హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసిన సన్రైజర్స్ లీడ్స్ సహ యజమాని కావ్యా మారన్కు భారీ షాక్ తగిలింది. అబ్రార్ ఎంపిక జరిగిన కొన్ని గంటలకే సన్రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయ్యింది.
అబ్రార్ను కొనుగోలు చేసిన వార్త బయటికి రాగానే భారత క్రికెట్ అభిమానులు సోషల్మీడియా వేదికగా కావ్యా మారన్, సన్రైజర్స్ లీడ్స్పై విరుచుకుపడ్డారు. పాక్ ఆటగాడిని ఎలా కొనుగోలు చేస్తారంటూ అసభ్యపదజాలాలతో దుమ్మెత్తిపోశారు. సన్రైజర్స్ను బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు.
భారీ ట్రోలింగ్ నేపథ్యంలో ఎక్స్ సన్రైజర్స్ లీడ్స్ ఖాతాను సస్పెండ్ చేసింది. వారి అకౌంట్ను యాక్సెస్ చేయాలని ప్రయత్నించిన వారికి “Account suspended. X suspends accounts that violate the X rules” అనే సందేశం కనిపించింది. ఇది భారతీయ అభిమానుల నుంచి పెల్లుబికిన ఆగ్రహజ్వాలల నేపథ్యంలో తీసుకున్న చర్చగా తెలుస్తుంది.
కాగా, నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్ లీగ్ తొట్టతొలి వేలంలో సన్రైజర్స్ లీడ్స్ అబ్రార్ను 190,000 పౌండ్ల (సుమారు ₹2.34 కోట్లు) భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. హండ్రెడ్ లీగ్ వేలంలో పాక్ ప్లేయర్ను కొన్న ఏకైక భారతీయ ఫ్రాంచైజీగా సన్రైజర్స్ లీడ్స్ నిలిచింది.
ఈ లీగ్ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్తో పాటు వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మాత్రమే అమ్ముడుపోయాడు. ఉస్మాన్ తారిక్ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.
ఈ వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు (లండన్ స్పిరిట్) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్కు దక్కింది. అతన్ని వెల్ష్ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.


