
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కష్టతరమైన పిచ్పై ఈ స్కోర్ ఫైటింగ్ స్కోర్గా చెప్పవచ్చు.
ఈ స్కోర్ను ఛేదించే క్రమంలో దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లండ్కు టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ కళ్లెం వేశాడు. 20 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు (బట్లర్, మొయిన్ అలీ, బెయిర్స్టో) తీసి టీమిండియా గెలుపుకు పునాది వేశాడు.
అక్షర్ రెచ్చిపోవడంతో డిఫెన్స్లో పడిపోయిన ఇంగ్లండ్.. ఆతర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అక్షర్తో పాటు మరో ఎండ్లో కుల్దీప్ యాదవ్ (4-0-19-3), బుమ్రా (2.4-0-12-2) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
ఆ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 2022 ఎడిషన్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనానికి పునాది వేసిన అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment