చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు | VHT: Ayush Mhatre Scripts History, Shatters Yashasvi Jaiswal's World Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు

Published Tue, Dec 31 2024 3:28 PM | Last Updated on Tue, Dec 31 2024 3:37 PM

VHT: Ayush Mhatre Scripts History, Shatters Yashasvi Jaiswal's World Record

ముంబై యువ సంచలనం ఆయుశ్‌ మాత్రే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ భారీ సెంచరీ చేశాడు. 

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో (50 ఓవర్ల ఫార్మాట్‌) ఇంత చిన్న వయసులో 150 ప్లస్‌ స్కోర్‌ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్‌ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్‌ స్కోర్‌ చేశాడు.  

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో 150 ప్లస్‌ చేసిన ఆటగాళ్లు
ఆయుశ్‌ మాత్రే 17 ఏళ్ల 168 రోజులు
యశస్వి జైస్వాల్‌ 17 ఏళ్ల 291 రోజులు
రాబిన్‌ ఉతప్ప 19 ఏళ్ల 63 రోజులు
టామ్‌ ప్రెస్ట్‌ 19 ఏళ్ల 136 రోజులు

మాత్రే ఇన్నింగ్స్‌ విషయానికొస్తే.. నాగాలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్‌. ఈ మ్యాచ్‌లో మాత్రే.. అంగ్‌క్రిశ్‌ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించాడు. 

ఇన్నింగ్స్‌ ఆఖర్లో కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ సునామీ ఇన్నింగ్స్‌ (28 బంతుల్లో 73 నాటౌట్‌; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడటంతో ముంబై భారీ స్కోర్‌ చేసింది. శార్దూల్‌ సిక్సర్ల సునామీ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

ముంబై ఇన్నింగ్స్‌లో బిస్త 2, సిద్దేశ్‌ లాడ్‌ 39, సుయాంశ్‌ షేడ్గే 5, ప్రసాద్‌ పవార్‌ 38, అంకోలేకర్‌ 0, హిమాన్షు సింగ్‌ (5) పరుగులు చేశారు. నాగాలాండ్‌ బౌలర్లలో దిప్‌ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్‌, జే సుచిత్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్‌ 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 42 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. బ్యాట్‌తో మెరిసిన శార్దూల్‌ ఠాకూర్‌ (4-1-12-2) బంతితోనూ సత్తా చాటాడు. రాయ్‌స్టన్‌ డయాస్‌ రెండు, సుయాన్ష్‌ షేడ్గే ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

నాగాలాండ్‌ ఇన్నింగ్స్‌లో డేగా నిశ్చల్‌ (5), హేమ్‌ చెత్రి (2), యుగంధర్‌ సింగ్‌ (0), కెప్టెన్‌ రాంగ్‌సెన్‌ జొనాథన్‌ (0), చేతన్‌ బిస్త్‌ (0) ఔట్‌ కాగా.. రుపేరో (22), జే సుచిత్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నాగాలాండ్‌ గెలవాలంటే 36 ఓవర్లలో 362 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు, టీమిండియా స్టార్‌ ప్లేయర్లు శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే ఆడటం లేదు. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ముంబై మేనేజ్‌మెంట్‌ పై ముగ్గురికి విశ్రాంతినిచ్చింది. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement