
చెస్ ఒలింపియాడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్లు విరామం తర్వాత తదుపరి పోటీలను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. మంగళవారం విశ్రాంతి దినం తర్వాత బుధవారం పురుషుల జట్టు చైనాను ఢీకొంటుండగా, మహిళల జట్టు జార్జియాతో తలపడుతుంది.
భారత జట్లు ఈ టోర్నీలో వరుసగా ఆరు రౌండ్లలోనూ విజయాలు సాధించాయి. పురుషుల జట్టులో భారత నంబర్వన్ ర్యాంకర్ ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ కీలక పాత్ర పోషిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. చైనా గట్టి ప్రత్యర్థి కావడంతో ఈ మ్యాచ్ ఫలితం భారత్ పతక వేటను శాసించనుంది.
తర్వాత అమెరికా, ఉజ్బెకిస్తాన్లతో భారత పురుషుల జట్టు తలపడుతుంది. మహిళల ఈవెంట్లో జార్జియా కూడా కఠినమైన ప్రత్యర్థే కావడంతో ఏడో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్లకు కష్టమైన సవాళ్లు ఎదురవనున్నాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి భారత జట్లు 12 పాయింట్లతో పురుషుల, మహిళల కేటగిరీలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment