మంత్రి ప్రోద్బలం.. రెవెన్యూ దౌర్జన్యం
పెనుకొండ రూరల్: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి పెనుకొండలో మంత్రి సవిత దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. గురువారం వైఎస్సార్ సీపీకి చెందిన సింగిల్విండో మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి భూమిని రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా సాధీనం చేసుకున్నారు. ఈ స్థలంపై కోర్టులో వాజ్యం నడుస్తున్నప్పటికీ మంత్రి ప్రోద్బలంతో భారీగా పోలీస్ బందోబస్తుతో అధికారులు అక్కడకు చేరుకుని జేసీబీ ద్వారా మామిడి మొక్కలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.
ఏం జరిగిందంటే...
శెట్టిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 28–2 లెటర్లో 28 సెంట్ల భూమి కృష్ణారెడ్డికి వారసత్వంగా సంక్రమించింది. కరణం వెంకోబరావు నుంచి ఈ భూమిని కృష్ణారెడ్డి తాత కొనుగోలు చేశారు. ఆ తర్వాత కృష్ణారెడ్డి తండ్రి సుబ్బిరెడ్డి పేరుతో పాసు పుస్తకాన్ని రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. అనంతరం ఆ భూమిని కృష్ణారెడ్డి తన భార్య అర్చన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఈసీ, రిజస్ట్రేషన్ డాక్యూమెంట్లు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక కృష్ణారెడ్డిపై టీడీపీ నేతలు కక్ష సాధింపులకు దిగారు. ఈ క్రమంలోనే మంత్రి సవిత ప్రోద్బలంతో సంబంధం లేని వ్యక్తులను కరణం వెంకోబరావు వారసులుగా చిత్రీకరించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టులో పరిధిలో ఉంది. ఈ క్రమంలోనే గురువారం తహసీల్దార్ శ్రీధర్, ఆర్ఐ భాస్కర్రెడ్డి తదితరులు కృష్ణారెడ్డికి చెందిన స్థలం వద్దకు వచ్చి ఆ స్థలంలో ఉన్న మామిడి చెట్లను జేసీబీతో తొలగించారు. అనంతరం పంచనామా నిర్వహించి వెంకోబరావు వారసులుగా చెబుతున్న వారికి స్థలాన్ని స్వాధీనం చేశారు.
దౌర్జన్యంగా లాక్కున్నారు
శెట్టిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 28–2 లెటర్లో 28 సెంట్ల స్థలం మా తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తోంది. ఇటీవల ఆర్ఐ భాస్కర్రెడ్డి, వీఆర్ఓ తేజ నా వద్దకు వచ్చి నాలుగు సెంట్ల స్థలం అంగన్వాడీ కేంద్రం కోసం ఇవ్వాలని కోరగా నేను సమ్మతించాను. అయినా రాజకీయ కక్షతో నా భూమిని అక్రమంగా లాక్కొన్నారు. నా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాసు పుస్తకం ఉన్నాయి. ప్రస్తుతం నేను భూమిలో ఉన్నాను. – కృష్ణారెడ్డి, బాధితుడు
వైఎస్సార్సీపీ నేత భూమి స్వాధీనం
ఇప్పటికే కోర్టులో నడుస్తున్న వాజ్యం
అయినా పట్టుబట్టి స్వాధీనం చేసుకున్న అధికారులు
మంత్రి ప్రోద్బలం.. రెవెన్యూ దౌర్జన్యం
Comments
Please login to add a commentAdd a comment