
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్స్ రచిస్తోంది. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇక, తెలంగాణ విషయంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది.
వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ సారధిగా నియమించినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకత్వాన్ని సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రొజెక్ట్ చేయనున్నట్టు సమాచారం. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు, ఈటల రాజేందర్ ఈరోజు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఢిల్లీలోనే ఉండి అధిష్టానం పెద్దలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ మేథోమథనం జరిపింది. రెండు రోజుల పాటు దాదాపు పది గంటలు నేతలు సమాలోచనలు చేశారు. కాగా, అధిష్టానం నిర్ణయంతో తెలంగాణ బీజేపీలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: నా టార్గెట్ బీఆర్ఎస్.. వడ్డీతోసహా చెల్లిస్తా: పొంగులేటి
Comments
Please login to add a commentAdd a comment