
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో టాప్-5లో చోటు దక్కించుకున్న ఏకైక ఆసియా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో మంధన మూడు (వన్డేల్లో), ఐదు (టీ20ల్లో) స్థానాల్లో నిలిచింది.
రెండు రోజుల కిందట (జూన్ 16) సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో శతక్కొట్టడంతో (117) మంధన వన్డే ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. టీ20ల విషయానికొస్తే.. మంధన గత వారంలో ఉన్న ఐదో స్థానాన్ని పదిలంగా కాపాడుకుంది.
ఆసియా జట్ల నుంచి వన్డే ర్యాంకింగ్స్లో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. టీ20 ర్యాంకింగ్స్లో ఆమె ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ మంధన తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ (11వ స్థానం), దీప్తి శర్మ (20) టాప్-20లో ఉన్నారు. టీ20ల్లో మంధన తర్వాత హర్మన్ప్రీత్ (13), షఫాలీ వర్మ (15), జెమీమా రోడ్రిగెజ్ (19) టాప్-20లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, మహిళల జట్ల ర్యాంకింగ్స్లో టీమిండియా వన్డేల్లో ఐదు, టీ20ల్లో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండు ఫార్మాట్లలో టాప్ ర్యాంక్లో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment