
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల సాగు ఊపందుకుంది. జోరుగా కురు స్తున్న వర్షాలతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 68.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రభు త్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటివరకు పత్తి 40.73 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 15.63 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి.
ఇక సోయాబీన్ 4.14 లక్షల ఎకరాల్లో, కంది 3.82 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 3.62 లక్షల ఎకరాల్లో సాగైంది. జిల్లాల వారీగా పంటల సాగును పరిశీలిస్తే 6.83 లక్షల ఎకరాలతో నల్లగొండ జిల్లా తొలి స్థానంలో నిలువగా 5.65 లక్షల ఎకరాలతో ఆదిలాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాలో 4.69 లక్షల ఎకరాల్లో, వికారాబాద్ జిల్లాలో 4.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
ఆలస్యమైనా గత ఏడాది సాగుతో సమానంగా
గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో రికార్డు స్థాయిలో 1.36 కోట్ల ఎకరాల్లో పంటలు సాగ య్యాయి. ఆలస్యమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తా రమైన వర్షాలు కురుస్తుండడంతో వ్యవ సాయ పనులు ముమ్మరంగా సాగుతు న్నాయి. ఈ వానా కాలం సాగు కూడా గతేడాది వానాకాలం సాగుతో పోటీ పడు తోంది.
గతేడాది ఈ సమయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68.90 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ సీజన్లో దాదాపు సమానంగా 68.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగవడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి వరి 11.11 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ సీజన్లో ఇప్పటికే 4.52 లక్షల ఎకరాలు అధికంగా 15.63 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి గతేడాది ఈ సమ యానికి 44.53 లక్షల ఎకరాల్లో సాగైతే ప్రస్తుతం ఈ పంట 40.73 లక్షల ఎకరాల్లో సాగైంది.
ఈ నేపథ్యంలో ఈ సీజన్లోనూ సాగుకు ఢోకా లేదని, రికార్డు స్థాయిలో సాగవడం ఖాయమని అధికారులు అంటున్నారు. వచ్చే నెల మొదటి వారం వరకు కూడా పత్తి సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. వానలు తగ్గి భూమి కాస్తంత పొడిగా మారిన తర్వాత పత్తి సాగు చేయవచ్చని చెబుతున్నారు. వానలు తగ్గాక వరి నాట్లు కూడా పుంజుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment