
టీ20 వరల్డ్కప్ ఛాంపియన్స్ టీమిండియాకు జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. హరారే వేదికగా భారత్తో జరిగిన తొలి టీ20లో 13 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత్ చతికల పడింది.
జింబాబ్వే బౌలర్ల దాటికి భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా నడ్డివిరచగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందిచాడు. బ్యాటింగ్లో విఫలమవకావడంతోనే ఓటమిపాలైమని గిల్ తెలిపాడు.
"ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. మేము తొలుత అద్భుతంగా బౌలింగ్ చేశాము. కానీ ఫీల్డింగ్లో మాత్రం మా మార్క్ చూపించలేకపోయాం. ఇక బ్యాటింగ్లో ప్రతీ ఒక్కరం పూర్తి స్వేఛ్చగా ఆడాలని నిర్ణయించుకున్నాము.
కానీ అందుకు తగ్గ విధంగా ఆడలేకపోయాం. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డాం. మా ఇన్నింగ్స్ సగం ముగిసే సరికి మేము 5 వికెట్లు కోల్పాయం. కానీ నేను ఇంకా క్రీజులో ఉండడంతో గెలుస్తామన్న నమ్మకం ఉండేది.
కానీ దురదృష్టవశాత్తూ నేను కూడా పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. నేను ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే లక్ష్యం 115 పరుగులే కావడంతో ఆఖరి వరకు మాకు గెలుపు పై ఆశలు ఉండేవి. కానీ మేము అనుకున్నది జరగలేదు.
ఎక్కడ తప్పు జరిగిందో మేము సమీక్షించుకుంటాము. తర్వాతి మ్యాచ్ల్లో ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment