సోషల్‌ మీడియా ద్వారా చెప్పాలి | CM interview with farmers | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా ద్వారా చెప్పాలి

Published Fri, Jul 19 2024 4:36 AM | Last Updated on Fri, Jul 19 2024 4:36 AM

CM interview with farmers

రైతులతో సీఎం ముఖాముఖి.. రుణమాఫీ సందర్భంగా మాటామంతి 

సాక్షి, హైదరాబాద్‌:  తొలి విడత రుణమాఫీ సందర్భంగా గురువారం సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల రైతులతో మాట్లాడారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్‌ జిల్లాకు నీళ్లు ఇస్తామని ఆ జిల్లాలోని తాంసీ మండలం బండల్‌ నాగాపూర్‌ గ్రామానికి చెందిన రైతు మహేందర్‌కు చెప్పారు. వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల రైతులతో కూడా ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడారు. 

సీఎం, మహేందర్‌ మధ్య సంభాషణ ఇలా.. 
సీఎం: ఎంత భూమి ఉంది మహేందర్‌? 
మహేందర్‌: ఎకరం ఉంది సార్‌. 
సీఎం: రుణం ఎంత ఉంది..? 
మహేందర్‌: రూ.50 వేలు ఉంది. ఒకేసారి రుణం తీరిపోతున్నందుకు సంతోషంగా ఉంది. 
సీఎం: రైతుల కష్టాలు, ఆదివాసుల కష్టాలు తెలుసుకుంటుందనే సీతక్కను మీ జిల్లాకు ఇన్‌చార్జిగా మంత్రిగా వేశాం. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నావా? 
మహేందర్‌: ఉన్నాను సార్‌. 
సీఎం: రైతు రుణమాఫీ గురించి సోషల్‌ మీడియా ద్వారా చెబుతావా? 
మహేందర్‌: చెబుతా. 
సీఎం: ధన్యవాదాలు మహేందర్‌.. మీ జిల్లాలో ప్రాణహితపై తుమ్మడిహెట్టిప్రాజెక్టుతో నీళ్లు ఇస్తాం. 

వరంగల్‌ జిల్లా ఎల్లయ్యతో.. 
ఎల్లయ్య: రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుండటంతో పండగ రోజులా అనిపిస్తోంది. 
సీఎం: రుణమాఫీ డిక్లరేషన్‌ వరంగల్‌లోనే చేశాం తెలుసా? 
ఎల్లయ్య: తెలుసు సార్‌. వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. 
సీఎం: ఆ సభకు వచ్చావా? 
ఎల్లయ్య: వచ్చా... 
సీఎం: వరంగల్‌లో సభ పెట్టి రాహుల్‌గాందీని పిలుద్దామా? 
ఎల్లయ్య: పిలిచి కృతజ్ఞతలు తెలుపుదాం. 
సీఎం: సభకు వస్తావా..? 
ఎల్లయ్య: నేను తప్పకుండా వస్తా.. వరంగల్‌ జిల్లా అంటేనే రైతులు. సభకు నాతో పాటు రైతులను తీసుకువస్తా. 

ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం రైతు సీతారాంతో.. 
సీతారాం: రుణమాఫీతో సంతోషం కలిగింది. యువ రైతులకు సాగు చేయాలనే సంకల్పాన్ని మీరు కలి్పంచారు. 
సీఎం: సీతారాం ఎంత భూమి ఉంది? ఎంత అప్పు ఉంది? 
సీతారాం: నాలుగున్నర ఎకరాల భూమి, రూ.78 వేల అప్పు ఉంది. 
సీఎం: మొత్తం రుణమాఫీ అవుతోంది. మీకు ఎలా ఉంది..? 
సీతారాం: చాలా సంతోషంగా ఉంది.. మీరు చల్లగా ఉండాలి. 
సీఎం: పిల్లలు ఎంతమంది సీతారాం? 
సీతారాం: ఇద్దరు పాపలు. పెద్ద పాప ఇంటర్, చిన్న పాప పదో తరగతి చదువుతున్నారు. 
సీఎం:ఇద్దరిని మంచిగా చదివించు, చదువు ఆపొద్దు 
సీతారాం: ఆపను సార్‌.. మంచిగా చదివిస్తా. 

ఇప్పుడు నమ్మకం కలిగింది.. 
రేవంత్‌రెడ్డితో బోధన్‌ రైతు రవి 
రవి: గతంలో రుణమాఫీపై ఎవరు హామీ ఇచ్చినా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు నమ్మకం కలిగింది. సంతోషంగా ఉంది. మిమ్మలి మరో రాజశేఖరరెడ్డిలా చూస్తున్నాం. రైతులందరి తరఫున పాదాభివందనం చేస్తున్నా. 
సీఎం: మీ నిజామాబాద్‌ జిల్లాకు రూ.225 కోట్లు రుణమాఫీ కింద ఇస్తున్నాం. 
రవి: నాట్లు వేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నాం
సీఎం: అంకాపూర్‌ చికెన్‌ తినిపిస్తావా?  
రవి: తప్పకుండా.. అంత అదృష్టం ఎలా వదులుకుంటాం సార్‌? 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement