార్డు సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. చదవండి: IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన -
'పనికొచ్చే ప్రశ్నలు వేయండి'.. గుజరాత్ బ్యాటర్ ఆగ్రహం!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విధించిన 255 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ తెవాటియా మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో గుజరాత్ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఓటమి అనంతరం గుజరాత్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ మీడియా సమావేశానికి వచ్చాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న రిపోర్టర్లలో ఒక వ్యక్తి తన ప్రశ్నలతో గ్లెన్ ఫిలిప్స్కు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు. 'ఆర్సీబీ విధించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసినప్పుడే మీ మైండ్లో ఓటమి భయం మొదలైందనుకుంటా' అని ప్రశ్నించాడు. రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఫిలిప్స్ ఆ తర్వాత సదరు రిపోర్టర్కు ధీటుగా బదులిచ్చాడు. 'ఇదొక దిక్కుమాలిన ప్రశ్న. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎప్పుడు లక్ష్యం గురించి ఆలోచించరు. మ్యాచ్లో టార్గెట్ ఎంత ఉన్నప్పటికీ పరుగులు చేయడానికే ప్రయత్నిస్తారు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలను మదిలోకి రానివ్వరు. మీరు వేసిన ప్రశ్న చాలా ఘోరంగా ఉంది. ఐపీఎల్ ఇంతకుమించి టార్గెట్లు ఛేదించిన సందర్భాలు ఉన్నాయన్న సంగతి మరిచిపోయారా?అయితే భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పుడు ఒత్తిడి ఉండడం సహజం. ఆ ఒత్తిడిలో ఒక్కోసారి విజయం సాధించలేకపోవచ్చు. అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. చదవండి: ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ! -
ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ!
భారత్లో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత విస్తరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను రెండుసార్లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి తగిన కార్యచరణను రూపొందిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘బీసీసీఐ సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లను మార్చి-మే మధ్యలో నిర్వహిస్తోంది. నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్లు సహా మొత్తం 74 మ్యాచ్లు ఉన్న టోర్నమెంట్లో విస్తరణ తర్వాత 94 మ్యాచ్లు జరిగే అవకాశముంది. దీంతో ఇప్పటివవరకు లీగ్ దశలో 14 మ్యాచ్లాడిన జట్లు ఇకపై 18 మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే ఇన్ని మ్యాచ్లను ఒకేసారి నిర్వహించడం వల్ల సీజన్ మరింత పొడిగించాల్సి ఉంటుంది. అందువల్ల టోర్నీ మార్చి నుంచి జూన్ వరకు జరిగే అవకాశముంటుంది. అయితే ఎండాకాలం కావడంతో అధిక వేడిమి కారణంగా క్రికెటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఐపీఎల్ను రెండు విడతల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందున్న ఆలోచన కూడా మాకు కలిగింది. ఈ నేపథ్యంలో మొదటి విడతను ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో, రెండో విడతను సెప్టెంబర్-అక్టోబర్ మధ్య జరిగేలా ప్రణాళిక రచించాలని చూస్తున్నాం. ఐపీఎల్ కేవలం బీసీసీఐని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ బోర్డులను, ఆటగాళ్లను ప్రభావితం చేస్తోంది. అయితే టోర్నమెంట్ను మరో విండోకు మార్చవచ్చా లేదా అనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక నిర్ణయానికి వస్తాం. అప్పటివరకు ఐపీఎల్ ఇప్పుడున్న ఫార్మాట్లోనే జరుగుతుంది.’ అని చెప్పుకొచ్చారు. అయితే అరుణ్ ధుమాల్ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న ఫార్మాట్ను కాదని రెండు విడతల్లో ఐపీఎల్ నిర్వహించడమనేది ఒక అనవసరమైన ప్రక్రియ అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ టోర్నీల షెడ్యూల్ కూడా గందరగోళంగా తయార వుతుందని, ఆటగాళ్లు గాయపడే అవకాశాలు మరింత పెరుగుతాయని పెదవి విరుస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లింది.నేడు జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్తో రాజస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. మే 31 (ఆదివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది.చదవండి: పాపం సాయి సుదర్శన్.. ఐపీఎల్ చరిత్రలో వింత ఔట్! -
పాపం సాయి సుదర్శన్.. ఐపీఎల్ చరిత్రలో వింత ఔట్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్ పోరులో గుజరాత్ టైటాన్స్కు ఏదీ కలిసి రాలేదు. ఆర్సీబీ విధించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైంది. అయితే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన తీరు నిజంగా బాధాకరమని చెప్పొచ్చు. ఈ సీజన్ లో అత్యంత నిలకడగా పరుగులు చేస్తున్న సాయి సుదర్శన్.. ఆర్సీబీతో క్వాలిఫయర్-1 పోరులోనే వరుస బౌండరీలతో మంచి టచ్లో కనిపించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లో అద్భుతమైన స్క్వేర్ కట్తో బౌండరీ బాదాడు. వరుసగా రెండో ఫోర్ వచ్చిందని అభిమానులు అనుకుంటున్న తరుణంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. షాట్ ఆడిన తర్వాత సాయి చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. గాల్లో తిరుగిన బ్యాట్ వచ్చి నేరుగా లెగ్ స్టంప్ను తాకి బెయిల్స్ను పడగొట్టింది. ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ సాయి సుదర్శన్ను హిట్ వికెట్గా ఔటిచ్చాడు. దీంతో చేసేదేం లేక సాయి సుదర్శన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇలాంటి విచిత్రమైన ఔట్ చూసి కామెంటేటర్లతో పాటు అభిమానులు కూడా షాక్ తిన్నారు. మ్యాచ్లో కూడా ఇదే టర్నింగ్ పాయింట్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో గుజరాత్ తరఫున నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ ఆరెంజ్క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. గతేడాది కుశాల్ మెండిస్..ఇక ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్ దశలో హిట్ వికెట్ అయిన రెండో బ్యాటర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. తొలి బ్యాటర్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతేడాది ముంబై ఇండియన్స్తో ప్లేఆఫ్ మ్యాచ్ సందర్భంగా ఇదే గుజరాత్కు చెందని కుశాల్ మెండిస్ హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ ఔట్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.'బంతి బౌండరీకి వెళ్లింది.. కానీ బ్యాట్ వికెట్లను కొట్టేసింది', 'పాపం సాయి సుదర్శన్', 'క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఔట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 92 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. HOW UNFORTUNATE! 🤯Probably the only way to end Sai Sudharsan's streak of five 50-plus scores 🫣Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/DbpVS0JUKw— IndianPremierLeague (@IPL) May 26, 2026చదవండి: గుజరాత్పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే! -
గుజరాత్పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గొడవలో అయినా, ఫన్నీ మోడ్లో అయినా కింగ్ కోహ్లిని ఎవరు బీట్ చేయలేరు. మ్యాచ్లో కోహ్లి 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఆర్సీబీకి శుభారంభం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఫొటో సెషన్ జరిగింది. ఈ సమయంలో డగౌట్లో ఉన్న కోహ్లీ గుజరాత్ జట్టు వైపు చూస్తూ.. ‘ బాగైంది.. మేం మీపై గెలిచి ఫైనల్కు చేరుకున్నాంలే’ అంటూ ఫన్నీ మోడ్లో తన చేతులతో స్నేక్ గెచ్చర్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన గుజరాత్ ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. అంతకముందు గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలోనూ కోహ్లీ గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్తో కయ్యానికి కాలు దువ్వడం కనిపించింది. అయితే ఇదంతా సరదా కోసమే చేసినట్లు వీడియోలో క్లియర్గా కనిపించింది. ఇక జాకబ్ డఫీకి బంతి ఇవ్వడానికి ముందు కోహ్లీ చేసిన మరొక చర్య కూడా వైరల్గా మారింది. తాను బౌలింగ్కు దిగుతున్నట్లు అంపైర్ వద్దకు వెళ్లి తన క్యాప్ను ఇచ్చిన కోహ్లీ ఆ తర్వాత బంతి తీసుకొని రనప్కు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన జాకబ్ డఫీ బంతి ఇవ్వమని అడగడంతో అతని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత తన క్యాప్ ఇవ్వాలంటూ అంపైర్ వద్దకు వెళ్లగా, అతడు నిరాకరించాడు. దీంతో 'ప్లీజ్ నా క్యాప్ ఇచ్చేయండి' అని అంపైర్ను అడగడం వీడియోలో కనిపించింది. గుజరాత్పై విజయం తర్వాత భార్య అనుష్క శర్మ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం కనిపించింది. ఇలా మ్యాచ్ మొత్తం తన చర్యలతో కోహ్లీ హల్చల్ చేశాడు. ఇవన్నీ కోహ్లీ సరదాతో చేసినప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు మాత్రం అతడి చర్యను తప్పుబట్టారు. కోహ్లికి వెటకారం అనుకున్నదాని కంటే ఎక్కువే ఉందని కామెంట్లు పెట్టారు. మొన్న హెడ్తో గొడవ పెట్టుకున్న కోహ్లి ఇవాళ గుజరాత్ టీమ్ను హేళన చేసేలా అతడి స్నేక్ గెచ్చర్ ఉందని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Virat Kohli teasing Gujarat Titans players during their photoshoot in Dharamshala 🤣🔥- Rajat Patidar did the same with GT too 😭 pic.twitter.com/368X6y0VpA— Jara (@JARA_Memer) May 26, 2026 -
పాటీదార్ ఒక స్లో పాయిజన్.. కప్పు గెలిస్తే చరిత్రే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఆ జట్టును వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేర్చడంలో సఫలమయ్యాడు. నాయకుడంటే ముందుండి నడిపించాలి. ఆ మాటలను ఇవాళ పాటీదార్ అక్షరాలా చేసి చూపించాడు. మొదట తన అద్భుత బ్యాటింగ్తో జట్టు భారీ స్కోరు సాధించడంలో పాటీదార్ కీలకపాత్ర పోషించి షాన్దార్గా నిలిచాడు. త్రుటిలో సెంచరీ చేజారినా, బ్యాటింగ్లో పొరపాట్లు ఉన్నా సరే, అతడి విలువైన ఇన్నింగ్స్ దానిని మర్చిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా తన టీమ్ను రెండోసారి ఫైనల్ చేర్చిన అతను మరో టైటిల్ అందిస్తే చరిత్రలో నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. గుజరాత్పై విజయంతో ఐపీఎల్లో ఒక జట్టును వరుసగా రెండుసార్లు ఫైనల్ చేర్చిన కెప్టెన్ల జాబితాలో పాటీదార్ చేరిపోయాడు. గతంలో ఎంఎస్ ధోని (సీఎస్కే, 2010, 2011), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ 2019, 2020), హార్దిక్ పాండ్యా ( గుజరాత్ టైటాన్స్ 2022, 2023), శ్రేయస్ అయ్యర్ (2024లో కేకేఆర్, 2025లో పంజాబ్) ఈ ఘనత సాధించారు.స్లో పాయిజన్ బ్యాటింగ్..రజత్ పాటీదార్ బ్యాటింగ్ స్టైల్ స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. స్లో పాయిజన్ మెళ్లిగా ఎక్కినా బలంగా ప్రభావం చూపుతుంది. అదే తరహాలో ముందు స్లోగా ఆడడం.. ఒకసారి కుదురుకున్నాక అతడి విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం పాటీదార్ స్టైల్. 2025 సీజన్లో బ్యాటింగ్లో కూడా ఫర్వాలేదనిపించే ప్రదర్శన (143.77 స్ట్రైక్రేట్తో 312 పరుగులు) చేసిన అతను ఈసారి మరింతగా చెలరేగిపోయాడు. టైటిల్ సాధించిన నాయకుడిగా వచ్చిన ఆత్మవిశ్వాసం కావచ్చు తాజా సీజన్లో అతను అసాధారణ బ్యాటింగ్ను ప్రదర్శిస్తున్నాడు. తాను ఎదుర్కొన్న 247 బంతుల్లో అతను 486 పరుగులు (5 అర్ధసెంచరీలు) సాధించాడు. వీటిలో 29 ఫోర్లు, 41 సిక్సర్ల ద్వారానే 362 పరుగులు రాబట్టడం అతని బ్యాటింగ్ ధాటి ఏమిటో చూపించింది. మంగళవారం మ్యాచ్లో అతను అద్భుత షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆరుగురు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్న అతనూ ఎవరినీ వదలకుండా అందరి బౌలింగ్లో సిక్సర్లు బాదాడు. కుల్వంత్ ఓవర్లో దూకుడు ప్రదర్శించిన తర్వాత రషీద్ ఓవర్లో అతను 2 భారీ సిక్స్లు కొట్టాడు. వీటిలో ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టిన సిక్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. రబాడ ఓవర్లోనూ రెండు సిక్స్లు కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన అతను ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లోనూ 2 సిక్స్లు కొట్టాడు. ఇలా కెప్టెన్గా, ఆటగాడిగా సూపర్ సక్సెస్ అయిన రజత్ పాటీదార్ తొందరలో టీమిండియా గడప కూడా తొక్కే అవకాశం లేకపోలేదు.Captains who led their teams into back to back IPL Finals:- MS Dhoni (2010, 2011). - Rohit Sharma (2019, 2020). - Hardik Pandya (2022, 2023). - Shreyas Iyer (2024, 2025). - Rajat Patidar (2025, 2026). pic.twitter.com/2evHNpBfQK— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026Breathtaking Batting 🤯🎥 Rajat Patidar leaving the best in the business awestruck 😳❤️Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/5BFUDFTHH1— IndianPremierLeague (@IPL) May 26, 2026చదవండి: ‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్ను గెలిపించింది వాళ్లే!’ -
‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్ను గెలిపించింది వాళ్లే!’
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్ చేరింది. మ్యాచ్లో 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయంపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు. ధర్మశాలలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో ఒత్తిడిని అధిగమించి ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం, మైదానంలో ప్రశాంతంగా నిలదొక్కుకోవడం కీలకంగా మారిందని అన్నారు. ఈ మ్యాచ్లో తాము కేవలం స్కోరును కాపాడుకోవడానికి రాలేదని, ప్రత్యర్థిపై పూర్తి దూకుడుతో అటాక్ చేయాలనే మైండ్ సెట్తో బరిలోకి దిగడం వల్లే విజయం సొంతమా అయిందని పటీదార్ పేర్కొన్నారు.పాటీదార్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశాడు. సెంచరీ ఏముంది మరో మ్యాచ్లో చేసుకోవచ్చు. అయినా నా బ్యాటింగ్లో చాలా తప్పులున్నాయి. లైఫ్లు లభించడంతోనే ఇవాళ భారీ స్కోరు సాధించాను. మేము భారీ స్కోరు చేసినప్పటికీ, మా బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. గెలుపు క్రెడిట్ను నేను తీసుకోలేను, మా బౌలర్లే ఇవాళ నిజమైన హీరోలు.ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయడమే తమ ప్రధాన లక్ష్యమని మా బౌలర్లు ముందే చెప్పారు. లీగ్ ముందుకు సాగుతున్న కొద్దీ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్వుడ్, రసిక్ సలామ్, కృనాల్ మ్యాచ్ విన్నర్లుగా మారిపోయారు. పవర్ ప్లేలో కీలక వికెట్లు తీస్తూ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఫైనల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తాం’ అని రజత్ పాటీదార్ ధీమా వ్యక్తం చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెపె్టన్ రజత్ పాటీదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్లు) విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన చేయగా... విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Body Language: “𝘞𝘦 𝘢𝘳𝘦 𝘤𝘰𝘮𝘪𝘯𝘨 𝘧𝘰𝘳 𝘺𝘰𝘶” 🦁 pic.twitter.com/oVXoBEWBki— Royal Challengers Bengaluru (@RCBTweets) May 26, 2026 -
ప్లేఆఫ్స్ చేరని పంజాబ్.. అర్ష్దీప్ కీలక నిర్ణయం!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. లీగ్ దశలో పంజాబ్ తమ చివరి మ్యాచ్ గెలిచినప్పటికీ, ముంబైపై రాజస్తాన్ రాయల్స్ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరని నేపథ్యంలో ఆ జట్టు బౌలర్ అర్ష్దీప్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే అర్ష్దీప్ సింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను చాలా వరకు క్లియర్ చేశాడు. దాదాపు 200 పోస్టులను ఇన్స్టా ఖాతా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోహ్లీతో కలిసి రీల్ చేసిన వీడియోను తొలగించడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీతో చేసిన రీల్ దాదాపు 15 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రస్తుతం అర్ష్దీప్ ఖాతాలో 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అయితే అర్ష్దీప్ ఉన్నపళంగా తన ఇన్స్టా నుంచి పోస్టులు తొలగించడం వెనుక బలమైన కారణముంది. లీగ్ స్టేజ్లో సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనంతరం.. అర్ష్దీప్ సింగ్ ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో పంజాబ్ స్పిన్నర్ చాహల్.. చేతులు అడ్డం పెట్టుకుని ఈ సిగరేట్ వేప్ చేస్తూ కనిపించాడు. దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ ఘటన తర్వాత ఐపీఎల్ 2026 ముగిసే వరకు వ్లాగింగ్ ఆపేయాలని బీసీసీఐ అర్ష్దీప్ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు సోషల్ మీడియా వినియోగంపై ఫ్రాంచైజీ కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు ఇకపై ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే రూపొందించి విడుదల చేయాలనే యాజమాన్యం కఠిన సూచనలు చేసింది. అందుకే అర్ష్దీప్ తన పోస్టులను తొలగించాడంటూ అభిమానులు పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో అర్ష్దీప్ సింగ్ పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్లాడిన అర్ష్దీప్ కేవలం 14 వికెట్లు మాత్రమే తీశాడు. అందునా ప్రతీ మ్యాచ్లోనూ ఓవర్కు దాదాపు 10 పరుగుల పైనే సమర్పించుకున్నాడు.Arshdeep Singh to Virat Kohli ; Paaji run km rah gye century pakki thi. Kohli ; Toss jeet gye nhi to teri bhi pakki thii dew mein 🤣#INDvSA #ViratKohli pic.twitter.com/hSxkG4ma5n— Ali Tweets (@ali_tweets05) December 6, 2025చదవండి: క్వాలిఫయర్ పోరు.. కోహ్లీ విషయంలో ఆందోళన! -
క్వాలిఫయర్ పోరు.. కోహ్లీ విషయంలో ఆందోళన!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న పోరులో అందరి కళ్లు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. కానీ ప్లేఆఫ్స్లో కోహ్లీ ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేకపోవడం ఆర్సీబీ జట్టులో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ప్లేఆఫ్స్లో 17 మ్యాచ్లాడిన కోహ్లీ 121 స్ట్రైక్రేట్తో 396 పరుగులు సాధించాడు. మరి గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్ పోరులో కోహ్లీ ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కోహ్లీ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే గుజరాత్తో మ్యాచ్లో పిచ్పై అవగాహన వచ్చేవరకు నిలదొక్కుకుంటే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదు. పైగా ధర్మశాలలో కోహ్లీకి మంచి రికార్డే ఉంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ సీజన్లో కోహ్లీ ఇప్పటివరకు 14 మ్యాచ్ల్లో 557 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులోనూ కొనసాగుతున్నాడు. లీగ్ దశలో ఇరుజట్లు 18 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ ఆర్సీబీ నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండడంతో టేబుల్ టాపర్గా నిలిచింది. క్వాలిఫయర్-1 పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభించనుంది. బుధవారం జరిగే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడనుంది.చదవండి:‘వాళ్లంతా క్రికెట్ తెలియని మూర్ఖులు’ -
‘వాళ్లంతా క్రికెట్ తెలియని మూర్ఖులు’
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2026 సీజన్లో ప్లాఫ్ షో కనబరిచాడు. 13 మ్యాచ్ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేసిన సూర్యకుమార్ దారుణంగా విఫలమయ్యాడు. అయితే సీజన్లో రాజస్తాన్తో మ్యాచ్లో 60 పరుగుల ఇన్నింగ్స్ సూర్యకు ఈ సీజన్లో చెప్పుకోదగిన ప్రదర్శన. ఇది మినహా అతడు రాణించిన దాఖలాలు లేవు. అయితే రాజస్తాన్తో మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ మణికట్టు గాయంతో బాధపడుతున్నాడని, అందుకే అతడి నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను సూర్యకుమార్ ఖండించాడు. తనకు ఏ గాయం కాలేదని, సరిగ్గా ఆడనంత మాత్రానా గాయంతో బాధపడుతున్నట్లు ఊహించుకున్నవారంతా మూర్ఖులేనంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. అంతేకాదు తనపై వచ్చిన వార్తలన్నీ అబద్దాలేనంటూ కొట్టిపారేశాడు. సూర్యకుమార్ మాట్లాడుతూ..‘ఒక విషయంపై నేను స్పష్టత ఇవ్వదలచుకున్నా. నేను మణికట్టు గాయంతో బాధపడుతున్నా అని మాట్లాడుకుంటున్నవాళ్లు ఫిజియోథెరపిస్టులు కాకపోవడం లేదా క్రికెట్ గురించి అవగాహన లేని వాళ్లు అయి ఉంటారు. ఎందుకంటే, ఒకవేళ నిజంగా నేను మణికట్టు గాయం లేదా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే.. ప్రాక్టీస్లోనూ, మ్యాచ్లలోనూ షాట్లు కొట్టడంలో ఇబ్బంది ఎదుర్కొనేవాడిని. నేను మ్యాచ్ల్లో ఆడే చాలా షాట్లతో పాటు ఫ్లిక్ షాట్లు నా మణికట్టుపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఈ రూమర్లను పట్టించుకునే సమయం నాకు లేదు. కానీ నేను పూర్తి ఫిట్గా ఉన్నప్పటికీ గాయంతో బాధపడుతున్నట్లు వార్తలు రావడం ఆగ్రహం తెప్పించింది. అందుకే పని గట్టుకొని ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. ఈ సీజన్లో నా నుంచి బ్యాటింగ్లో మంచి ప్రదర్శన రాకపోవడంపై అసంతృప్తిగానే ఉన్నా. కానీ ఈ ఏడాది మంచి హార్డ్వర్క్తోనే క్రికెట్ సీజన్ను స్టార్ట్ చేశాను. న్యూజిలాండ్తో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నా. టీ20 ప్రపంచకప్లో ఆరంభంలో విఫలమైనప్పటికీ ఆఖర్లో మంచి ప్రదర్శనే కనబరిచాను. కానీ ఐపీఎల్లో మాత్రం లయను కోల్పోయి బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాను. నా ప్రదర్శన బాగాలేదని సర్దిచెప్పుకోలేను. దానిని మెరుగుపరుచుకునేందుకు ఇంకా కష్టపడుతా. ఫలితం వస్తే సంతోషం లేకుండా మళ్లీ కష్టపడతా. దేవుడు అన్నీ చూస్తున్నాడు. త్వరలోనే మళ్లీ కమ్బ్యాక్ ఇస్తానని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.Suryakumar Yadav on his Wrist Injury : "First of all, I'd like to clear the air a little bit. The people talking about a wrist injury are either pure physios or people who don't understand cricket. Because if I really had a wrist injury or such a problem, then the shots I've… pic.twitter.com/cNvibE9e3j— Vipin Tiwari (@Vipintiwari952) May 25, 2026చదవండి: కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు! -
కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వాలిఫయర్-1 పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే సీజన్ ముగియకముందే మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే ఈ జట్టులో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఊహించినట్లుగానే రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. ఓపెనింగ్లో వైభవ్కు జంటగా గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బద్రీనాథ్ కీలకమైన మూడో స్థానానికి కోహ్లీని కాదని ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్కు చోటు కల్పించాడు.మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), రజత్ పటీదార్ (ఆర్సీబీ), ఆల్రౌండర్ స్థానానికి కృనాల్ పాండ్యా (ఆర్సీబీ)ని ఎంపిక చేశాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేకేఆర్కు చెందిన సునీల్ నరైన్కు చోటు కల్పించిన బద్రీనాథ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఏకంగా ఐదుగురిని ఎంపిక చేయడం విశేషం. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువనేశ్వర్ కుమార్ (ఆర్సీబీ)తో పాటు జోఫ్రా ఆర్చర్ (రాజస్తాన్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్)లను ఎంచుకున్నాడు. మరో పేసర్ స్థానానికి యువ బౌలర్లు ప్రిన్స్ యాదవ్, కార్తిక్ త్యాగిలను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లోనూ 500 పరుగుల మార్క్ను దాటాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఓపెనర్లుగా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ (14 మ్యాచ్ల్లో 583 పరుగులు), శుబ్మన్ గిల్ (14 మ్యాచ్ల్లో 616 పరుగులు) సాధించారు. ఇక ఆర్సీబీకి కీలక బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్, గుజరాత్కు చెందిన రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక బద్రీనాథ్ టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో 95 మ్యాచ్లాడిన బద్రీనాథ్ 1441 పరుగులు సాధించాడు.బద్రీనాథ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్:వైభవ్ సూర్యవంశీ, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.చదవండి: విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్! -
విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్
ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్లో ఘోర వైఫల్యం తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు తప్పులను సరిదిద్దుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20లు)కు లంక జట్టు కొత్త కెప్టెన్గా కుశాల్ మెండిస్ను నియమిస్తూ లంక బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వన్డేలకు కెప్టెన్గా ఉన్న షనక, టీ20లకు కెప్టెన్గా వ్యవహరించిన చరిత్ అసలంకలను ఆ పదవి నుంచి తప్పించి రెండు ఫార్మాట్లలోనూ కుశాల్ మెండిస్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. టెస్టు జట్టును మాత్రం ధనుంజయ డిసిల్వానే నడిపించ నున్నాడు. పనిలో పనిగా వెస్టిండీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు 16 మందితో, టెస్టు సిరీస్కు 17 మందితో కూడిన జట్లను ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయినప్పటికీ షనక, చరిత్ అసలంకలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. కమిందు మెండిస్ కుశాల్కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. గాయంతో టీ20 ప్రపంచకప్కు దూరమైన లంక ఆల్రౌండర్ వనిందు హసరంగ విండీస్తో సిరీస్కు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ20 ప్రపంచకప్కు భారత్తో కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన శ్రీలంక టోర్నీలో సెమీఫైనల్ చేరడంలో విఫలమైంది. చచ్చీ చెడీ సూపర్-8కు చేరుకున్నప్పటికీ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ దారుణ పరాజయాలు చవిచూసింది. ఈ నేపథ్యంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్లను మార్చేందుకు లంక క్రికెట్ బోర్డు మొగ్గుచూపింది.శ్రీలంక టూర్ ఆఫ్ వెస్టిండీస్:జూన్ 3: మొదటి వన్డే, జమైకాజూన్ 6: రెండో వన్డే, జమైకాజూన్ 8: మూడో వన్డే, జమైకాజూన్ 11: తొలి టీ20, జమైకాజూన్ 13: రెండో టీ20, జమైకాజూన్ 14: మూడో టీ20, జమైకాజూన్ 25 నుంచి 29 వరకు: మొదటి టెస్టు, అంటిగ్వాజూలై 3 నుంచి 7 వరకు: రెండో టెస్టు, అంటిగ్వావిండీస్తో సిరీస్కు శ్రీలంక జట్టు:వన్డే జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానాగే, చరిత్ అసలంక, మిలన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుషంక, ఇషాన్ మలింగ, అసితా ఫెర్నాండో, ప్రమోద్ మదుషన్.టీ20 జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, లసిత్ క్రూస్పుల్లే, దాసున్ షనక, మిలన్ రత్నాయకే, దునిత్ వెల్లలగే, వనీందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుషంక,ఇషాన్ మలింగ, బినురా ఫెర్నాండో, నువాన్ తుషార.టెస్టు జట్టు: ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, పాతుమ్ నిస్సంక, లహిరు ఉదరా, నిషాన్ మదుష్క, దినేష్ చండిమల్, పసిందు సూర్యబండార, సోనాల్ దినుషా, కుసాల్ మెండిస్, మిలన్ రత్నాయకే, ప్రబాత్ జయసూర్య, రమేశ్మెండిస్, అసితా ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, లాహిరు కుమారా, ఇసితా విజ్వేసుందర, కాసున్ రజిత.Sri Lanka Tour of West Indies 2026🏏Sri Lanka Cricket’s Selection Panel has selected the following squads for Sri Lanka’s Tour of the West Indies 2026.The tour will feature matches across all three formats - ODI, T20I, and Test cricket.The tour will begin with the ODI series,… pic.twitter.com/rnZYZZHm0S— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) May 25, 2026చదవండి: కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు! -
క్వాలిఫయర్-1 పోరు.. ఫైనల్ అడుగు ఎవరిది?
ఐపీఎల్లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్, మాజీ చాంపియన్ జట్లు మరో టైటిల్ వేటలో ముందుగా ఫైనల్లోకి అడుగు పెట్టేందుకు సై అంటున్నాయి. చెరో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బెంగళూరు, గుజరాత్ టీమ్ల మధ్య మ్యాచ్ తొలి క్వాలిఫయర్ విజేత నేరుగా తుది పోరుకు అర్హత సాధించే అవకాశం ఉండగా... ఓడిన జట్టు నిష్క్రమించకుండా రెండో క్వాలిఫయర్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఏడాది లీగ్ దశ రెండు ముఖాముఖి మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి క్వాలిఫయర్–1 ద్వారా నేరుగా ఫైనల్కు చేరుతుందా? గత సీజన్లో ఎలిమినేటర్లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మూడేళ్ల తర్వాత మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా? ఈ రెండు మేటి జట్ల మధ్య మరికొన్ని గంటల్లో జరిగే సమరంలో పైచేయి ఎవరిదో తేలనుంది. టోర్నీ ఆసాంతం బెంగళూరు కీలక సమరాల్లో ఆధిక్యాన్ని అందుకొని ముందంజ వేయగా... రెండో అర్ధ భాగంలో అసాధారణంగా రాణించి గుజరాత్ దూసుకొచ్చింది. ఐపీఎల్లో ఇరు జట్లు ‘ప్లే ఆఫ్స్’లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం కాగా... ఓవరాల్గా ముఖాముఖి పోరులో రెండు జట్లు 4–4తో సమానంగా ఉన్నాయి. ఆద్యంతం నిలకడగా..వరుసగా రెండో సీజన్లో టాప్–2తో ముగించడం బెంగళూరు నిలకడను చూపిస్తోంది. టోర్నీ తొలి అర్ధభాగంలో ఐదు మ్యాచ్లు గెలిచిన జట్టు రెండో అర్ధభాగంలో నాలుగు విజయాలు సాధించింది. ఈ సీజన్లో అతి తక్కువ మంది ఆటగాళ్లను ఉపయోగించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అంటే టీమ్ ఎంత స్థిరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో కీలక ఆటగాళ్లంతా సత్తా చాటారు. వరుసగా నాలుగో సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లి (557) ముందుండి నడిపించగా... పడిక్కల్ (433), పాటీదార్ (393) తమ వంతు పాత్ర పోషించారు. ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలతో చెలరేగుతున్న కోహ్లిని తాజా ఫామ్లో నిలువరించడం అంత సులువు కాదు. బౌలింగ్లో భువనేశ్వర్ (24 వికెట్లు) టోరీ్నలో ఆర్సీబీకి విజయాలు అందిస్తూ అగ్ర స్థానంలో నిలిచాడు. హాజల్వుడ్, రసిఖ్ సలామ్లనుంచి అతనికి సరైన సహకారం లభించింది. ఇక ఆల్రౌండర్గా కృనాల్ పాండ్యా రాణిస్తున్నాడు. భిన్నమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరిస్తున్న అతను... బ్యాటింగ్లో అవకాశం వచ్చిన ప్రతీసారి తన విలువను ప్రదర్శించాడు. టిమ్ డేవిడ్ కూడా కీలక ఇన్నింగ్స్లతో తన బాధ్యతను నెరవేర్చాడు. చివరి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో దెబ్బతిన్నా... భువీ, హాజల్వుడ్ ఇచ్చే ఆరంభం మరోసారి ఆర్సీబీకి కీలకం కానుంది. స్వింగ్, సీమ్కు అనుకూలించే ధర్మశాల మైదానం వారి ప్రదర్శనకు సరైన వేదిక కాగలదు. పూర్తి ఫిట్గా ఉంటే కోహ్లికి తోడుగా ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేయడం ఖాయం. లేదంటే వెంకటేశ్ అయ్యర్నే కొనసాగిస్తారు. స్పిన్నర్ సుయాశ్ స్థానంలో పేసర్ డఫీని ఆడించే అంశాన్ని కూడా మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. టాప్–3 బ్యాటింగ్తోనే..గుజరాత్ జట్టు ధర్మశాలలో ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది కొంత ప్రతికూలమే అయినా... పదునైన పేస్ బౌలింగ్ బృందం ఆ లోటు కనపడనీయకుండా చేయగలదు. సిరాజ్, రబాడ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా, అర్షద్ ఖాన్ కూడా నిలకడగా రాణించాడు. రబాడ కూడా 24 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, తక్కువ వికెట్లే (17) తీసినా... సిరాజ్ ఎంతో ప్రభావం చూపించాడు. ఆల్రౌండర్ హోల్డర్ పేస్ బౌలింగ్ కూడా జట్టుకు అదనపు బలంగా మారింది. రషీద్ ఖాన్ ఎప్పటిలాగే మరోసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే బెంగళూరు మిడిలార్డర్ను కట్టడి చేయగలడు. గత మ్యాచ్లో ఆర్సీబీని గుజరాత్ ఓడించడంలో అతనిదే ప్రధాన (2/19) పాత్ర. పిచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిధ్ లేదా సాయికిషోర్లలో ఒకరికి చాన్స్ లభిస్తుంది. బ్యాటింగ్లో మరోసారి టైటాన్స్ టాప్–3పైనే ఆధారపడుతోంది. సాయిసుదర్శన్ (638), శుబ్మన్ గిల్ (616), జోస్ బట్లర్ (469) చెలరేగడంతోనే టైటాన్స్ ప్రస్థానం ప్లే ఆఫ్స్ వరకు చేరింది. వాషింగ్టన్ సుందర్ (303) కూడా నిలకడగా తన వంతు పాత్ర పోషించాడు.పిచ్, వాతావరణంభారీ స్కోర్లకు వేదిక ఇది. ఈ సీజన్లో ధర్మశాల మైదానంలో మూడు లీగ్ మ్యాచ్లు జరిగాయి. ఐదు ఇన్నింగ్స్లలో 200కు పైగా స్కోరు నమోదు కాగా, మరో ఇన్నింగ్స్లో 199 పరుగులు వచ్చాయి. డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ నెగ్గగా... సాయంత్రం జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఛేదన చేసిన టీమ్ విజయం సాధించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో బ్యాట్ను తాకిన బంతి వాతావరణం కారణంగా చాలా వేగంగా దూసుకుపోవడం ఖాయం. పంజాబ్పై ముంబై గెలిచిన మ్యాచ్లో ఇది బాగా కనిపించింది. వర్షసూచన లేదు. The steepest climb of the season, but the view from the top is a spot in the Final! 🏔️Dharamshala is READY for the #Qualifier1 🏟️#TATAIPL | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets | @gujarat_titans pic.twitter.com/sCdPkNMzyZ— IndianPremierLeague (@IPL) May 25, 2026 చదవండి: ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా! -
ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన వైభవ్ 583 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్థసెంచరీలున్నాయి. ఆదివారం ముంబై ఇండియన్స్పై గెలిచిన రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది.మే 27న (బుధవారం) ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఫ్యామిలీ వీడియో వైరల్గా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ను వీక్షించడానికి వైభవ్ కుటుంబం మొత్తం తరలివచ్చింది.మ్యాచ్లో వైభవ్ తుస్సుమన్నప్పటికీ రాజస్తాన్ గెలవడం, ప్లేఆఫ్ చేరడంతో అతడి కుటుంబం సంతోషంతో ఇంటిబాట పట్టారు. ఈ నేపథ్యంలో స్టేడియం నుంచి బయటికి వస్తున్న వైభవ్ సూర్యవంశీ కుటుంబం సహా అతడి సోదరులు కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంది' అంటూ కామెంట్స్ చేయడం ఆసక్తి కలిగించింది.కాగా, వైభవ్కు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఉజ్వల్, విశాల్ అతడి కంటే పెద్దవాళ్లు కాగా, ఆశీర్వాద్ అందరికంటే చిన్నవాడు. ఈ నలుగురు అన్నదమ్ములు కూడా హైట్లో తేడా ఉన్నప్పటికీ ముఖ కవలికల్లో మాత్రం అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండడం విశేషం. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జురెల్ (38), జోఫ్రా ఆర్చర్ (32) సహా మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో రాజస్తాన్ 200 పరుగుల మార్క్ను దాటింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia)Vaibhav’s carbon copy cute Family 🩷🤭 pic.twitter.com/WLUDhFyg0c— Charvi Vyas (@4Vvyas) May 25, 2026చదవండి: మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం! -
మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం!
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మేగన్ స్కట్ రిటైర్మెంట్పై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు మేగన్ స్కట్ వెల్లడించింది. తర్వాతి జనరేషన్కు అవకాశాలు ఇవ్వా లనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది.దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ మేఘన్ స్కట్కు చివరి అంతర్జాతీయ టోర్నీ కానుంది. 33 ఏళ్ల మేగన్ స్కట్ 2012లో 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. అనతికాలంలోనే ఆసీస్ స్టార్ ప్లేయర్గా పేరు పొందిన మేగన్ స్కట్ ఆ జట్టు తరఫున నాలుగు టెస్టులు, 111 వన్డేలు, 125 టీ20 మ్యాచ్లు ఆడింది. మొత్తం 240 అంతర్జాతీయ మ్యాచ్లాడిన మేగన్ స్కట్ 309 వికెట్లు పడగొట్టింది. ఇందులో వన్డేల్లో 148 వికెట్లు, టీ20ల్లో 152 వికెట్లు ఉన్నాయి. మహిళల క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్గానూ రికార్డులకెక్కింది. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మేగన్ అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్గానూ మేగన్ రికార్డులకెక్కింది.ఇక తన రిటైర్మెంట్ ప్లాన్పై మేగన్ స్కట్ స్పందించింది. ‘14 ఏళ్ల కెరీర్ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. తర్వాతి తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయిం చుకున్నా. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది.’ అని చెప్పుకొచ్చింది. మేగన్ స్కట్.. రెండు వన్డే ప్రపంచకప్(2013, 2022)లతో పాటు మూడు టీ20 ప్రపంచకప్లు (2108, 2020, 2026) గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలిగా ఉంది. జూన్ 12న ప్రారంభం కానున్న మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 13న సౌతాఫ్రికాతో ఆడనుంది.లెస్బియన్తో వివాహంఅడిలైడ్కు చెందిన మేఘన్ స్కట్ తన దీర్ఘకాల భాగస్వామి జెస్ హోలియోక్ను వివాహం చేసుకుంది. ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం అయిన తర్వాత 2019లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 2021 ఆగస్టులో, అత్యవసర సి-సెక్షన్ సరోగసి ద్వారా నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు రైలీ లూయిస్ అని పేరు పెట్టారు. అయితే 2025లో జెస్తో తన పదేళ్ల రిలేషిన్షిప్ ముగిసిందంటూ మేగన్ స్కట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం విడిగా ఉంటున్నప్పటికీ మేగన్, జెస్లు కలిసి మిరాకిల్ బేబీస్ ఫౌండేషన్కు రాయబారులుగా పనిచేస్తూ, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. చదవండి: 25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్! -
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా ట్రెండింగ్లో నిలిచిన పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న ఈ 15 ఏళ్ల చిన్నోడు బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన యూట్యూబ్ షోలో పాల్గొన్న వైభవ్ సూర్యవంశీ 25 బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విషయంలోకి వెళితే పీటర్సన్ తన యూట్యూబ్ చానెల్లో వైభవ్ సూర్యవంశీతో ఒక ప్రత్యేక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్లోనే పీటర్సన్ వైభవ్కు 50 బంతుల్లో 100 పరుగులు చేయాలంటూ సవాల్ విసిరాడు. కానీ వైభవ్ మాత్రం పీటర్సన్ విసిరిన సవాల్ను 25 బంతుల్లోనే అందుకోవడం విశేషం. బౌలింగ్ మెషిన్ నుంచి వచ్చిన బంతులను వైభవ్ భారీ సిక్సర్లుగా మలిచాడు. అయితే 25 బంతుల్లోనే శతకం సాధించినప్పటికీ ఇదే పీటర్సన్ షోలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో సాధించిన వంద పరుగుల రికార్డును మాత్రం బద్దలుకొట్టలేకపోయాడు. మూడు బంతుల తేడాతో అయ్యర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. ఇక పీటర్సన్ షోలో అత్యంత వేగంగా సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ రెండో స్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, వైభవ్ తర్వాత నికోలస్ పూరన్ (28 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. అంతకముందు ఏబీ డివిలియర్స్ 30 బంతుల్లో వంద పరుగులు సాధించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో వంద పరుగులు సాధించడం గమనార్హం. ఇదే ఎపిసోడ్లో సూర్యవంశీ తన కోరికను వెల్లడించాడు. టీ20ల్లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే టీ20 క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (175 పరుగులు) పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజన్లో గేల్ ఆర్సీబీ తరఫున 175 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. గేల్ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు టీ20ల్లో డబుల్ సెంచరీ బాదడమే తన టార్గెట్ అని మరోసారి స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్పై 30 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్ 16 పాయింట్లతో నాకౌట్ దశకు చేరుకుంది. బుధవారం (మే 27న) జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ను ఎదుర్కోనుంది. ఇక రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీజన్లో 14 మ్యాచ్లాడి 583 పరుగులు సాధించాడు.చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్రపంచకప్కు దూరం! -
‘నేను క్లారిటీగా ఉన్నా.. మీ టైం వృథా చేసుకోవద్దు’
ఐపీఎల్ 2026 సీజన్ను కోల్కతా నైట్రైడర్స్ ఓటమితో ముగించింది. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. అయితే అంతకముందే రాజస్తాన్ రాయల్స్ ముంబైపై గెలిచి ప్లేఆఫ్స్కు చేరడంతో ఢిల్లీ, కేకేఆర్ మ్యాచ్ నామామాత్రంగా మారిపోయింది. అయితే విజయంతో సీజన్ను ముగిద్దామనుకున్న కేకేఆర్కు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భంగపాటు ఎదురైంది. ఈ సీజన్లో కేకేఆర్ ఆటతీరుపై, రహానే నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టు ప్రదర్శన, తన కెప్టెన్సీపై వస్తున్న విమర్శలపై రహానే ఘాటుగా సమాధానమిచ్చాడు. రహానే మాట్లాడుతూ.. ‘జట్టు వరుస ఓటములతో కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం లేదా వెనక్కి తగ్గడం నా డిక్షనరీలోనే లేదు. నేను ఎప్పుడూ సవాళ్లను చూసి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు. ఈ కఠిన పరిస్థితుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఆలోచన నా మనసులోకి ఒక్కసారి కూడా రాలేదు. ఒక నాయకుడిగా జట్టును ముందుకు నడపడమే తన బాధ్యత అని, గెలుపోటములు ఆటలో సహజం. నేనైతే కేకేఆర్తోనే కొనసాగాలనుకుంటున్నా. నాకు ఆడాలనిపించినకాలం క్రికెట్ ఆడుతాను. రిటైర్మెంట్ ఆలోచన ఇప్పుడేం లేదు. ఐపీఎల్ ముగియడంతో కొంతకాలం కుటుంబంతో గడుపుతాను. ఆ తర్వాత ముంబైలో లోకల్ లీగ్లో పాల్గొంటాను. క్రికెట్ ఆడడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా.’ అని రహానే చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో కేకేఆర్ ప్రదర్శనపై కూడా రహానే స్పందించాడు. ‘సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు మా జట్టును కుంగదీశాయి. కానీ రెండో అంచె పోటీల్లో గోడకు కొట్టిన బంతిలా మేం తిరిగి ఫుంజుకున్నాం. వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి కూడా వచ్చాం. కొన్ని మ్యాచ్ల్లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయాం. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్లోనైనా గెలిచి ఉండుంటే ఇవాళ ప్లేఆఫ్స్లో ఉండేవాళ్లం. రాబోయే సీజన్లో తప్పులను సరిదిద్దుకుని బలంగా పునరాగమనం చేస్తాం.’ అని రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు.ఈ సీజన్లో కేకేఆర్ ప్రయాణం అంచనాలకు భిన్నంగా సాగింది. ఒక మ్యాచ్ రద్దు సహా వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడిన కేకేఆర్ తొలి హాఫ్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. అయితే రెండో సగంలో మాత్రం వరుసగా నాలుగు విజయాలు సాధించి ఔరా అనిపించింది. మధ్యలో ఆర్సీబీ చేతిలో ఓడినా మళ్లీ రెండు విజయాలు సాధించిన కేకేఆర్ ఒక్కసారిగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.కానీ పంజాబ్, రాజస్తాన్లతో పోలిస్తే నెట్ రన్రేట్ చాలా తక్కువగా ఉండడంతో పోటీలో ఉన్నప్పటికీ ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సి వచ్చింది. రహానే కెప్టెన్సీపై విమర్శలు వచ్చినప్పటికీ, అతడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా జట్టును సమర్థంగా నడిపించాడు. ఐపీఎల్లో మూడుసార్లు చాంపియన్గా నిలిచిన కేకేఆర్ వచ్చే సీజన్లో తప్పులను సరిదిద్దుకొని సత్తా చాటుతుందని ఆశిద్దాం.Curtains down at Eden Gardens for this season! 🏟️The Kolkata Knight Riders signing off with a lap of honour for a brilliant home crowd 💜#TATAIPL | #KhelBindaas | #KKRvDC | @KKRiders pic.twitter.com/fC29SWpCYe— IndianPremierLeague (@IPL) May 24, 2026చదవండి: హెడ్ భార్యకు అవమానం.. వికృత చేష్టలు ఆపండి! -
హెడ్ భార్యకు వేధింపులు.. వికృత చేష్టలు ఆపండి!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్ ఫలితం కంటే విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ల మధ్య చోటుచేసుకున్న వివాదమే హైలైట్గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీపై హెడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం, దీనికి కౌంటర్గా కోహ్లీ ధీటుగా బదులివ్వడం కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. అయితే వివాదం అక్కడితో సద్దుమణిగిందిలే అనకుంటే ఇప్పుడు అభిమానులు దీనిని మరింత పెద్దదిగా చేస్తున్నారనిపిస్తోంది. తాజాగా హెడ్ భార్య జెస్సికాను ఈ వివాదంలోకి లాగారు. జెస్సీకా సోషల్ మీడియా అకౌంట్ను హ్యాక్ చేసిన కొంతమంది ఆమెను కించపరుస్తూ అసభ్యకర పోస్టులతో ఆన్లైన్ వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు వివాదాన్ని మైదానానికే పరిమితం చేస్తున్నప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం వివాదాలను ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి తమ వికృత చేష్టలతో క్రీడా సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు.తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ హెడ్ భార్య జెస్సికా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వాపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 'ప్రపంచకప్ సంఘటన తర్వాత నాపై వేధింపులు తిరిగి పునరావృతమైనట్లుగా అనిపిస్తోంది. నేను నిద్రలేవడంతోనే నా సోషల్ మీడియా ఖాతాలో కొంతమంది అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టారు. నన్ను వేధింపులకు గురి చేసినా పట్టించుకునే దాన్ని కాదు, కానీ వాళ్లు శ్రుతి మించిపోయారు. నాతో పాటు నా కుటుంబసభ్యులను, మిత్రులపై వేధింపులకు దిగారు. క్రీడా సంబంధిత విషయాలను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టడం సరికాదు. ఈ వికృత చేష్టలను దయచేసి ఆపాలని కోరుతున్నా.' అంటూ జెస్సికా ఆవేదనతో రాసుకొచ్చింది. మేము మనుషులమే..'ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మానసిక ఆరోగ్యం, దృక్పథం, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం గురించి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. క్రీడల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. కానీ ఆటను ఆటగానే చూడాలి. అంతేకానీ ఆ వివాదాలను వ్యక్తుల కుటుంబాల దాకా తీసుకురాకూడదు. మేము మనుషులమే.. మాకు కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.' అని ఆమె అన్నారు.గతంలోనూ వేధింపులు..అయితే హెడ్ భార్య జెస్సికాకు ఆన్లైన్ వేధింపులు కొత్త కాదు. గతంలో 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఫైనల్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ను హెడ్ అందుకున్నాడు. అప్పుడు కూడా హెడ్తో పాటు అతడి భార్య జెస్సికాను టార్గెట్ చేస్తూ కొంతమంది అభిమానులు అసభ్యకర కామెంట్లు చేశారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో కోహ్లీ, హెడ్ మధ్య వివాదం జెస్సికాకు మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది.కోహ్లీ, హెడ్ వివాదమేంటి?ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్.. ‘కాస్త బౌండరీలు కొట్టు’ అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల కరచాలనం సందర్భంగా హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ ముగిసింది. మంగళవారం తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ, గుజరాత్ తలపడునున్నాయి. బుధవారం ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మే 29న క్వాలిఫయర్-2, మే 31న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’ -
విజయంతో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2026 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంతో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నామమాత్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్కతా వేదికగా జరిగిన సీజన్ చివరి మ్యాచ్లో కేకేఆర్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అజింక్య రహానే (63) అర్థసెంచరీ సాధించగా, పావెల్ (29), మనీశ్ పాండే (25) పర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఎన్గిడి చెరో మూడు వికెట్లతో విజృంభించగా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థసెంచరీతో తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (39), డేవిడ్ మిల్లర్ (28), అశుతోశ్ శర్మ (18 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ 200 పరుగుల మార్క్ను దాటింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్లు తలా ఒక వికెట్ పడగొట్టారు. కేకేఆర్పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్ల్లో ఏడు విజయాలతో సీజన్ను ఆరో స్థానంతో ముగించింది. మరోవైపు కేకేఆర్ 14 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. ఇక రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంతో పంజాబ్, కేకేఆర్లు ఇంటిదారి పట్టాయి.Ending the season exactly how you want to... with a solid W! 🙌A comprehensive 40-run win for @DelhiCapitals to finish things off 💙❤️Scorecard ▶️ https://t.co/Uo07zwiknq#TATAIPL | #KhelBindaas | #KKRvDC pic.twitter.com/lc0u4ZLx6D— IndianPremierLeague (@IPL) May 24, 2026చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’ -
‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’
ఐపీఎల్ 2026 సీజన్లో తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 30 పరుగులతో ఓడించి రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. మ్యాచ్ విజయం అనంతరం రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ జోఫ్రా ఆర్చర్పై ప్రశంసలు కురిపించాడు. తమ జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో జోఫ్రా ఆర్చర్దే కీలకపాత్ర అని, అతడు ఆడకపోయుంటే ఇవాళ ఇంటికి వెళ్లిపోయేవాళ్లమని పరాగ్ పేర్కొన్నాడు. రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘మేము అనుకున్న ప్రణాళికలు సఫలం కావడం ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్చరు నంబర్ 7 స్థానంలో ప్రమోట్ చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. క్రీజులో ఎవరో ఒకరు చొరవ తీసుకుని వేగంగా ఆడాల్సిన పిచ్ ఇది. ఆ బాధ్యతను ఆర్చర్ చక్కగా నిర్వర్తించాడు. ఈ సీజన్లో నేను కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నప్పుడు, అతడిని అవుట్ చేయగల సత్తా ఒక్క జోఫ్రా ఆర్చర్కే ఉందని నేను బలంగా నమ్మాను. ఆ నమ్మకాన్ని ఆర్చర్ నిలబెట్టుకున్నాడు. అతడు బండరాయిలా దృఢంగా నిలబడి మ్యాచ్ను మా వైపు తిప్పాడు’ అని కొనియాడాడు.ఇక మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఆర్చర్ @ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ స్పందిస్తూ.. ‘ఇది నా అత్యుత్తమ ప్రదర్శన అని నేను అనుకోవడం లేదు, దీనికంటే మెరుగ్గా బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం సరైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయడానికే ప్రయత్నించాను. నేను ఇంత త్వరగా బ్యాటింగ్కు రావాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇంపాక్ట్ సబ్ నిబంధన వల్ల నాకు సాధారణంగా బ్యాటింగ్ చేసే అవకాశం రాదు. కోచ్ నన్ను ప్యాడ్లు కట్టుకోమన్నప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ, నేను నన్ను ఒక ఆల్రౌండర్గానే భావిస్తాను. ప్రస్తుతం నా ఫిట్నెస్ చాలా బాగుంది’ అని సంతోషం వ్యక్తం చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్పై రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకు పరిమితమైంది. ముంబైపై విజయంతో రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్, కేకేఆర్లు కూడా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి. View this post on Instagram A post shared by IPL (@iplt20) చదవండి: ముగిసిన లీగ్ దశ.. ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే -
ముగిసిన లీగ్ దశ.. ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్పై విజయంతో రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్లుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ప్లేఆఫ్స్కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు ప్లేఆఫ్స్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ సమయంకు సంబంధించి పూర్తి వివరాలు విడుదల చేశారు. మే 26న జరగనున్న క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. ఇక మే 27న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ తలపడనున్నాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మే 29న జరగనున్న క్వాలిఫయర్-2 పోరులో ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు తలపడనుంది. ఎలిమినేటర్తో పాటు క్వాలిఫయర్-2 మ్యాచ్కు ముల్లన్పూర్ వేదిక కానుంది. ఇక ఆదివారం (మే 31న) అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో క్వాలిఫయర్-1 విజేతతో క్వాలిఫయర్-2 విజేత అమీతుమీ తేల్చుకోనుంది.ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్మే 26- క్వాలిఫయర్-1 (ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, ధర్మశాల, రాత్రి 7.30 నుంచి)మే 27- ఎలిమినేటర్ (ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్తాన్, ముల్లన్పూర్, రాత్రి 7.30 నుంచి)మే 29-క్వాలిఫయర్-2 (క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత, ముల్లన్పూర్, రాత్రి 7.30 నుంచి)మే 31- ఫైనల్ (క్వాలిఫయర్-1 విజేత వర్సెస్ క్వాలిఫయర్-2 విన్నర్, అహ్మదాబాద్, రాత్రి 7.30 నుంచి)4️⃣ teams. 1️⃣ winner All roads lead to the ultimate glory 🏆#TATAIPL | #TheFinalLeap pic.twitter.com/waI2u61Q4t— IndianPremierLeague (@IPL) May 24, 2026చదవండి: పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు! -
పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు!
ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్ ఒకటి. మొదట కింగ్స్ ఎలెవెన్ పంజాబ్గా, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్గా 19 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతూ వస్తోంది. జట్టు పేరు మార్చినా, కెప్టెన్లు మారినా పంజాబ్ తలరాత మాత్రం మారడం లేదు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైంది. అయితే సీజన్ తొలి అంచె పోటీల్లో ఓటమి ఎరుగని పంజాబ్ రెండో అంచె పోటీల్లో అనవసర ఒత్తిడికి లోనైంది. తద్వారా వరుస పరాజయాలతో చేజేతులా ప్లేఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. 19 సీజన్లుగా కప్పు కోసం నిరీక్షిస్తున్న పంజాబ్కు ఈ ఏడాది కూడా నిరాశనే మిగిల్చింది.ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008)లో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన పంజాబ్ మళ్లీ 2014లో ఫైనల్కు చేరుకున్నప్పటికీ తుదిమెట్టుపై బోల్తా పడింది. ఆ తర్వాత షరా మాములే అన్నట్లుగా వారి ఆటతీరు సాగింది. అయితే ఐపీఎల్ కెప్టెన్లలో లక్కీ కెప్టెన్గా పేరున్న శ్రేయస్ అయ్యర్ 2025 సీజన్కు ముందు పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా రావడంతో ఆ జట్టులో ఆశలు చిగురించాయి. జట్టు తనపై ఉంచిన నమ్మకా న్ని నిలబెట్టుకున్న శ్రేయస్ అయ్యర్ పదేళ్ల తర్వాత పంజాబ్ను మళ్లీ ఫైనల్ చేర్చాడు. అయితే తుదిపోరులో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ రన్నరప్తోనే సరిపెట్టుకుంది. గత సీజన్ ఇచ్చిన బూస్ట్తో ఈ సీజన్లో మంచి అంచనాలతోనే పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టుగానే తొలి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు (ఒక మ్యాచ్ వర్షంతో రద్దు) సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. ఇంకేముంది ఈసారి పంజాబ్ టైటిల్ కొడుతుందని అంతా భావించారు. కానీ రెండో అంచె పోటీలు మొదలవ్వగానే అంచనాలు తలకిందులయ్యాయి. రాజస్తాన్ రాయల్స్ చేతిలో మొదలైన ఓటముల పరంపర వరుసగా ఆరు మ్యాచ్ల వరకు కొనసాగింది. అయితే లక్నో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జూలు విదిల్చి విజయం సాధించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 14 మ్యాచ్ల్లో ఏడు విజయాలు, ఆరు ఓటములు, ఒక రద్దుతో 15 పాయింట్లతో ఉన్నప్పటికీ మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగాక రెండో అంచె పోటీల్లో లక్నోతో మ్యాచ్కు ముందు ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఒక్క దానిలో విజయం సాధించినా ఇవాళ పంజాబ్ ప్లేఆఫ్ చేరుకునేది. కానీ అదృష్టం కంటే దురదృష్టంతో ప్రయాణం చేస్తున్న పంజాబ్కు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.వైఫల్యం వెనుక కారణాలెన్నో!ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ చేరకపోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో ప్రధాన కారణం బౌలింగ్ బలహీనంగా ఉండడం. తొలి అంచె పోటీల్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధిస్తే అందులో నాలుగు మ్యాచ్ల్లో ఛేదనలో విజయాలు సాధించింది. ప్రత్యర్థి జట్లు ఎంత పెద్ద టార్గెట్ విధించినా పంజాబ్ సులువుగా ఆ లక్ష్యాన్ని అందుకునేది. అప్పుడు బౌలింగ్లో లోపాలు కనిపించలేదు. కానీ రెండో అంచె పోటీల్లో సీన్ రివర్స్ అయింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు బౌలింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయింది. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్ కూడా పంజాబ్ కొంపముంచింది. చాలా మ్యాచ్ల్లో క్యాచ్లు జారవిడవడంపై హెడ్కోచ్ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు పంజాబ్ టైటిల్ సాధించే ఒక మంచి అవకాశాన్ని చేజేతులా కోల్పోయింది.🚨 PUNJAB KINGS KNOCKED OUT OF IPL 2026. 🚨- PBKS were unbeaten for the first 7 matches of the tournament. 🤯 pic.twitter.com/qmeXyFP0An— Mufaddal Vohra (@mufaddal_vohra) May 24, 2026చదవండి: రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ధ్రువ్ జురేల్కు క్యాచ్ ఇచ్చిన రోహిత్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ డకౌట్తో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన ఆటగాడిగా గ్లెన్ మాక్స్వెల్తో కలిసి రోహిత్ శర్మ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్లో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన గ్లెన్ మాక్స్వెల్ కూడా 19 డకౌట్లతో రోహిత్ శర్మతో పాటే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత దినేష్ కార్తీక్, సునీల్ నరైన్ చెరో 18 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే స్పిన్ బౌలర్లు పియూష్ చావ్లా, రషీద్ ఖాన్ లు కూడా చెరో 16 సార్లు సున్నా పరుగులకే అవుటయ్యి ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్పై రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకు పరిమితమైంది. ముంబైపై విజయంతో రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్, కేకేఆర్లు కూడా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.చదవండి: 'మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు పట్టుకెళ్లాడు!' -
IPL 2026: కేకేఆర్పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
కోల్కతా వేదికగా జరిగిన సీజన్ చివరి మ్యాచ్లో కేకేఆర్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రహానే (63) అర్థసెంచరీ సాధించగా, పావెల్ (29), మనీశ్ పాండే (25) పర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఎన్గిడి చెరో మూడు వికెట్లతో విజృంభించగా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థశతకంతో రాణించాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కేకేఆర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మొదట రహానే (63) ఔటవ్వగా, మరుసటి బంతికి రింకూ సింగ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. పావెల్ (15), తేజస్వి (1) పరుగుతో ఆడుతున్నారు.13 ఓవర్లలో కేకేఆర్ 123/313 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. రహానే (59), రోవ్మెన్ పావెల్ (14) పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ 87 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన మనీశ్ పాండే ఎన్గిడి బౌలింగ్లో మిచెల్ స్టార్క్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. రహానే (45), కామెరున్ గ్రీన్ (1) పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన ఓపెనర్ ఫిన్ అలెన్ ఎన్గిడి బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. రహానే (23), మనీశ్ పాండే (4) పరుగులతో ఆడుతున్నారు.కేకేఆర్ టార్గెట్ 204 పరుగులురాజస్తాన్ ప్లేఆఫ్స్కు చేరడంతో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నామమాత్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థసెంచరీతో తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (39), డేవిడ్ మిల్లర్ (28), అశుతోశ్ శర్మ (18 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ 200 పరుగుల మార్క్ను దాటింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్లు తలా ఒక వికెట్ పడగొట్టారు.హాఫ్ సెంచరీ బాది కేఎల్ రాహుల్ ఔట్ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 30 బంతులకే హాఫ్ సెంచరీ బాది జోరు మీదున్న కేఎల్ రాహుల్ అనుకుల్ రాయ్ బౌలింగ్లో రోవ్మన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఢిల్లీ స్కోరు 14 ఓవర్లకు 135-3గా ఉంది.మరో వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ మరో వికెట్ కోల్పోయింది. సాహిల్ పరాఖ్ 24 పరుగులు చేసి, సునిల్ నరైన్ బౌలింగ్లో అజింక్యా రహానెకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఢిల్లీ స్కోరు 10 ఓవర్లకు 88-2గా ఉంది. 8 ఓవర్లలో ఢిల్లీ 70/18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. సాహిల్ పరాఖ్ (15), కేఎల్ రాహుల్ (31) పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీకేకేఆర్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన అభిషేక్ పొరేల్ సౌరభ్ దూబే బౌలింగ్లో తేజస్వీ దహియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది.టాస్ గెలిచిన కేకేఆర్టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కేకేఆర్కు చాలా కీలకం. కాగా ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ముకేశ్ కుమార్, కుల్దీప్ స్థానంలో అకిబ్ నబీ, త్రిపురానా జట్టులోకి వచ్చారు. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 36 సార్లు తలపడితే ఢిల్లీ 15 సార్లు, కేకేఆర్ 21 సార్లు నెగ్గాయి. సీజన్ తొలి అంచె పోటీల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.పంజాబ్, రాజస్తాన్లు ప్లేఆఫ్ రేసులో ఉన్నప్పటికీ కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో, ఢిల్లీ విధించే టార్గెట్ను 13 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది.ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి నిగిడి.కోల్కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్), మనీష్ పాండే, కెమెరూన్ గ్రీన్, రోవ్మన్ పావెల్, రింకు సింగ్, తేజస్వి దహియా(వికెట్కీపర్), అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, సౌరభ్ దూబే, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి.🚨 TOSS update from Kolkata🚨@KKRiders won the toss and will bowl first against @DelhiCapitals Updates ▶️ https://t.co/Uo07zwiknq#TATAIPL | #KhelBindaas | #KKRvDC pic.twitter.com/BS2ulpHJIT— IndianPremierLeague (@IPL) May 24, 2026 -
'మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు పట్టుకెళ్లాడు!'
శ్రీలంక క్రికెటర్ మతీశా పతీరానా ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా ముద్రపడిన పతీరానాను రూ. 18 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న పతీరానా సీజన్లో కేకేఆర్ ఆడిన 12 మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న పతీరానా గుజరాత్ టైటాన్స్తో జరిగిన గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. వచ్చీ రావడంతోనే తన ప్రతాపం చూపిస్తాడని అంతా భావించారు. కానీ విధి వింత నాటకం ఆడింది. గుజరాత్తో మ్యాచ్లో 8 బంతులు వేసిన అనంతరం పతీరానాకు కాలి పిక్క కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు. తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పతీరానా కేకేఆర్ జట్టును వీడి స్వదేశానికి వెళ్లిపోయినట్లు ఆ జట్టు ఫ్రాంచైజీ ఆదివారం తెలిపింది. ఇవాళ కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్తో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పతీరానా స్థానంలో లవ్నిత్ సిసోడియాతో భర్తీ చేయనున్నట్లు కేకేఆర్ తెలిపింది.ఈ సీజన్లో తన బౌలింగ్తో కేకేఆర్కు ఎక్స్-ఫ్యాక్టర్గా మారతాడని భావించిన కేకేఆర్కు నిరాశే మిగిలింది. పైగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్క మ్యాచ్ ఆడినా ఆటగాడికి మొత్తం పారితోషికం చెల్లించాల్సిందే. ఈ లెక్కన పతీరానా సీజన్లో ఒక్క మ్యాచ్లోనే ఆడినప్పటికీ అతనికి రూ. 18 కోట్లు దక్కనున్నాయి. దీంతో కేకేఆర్ అభిమానులు పతీరానాపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పతీరానా ఒక మోసగాడు.. కోలుకున్నానని అబద్ధం చెప్పి సర్టిఫికేట్ చూపించాడు.. కేకేఆర్ తరఫున ఈ సీజన్లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన పతీరానా డబ్బు మూటతో లంకకు వెళ్లిపోయాడు.. ఏం లాభం వచ్చాడు.. 18 కోట్లు పట్టుకెళ్లాడు.' అంటూ కామెంట్లు చేశారు.చదవండి: ‘హమ్మయ్య ఔట్ చేశా’.. వైభవ్ అంటే అంత భయమా? -
‘హమ్మయ్య ఔట్ చేశా’.. వైభవ్ అంటే అంత భయమా?
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఆటతో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టించాడు. క్రీజులోకి వచ్చిందే మొదలు బాదుడే పరమావధిగా పెట్టుకున్న 15 ఏళ్ల బీహార్ చిన్నోడు సీజన్లో 14 మ్యాచ్ల్లో 583 పరుగులు సాధించి రాజస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆదివారం ముంబై ఇండియన్స్తో రాజస్తాన్ ఆడిన తమ చివరి లీగ్ మ్యాచ్లో వైభవ్ నిరాశ పరిచాడు. చాహర్ వేసిన లెంగ్త్ బంతిని అంచనా వేయడంలో పొరబడిన వైభవ్ సూర్యవంశీ స్లాగ్ షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తాకి గాల్లోకి లేచింది. బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన నమన్ ధిర్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఆట ముగిసింది. ఈ నేపథ్యంలో వైభవ్ వికెట్ తీయగానే దీపక్ చాహర్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. 'హమ్మయ్యా ఔట్ చేశాను' అన్న తరహాలో చాహర్ సైగలు చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాహర్ వింత సెలబ్రేషన్ వెనుక ఒక బలమైన కారణముంది. అదేంటంటే ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఆటను ప్రదర్శించాడు. క్షణాల్లో ఆటను మార్చేసి ప్రత్యర్థి జట్లకు తలనొప్పిగా మారిపోయాడు. చాలా మ్యాచ్ల్లో అతడు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ అతని ఇంపాక్ట్ ఆటపై బలంగా ప్రభావం చూపించేది. అందుకే వైభవ్ను ఆరంభంలోనే ఔట్ చేయాలని అన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇదే సీజన్లో తొలి అంచె పోటీల్లో ముంబైతో మ్యాచ్లోనూ వైభవ్ 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి ముంబై బౌలింగ్ దళాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇది దృష్టిలో పెట్టుకున్న దీపక్ చాహన్ ఈసారి పక్కా ప్రణాళికతో వైభవ్ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. అందుకే పట్టరాని సంతోషంతో వినూత్న రీతిలో సెలబ్రేషన్ చేసుకున్నాడు. 2025 సీజన్లోనూ వైభవ్ సూర్యవంశీ మంచి ఆటతీరును ప్రదర్శించినప్పటికీ, ఈ సీజన్లో అతడి బలహీనతలు బయటపడతాయని అన్ని జట్లు భావించాయి. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీజన్ ఆద్యంతం విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. pic.twitter.com/YXigIYta2M— crictalk (@crictalk7) May 24, 2026చదవండి: వెల్ డన్ అర్జున్.. నువ్వు రెండింటినీ గెలిచావు: సచిన్ -
గంభీర్ చేతుల్లో సూర్యకుమార్ భవితవ్యం!
టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దీనికి సంబంధించి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. కెప్టెన్సీ పదవి పోయినప్పటికీ సూర్యకుమార్ బ్యాటర్గా తుదిజట్టులో కొనసాగుతాడని బీసీసీఐ పేర్కొంది. అయితే తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటర్గా పూర్తిగా విఫలమైన సూర్యకుమార్ తుది జట్టు నుంచే తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లో సూర్యకుమార్ భవితవ్యం ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ను తుదిజట్టులో ఆడించాలా వద్దా అనేది గంభీర్తో పాటు సెలెక్షన్ కమిటీ సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. ఫామ్లేమి దృశ్యా సూర్యకుమార్ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ, గంభీర్తో సూర్యకు ఉన్న సఖ్యత కారణంగా అదంత సులువు కాదనిపిస్తోంది. ఎందుకంటే సూర్య సారథ్యంలో టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్తో పాటు ఆసియాకప్ను గెలుచుకుంది.అయితే దాదాపు ఏడాదిగా భారత క్రికెట్ జట్టులో సూర్యకుమార్ స్థానంపై తీవ్రమైన పరిశీలన కొనసాగుతోంది, ఐదుగురు సెలెక్టర్లు కూడా అతడిని తుది జట్టులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా కెప్టెన్గా సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ బ్యాటర్గా మాత్రం రాణించడంలో విఫలమయ్యాడు. అయితే భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సూర్యకుమార్ను జట్టు నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్లో నిలకడగా రాణిస్తే సూర్యకుమార్కు చివరి చాన్స్ ఇద్దామని బీసీసీఐ భావించింది. కానీ సూర్యకుమార్ ఐపీఎల్ 2026 సీజన్లో దారుణ ప్రదర్శన కనబరచడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం, గంభీర్ నాయకత్వంలోని ఈ పరివర్తన దశలో భవిష్యత్ ప్రణాళిక, అధికార సమీకరణాలు మారుతుండటంతో భారత క్రికెట్ ఒక సంధి దశలో నిలబడి ఉంది. గణాంకాలు సూర్యకుమార్కు అనుకూలంగా లేనప్పటికీ, గౌతమ్ గంభీర్కు అతనిపై ఉన్న విశ్వాసం, అతనితో ఉన్న సంబంధం భారత టీ20 కెప్టెన్సీ భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు.చదవండి: ఆర్సీబీకి షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు! -
ఆర్సీబీకి షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో డిపెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్ హోదాకు తగ్గట్లే టేబుల్ టాపర్గా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. అయితే గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్ పోరుకు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ఓపెనర్గా రాణిస్తున్న జాకబ్ బెతెల్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. చేతి వేలి గాయంతో జాకబ్ బెతెల్ జట్టును వీడినట్లు ఆర్సీబీ యాజమాన్యం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే జూన్లో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీంతో స్వదేశంలో చేతి వేలి గాయానికి సంబంధించి మెరుగైన చికిత్స తీసుకోవడానికి ఇంగ్లండ్ వెళ్లినట్లు ఆర్సీబీ తెలిపింది. 'పంజాబ్తో జరిగిన మ్యాచ్లో జాకబ్ బెథెల్ ఎడమ చేతి వేలికి గాయమైంది. అయితే జూన్లో ఇంగ్లండ్కు కీలకమైన టెస్టు సిరీస్ ఉండడంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం ఇంగ్లండ్కు వెళ్లిపోయాడు' అని ఆర్సీబీ తమ ఎక్స్లో రాసుకొచ్చింది. కాగా ఇంగ్లండ్కే చెందిన మరో స్టార్ ఆటగాడు ఫిల్ సాల్ట్ గాయపడడంతో జట్టులో చోటు దక్కించుకున్న జాకబ్ బెతెల్ సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడాడు. ఫిల్ సాల్ట్ తిరిగొచ్చినప్పటికీ బెతెల్ రాణించడంతో జట్టులో అతడినే కంటిన్యూ చేసింది. అయితే మే 26న ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్తో జరగనున్న క్వాలిఫయర్-1 పోరుకు జాకబ్ బెతెల్ దూరం కావడంతో కోహ్లీతో కలిసి ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. అందుకే జాకబ్ బెతెల్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయడం లేదని ఆర్సీబీ మరో ప్రకటనలో పేర్కొంది. ఇక ఇంగ్లండ్ స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. జూన్ 4 నుంచి 8 మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా జాకబ్ బెతెల్ గాయంపై స్పందించింది. ‘న్యూజిలాండ్తో వచ్చే నెలలో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం జాకబ్ బెతెల్ను ఎంపిక చేశాం. తొలి టెస్టుకు ముందే జాకబ్ బెతెల్ గాయం తీవ్రతను పూర్తిగా అంచనా వేసేందుకు వైద్య బృందం పర్యవేక్షించనుంది’ అని పేర్కొంది.🚨 𝙊𝙛𝙛𝙞𝙘𝙞𝙖𝙡 𝘼𝙣𝙣𝙤𝙪𝙣𝙘𝙚𝙢𝙚𝙣𝙩: Jacob Bethell sustained an injury to his left ring finger during our game against PBKS. He will return to England to be assessed ahead of their Test series. ❤️🩹𝙶𝚎𝚝 𝚠𝚎𝚕𝚕 𝚜𝚘𝚘𝚗, 𝙹𝙱! 🫂 𝚆𝚎’𝚕𝚕 𝚖𝚒𝚜𝚜 𝚑𝚊𝚟𝚒𝚗𝚐 𝚢𝚘𝚞… pic.twitter.com/x6ipurfteA— Royal Challengers Bengaluru (@RCBTweets) May 23, 2026చదవండి: టెస్టు క్రికెట్లో ఐసీసీ కీలక మార్పులు! -
టెస్టు క్రికెట్లో ఐసీసీ కీలక మార్పులు!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంప్రదాయ టెస్టు క్రికెట్లో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఐసీసీ కమిటీ సమావేశం వర్చువల్గా జరిగింది. ఈ సమావేశంలో ఐసీసీ చైర్మన్ జై షా సహా ఐసీసీ క్రికెట్ కమిటీ హెడ్ సౌరవ్ గంగూలీ సహా తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సమవేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో వినియోగిస్తున్న ఎర్రబంతికి బదులు ఇకపై పింక్ బంతిని వినియోగంలోకి తీసుకురావాలనే యోచనలో ఐసీసీ ఉంది. దీనితో పాటు టీ20 క్రికెట్లో ఇన్నింగ్స్ విరామ సమయాలు, డ్రింక్స్ బ్రేక్ల సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వడం సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఐసీసీ టెస్టు ఫార్మాట్లో వేర్వేరు రంగుల బంతులను ఉపయోగించడాన్ని పరిశీలిస్తోంది. అందువల్ల, సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ సమయంలో ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతికి మారే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితులలో, వాతావరణ అంతరాయాలు ఏర్పడినప్పుడు లైట్ల వెలుగులో ఆటను కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరిస్తే, జట్లకు ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతిని ఉపయోగించడానికి అనుమతి లభించనుంది. ప్రతిపాదిత మార్పుల వివరాలు ఇంకా ఖరారు కానప్పటికీ, ఒక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఎరుపు బంతి నుండి గులాబీ బంతికి మారే ప్రక్రియను ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. డ్రింక్స్ విరామ సమయంలో హెడ్ కోచ్ను మైదానంలోకి అనుమతించడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే దీనిని వన్డే క్రికెట్లో తీసుకురావాలని ఐసీసీ యోచిస్తోంది. మైదానంలోకి హెడ్కోచ్..ఇప్పటివరకు సబ్స్టిట్యూట్ ఆటగాళ్లకు మాత్రమే డ్రింక్స్ విరామంలో మైదానంలోకి అనుమతి ఉంది. భవిష్యత్తులో డ్రింక్స్ విరామాల్లో హెడ్కోచ్ను కూడా మైదానంలోకి అనుమతిస్తే, అతడు జట్టు జెర్సీ వేసుకొని రావాలా లేక సాధారణంగా రావాలా అనేది నిర్ణయించాల్సి ఉంది. ఇక వన్డే క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో రెండు డ్రింక్స్ విరామాలు ఉండేలా మార్పులు చేయనున్నారు. ఒక ఇన్నింగ్స్లో ప్రతీ డ్రింక్స్ బ్రేక్కు గంటా 10 నిమిషాల వ్యవధి ఉండనుంది.ఇన్నింగ్స్ విరామంపై కీలక నిర్ణయంఇక టీ20 క్రికెట్లో ఇన్నింగ్స్ విరామ సమయాన్ని తగ్గించాలని ఐసీసీ సమావేశంలో ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఉన్న 20 నిమిషాల సమయాన్ని 15 నిమిషాలకు కుదించాలని నిర్ణయించింది. దీంతో రాబోయే రోజుల్లో టీ20 క్రికెట్లో ఒక ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం రెండో ఇన్నింగ్స్ 15 నిమిషాల్లోనే ప్రారంభమయ్యేలా చూసుకోవాలని ఐసీసీ తెలిపింది. మే 30న అహ్మదాబాద్లో జరగనున్న మలి విడత సమావేశంలో ఐసీసీ బోర్డు దీనిపై స్పష్టతనివ్వనుంది.చదవండి: కోహ్లీకి ఎదురుపడితే ఈసారి దబిడిదిబిడే! -
IPL 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం
ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్ధానానికి చేరుకుంది. తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.లక్నో నిర్ధేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ అద్భుత విజయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర.అయ్యర్ అజేయ సెంచరీతో సత్తాచాటాడు. కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శ్రేయస్.. 11 ఫోర్లు, 5 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 69) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు, అర్జున్ టెండూల్కర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో జోష్ ఇంగ్లిష్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 43) టాప్ స్కోరర్గా నిలవగా.. అయూశ్ బదోని(43), అబ్దుల్ సమద్(37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జానెసన్, చాహల్ తలా రెండు వికెట్లు సాధించాడు.15 ఓవర్లలో 162/315 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో ప్రబ్సిమ్రన్ (69) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.నిలకడగా ఆడుతున్న పంజాబ్12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(48), ప్రభ్సిమ్రాన్ సింగ్(56) ఉన్నారు.8 ఓవర్లలో పంజాబ్ 79/28 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (28), ప్రబ్సిమ్రన్ సింగ్ (30) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్లక్నోతో మ్యాచ్లో 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. తొలి వికెట్గా ప్రియాన్ష్ ఆర్య గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక 18 పరుగులు చేసిన కూపర్ కనోలీ షమీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అవడంతో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రబ్సిమ్రన్ (2), అయ్యర్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.పంజాబ్ టార్గెట్ 197 పరుగులుపంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్ జోస్ ఇంగ్లిస్ (44 బంతుల్లో 72) అర్థసెంచరీతో రాణించాడు. ఆయుశ్ బదోని (43), అబ్దుల్ సమద్ (20 బంతుల్లో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. పంజాబ్ బౌలర్లలో చాహల్, మార్కో జాన్సెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన లక్నోలక్నో ఇన్నింగ్స్ను నిలబెట్టిన జోస్ ఇంగ్లిస్ (72) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. శశాంక్ సింగ్ బౌలింగ్లో లాంగ్ ఆన్ దిశగా ఇంగ్లిస్ షాట్ ఆడినప్పటికీ అయ్యర్ చేతికి చిక్కాడు. 18 ఓవర్లో ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.మూడో వికెట్ కోల్పోయిన లక్నోధాటిగా ఆడుతున్న ఆయుశ్ బదోనీ (43) రూపంలో లక్నో సూపర్జెయింట్స్ 69 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్లో షాట్కు యత్నించి విఫలమైన బదోని కీపర్ ప్రబ్సిమ్రన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఇంగ్లిస్ (24), పంత్ (6) పరుగులతో ఆడుతున్నారు.రెండు వికెట్లు కోల్పోయిన లక్నోపంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 2 పరుగులు చేసిన నికోలస్ పూరన్ను మార్కో జాన్సెన్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. అంతకముందు ఓపెనర్ అర్షిన్ కులకర్ణి అజ్మతుల్లా ఒమర్జయ్ బౌలింగ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి లక్నో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. బదోని (20), ఇంగ్లిస్ (18) పరుగులతో ఆడుతున్నారు.టాస్ గెలిచిన పంజాబ్టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్కు చావో రేవో లాంటిది. మ్యాచ్లో లక్నోపై విజయం సాధిస్తే పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో ప్లేఆఫ్స్ పోటీలో ఉన్న కేకేఆర్, రాజస్తాన్లు తమ చివరి మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ లక్నో చేతిలో పంజాబ్ ఓటమి చవిచూస్తే మాత్రం ఆ జట్టు ఇంటిబాట పట్టాల్సిందే. అప్పుడు కేకేఆర్, రాజస్తాన్లు ప్లేఆఫ్స్ పోటీలో ఉంటాయి.లక్నో సూపర్ జెయింట్స్: జోష్ ఇంగ్లిస్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.🚨Toss update from Lucknow 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @LucknowIPLUpdates ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS pic.twitter.com/FZTDevYeis— IndianPremierLeague (@IPL) May 23, 2026 -
కోహ్లీకి ఎదురుపడితే ఈసారి దబిడిదిబిడే!
ఐపీఎల్ 2026 సీజన్లో శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ విజయం కన్నా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్కు షేక్హ్యాండ్ ఇవ్వడానికి కోహ్లీ నిరాకరించడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. వివాదం జరిగి ఒకరోజు కావొస్తున్నా ఇంకా ఆ వేడి తగ్గలేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లు క్వాలిఫయర్లో ఎదురుపడే అవకాశం లేదు. కానీ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ ఓడి, ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం.. క్వాలిఫయర్-2 పోరులో ఈ రెండు జట్లు మళ్లీ తలపడనున్నాయి.అలా కాకుండా క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గెలిచి.. మరోవైపు ఎలిమినేటర్తో పాటు క్వాలిఫయర్-2లోనూ ఎస్ఆర్హెచ్ గెలిచి ఫైనల్ చేరితే మాత్రం, తుది పోరులో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఏది ఏమైనప్పటికీ కోహ్లీ మాత్రం ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాడు. మరోమారు ఎస్ఆర్హెచ్తో ఆర్సీబీ మ్యాచ్ ఆడితే మాత్రం హెడ్కు దబిడిదిబిడి అయ్యేలాగే పరిస్థితులు ఉన్నట్లు అభిమానులు పేర్కొంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అసలేం జరిగిందంటే..ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్ @కాస్త బౌండరీలు కొట్టు* అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోహ్లీ దీనిని సీరియస్గా తీసుకున్నాడని స్పష్టంగా తెలిసొచ్చింది.You could easily notice that every time Venkatesh Iyer found the boundary, Kohli kept throwing Travis Head-related gestures. He sparked the whole drama himself, didn’t even shake hands afterward.His arrogance is on another level. 🥵pic.twitter.com/HEnvHnLjEw— Yorker__93™ (@Boom__93) May 23, 2026 255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: అభిమానికి రోహిత్ క్షమాపణ.. ఎందుకంటే? -
అభిమానికి రోహిత్ క్షమాపణ.. ఎందుకంటే?
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తన అభిమానికి క్షమాపణ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ను ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ఆడింది. పూర్తి వన్సైడ్గా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. కేకేఆర్కు సొంత స్టేడియం కావడంతో ఆ జట్టుకు భారీగా అభిమానులు వచ్చినప్పటికీ, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా మంది అభిమానులు ముంబై ఇండియన్స్ బస చేసే హోటల్ ముందు ఆటగాళ్ల కోసం నిరీక్షించారు. ముఖ్యంగా రోహిత్ శర్మను చూడడం కోసం చాలాసేపు ఎదురుచూశారు. అందులోనే ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది. రోహిత్ బయటకు వచ్చినప్పటికీ ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. దీంతో ఆ అమ్మాయి ఎమోషనల్ అయ్యి ఏడ్వడం ప్రారంభించింది. దీనిని వీడియో తీసిన కొందరు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోను చూసిన రోహిత్ శర్మ వెంటనే క్షమాపణతో కూడిన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 'టెన్షన్, గందరగోళం మధ్య వీటన్నింటిని పట్టించుకోవడం కాస్త కష్టమని రోహిత్ తెలిపాడు. అయితే నాకోసం నిరీక్షించిన చిన్న అమ్మాయిని కలవకపోడం బాధగా అనిపించింది. నా చర్య పట్ల క్షమాపణ చెబుతున్నా. మరో విషయం ఏంటంటే ఈసారి ఎప్పుడు కోల్కతాకు వచ్చినా ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతానని అందరికీ వాగ్దానం చేస్తున్నా.' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ ఒక అభిమానికి ఇలా క్షమాపణ చెబుతూ ప్రత్యేకంగా వీడియో విడుదల చేయడంపై అభిమానులు తెగ సంతోషపడిపోయారు. 'రోహిత్ తనను ఇష్టపడే వ్యక్తులను ఎప్పుడు బాధపెట్టడానికి ఇష్టపపడడని' కామెంట్లు చేస్తున్నారు. కేకేఆర్తో మ్యాచ్లో రోహిత్ శర్మ పెద్దగా రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ సౌరభ్ దూబే బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ సీజన్లో గాయంతో పలు మ్యాచ్లకు దూరమైన రోహిత్ 8 మ్యాచ్ల్లో 283 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ పాండ్యా (26) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం కేకేఆర్ స్వల్ప టార్గెట్ను ఛేదించడానికి కష్టపడినప్పటికీ మనీష్ పాండే, రోవ్మెన్ పావెల్ మధ్య 64 పరుగుల భాగస్వామ్యం కేకేఆర్ను విజయతీరాలకు చేర్చింది. ఇప్పటికే సీజన్ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ముంబై తమ చివరి లీగ్ మ్యాచ్ను రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది.Rohit Sharma apologized to the fangirl who started crying at Eden Gardens after not being able to meet him. Rohit made a special video for her and said sorry, and he also promised that he would meet her the next time he comes to Kolkata.🥹❤️bRO doesn’t disappoint his fans.🙌 pic.twitter.com/NA5FR9AlMM— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 23, 2026చదవండి: ఎస్ఆర్హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్! -
ఎస్ఆర్హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 255 పరుగులు భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరుజట్లు ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఎస్ఆర్హెచ్ రెండో స్థానంలో ప్లేఆఫ్కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ చేయడంతో రెండో స్థానంలో నిలవాలంటే 90 ప్లస్ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ సంగతి పక్కనబెడితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెనిరిచ్ క్లాసెన్లు ఒక అరుదైన రికార్డు తమ పేరిట లిఖించుకున్నారు. ఆర్సీబీతో మ్యాచ్లో ఈ ముగ్గురు త్రిమూర్తులు అర్థసెంచరీలతో చెలరేగారు. ఈ సీజన్లో అభిషేక్, క్లాసెన్, ఇషాన్లు 500 పరుగుల మార్క్ను దాటారు. తద్వారా ఒకే ఎడిషన్లో ఒక జట్టు నుంచే ముగ్గురు బ్యాటర్లు 500 ప్లస్ పరుగులు సాధించడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. గతంలో గుజరాత్ టైటాన్స్ 2025లో ఈ ఫీట్ను నమోదు చేసింది. ఆ సీజన్లో సాయి సుదర్శన్ (600 పరుగులు), శుబ్మన్ గిల్ (759 పరుగులు), బట్లర్ (538 పరుగులు) సాధించారు. తాజా సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున క్లాసెన్ (606 పరుగులు), అభిషేక్ శర్మ (563 పరుగులు) ఐదొందల మార్క్ దాటగా, తాజాగా ఆర్సీబీతో మ్యాచ్లో ఫిఫ్టీ సాధించడం ద్వారా ఇషాన్ కిషన్ కూడా 500 మార్క్ దాటి 569 పరుగులతో ఆరెంజ్క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు. MAXIMUMS x 2️⃣🎥 Abhishek Sharma was in his element 👊🧡Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/exdErsz4bp— IndianPremierLeague (@IPL) May 22, 2026A six-hitting Master-KLAAS on show 🍿🎥 Heinrich Klaasen going big against Josh Hazlewood 💥💥Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/DGYE4ND2WN— IndianPremierLeague (@IPL) May 22, 2026 The ball literally flew to every single corner of the ground tonight 🚀Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/8pR8qvDCnC— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
స్టార్ ప్లేయర్ దూరం.. కేకేఆర్కు ఎదురుదెబ్బ!
ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్ రేసులో ఉన్న కోల్కతా నైట్రైడర్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేకేఆర్ ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్కు దూరమైనట్లు కేకేఆర్ యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేకేఆర్ ఈ సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో ఢీలా పడింది. అయితే రెండో అంచె మ్యాచ్ల్లో వరుస విజయాలతో మళ్లీ ట్రాక్ ఎక్కిన కేకేఆర్ ఇప్పుడు ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్ల్లో 6 విజయాలతో 13 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. అయితే కేకేఆర్ కంటే మెరుగైన రన్రేట్తో ఉన్న పంజాబ్ ఐదో స్థానంలో ఉండగా, రాజస్తాన్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్, రాజస్తాన్లు తమ చివరి మ్యాచ్ల్లో ఓడిపోయి, కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిస్తే ప్లేఆఫ్స్లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో అంగ్క్రిష్ రఘువంశీ దూరమవ్వడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఈ సీజన్లో అంగ్క్రిష్ రఘువంశీ తన బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. 13 మ్యాచ్ల్లో 146 స్ట్రైక్రేట్తో 422 పరుగులు సాధించాడు. అయితే కేకేఆర్ జట్టులో రఘువంశీ కంటే నాణ్యమైన క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ వారెవరూ ప్రభావం చూపలేకపోయారు. కానీ అంగ్క్రిష్ రఘువంశీ ప్రతీ మ్యాచ్లో స్థిరంగా రాణించి ఇవాళ కేకేఆర్ ప్లేఆఫ్ రేసులో నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
మతి తప్పిన నేపాల్ క్రికెటర్.. ముందుంది ముసళ్ల పండగ!
నేపాల్ స్టార్ క్రికెటర్ రోహిత్ పౌడెల్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను ఔట్ కాదని క్లియర్గా తెలుస్తున్నప్పటికీ అంపైర్ ఔట్గా ఇవ్వడంపై రోహిత్ పోడెల్ ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ లీగ్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా అమెరికాతో మ్యాచ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 38వ ఓవర్ మిలింద్ కుమార్ వేశాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ విఫలం కావడంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే మిలింద్ కుమార్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. బంతి ప్యాడ్లకు తాకలేదని ఒకవైపు రోహిత్ చెబుతూనే ఉన్నప్పటికీ అంపైర్ ఔటిచ్చాడు. అంపైర్ నిర్ణయంతో షాక్కు గురైన రోహిత్ పౌడెల్ అంపైర్వైపు కోపంగా చూశాడు. ఆ తర్వాత బ్యాట్ను పిచ్పై బలంగా కొట్టి చేసేదేం లేక నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో బంతి ప్యాడ్లను తాకలేదు, కానీ గ్లోవ్స్ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్ ఔట్ ఇచ్చిన తర్వాత తిట్టడం, బ్యాట్ను పడేయడం, బ్యాట్తో మైదానాన్ని కొట్టుకుంటూ వెళ్లడం, బౌండరీ లైన్ను కాళ్లతో తన్నడం వంటివి నిషిద్ధం. అయితే రోహిత్ పౌడెల్ బ్యాట్ను బలంగా పిచ్కు కొట్టడంతో నిబంధన ఉల్లఘించినట్లయింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లఘించిన రోహిత్ పౌడెల్పై లెవెల్ 1 లేదా లెవెల్ 2 కింద చర్యలు తీసుకునే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే అమెరికాపై నేపాల్ 122 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఇషాన్ పాండే (84), దీపేంద్ర సింగ్ (59) అర్థసెంచరీలతో రాణించగా.. రోహిత్ పౌడెల్ (46), ఆసిఫ్ షేక్ (43) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. శుభమ్ రంజనే మూడు వికెట్లు తీశాడు. అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 41.2 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. సంజయ్ కృష్ణమూర్తి (56) అర్థసెంచరీతో రాణించాడు. నేపాల్ బౌలర్లలో సందీప్ లమిచ్చానే 3 వికెట్లు తీయగా, లలిత్, దీపేంద్ర సింగ్, గుల్షన్ జా తలా రెండు వికెట్లు పడగొట్టారు. There have been no shortage of poor umpiring decisions during the ongoing ODI tri series in Nepal. Add this from today to the list. Nepal captain Rohit Paudel given lbw on a ball that never hit his pads, appeal upheld from USA bowler Milind Kumar on gloved sweep into the ground. pic.twitter.com/KN9PwL1s7A— Peter Della Penna (@PeterDellaPenna) May 22, 2026చదవండి: ఉగ్రవాదితో షాహిద్ అఫ్రిది డిన్నర్!


